breaking news
tadipatri muncipality
-
నావల్లనే ప్రాబ్లమ్ అయితుంది అంటే వెళ్లిపోతా: జేసీ
అనంతపురం, సాక్షి: టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జనాల్ని తాను ఇష్టమొచ్చినట్లు తిడతానని, పడాల్సిందేనంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఈ క్రమంలో ‘చదువులెందుకంటూ?’ విడ్డూరమైన వ్యాఖ్యలు చేశారాయన.‘‘తాడిపత్రిలో ఆలయాలకు వెళ్లే భక్తులకు క్రమశిక్షణ లేదు. జనాలను దారిలో పెట్టేందుకు ఖచ్చితంగా తిడతా.. పడాల్సిందే. మీరు మారతారా? లేదంటే నన్ను ఊర్లోంచి తరిమేయండి. నావల్లనే సమస్య అంటే నేను వెళ్లిపోతా. ఉంటే మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉంటా’’ అని అన్నారాయన. చెత్త వేసే వారి ఇళ్లకు కరెంట్ కట్ చేస్తా.. తాగునీటి సరఫరా నిలిపివేయిస్తా అని హెచ్చరించారు. అలాగే..బీటెక్ చదివిన ఓ అమ్మాయిని దీపాలు అమ్ముతుంటే.. సంతోషపడ్డానని, వేరే దగ్గర ఆమెతో స్టాల్ పెట్టిస్తే.. మళ్లీ పాత చోటుకే వచ్చి అమ్ముతోందని మండిపడ్డారాయన. ఈ మాత్రం దానికి చదువుకుని దేనికి? అంటూ ప్రశ్నించారు. పిల్లలకు చదువులు కాకుండా క్రమశిక్షణ నేర్పించాలని తల్లిదండ్రులకు జేసీ సూచించారు.‘‘పిల్లలకు డిసిప్లిన్ నేర్పియండి. చదువుకాదు. లేకుంటే పాడైపోతారు. అమెజాన్, రెడ్బస్ ఓనర్లు.. ఎలాన్ మస్క్.. వీళ్లంతా చదువులేనోళ్లే!!. ఇప్పుడంతా కొత్త షావుకారులే వస్తున్నారు. సదువులేనోళ్లు బ్రహ్మాండమైన ఇళ్లు కడుతున్నారు. వాళ్లంతా బుర్రున్నోళ్లు. ఇంజనీరింగ్ కంటే మున్సిపల్లో ఊడ్చే పర్మినెంట్ ఉద్యోగికి మంచి జీతం వస్తోంది’’ అని జేసీ అన్నారు. తాడిపత్రి ప్రజలకు ఉంది రెండే ఆప్షన్లు. మీరైనా మారాలి లేదంటే నన్ను ఊర్లోంచి తరిమేయండని అన్నారాయన. -
జేసీ అనుచరుల ఆగడాలు.. ప్రభాకర్రెడ్డి అన్న చెప్పాడంటూ
సాక్షి, అనంతపురం(తాడిపత్రి): తాడిపత్రి మునిసిపాలిటీలో జేసీ అనుచరుల ఆగడాలు శ్రుతిమించాయి. తరచూ ఏదో ఒక వివాదాన్ని రేకెత్తిస్తున్నారు. తద్వారా అధికారులు, ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ప్రొటోకాల్ పేరిట గొడవ చేశారు. రెండు రోజుల క్రితం ఏకంగా మునిసిపల్ కమిషనర్ చాంబరును ఆక్రమించేందుకు ప్రయత్నించారు. టీడీపీ కౌన్సిలర్లతో పాటు ఆ పార్టీ నాయకులు మునిసిపల్ కార్యాలయంలోనే తిష్ట వేసి.. చీటికిమాటికి ‘జేసీ ప్రభాకర్రెడ్డి అన్న చెప్పాడం’టూ అధికారుల విధులకు అడ్డు తగులుతున్నారు. వీరి ఆగడాలు తాళలేక కొందరు బదిలీపై వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలిసింది. మారని తీరు రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్నన్నాళ్లూ జేసీ ప్రభాకర్రెడ్డితో పాటు అనుచరులు దౌర్జన్యాలు, బరి తెగింపులతో రెచ్చిపోయారు. అధికారులను భయకంపితులను చేశారు. అప్పట్లో వీరి ఆగడాలు తాళలేక ఎంతో మంది అధికారులు సెలవుపై వెళ్లిపోయారు. మరికొందరు ఇక్కడి నుంచి బదిలీ చేయించుకున్నారు. వీరి తీరును ప్రజలు సైతం అసహ్యించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటుతో గట్టిగా బుద్ధి చెప్పారు. ఇప్పుడైనా తీరు మార్చుకున్నారా అంటే అదీ లేదు. పాత పద్ధతుల్లోనే అధికారులు, ఉద్యోగులపై రుబాబు చేస్తున్నారు. చదవండి: (అచ్చెన్నా.. నీకెందుకంత నోటి దురద) స్వేచ్ఛాయుత వాతావరణాన్ని దెబ్బతీస్తూ.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక తాడిపత్రిలో శాంతిభద్రతల పరిరక్షణకు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కృషి చేశారు. అటు పోలీసు యంత్రాంగానికి, ఇటు అధికార యంత్రాంగానికి పూర్తిస్థాయిలో స్వేచ్ఛనిచ్చారు. ఫలితంగా శాంతిభద్రతలు గాడిలో పడ్డాయి. పట్టణ వాసులు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. జేసీ ప్రభాకర్రెడ్డి మునిసిపల్ చైర్మన్గా గెలిచిన తర్వాత తాడిపత్రిలో మళ్లీ అలజడి రేపేందుకు ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మునిసిపల్ కార్యాలయంలో తన పార్టీ కౌన్సిలర్లతో ప్రొటోకాల్ వివాదానికి తెర లేపడమే కాకుండా అధికార దర్పంతో అధికారులను, సిబ్బందిని బెదిరిస్తున్నారు. మునిసిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్రెడ్డి ఇటీవల బదిలీపై వెళ్లారు. ఇంకా నూతన కమిషనర్ రాకపోవడంతో చాంబర్కు తాళం వేసి ఉంచారు. దీన్ని గమనించిన టీడీపీ కౌన్సిలర్లు గురువారం కమిషనర్ చాంబరును ఆక్రమించేందుకు ప్రయత్నించారు. తాళాలను దౌర్జన్యంగా పగులగొట్టి, కమిషనర్ నేమ్ బోర్డు సైతం తొలగించి చైర్మన్ చాంబర్గా మార్చాలని చూశారు. పోలీసులు రావడంతో వారి ఆటలు సాగలేదు. ►గత ఆగస్టులో తాను పిలిస్తే కమిషనర్ రాలేదన్న నెపంతో చైర్మన్ జేసీ తన అనుచరులతో కలిసి మునిసిపల్ కార్యాలయంలో 24 గంటల పాటు తిష్టవేసి నానా హంగామా సృష్టించారు. తనకు అధికారం లేకపోయినప్పటికీ అధికారులకు, కింది స్థాయి సిబ్బందికి నోటీసులు ఇస్తున్నానంటూ హడావుడి చేశారు. ►ఈ ఏడాది జనవరి 26న రిపబ్లిక్డే సందర్భంగా జెండా ఆవిష్కరణ పేరుతో నానా యాగీ చేసి విమర్శల పాలయ్యారు. ►ప్రతి రోజూ టీడీపీ కౌన్సిలర్లతో పాటు చైర్మన్ జేసీ అనుచరులు కార్యాలయంలోకి వచ్చి బెదిరింపులకు పాల్పడుతూ సిబ్బందిని బెంబేలెత్తిస్తున్నారు. వీరి తీరుతో ఆందోళన చెందుతున్న కొందరు ఉద్యోగులు సెలవుపై వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. జేసీ అనుచరుల వైఖరితో మునిసిపల్ కార్యాలయ విధులకు ఆటంకం కలగడమే కాకుండా..పట్టణాభివృద్ధిపైనా ప్రతికూల ప్రభావం చూపే అవకాశముంది. -
తాడిపత్రి మున్సిపాల్టీకి జాతీయ అవార్డు
తాడిపత్రి టౌన్ : సాలీడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఓపెన్ డెఫికేషన్, పరిసరాల పరిశుభ్రతలో తాడిపత్రి మున్సిపాల్టీ జాతీయ అవార్డుకు ఎంపికైనట్లు ఇన్చార్జ్ కమిషనర్ రఘుకుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. మే 4న ఢిల్లీలో మున్సిపల్ అధికారులు ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు. సాలీడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఓపెన్ డెఫికేషన్, పరిసరాల పరిశుభ్రతలో తాడిపత్రి మున్సిపాల్టీలో గత జనవరిలో స్వచ్ఛ సర్వేక్షన్ బృందం పర్యటించి అవార్డుకు ఎంపిక చేసినట్టు ఆయన వివరించారు. తాడిపత్రితో పాటు విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, ఒంగోలు, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్లు కూడా అవార్డుకు ఎంపికైనట్లు ఆయన తెలిపారు.