breaking news
tax consultants
-
హోమ్వర్క్ చెయ్యండి .. మాస్టారు!
‘‘మేము ఉద్యోగం చేస్తున్నాం, సంపాదిస్తున్నాం, సక్రమంగా పన్నులు కట్టి రిటర్నులు వేస్తున్నాం, మాకు ఇంకా హోమ్వర్క్ ఏమిటండీ’’ అని తీసిపారేయకండి. నిజంగా నూటికి నూరు పాళ్లు స్వయంగా హోమ్వర్క్ చేసి మీ పన్నుభారాన్ని మీరే లెక్కించుకోండి. ఎవరితోనూ పోల్చుకోవద్దు. పోటీ పడొద్దు. మీ యజమాని లెక్కించిన పన్నుభారాన్ని కూడా నమ్మవద్దు. 2021 మార్చి 31తో పూర్తయ్యే సంవత్సరం ప్రతి అసెస్సీ రెండు విధానాలుగా, రకాలుగా పన్నుభారాన్ని లెక్కించుకోవచ్చు. పాత పద్ధతి ప్రకారం అ న్ని మినహాయింపులు పరిగణిస్తూ పాత శ్లాబుల ప్ర కారం, పాత రేట్ల ప్రకారం పన్నుభారం లెక్కించ డం ఒక విధానం. ఇక రెండోది, కొత్తది సెక్షన్ 115 BAC ప్రకారం ఎటువంటి మినహాయింపులు, తగ్గింపులు తీసుకోకుండా కొత్త శ్లాబుల ప్రకారం కొత్త రేట్ల ప్ర కారం పన్నుభారం లెక్కించాలి. 115 BAC ప్రకారం .. కొత్త పద్ధతిలో 60 సంవత్సరాలు లోపు ఉన్నా, 60–80 ఏళ్ల సీనియర్ అయినా, 80 దాటిన సూపర్ సీనియర్ అయినా ఇవే రేట్లు. ఈ నేపథ్యంలో ఒక కేసు చూద్దాం. 80 సంవత్సరాలు దాటి పెన్షన్ పొందుతున్న శర్మగారు యజమానికి ఏమీ చెప్పకపోవడం వల్ల పాత పద్ధతిలో పన్ను కోశారు. వారి పెన్షను రూ. 11,20,000 కాగా స్టాండర్డ్ డిడక్షన్ రూ. 50,000 తీసివేసి, పాత రేట్ల ప్రకారం పన్ను భారం రూ. 1,25,840గా ఉంటుంది. కానీ కొత్త రేట్ల ప్రకారం పన్ను భారం రూ. 1,02,960గా ఉంటుంది. శర్మగారికి వారి యజమాని రూ. 22,880 ఎక్కువగా కోశారు. ఫారం 16,ఫారం 26 అ లో ఉన్న సమాచారం కూ డా చెక్ చేసుకోండి. శర్మగారు కొత్త పద్ధతి ప్రకారం వేసుకుంటే రూ. 22,880 రిఫండు వస్తుంది. ఒక ప్రభుత్వ సంస్థ ఉద్యోగి ఫారం 26 అ లో రూ. 55 కోట్ల జీఎస్టీ టర్నోవరు పడింది. నిజానికి ఆ ఉద్యోగికి ఎటువంటి వ్యాపారం లేదు. కానీ ఆయన పాన్ నంబరును ఒక సంస్థ వారు తస్కరించి, వాడుకోవడం వల్ల ఇలా జరిగింది. మరో ఉద్యోగి రావుగారు రిటైర్ అయ్యారు. వయస్సు 70 ఏళ్లు. పెన్షన్ రూ. 3,00,000, ఇంటి మీద ఆదాయం (నికరంగా) రూ. 3,20,000, 80సి సేవింగ్స్ రూ. 1,50,000, 80డి కింద రూ. 30,000, వృత్తి పన్ను రూ. 2,400 కాగా వీరికి టీడీఎస్ రూ. 12,000 అనుకుందాం. పాత పద్ధతి ప్రకారం నికర ఆదాయం రూ. 5,00,000 లోపల ఉంది కావున పన్నుభారం లేదు. టీడీఎస్ మొత్తం రిఫండు వస్తుంది. కొత్త విధానాన్ని ఎంపిక చేసుకుంటే మొత్తం పన్నుభారం రూ. 25,480, టీడీఎస్ పోను అదనంగా కట్టాలి. అంటే వీరికి పాత పద్ధతే బెస్ట్. మీ కేసు, మీ కేసే! శర్మగారితో, రావుగారితో పక్కింటి పరంధామయ్యగారితో, వెనకింటి వెంకట్రావుగారితో పోలిక లేదు. నికర ఆదాయం రూ. 5,00,000 లోపల పాత పద్ధతి ప్రకారం పైసా కూడా పన్ను అవసరం లేదు. కొత్త పద్ధతి అనుసరిస్తే నికర ఆదాయం రూ. 2,50,000 వరకూ పన్ను లేదు. పాత పద్ధతిలో అన్ని మినహాయింపులు పొందవచ్చు. కొత్త పద్ధతిలో సర్వసంగపరిత్యాగిలాగా ఏ మినహాయింపు, తగ్గింపు, ప్రయోజనం పొందడానికి ఉండదు. అందుకే కాస్త ఓపికగా హోమ్వర్క్ చేసి పన్నుభారాన్ని లెక్కించండి. ఎంపిక చేసుకున్నప్పుడు ఏ తప్పులూ చేయకుండా అంకెలు వేసుకోండి. ఎంపిక చేసుకోండి. ఈ లోపలే స్టేట్మెంట్లు రెండు పద్ధతుల్లోనూ చేసుకుని రెడీగా ఉంచుకుని, కావాల్సినది ఎంచుకోండి. -
జీఎస్టీ వచ్చేస్తోంది: ఇక వారికే ఫుల్ డిమాండ్
ముంబై : దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానంలోకి తీసుకొచ్చే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్(జీఎస్టీ) మరికొన్ని రోజుల్లో అమలుకాబోతుంది. జూన్ 30న అర్థరాత్రి పార్లమెంట్ వేదికగా దీన్ని గ్రాండ్ గా లాంచ్ చేసి, జూలై 1 నుంచి అమలుచేయబోతున్నారు. దీంతో అన్ని రంగాల కంపెనీలు ఇప్పటికే ఈ కొత్త జీఎస్టీ విధానానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నాయి. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత పన్ను, టెక్నాలజీ నిపుణులకు భారీగా డిమాండ్ ఏర్పడునుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఎఫ్ఎంసీజీ రంగంలో వీరికి భారీగా డిమాండ్ ఉంటుందని, తర్వాత కన్జ్యూమర్ గూడ్స్, ఫార్మాస్యూటికల్స్, రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగాల్లో పన్ను, టెక్నాలజీ నిపుణుల అవసరం ఎక్కువగా ఉంటుందని తెలిసింది. ఈ కొత్త పన్ను విధానంతో ప్రయోజనాలు పొందడానికి సంస్థలు వీరిని నియమించుకుంటారని ఇండస్ట్రి నిపుణులు, నాలుగు అతిపెద్ద ఆడిట్ సంస్థల ఎగ్జిక్యూటివ్ లు చెబుతున్నారు. పన్ను అవగాహన అధికారులు, నిపుణులు చెబుతున్న ప్రకారం, జీఎస్టీని నమోదుచేసుకున్న కంపెనీలు చివరికి 90 లక్షలుగా ఉంటాయని, వారిలో 1 శాతం పెద్ద కంపెనీలుంటే, ఆ కంపెనీలకు జీఎస్టీ బాధ్యతలు నిర్వర్తించడానికి కనీసం ఐదుగురు నిపుణులు అవసరం పడతారని పేర్కొన్నారు. అంతేకాక 10 శాతం మధ్యస్థాయి కంపెనీల్లో కనీసం ఒకవ్యక్తి అవసరం పడతారని చెప్పారు. దీంతో ఈ కొత్త జీఎస్టీ విధానంతో 1.3 మిలియన్ నిపుణులకు డిమాండ్ ఏర్పడుతుందన్నారు. కొన్ని బాధ్యతలను ప్రస్తుతమున్న సేల్స్, ఇతర పన్నుల నిపుణులు నిర్వర్తించవచ్చు, కానీ కొత్తగా ప్రతిభావంతులును కూడా నియమించుకోవాల్సినవసరం ఎక్కువగా ఉంటుందన్నారు. పన్ను వైపుగా అయితే లాయర్లు, ఛార్టెడ్ అకౌంటెంట్లు, కాస్ట్ అకౌంటెంట్లు, ట్యాక్స్ కన్సల్టెంట్స్ కు భారీగా డిమాండ్ ఉంటుందని ఇండస్ట్రీ నిపుణులు చెప్పారు. టెక్నాలజీ వైపు అయితే సాఫ్ట్ వేర్ నిపుణులకు అవసరం ఎక్కువగా ఉంటుందన్నారు. అంతేకాక సెమీ-స్కిల్డ్ వర్కర్లకు కూడా డిమాండ్ ఏర్పడుతుందని నిపుణులు తెలిపారు. జీఎస్టీ రిటర్న్స్ లను, ప్రభుత్వ డేటా బేస్ లతో సమకాలీకరించాల్సి ఉంటుంది. జీఎస్టీ మేనేజర్, వీపీ-జీఎస్టీ లేదా జీఎస్టీ టీమ్ లీడర్ వంటి కొన్ని పొజిషన్లు క్రియేట్ అవుతాయని ఓ సంస్థ సీరియర్ డైరెక్టర్ చెప్పారు. కొత్త జీఎస్టీ విధానాన్ని సరిగ్గా అమలుచేయలేకపోతే, కంపెనీలకే రెవెన్యూలు, లాభాలు పోతాయని, దీంతో మార్కెట్ షేరును వారు కోల్పోతారని పలువురు పేర్కొంటున్నారు. కార్పొరేట్లలో జీఎస్టీపై ఎంతో బాధ్యతతో పనిచేసేవారిని తీసుకోవాల్సి ఉంటుందన్నారు. మంచి ప్రణాళికతో దీన్ని అమలుచేస్తే, అన్ని సమస్యలను అధిగమించవచ్చని, ఆర్థిక పొదుపులో జీఎస్టీ ఎంతో కీలకమైనదని పేర్కొంటున్నారు.