మరింతమంది మహిళా అధికారులు ముందుకు రావాలి: సంజీవ్
న్యూఢిల్లీ: మహిళలపై నేరాలను విచారించేందుకు మహిళా అధికారులు తప్పనిసరిగా ముందుకురావాలని మధ్య ఢిల్లీ సంయుక్త పోలీస్ కమిషనర్ సంజీవ్ గోయల్ సూచించారు. ‘కమిట్మెంట్ టు జెండర్ జస్టిస్-జీరో టాలరెన్స్ టు సెక్సువల్ హెరాస్మెంట్’ అనే అంశంపై ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ)లో శనివారం నిర్వహించిన సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ప్రసంగించారు. మహిళలపై నేరాలను విచారించేందుకు మహిళా పోలీసు అధికారులకు సాధికారత కల్పించేరీతిలో వాతావరణాన్ని సృష్టించాల్సిన అవసరం ఉందన్నారు. నగరంలోని మహిళలకు భద్రత కల్పించడమే తమ ప్రధాన కర్తవ్యమన్నారు. మహిళా పోలీసు అధికారులు విశ్వాసంతో పనిచేయాలని ఆయన సూచించారు. అప్పుడు మాత్రమే బాధిత కుటుంబాలకు ధీమా కలిగించగలుగుతారన్నారు. నేరాలు చేసేవారెవరూ తాము తప్పు చేస్తున్నట్టు ఏనాడూ భావించరని, ఇందుకు కారణం వారు విద్యావంతులు కాకపోవడమేనన్నారు.
అత్యాచార కేసుల్లో బాధితులను, ప్రాణాలతో బయటపడిన వారిని అత్యంత జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయప్రక్రియ అనేది బాధితులతోపాటు బాధిత కుటుంబాలకు ఇబ్బందికరంగా అనిపిస్తుందన్నారు. అందువల్ల లైంగిక వేధింపు కేసు విచారణ బాధ్యతలను మహిళా పోలీసు అధికారులే నిర్వర్తిస్తే వారికి ఎటువంటి ఇబ్బందులూ ఉండబోవన్నారు. బాధిత కుటుంబాలతో సంబంధాలు కలిగిన స్వచ్ఛంద సంస్థలతోనూ తాము కలిసి పనిచేస్తామన్నారు. అనంతరం జవహర్లాల్ నెహ్రూ (జేఎన్యూ) ప్రొఫెసర్ విదు వర ్మ మాట్లాడుతూ కేవలం చట్టాలవల్లనే బాధిత కుటుంబాలకు న్యాయం జరగబోదన్నారు. ఎన్ని చట్టాలు ఉన్నప్పటికీ బాధితులను జాగ్రత్తగా చూసుకోగలిగే వారు కూడా అవసరమన్నారు. పనిమనుషులు, సెక్స్వర్కర్లు తదితర అసంఘటిత రంగంలో పనిచేసే మహిళలకు ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాలు తగినంత భద్రత కల్పించలేవన్నారు.