breaking news
prakasham building
-
కబంధ హస్తాల్లో మున్సిపల్ షాపులు
నెల్లూరు సిటీ: సొమ్మొకరిది..సోకొకరిది అన్నట్లుగా తయారైంది నగర పాలక సంస్థ మున్సిపల్ షాపుల పరిస్థితి. 20 ఏళ్లకుపైగా కొందరి కబంధ హస్తాల్లో మున్సిపల్ షాపులు కొనసాగుతున్నాయి. అధికార పార్టీ, రాజకీయ నాయకుల అండదండలతో షాపు లీజుదారులు కొనసాగుతున్నారు. బయట వ్యక్తులకు ఎక్కువ మొత్తానికి షాపులను అద్దెకు ఇచ్చి కార్పొరేషన్ ఆదాయానికి గండికొడుతున్నారు. మున్సిపల్ షాపులపై చర్యలు తీసుకునేందుకు అధికారులు సైతం వెనుకంజ వేస్తున్నారు. నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలో 14 మున్సిపల్ కాంప్లెక్స్లు ఉన్నాయి. అందులో 234 షాపులు ఉండగా, వాటిలో 64 షాపులు 20 ఏళ్లకు పైబడి కొందరి చేతుల్లో ఉన్నాయి. మరో 100 నుంచి 120 షాపులను పదేళ్లకుపైగా కొందరు బినామీలు నడుపుతున్నారు. మున్సిపల్ నిబంధనల ప్రకారం షాపు లీజుకు తీసుకుని మూడేళ్లు దాటితే వేలం పాట నిర్వహించాలి. అయితే ఈ నిబంధనలు అమలు కావడంలేదు. కార్పొరేషన్ రెవెన్యూ అధికారులు కొన్ని సార్లు వేలం పాటలు నిర్వహించేందుకు యత్నించినా బడాబాబులు, అధికార పార్టీ నాయకులు ఒత్తిళ్లతో అడ్డుకుని షాపు లీజుదారుడికే కట్టబెట్టుతున్నారనే విమర్శలు ఉన్నాయి. లీజుదారుడు ఒకరు.. బాడుగకు ఉండేది మరొకరు... మున్సిపల్ షాపులను లీజుకు తీసుకున్న వారు మాత్రమే షాపు నిర్వహణ చేయాలి. అయితే లీజుదారుడు కార్పొరేషన్కు తక్కువ బాడుగ చెల్లిస్తూ బయట వ్యక్తికి ఎక్కువ బాడుగలకు ఇస్తున్నారు. చిన్నబజారు, డైకాస్రోడ్డు, మద్రాసుబస్టాండు, గాంధీబొమ్మ సెంటర్లోని మున్సిపల్ కాంప్లెక్స్లో కొందరు షాపులను వేలం పాటలో రూ.5 నుంచి రూ.7వేలకు తీసుకుని, బయట వ్యక్తికి అదే షాపును రూ.10వేల నుంచి రూ.15వేలకు బాడుగకు ఇస్తున్నారు. వేలం పాటలు నిర్వహించపోవడంతో ఏటా లక్షల రూపాయల కార్పొరేషన్ ఆదాయానికి గండి పడుతోంది. మున్సిపల్ షాపుల వేలానికి అడ్డంకులు గతంలో పనిచేసిన కమిషన్ పీవీవీఎస్ మూర్తి కార్పొరేషన్ పరిధిలోని 25 ఏళ్ల లీజు నిండిన 65 షాపులకు వేలం పాట నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు. షాపుల వేలం పాట తేదీని సైతం ప్రకటించారు. అయితే ఆయా షాపుల లీజుదారులు కోర్టుకు వెళ్లడంతో తాత్కాలికంగా వేలం పాట నిలిపివేశారు. ఇది జరిగి ఒకటన్నర ఏడాది కావస్తున్నా అధికారులు అటు వైపుగా కన్నెత్తి చూడకపోవడం విశేషం. ఇప్పటికైనా కార్పొరేషన్ అధికారులు స్పందించి వేలం పాటలకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. షాపింగ్ కాంప్లెక్ పేరు షాపుల సంఖ్య ప్రకాశం పంతులు కాంప్లెక్స్ 18 సుబేదారుపేట కాంప్లెక్స్ 13 బీవీఎస్ఎం కాంప్లెక్స్ 16 పప్పులవీధి కాంప్లెక్స్ 24 ఏసీ భవన్ కాంప్లెక్స్ 12 పనుతల వారి కాంప్లెక్స్ 13 చిన్నబజారు కాంప్లెక్స్ 38 డైకాస్రోడ్డు 06 సౌదాన్య కాంప్లెక్స్ 15 డైకాస్రోడ్డు కాంప్లెక్స్ 05 ఏసీ విహార్ కాంప్లెక్స్ 05 ఏసీ సుబ్బారెడ్డి కాంప్లెక్స్ 22 -
ఆధునికీకరించిన ఎస్బీఐ కలెక్టరేట్ శాఖ ప్రారంభం
ఒంగోలు ఒన్టౌన్, న్యూస్లైన్ : స్థానిక ప్రకాశం భవనంలో ఆధునికీకరించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కలెక్టరేట్ శాఖను కలెక్టర్ విజయకుమార్ శుక్రవారం ప్రారంభించారు. 2009లో ఎస్బీఐ ఎక్స్టెన్షన్ కౌంటర్గా ప్రారంభమై ప్రస్తుతం పూర్తిస్థాయి బ్యాంకు శాఖగా రూపుదిద్దుకోవడంపై కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రారంభంలో ఒకే గదిలో ఇరుకుగా ఉన్న ఎక్స్టెన్షన్ కౌంటర్ను ప్రస్తుతం పూర్తిస్థాయి బ్యాంకు శాఖగా స్థాయిపెంచి భవనాలను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. సెంట్రల్ ఏసీ సౌకర్యం కూడా కల్పించారు. బ్యాంకు శాఖను ప్రారంభించిన కలెక్టర్ మాట్లాడుతూ బ్యాంకులో డిపాజిట్లు సేకరించడంతో పాటు బంగారం తాకట్టుపై రుణాలు కూడా ఇస్తారన్నారు. వ్యక్తిగత రుణాలు కూడా పొందవచ్చని, ప్రభుత్వ చలానాల చెల్లింపులన్నీ ఈ బ్యాంకు శాఖ నుంచే జరుగుతున్నాయని వెల్లడించారు. బ్యాంకు సేవలను ప్రకాశం భవనంలోని ఉద్యోగులతో పాటు పరిసరాల్లోని ప్రజలు కూడా వినియోగించుకోవాలని సూచించారు. బ్యాంకు శాఖకు అనుబంధంగా రెండు ఏటీఎంలు, ఒక క్యాష్ డిపాజిట్ మిషన్ (సీడీఎం) ఏర్పాటు చేసేందుకు కలెక్టరేట్ కాంప్లెక్స్లో స్థలాన్ని సమకూర్చేందుకు కలెక్టర్ హామీ ఇచ్చారు. త్వరలో 11 ఏటీఎంలు... స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు శాఖలకు అనుబంధంగా త్వరలో 11 ఏటీఎంలు ప్రారంభించనున్నట్లు ఆ బ్యాంకు డిప్యూటీ జనరల్ మేనేజర్ సంజుక్తారాయ్గురు తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి బ్యాంకు శాఖ ఆవరణలో ఏటీఎం ఏర్పాటు చేయాలన్నారు. అక్కడ స్థలం సరిపోకపోతే కనీసం 500 మీటర్లలోపు ఏటీఎంను ఏర్పాటు చేయాలన్నారు. కొత్త ఏటీఎంలలో క్యాష్ డిపాజిట్ మిషన్లను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. కందుకూరు, కనిగిరి, కంభం, ఒంగోలు అంజయ్యరోడ్డు, కలెక్టరేట్ శాఖల వారీగా 6 ఏటీఎంలు, 5 క్యాష్ డిపాజిట్ మిషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఖాతాదారులకు 24 గంటల పాటు నగదు లావాదేవీలు, డిపాజిట్లు, విత్డ్రాలకు అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఒంగోలు కలెక్టరేట్ కాంప్లెక్స్లో ఏటీఎంలు, సీడీఎంల ఏర్పాటుకు స్థలం సమకూర్చాలని కలెక్టర్ను కోరారు. కలెక్టరేట్ బ్యాంకు శాఖను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దిన ఆ శాఖ మేనేజర్ రాంబాబును డీజీఎంతో బ్యాంకు రీజినల్ మేనేజర్ కేఎస్ఆర్ మూర్తి, కలెక్టర్ అభినందించారు. వ్యక్తిగత రుణాలివ్వాలి... కలెక్టరేట్ శాఖలో ఉద్యోగులకు వ్యక్తిగత రుణాలివ్వాలని ఎన్జీవో సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసరావు, ఒంగోలు తాలూకా అధ్యక్షులు నాసర్ మస్తాన్వలి, మాలకొండయ్యలు ఆ బ్యాంకు డీజీఎం, ఆర్ఎంలను కోరారు. రుణాల మంజూరుకు అదనపు సిబ్బందిని నియమించాలని వారు విజ్ఞప్తి చేశారు. రుణాలిచ్చేందుకు డీజీఎం, ఆర్ఎంలు అంగీకరించారు. కార్యక్రమంలో ఒంగోలు ఆర్డీవో ఎస్.మురళి, వెలిగొండ స్పెషల్ కలెక్టర్ నాగరాజారావు, జేడీఏ దొరసాని, బ్యాంకు ఆఫీసర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ కె.కిశోర్కుమార్, కె.కృష్ణ, పలు శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
సమైక్య పోరుకు దూరంగా ఉపాధ్యాయులు
ఒంగోలు ఒన్టౌన్, న్యూస్లైన్ : జిల్లాలో నెల రోజులుగా ఉవ్వెత్తున సాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమానికి ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు ఎక్కువ మంది దూరంగా ఉండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మేధావులుగా.. సమాజ నిర్దేశకులుగా పేరొందిన ఉపాధ్యాయులు కీలక సమయంలో ప్రేక్షకపాత్ర కే పరిమితమయ్యారు. సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగితే మెజారిటీ ఉపాధ్యాయులు మాత్రం దూరంగానే ఉన్నారు. ఏవో పొంతన లేని కుంటిసాకులు చెబుతూ సమ్మె నుంచి దూరం జరుగుతున్నారు. ఉపాధ్యాయ సంఘాల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు.. సమైక్యాంధ్ర ఉద్యమంలో స్పష్టంగా కనిపిస్తోంది. జిల్లాలో మొదటిగా ఎన్జీవోలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టగా ఉపాధ్యాయుల్లో వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ప్రకాశం భవనం ఎదుట రెండు రోజులు నిరాహారదీక్షలు నిర్వహించింది. రిలే దీక్షలు ముగింపు సందర్భంగా నగరంలో ర్యాలీ కూడా నిర్వహించింది. అనంతరం ఉపాధ్యాయ జేఏసీ ఏర్పాటుకు కూడా చొరవ చూపి తమ కార్యాలయంలోనే అన్ని ఉపాధ్యాయ సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని వైఎస్ఆర్ టీఎఫ్ ఏర్పాటు చేసింది. రౌండ్టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఉపాధ్యాయ సంఘాల నాయకులు సమైక్యాంధ్ర ఉపాధ్యాయ జేఏసీ ఏర్పాటుకు తమ మద్దతు తెలిపారు. దీంతో అన్ని సంఘాలతో కలిపి ఉపాధ్యాయ జేఏసీ ఆవిర్భవించింది. తీరా సమ్మెలోకి వెళ్లే విషయంలో కొన్ని ఉపాధ్యాయ సంఘాలు యూటర్న్ తీసుకున్నాయి. సీమాం ధ్రలోని 13జిల్లాల ఉపాధ్యాయ సంఘాల జేఏసీ విజయవాడలో సమావేశమై ఆగస్టు 21వ తేదీ అర్ధరాత్రి నుంచి ఉపాధ్యాయులందరూ సమ్మెలో పాల్గొనాలని తీర్మానించారు. జిల్లాలో నెలకొన్న పరిస్థితుల కారణంగా ఈ నెల 26వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయించారు. డీఈవోకు సమ్మె నోటీసు కూడా అందజేశారు. ఉపాధ్యాయ జేఏసీ ఏర్పాటుకు అంగీకారం తెలిపిన 10 సంఘాల్లో కేవలం 5సంఘాలు మాత్రమే సమ్మె నోటీసులో సంతకం చేశాయి. నోటీసులో సంతకం చేసిన 5 సంఘాల సభ్యులు కూడా పూర్తిస్థాయిలో సమ్మెలో పాల్గొనక పోవడంతో జిల్లాలో ఉపాధ్యాయుల సమ్మె వెలవెలపోతోంది. ఇదీ.. వాస్తవ పరిస్థితి రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలుగా విడిపోతే సీమాంధ్ర ప్రాంతంలో పని చేస్తున్న ఉద్యోగులకు జీతాలు చెల్లించే పరిస్థితి ఉండదు. రాష్ట్ర రెవెన్యూలో సింహభాగం అంటే 60 శాతం వరకు ఒక్క హైదరాబాద్ నుంచే వస్తోంది. తెలంగాణలోని మిగిలిన జిల్లాల నుంచి 16 శాతం రెవెన్యూ వస్తోంది. అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ రాబడిలో 76 శాతం ఒక్క తెలంగాణకే దక్కుతుంది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల నుంచి కేవలం 24 శాతం రెవెన్యూ మాత్రమే వస్తోంది. అంటే భవిష్యత్తులో సీమాంధ్ర జిల్లాలో పని చేసే ఉద్యోగులకు ప్రస్తుతం చెల్లిస్తున్న జీతాలు కూడా చెల్లించలేని దుర్భర పరిస్థితి ఏర్పడుతుంది. ఇక భవిష్యత్తులో పీఆర్సీ, డీఏల ఊసే ఉండదు. విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. ఐటీ ఫార్మా పరిశ్రమలన్నీ హైదరాబాద్లోనే కేంద్రీకృతమయ్యాయి. అంటే సీమాంధ్రలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల్లేనట్లే. సీమాంధ్రలోని జిల్లాల్లో కనీసం 400 మందికి ఉపాధి కల్పించే సంస్థ ఒక్కటీ లేదు. ఇక జల వివాదాల వల్ల సీమాంధ్ర ప్రాంతం ఎడారిగా మారే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే సీమాంధ్ర ప్రాంతానికి దుర్భర పరిస్థితులు దాపురించనున్నాయి. ఈ పరిస్థితులను ముందుగానే ఊహించి ప్రభుత్వ ఉద్యోగులు విధులు బహిష్కరించి సమ్మె బాట పట్టారు. విద్యార్థులు వారికి తోడుగా నిలిచారు. ప్రైవేట్ విద్యాసంస్థలు కూడా జేఏసీగా ఆవిర్భవించి సమైక్యాంధ్ర ఉద్యమానికి తమ వంతుగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు పాఠశాలలకు సెలవులు ప్రకటించి నిరసనలు తెలుపుతున్నాయి. ఇవేమీ మెజారిటీ ప్రభుత్వ ఉపాధ్యాయులకు పట్టడం లేదు. సమాజహితాన్ని విస్మరించి కేవలం బెల్లు, బిల్లుకే పరిమితమవుతున్నారు. దీంతో ఉపాధ్యాయుల తీరును నిరసిస్తూ సెల్ఫోన్లలో మెసేజ్లు హల్చల్ చేస్తున్నాయి. సమైక్యాంధ్ర కోసం స్వీపర్లు, నాలుగో తరగతి ఉద్యోగులు, ఎన్జీవోలు, డాక్టర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఆర్టీసీ, హెచ్ఎంలు, ఎంఈఓలు, జిల్లా అధికారులు, ఆర్డీఓలు, కుల సంఘాలు, హిజ్రాలు సైతం ఉద్యమిస్తున్నారు. మేధావులైన ఉపాధ్యాయులు మాత్రం దూరంగా ఉంటున్నారంటూ ఆ మెసేజ్ల సారాంశం. మరికొన్నింటిలో ఆర్థిక లాభం కలిగించే ఇంక్రిమెంట్లు, డీఏలు, పీఆర్సీల కోసం ఆందోళనలు చేసే టీచర్లుకు సమైక్యాంధ్ర పట్టదంటూ మెసేజ్లు ఇస్తున్నారు. సమ్మెలో ఐదు సంఘాలు సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్ర జిల్లాలన్నింటిలో ప్రభుత్వ ఉపాధ్యాయుల సమ్మెలో పాల్గొంటుండటంతో పాఠశాలలు మూతబడ్డాయి. జిల్లాలో మాత్రం ఐదు ఉపాధ్యాయ సంఘాలు మాత్రమే సమ్మెకు మద్దతు తెలిపి డీఈఓకు నోటీసులిచ్చాయి. వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్, ప్రధానోపాధ్యాయుల సంఘం, ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘం, పీఆర్టీయూ, బీయీడీ ఉపాధ్యాయ సంఘం మాత్రమే నోటీసులో సంతకం చేశాయి. మిగిలిన సంఘాలు సమ్మెకు దూరంగా ఉన్నాయి. జిల్లాలోని 2940 ప్రాథమిక పాఠశాలల్లో 83069 మంది ఉపాధ్యాయులు, 428 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 3,339 మంది ఉపాధ్యాయులు, 441 హైస్కూళ్లలో 7015 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. సమైక్యాంధ్ర ఉపాధ్యాయ జేఏసీ నాయకులు చెప్పిన వివరాల ప్రకారం 430 మంది హైస్కూలు హెడ్మాస్టర్లకు గాను 298 మంది సమ్మెలో పాల్గొంటున్నారు. హైస్కూళ్లలో పనిచేసే స్కూలు అసిస్టెంట్లు, ప్రాథమిక పాఠశాలల్లో పనిచేసే సెకండరీ గ్రేడ్ టీచర్లు 1970 మంది సమ్మెలో పాల్గొంటున్నారు. అంటే జిల్లాలోని మొత్తం ఉపాధ్యాయుల్లో కేవలం 12 శాతం మంది మాత్రమే ప్రస్తుతం సమ్మెలో పాల్గొంటున్నారు. సమ్మెలో పాల్గొనవద్దని ప్రచారం చేస్తున్న కొన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులైతే సమైక్యాంధ్ర పేరు ఉచ్ఛరించేందుకు కూడా ఇష్టపడటం లేదు. సమ్మెలో పాల్గొనవద్దంటూ మెసేజ్లు పంపుతూ ఉపాధ్యాయులను గందరగోళానికి గురి చేస్తున్నారు. అదే తెలంగాణలో ఉపాధ్యాయ సంఘాలతో సంబంధం లేకుండా ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సమ్మెలో పాల్గొన్నారు. ఆ తర్వాత సమ్మె కాలాన్ని ఆన్డ్యూటీగా (ఓడీ) సాధించుకుని జీతాలు కూడా తీసుకున్నారు. ఇక్కడ మాత్రం ఉపాధ్యాయులు కుంటిసాకులు చెబుతూ ఉద్యమానికి దూరంగా ఉంటున్నారు. ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొని సమైక్యాంధ్ర పరిరక్షణలో తమ వంతు పాత్ర పోషించకపోతే భవిష్యత్తు తరాలకు ద్రోహం చేసినవారవుతారని పలువురు పేర్కొంటున్నారు.