breaking news
Seed driller
-
జీలుగ చేనులో నేరుగా వరి!
దుక్కి చేసుకున్న పొలంలో వరి విత్తనాన్ని ట్రాక్టర్కు అనుసంధానించిన సీడ్ డ్రిల్తో నేరుగా విత్తడం(డైరెక్ట్ సీడింగ్) తెలిసిందే. వరి సాగులో శ్రమను, ఖర్చును చాలా వరకు తగ్గించడానికి.. కాలువ నీరు ఆలస్యంగా వచ్చినప్పుడు సీజన్ దాటిపోకుండా చూడటానికి.. వరి నాట్ల కాలంలో కూలీల కొరతను అధిగమించడానికి కూడా ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. అయితే, పచ్చి రొట్ట ఎరువు పంటైన జీలుగను విత్తి 25 రోజుల తర్వాత.. అదే పొలంలో నేరుగా వరి విత్తనాన్ని విత్తుకునేందుకు ఉపకరించే హేపీ సీడర్ను పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించింది. ప్రెస్ వీల్ టెక్నాలజీతో ఈ హేపీ సీడర్ తయారైంది. వరి విత్తనాన్ని భూమిలో సాళ్లుగా వేయడంతోపాటు.. జీలుగ మొక్కలు ముక్కలు ముక్కలై వరి సాళ్ల మధ్య ఆచ్ఛాదనగా వేయడం హేపీ సీడర్ ప్రత్యేకత. పంజాబ్లోని ముక్త్సర్ జిల్లా గోనియాన కృషి వికాస కేంద్రంలో 2016 రబీలో దీన్ని తొలిగా పరీక్షించినప్పుడు మంచి ఫలితాలు వచ్చాయని కేవీకే అసోసియేట్ డైరెక్టర్ (శిక్షణ) డాక్టర్ నిర్మల్జిత్ సింగ్ ధాలివాల్ ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. 2017లో 80 ఎకరాల్లో దీని ద్వారా నేరుగా వరి విత్తనాన్ని విత్తినప్పుడు కూడా మంచి ఫలితాలు వచ్చాయి. పంజాబ్లో రైతులు విరివిగా వాడుతున్నారు. ప్రెస్వీల్ టెక్నాలజీతో కూడిన ఈ సీడ్ డ్రిల్తో రోజుకు 6–7 ఎకరాలు విత్తవచ్చు. ఖరీదు రూ. 2 లక్షల వరకు ఉంటుందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని కృషి విజ్ఞాన కేంద్రాలు దీన్ని ప్రయోగాత్మకంగా వినియోగించదలచుకుంటే తాము సాంకేతిక సహాయాన్ని అందిస్తామని డా. నిర్మల్జిత్ సింగ్ (98556 20914) చెప్పారు. kvkmuktsar@pau.edu -
ఆరుతడి పంటగానూ వరి
ఈ పద్ధతిలో నీటి వినియోగం చాలా తక్కువ. పొలాన్ని దున్నడం.. నారుమడి తయారు చేయడం.. నాటు అవసరం లేకుండానే వరి పండించవచ్చు. వరి విత్తనాన్ని నేరుగా విత్తి ఆరుతడి పంటగా సాగు చేయవచ్చు. ఈ పద్ధతిలో ఆరుతడి పంటలకు ఇచ్చేలా నీటిని ఇస్తే సరిపోతుంది. పొలంలో తేమ తగ్గకుండా చూడాలి. ఇందుకోసం తేమ లేని సమయంలో భూమిని బాగా దున్ని విత్తనాలను సాళ్లలో గానీ, సీడ్ డ్రిల్లర్ ద్వారా కాని విత్తితే సరిపోతుంది. ఎకరాకు 12 కిలోల విత్తనం అవసరమవుతుంది. మాములు పద్ధతి మాదిరిగానే ఎరువులను వాడాల్సి ఉంటుంది. చీడపీడల సమస్య తక్కువగా ఉంటుంది. కలుపు ఎక్కువగా ఉంటుంది. అయితే కలుపు మందులు వాడి సమస్యను అధిగమించవచ్చు. అన్ని యాజమాన్య పద్ధతులు పాటిస్తే దిగుబడిలో ఎలాంటి తేడా ఉండదు. ఆధునిక యంత్రంతో వరినాట్లు ఆధునిక యంత్రంతో నాట్లు వేసి అధిక దిగుబడులు పొందవచ్చు. ఈ పద్ధతిలో నాట్లు వేయాలంటే ముందుగా నారును ట్రేలలో పెంచాల్సి ఉంటుంది. ట్రేలలో పెంచిన నారును, ప్రధాన పొలం సిద్దం చేసిన తర్వాత అక్కడకు తీసుకెళ్లి, నాటు మిషన్లో పెట్టి నాట్లు వేయాల్సి ఉంటుంది. ట్రేలలో నారును పెంచడం సామాన్య రైతులకు కొంత ఇబ్బందే. కూలీలతో పోల్చితే ఖర్చు తక్కువగా ఉన్నప్పటికి, ఈ పరికరాలు ఎక్కువ సంఖ్యలో అందుబాటులో లేవు. డ్రిప్తో వరి సాగు ఉన్న నీటిని డ్రిప్తో సద్వినియోగం చేసుకుంటూ సైతం వరి సాగు చేపట్టవచ్చు. ఒక మీటర్ వెడల్పు, 80 మీటర్ల పొడవుతో బెడ్లను తయారు చేసుకోవాలి. కలుపు నివారణ కోసం బెడ్లపైన మల్చింగ్ పేపర్ వేసుకోవాలి. అనంతరం విత్తనాలు వేసుకోవాలి. డ్రిప్ ద్వారా సాగు నీరుతోపాటు ఎరువులను సైతం అందించవచ్చు. ఒక సారి డ్రిప్ ఏర్పాటు చేసుకుంటే దాదాపు 10 ఏళ్లపాటు ఉపయోగించుకోవచ్చు. ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఏటా ఈ పద్ధతినే ఎంచుకునేవారికి ఇది ఉత్తమం.