మంత్రి ఈటల వాహనం బోల్తా
కరీంనగర్ జిల్లాలో ఘటన
టిప్పర్ను ఓవర్టేక్ చేయబోయి పల్టీలు
ఈటల సహా పీఏలు, గన్మెన్లు, డ్రైవర్కు గాయాలు
మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలింపు
మంత్రికి ఇబ్బంది లేదన్న వైద్యులు.. సీఎం కేసీఆర్ వాకబు
కరీంనగర్: రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్ శనివారం రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నుంచి కరీంనగర్కు ఆయన బుల్లెట్ప్రూఫ్ కారు (టొయోటా ఫార్చునర్ టీఎస్ 09పీఏ 1648)లో వెళ్తుండగా మార్గమధ్యంలో మానకొండూరు నియోజకవర్గంలోని ఈదులగట్టపల్లి సమీపంలో ఆయన వాహనం టిప్పర్ను ఓవర్టేక్ చేసే క్రమంలో ఢీకొట్టింది. దీంతో అదుపు తప్పి నాలుగు పల్టీలుకొట్టి రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఈటల కాలుకు గాయాలవగా పీఏలు ముకుందరెడ్డి, చంద్రమౌళి తలకు గాయాలయ్యాయి. డ్రైవర్ రఫీ, గన్మెన్ వెంకటేశ్లకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే మంత్రి సహా క్షతగాత్రులను హుటాహుటిన కరీంనగర్లోని అపోలో రీచ్ ఆసుపత్రికి తరలించారు. వైద్యపరీక్షలు నిర్వహించిన వైద్యులు ఈటలకు ఎలాంటి ఇబ్బందిలేదని తేల్చారు. మెరుగైన వైద్యం కోసం ఆయన్ను హైదరాబాద్కు తరలించారు.
10 నిమిషాలు వాహనంలోనే...
కరీంనగర్లో ఏర్పాటు చేసిన పెంటావాలెంట్ వాక్సిన్ ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యేందుకు మంత్రి ఈటల బయలుదేరగా ఈ ప్రమాదం జరిగింది. వాహనం అద్దాలు తెరుచుకోకపోవడంతో ఈటల దాదాపు 10 నిమిషాలు కారులోనే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో భద్రతా సిబ్బంది కారు అద్దాలను పగలగొట్టి ఈటల సహా అందులోని వారిని బయటకు తెచ్చారు. స్థానికులు 108 అంబులెన్స్కు సమాచారం ఇచ్చినా అది వచ్చేలోపే కాన్వాయ్లోని మరో వాహనంలో ఈటలను ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో మంత్రి వాహనం వేగంగా వెళ్తోందని, ఆ సమయంలో ఈటల సీటు బెల్టు పెట్టుకోలేదని తెలిసింది. కాగా, ఈటలను ఎంపీ బి.వినోద్కుమార్, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, దాసరి మనోహర్రెడ్డి, బొడిగె శోభ, కలెక్టర్ నీతూప్రసాద్ తదితరులు ఆస్పత్రిలో పరామర్శించారు. ప్రమాద సమాచారాన్ని తెలుసుకున్న వెంటనే సీఎం కేసీఆర్ ఈటలకు ఫోన్ చేశారు. ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను వాకబు చేశారు. సీఎం సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఈటలకు కాలు విరిగిందన్న వార్తలు అవాస్తవమని అపోలో రీచ్ ఆసుపత్రి సూపరిండెంట్ నరేశ్ చెప్పారు.
నాలుగోసారి ప్రమాదం...
రాజకీయాల్లోకి వచ్చాక ఈటల నాలుగుసార్లు ప్రమాదానికి గురయ్యారు. 2004లో కమలాపూర్ ఎమ్మెల్యేగా గెలిచిన కొత్తలో హైదరాబాద్లో ఆయన స్వల్ప రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అలాగే టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా ఉన్నప్పుడు వరంగల్ జిల్లా స్టేషన్ఘన్పూర్ వద్ద ఈటల ప్రయాణించిన కారు డివైడర్ను ఢీకొట్టింది. గత నెల కరీంనగర్ జిల్లాలోని శంకరపట్నం మండలం మెట్పల్లి వద్ద ఆయన ప్రయాణించిన స్కార్పియో బుల్లెట్ప్రూఫ్ వాహనం చెట్టును ఢీకొంది. అయితే ప్రమాదానికి 5 నిమిషాల ముందు ఆయన వేరే వాహనంలోకి మారడంతో క్షేమంగా బయటపడ్డారు. ఆ వాహనం మరమ్మతులకు నోచుకోకపోవడంతో 10 రోజుల క్రితమే ప్రభుత్వం మరో కొత్త బుల్లెట్ప్రూఫ్ వాహనాన్ని కేటాయించింది.