breaking news
relegion
-
అన్యమతస్తులకు ప్రసాదం తయారీ కాంట్రాక్ట్?
సింహాచలం(పెందుర్తి): వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానంలో ప్రసాదాల కాంట్రాక్ట్ను అన్యమతస్తుడికి ఇచ్చారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దేవా దాయశాఖ నిబంధనలను ఉల్లంఘించి అన్యమతస్తుడికి కాంట్రాక్ట్ ఇచ్చి హిందువుల మనోభావాలు దెబ్బతీశారన్న నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే... సింహాచలం దేవస్థానంలో స్వామి ప్రసాదంగా లడ్డు, పులిహోర విక్రయాలు జరుపుతార న్న సంగతి తెలిసిందే. వీటిని భక్తులు మహా ప్రసాదంగా స్వీకరిస్తారు. ఏటా దేవస్థానం ఈప్రొక్యూర్మెంట్, సీక్రెట్ టెండర్ ద్వారా ప్రసాదాల కాంట్రాక్ట్ను ఇస్తుంటుంది. వీటిల్లో తక్కువ కోడ్ చేసిన కాంట్రాక్టర్కు ప్రసాదాల కాంట్రాక్ట్ ఇస్తుంది. సదరు కాంట్రాక్టర్ పులిహోర ప్యాకింగ్, శ్రీ వైష్ణవస్వాములతో లడ్డూను తయారుచేయించడం, సిబ్బంది చేత లడ్డూలను చుట్టించడం చేయాలి. దేవాదాయశాఖ రూల్ ప్రకారం టెండర్లు వేసి, వాటిని దక్కించుకునే వారంతా హిందువులే అయి ఉండాలి. ఇప్పటివరకు అలాగే కొనసాగుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి ప్రారంభమైన కొత్త కాంట్రాక్ట్కు సంబంధించి దేవస్థానం టెండర్లు పిలిచింది. అందులో ఈప్రొక్యూర్మెంట్ ద్వారా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన రాజ్ సెక్యూరిటీ సర్వీసెస్ తక్కువ కోడ్ చేసి టెండరు కైవసం చేసుకుంది. సంబంధిత సెక్యూరిటీ సర్వీసెస్ మేనేజింగ్ పార్టనర్ టెండరు దాఖలు చేశారు. టెండరు తక్కువ ధరకు కోడ్ చేయడంతో అతనికి కాంట్రాక్ట్ని దేవస్థానం అధికారికంగా అందజేసింది. ఫిబ్రవరి నుంచి ఇందుకు సంబంధించిన పనులు చేస్తున్నాడు. అయితే సదరు కాంట్రాక్టర్ అన్యమతస్తుడని, ప్రసాదాల కాంట్రాక్ట్ను అతడికి ఎలా అప్పగిస్తారన్న ఆరోపణలు రెండు రోజుల నుంచి చోటుచేసుకున్నాయి. విచారణ చేయిస్తాం దేవాదాయశాఖ రూల్స్ ప్రకారం ప్రసాదాల టెండ రు దాఖలు చేసేవాళ్లు, తీసుకునేవారు హిందువు అయి ఉండాలి. టెండరు రూల్స్ ప్రకారం కాంట్రాక్టు పొందిన వ్యక్తి తాను హిందువునని డిక్లరేషన్లో పేర్కొన్నాడు. దేవాదాయశాఖ పరిధిలోని ఆలయాల్లో ఇలాటి విధులు నిర్వర్తించడానికి అవసరమైన సిబ్బందిని కొన్నేళ్ల నుంచి అందిస్తున్నట్టు డిక్లరేషన్లో తెలిపారు. దేవాదాయశాఖ నిబంధనలకు కట్టుబడి పూర్తిగా హిందూ ధర్మాన్ని పాటిస్తున్నానని, అన్యమతానికి చెందినవాడిని కాదని తెలిపారు. అయినా అతను హిందువో కాదో విచారణ జరిపిస్తాం. అతను అన్యమతస్తుడైతే కాంట్రాక్ట్ రద్దు చేసి క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. – కె.రామచంద్రమోహన్, ఈవో సింహాచలం దేవస్థానం -
పేద దేశాల్లోనే మత విశ్వాసం ఎక్కువ
లండన్: ప్రపంచంలో అన్నింటికన్నా తమకు మతమే ముఖ్యమని భావించేవారు ఆర్థికంగా, సామాజికంగా వెనకబడిన దేశాల్లోనే ఎక్కువగా ఉన్నారని పియూస్ రిసెర్చ్ సెంటర్ గతేడాది నిర్వహించిన ఓ సర్వే తెలియజేస్తోంది. ఒక్క అమెరికా మినహా ఆర్థికంగా బలమైన దేశాల్లో మతం అన్నింటికన్నా ముఖ్యమనే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. మతేమేదైనా మతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామంటున్న ప్రజలు అమెరికాలో 53 శాతం ఉన్నారు. మతానికి ఎక్కువ ప్రాధ్యాన్యత ఇస్తామంటున్న వారు వెనుకబడిన దేశమైన ఇథియోపియాలో ఏకంగా 98 శాతం మంది ఉన్నారు. ఈ విషయంలో ప్రపంచంలో ఇథియోపియానే అగ్రస్థానంలో ఉంది. ప్రపంచంలోనే మతానికి అతి తక్కువ ప్రాధాన్యత ఇచ్చే దేశాల్లో చైనా అగ్రస్థానంలో ఉంది. ఆ దేశంలో మతానికి ప్రాధాన్యత ఇచ్చే వారి సంఖ్య కేవలం మూడు శాతం మాత్రమే. అంటే ప్రతి 20 మందిలో ఒక్కరు మాత్రమే మతానికి ప్రాధాన్యత ఇస్తారన్నమాట. భారత్కు పొరుగనున్న పాకిస్తాన్ మతానికి ప్రాధాన్యత ఇచ్చే దేశాల్లో 93 శాతంతో ఐదో స్థానంలో ఉంది. భారత్ 80 శాతంతో 14వ స్థానంలో ఉంది. ఆర్థికంగా బలమైన దేశాల్లో అన్నింటికన్నా మతమే ముఖ్యమని విశ్వసించే వారి సంఖ్య 20 శాతం కన్నా తక్కువగా ఉంది. బ్రిటన్, జర్మనీ దేశాల్లో ప్రతి 20 మందిలో కేవలం ఐదుగురు మాత్రమే తమ జీవితాల్లో మతం ముఖ్యమని నమ్ముతున్నారు. 2050 నాటికి ప్రపంచంలో ముస్లింల సంఖ్య కూడా క్రైస్తవులకు సమానమవుతుందని పియూస్ రిసర్చ్ సెంటర్ తెలిపింది. ఏ మతాన్ని విశ్వసించని వారి సంఖ్య అతి తక్కువగా పెరుగుతుందని అంచనా వేసింది. -
ఉరికొయ్యతో మతం పీటముడిని విప్పగలమా?
అవలోకనం ఉగ్రవాదాన్ని మతం నుంచి వేరుచేసి చూడాలనేది నిజాయితీతో కూడిన, సబబైన కోరికేనా అనేదే నా ప్రశ్న. హిందూ, సిక్కు ఉగ్రవాదులను ఉగ్రవాదులుగా చూడటం మనకు తేలికేం కాదు. అఫ్జల్ గురుకు ‘మరణ దండన విధించనిదే సమాజ సమష్టి అంతరాత్మ సంతృప్తి చెంద ద’ని సుప్రీం కోర్టు పేర్కొంది. ముస్లిమేతరులను ఉరితీయడానికి కూడా అలాంటి సమర్థనలను యోచించగలిగేటంత వరకు ఉగ్రవాదాన్ని మతం నుంచి వేరుచేసి చూడటం మనకు సాధ్యం కాదు. గత నెల మలేసియాలో మాట్లాడుతూ మన ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్ర వాదం గురించి రెండు విషయాలు చెప్పారు. ఒకటి, ఉగ్రవాదాన్ని మతం నుంచి వేరు చేసి చూడాలి. రెండు, ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద ముప్పు ఉగ్రవాదం. ఇది నిజమేనా? ఈ ఏడాది కశ్మీర్కు వెలుపల దేశవ్యాప్తంగా ఇస్లామిక్ ఉగ్రవాదం వల్ల చనిపోయినవారి సంఖ్య 21. గత ఏడాది అది నలుగురు కాగా, అంతకు ముందటి ఏడాది 25. అంతకంటే ముందటి ఏడాది ఒకే ఒక్కరు. దేశంలో ఏటా ఐదు లక్షల మంది ఐదేళ్లలోపు పిల్లలు పోషకాహార లోపంతో మరణిస్తున్నారు. నిజాయితీతో కూడిన ఏ ప్రమాణం ప్రకారం చూసినా దేశ జనాభాలో సగం మంది పేదలు, అందులో సగం మంది నిరక్ష రాస్యులు. మన దేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఇదే. అయినా ఉగ్రవాదం వాతావారణ మార్పుల కంటే కూడా పెద్ద సమస్యా? భూతాపం పెరుగుదలే చెన్నై వరదలకు కారణమని ప్రధానే అంగీ కరించారు. ఈ వరదల్లో 280 మంది కంటే ఎక్కువ మందే మరణించారు. కాబట్టి ఉగ్రవాదం, అతిశయించి చూపుతున్న సమస్యని నాకు అనిపిస్తుంది. పేదరికం, పోషకాహార లోపం, నిరక్షరాస్యత వంటి సమస్యలను ఇప్పటికే చాలా వరకు పరిష్కరించుకున్న పాశ్చాత్య దేశాలకు అది తక్షణమైన అత్యవసర సమస్య. భారతీయులలో అత్యధికులకు భిన్నంగా సౌఖ్యంగా సాగిపోతుండే వారి జీవితాలకు ఉగ్రవాదమంటే అందుకు అంతరాయాన్ని కలిగించే సంచలనం. అయితే ఈ వ్యాసాన్ని రాస్తున్నది దాని గురించి కాదు. మన ప్రధాని చెప్పిన మొదటి అంశమైన ఉగ్రవాదాన్ని మతం నుంచి వేరుచేయడం గురించి. ఇంతకూ దాన్ని అలా వేరుచేయడం ఎలా? కొన్ని వాస్తవాలను చూడండి.. మీరు త మిళం మాట్లాడే హిందువు అయితే, మన మాజీ ప్రధానిని హత్య చేసినందుకు మిమ్మల్ని ఉరితీయరు. 1991లో రాజీవ్ గాంధీని, మరో 14 మందిని ఆత్మాహుతి దాడిలో హతమార్చిన కేసులో మురుగన్, శంతన్, పెరారివలన్ అనే ముగ్గురికి ఉరిశిక్ష విధించారు. అయితే గత ఏడాది వారిని ఉరితీయరాదని నిర్ణయించారు. తమిళనాడు ప్రభుత్వం వారిని కాపాడటంలో చురుకైన పాత్ర పోషించింది. మీరే గనుక పంజాబీ మాట్లాడే సిక్కు అయితే, ఒక ముఖ్యమంత్రిని చంపినందుకు మిమ్మల్ని ఉరితీయరు. పంజాబ్ ముఖ్యమంత్రి బియంత్ సింగ్ను, మరో 17 మందిని ఒక ఆత్మాహుతి దాడిలో హతమార్చిన బలవంత్సింగ్ రాజోనాను ఉరితీయలేదు. తనకు మరణశిక్ష విధించి, తన అవయవాలను దానం చేయాలని రాజోనా కోరినా ఆ పని చేయలేదు. మరో పంజాబీ మాట్లాడే సిక్కు, దేవిందర్పాల్ సింగ్ భుల్లార్ 1993లో ఒక కాంగ్రెస్ నేతపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. అతనినీ ఉరి తీయలేదు. గుజరాతీ మాట్లాడే ఒక సింధీ హిందువైన మాయా కొద్నానికి, తోటి గుజరాతీలు 97 మందిని హత్యగావించినందుకు శిక్ష విధించారు. అయినా ఆమె జైలులో గడపాల్సిన అవసరం లేదు. క్రమం తప్పకుండా లభిస్తున్న బెయిళ్లతో శిక్షపడ్డ నేరస్తురాలై ఉండి కూడా ఆమె జైలు బయటనే గడుపుతున్నారు. అదే మీరు గుజారాతీ మాట్లాడే ముస్లిం అయితే, ఉగ్రవాద ఆరోపణలకు గానూ మిమ్మల్ని ఉరితీస్తారు. యాకూబ్ మెమెన్ కుటుంబానికి తెలిసివచ్చిన నిజం అదే. మెమెన్ను ఉరితీయరాదని కొందరు అన్నారు, నిజమే. అయితే వారు ఉరిశిక్షల రద్దును కోరేవారు. మొదట పేర్కొన్నవారితో సహా అన్ని రకాల నేరస్తుల ఉరిశిక్షలకూ వారు వ్యతిరేకులు. ముస్లిం అయిన మెమన్కు తోటి గుజరాతీల మద్దతు సైతం లభించలేదు. అలాగే మీరు కశ్మీరీ మాట్లాడే ముస్లింలయితే, ఉగ్రవాద కార్యకలాపాల ఆరోపణలకు మీకు ఉరి వేస్తారు. అఫ్జల్ గురు కుటుంబం ఆ నిజాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవాల్సి వచ్చింది. గురు కేసులో ఆధారాలు తప్పయి ఉండే అవకాశం ఉందనే అభిప్రాయం కూడా ఉంది. అయినా అది అతని మరణ శిక్షను అమలుకాకుండా ఆపలేకపోయింది. తమిళనాడు, పంజాబ్ శాసన సభల్లో తమ రాష్ట్రాలకు చెందిన ఉగ్రవాదులను కాపాడాలని విపరీతమైన రాజకీయ ఒత్తిడి వచ్చింది. ఇక కొద్నానీ గుజరాత్ ప్రభుత్వంలో మంత్రి, ఆమె నాయకుడు స్వయంగా ముఖ్యమంత్రి (నేటి ప్రధాని నరేంద్ర మోదీ). బాధ్యతగల మంత్రి అయి ఉండి కూడా తోటి గుజరాతీలపై ఆమె సాగించిన హత్యాకాండపై ఆయన పల్లెత్తు మాట్లాడలేదు. ఇక్కడ నేను చెబుతున్నవాటిలో కొత్త విషయాలేవీ లేవు. అన్నీ బహిరంగంగా జరిగినవి, అధికారికంగా నమోదైనవే. ఇక మొదట చర్చిన్తున్న విషయానికే తిరిగి వస్తే, నా ప్రశ్న ఒక్కటే. ఉగ్రవాదాన్ని మనం మతం నుంచి వేరుచేయాలనేది నిజాయితీతో కూడిన, సబబైన కోరికేనా? అదే జరగాలని ఒక నేత కోరుకునేట్టయితే ముందుగా చేపట్టాల్సిన చర్యలేమిటి? ఎవరికైనాగానీ, ప్రత్యేకించి ప్రపంచంలోని మనమున్న ఈ ప్రాంతంలోని వారికి ఈ పని చేయడం కష్టమని నేనంటాను. ఉగ్రవాదులు హిందువులో, సిక్కులో అయితే వారిని ఉగ్రవాదులుగా చూడటం మనకు తేలికేం కాదు. వారికి శిక్షలు విధించినా, వారు కూడా ఆత్మాహుతి దాడులనే అవే ఎత్తుగడలను ప్రయోగించినా, వారి చర్యల వల్ల వారు ఎంచుకున్న లక్ష్యాలతో పాటూ అమాయక ప్రజలు కూడా బలైపోయినా అది అంతే. పార్లమెంటుపై జరిగిన ఉగ్రవాద దాడికి మద్దతునిచ్చినందుకు అఫ్జల్ గురుకు ఉరిశిక్ష విధించారు. గురుకు ‘‘మరణ దండన విధించనిదే సమాజ సమష్టి అంతరాత్మ సంతృప్తి చెందదు’’ అని భారత అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టు పేర్కొంది. ముస్లిమేతరులను ఉరితీయడానికి కూడా మనం అలాంటి సమర్థనలను యోచించగలిగేటంత వరకు, ఉగ్రవాదాన్ని మతం నుంచి వేరుచేసి ఆలోచించడం సాధ్యం కాదని నా అభిప్రాయం. - ఆకార్ పటేల్ (వ్యాసకర్త కాలమిస్టు, రచయిత) aakar.patel@icloud.com