ఐఎస్ఐఎస్లో భారతీయ ఫైటర్లపై చిన్నచూపు
న్యూఢిల్లీ: ప్రపంచానికి సవాల్ మారిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ (ఐఎస్ఐఎస్).. అరబ్, దక్షిణాసియా దేశాలతో పాటు నైజీరియా, సూడాన్ తదితర దేశాల నుంచి ఎక్కువగా యువతను రిక్రూట్ చేసుకుంటున్నా.. జీతాలు, హోదా వంటి విషయాల్లో అందరినీ సమానంగా పరిగణించడం లేదు. అరబ్ ఫైటర్లతో పోలిస్తే భారతీయులు సహా దక్షిణాసియా వాసులు గొప్ప పోరాట యోధులు కాదని ఐఎస్ఐఎస్ భావిస్తోంది. అరబ్ ఫైటర్ల కంటే వారిని తక్కువ స్థాయిగా చూస్తున్నట్టు ఇంటలిజెన్స్ నివేదిక వెల్లడించింది. అంతర్జాతీయ ఇంటలిజెన్స్ సంస్థలు రూపొందించిన ఈ నివేదికను భారత్ సంస్థలకు అందజేశాయి.
ఆ నివేదిక ప్రకారం.. భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దక్షిణాసియా దేశాలతో పాటు నైజీరియా, సూడాన్ దేశాల నుంచి ఐఎస్ఐఎస్లో చేరిన ఉగ్రవాదులను అరబ్ ఫైటర్ల కంటే తక్కువ స్థాయిలో పరిగణిస్తున్నారు. అరబ్ ఫైటర్లకు ఆపీసర్ కేడర్ స్థాయి కల్పించి, ఆత్యాధునిక ఆయుధాలు, వేతనాలు, వసతులు కల్పిస్తున్నారు. దక్షిణాసియా వారికి మాత్రం అరబ్ ఫైటర్ల కంటే తక్కువ హోదా, జీతాలు ఇచ్చి, చిన్న చిన్న బ్యారక్లలో ఉంచుతున్నారు. ఇరాక్, సిరియాల్లో ఆత్మాహుతి దాడులకు ఎక్కువగా వీరినే ఉసిగొల్పుతున్నారు. పేలుడు పదార్థాలతో కూడిన ఓ వాహనాన్ని ఇచ్చి, సమీప లక్ష్యంలో దాడులకు పంపుతున్నారు. ఐఎస్ఐఎస్లో 23 మంది భారతీయులు చేరగా, వారిలో ఆరుగురు ఉగ్రవాద చర్యల్లో చనిపోయారు. ఉగ్రవాద దాడుల్లో వీరిని సైనికుల మాదిరిగా ముందుకు ఉసికొల్పుపుతు అరబ్ ఫైటర్లు వెనక ఉంటున్నట్టు నివేదిక వెల్లడించింది.