breaking news
Port of entry
-
అమెరికా వెళ్తున్నారా... అయితే జాగ్రత్త...
హైదరాబాద్ : ఎన్నో ఆశలతో అమెరికాలో ఉన్నత చదువులు చదవాలని భావిస్తున్న విద్యార్థులు కొందరికి ఇటీవలి కాలంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అమెరికాలోని ఏదైనా ఎయిర్ పోర్టు దిగగానే పోర్ట్ ఆఫ్ ఎంట్రీ నుంచి తిరిగి స్వదేశానికి తిరిగి వస్తున్న విద్యార్థుల సంఖ్య ఇటీవలి కాలంలో పెరగడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు కొన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉంటే ఎలాంటి ఇబ్బందులు రావని నిపుణులు చెబుతున్న సూచనలు పాటిస్తే మంచిది. ప్రధానంగా పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో అడిగే ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పడమే కాకుండా అమెరికా ఎందుకు వెళుతున్నామన్న విషయంలో విద్యార్థినీ విద్యార్థులకు ముందు అవగాహన ఉండాలి. ఈ విషయాల్లో నిపుణులు ఏం సూచిస్తున్నారో ఒకసారి పరిశీలిద్దాం. కోర్సులపై అవగాహన ఒక యూనివర్సిటీలో అడ్మిషన్ (ఐ 20) తో పాటు వీసా పొందిన తర్వాత ప్రధానంగా కొన్ని అంశాలపై పూర్తి అవగాహన ఉండాలి. ప్రధానంగా యూనివర్సిటీ నేపథ్యం, చదువుతున్న కాలంలో చెల్లించే ఫీజులతో పాటు విడిగా మనకు అయ్యే ఖర్చులన్నీభరించగలిగే స్థితిగతులు విద్యార్థికి ఉన్నాయని పోర్ట్ ఆఫ్ ఎంట్రీ అధికారులకు నమ్మకం కలగాలి. అలా కాకుండా అక్కడికి వెళ్లిన తర్వాత ప్రైవేటు ఉద్యోగాలు చేసి సంపాదించుకుని చదువుకుంటానని చెబితే మిమ్మల్ని వెనక్కి తిప్పిపంపిస్తారు. వీసా ఇచ్చింది చదువు కోవడానికి అయినప్పుడు ప్రైవేటు ఉద్యోగాలు చేయడం అమెరికాలో నిషేధం. పోతే అమెరికాలో ఒక్కో యూనివర్సిటీ ఒక్కో విధంగా సెమిస్టర్ విధానం, క్రెడిట్స్ విధానంలో విద్యనందిస్తుంటాయి. మీరు చేరబోయే కోర్చులకు సంబంధించి ఎన్ని సెమిస్టర్స్, ఎన్ని క్రెడిట్స్ ఉంటాయి వంటి విషయాల్లో యూనివర్సిటీ అధికారులతో ముందుగానే ఈ మెయిల్ ద్వారా సంప్రదించి సమగ్ర వివరాలు తెలుసుకుని ఉండాలి. ఉదాహరణకు ఎంఎస్ చేయడానికి వెళుతున్నప్పుడు మీరు చేరిన యూనివర్సిటీ మొత్తం నాలుగు సెమిస్టర్లలో ఆ కోర్సును అందిస్తుందనుకుంటే... ఆ నాలుగు సెమిస్టర్లను ఎంతకాలంలో పూర్తి చేయాలి. దానికి ఎంత ఫీజు చెల్లిస్తున్నాం. ఫీజులు పోగా మిగిలిన ఖర్చులను ఏ విధంగా భరిస్తాం. ఆ ఖర్చులన్నీ భరించడానికి మనకు స్తోమత ఉందా... వంటి వివరాలను పోర్ట్ ఆఫ్ ఎంట్రీ లో కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) అధికారులు మిమ్మల్ని రకరకాల ప్రశ్నల ద్వారా ఒక అంచనాకు వస్తారు. ఇలా ప్రశ్నించే విషయంలో ఒక్కో సారి ర్యాండమ్ గా విద్యార్థులను ఎంపిక చేసుకోవచ్చు. అనుమానం కలిగితే ఒక గ్రూపు మొత్తాన్ని కూడా విచారణ చేయొచ్చు. డాక్యుమెంట్స్ అవసరమా వీసా, ఐ20, యూనివర్సిటీ ఆఫర్ లెటర్ వంటి అడ్మిషన్ కు సంబంధించిన పూర్తి వివరాల సర్టిఫికేట్లు ఉండాల్సిందే. అధికారులు అడిగినప్పుడు వాటన్నింటినీ చూపించాల్సి ఉంటుంది. వాటితో పాటు ఫీజు చెల్లింపు పత్రాలు కూడా కలిగి ఉండాలి. ఎంఎస్ చేయడానికి బ్యాంకు రుణం తీసుకున్నారనుకోండి... ఆ రుణంలో మీరు యూనివర్సిటీకి చెల్లించే ఫీజుతో పాటు మీకు అక్కడ ఉండటానికి అయ్యే ఖర్చులు కూడా కలిపే బ్యాంకులు రుణం మంజూరు చేస్తాయి. అందువల్ల రుణం తీసుకున్న బ్యాంకు నుంచి పూర్తి వివరాలకు సంబంధించిన పత్రాలు విద్యార్థుల వద్ద ఉంటే మంచిది. ఇంగ్లీషుపై పట్టు... సీబీపీ అధికారులు ప్రశ్నిస్తున్నప్పుడు కొందరు విద్యార్థులు వాటిని సరిగా అర్థం చేసుకోలేక కూడా వెనక్కి తిరిగాల్సిన పరిస్థితులు ఇటీవలి కాలంలో తలెత్తాయి. విద్యార్థులు ముందుగా ఇంగ్లీషుపై పట్టు సాధించడం చాలా ముఖ్యం. ఇంగ్లీషులో పట్టుంటే తడుముకోకుండా అధికారులకు సులభంగా సమాధానాలు చెప్పడానికి వీలవుతుంది. ఇంగ్లీషుపై పట్టు లేకపోవడం వల్ల చాలా మంది తడుముకుంటుంటారు. దాంతో అధికారులు మరిన్ని ప్రశ్నలు వేయడం, దాంతో విద్యార్థి ఆ సమయంలో ఆందోళనకు గురికావడం, వాళ్లు మరింత రెచ్చిపోయిన విధంగా అడగడం... చివరకు నిరాశ ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు వెనక్కి వస్తున్న వారిలో ఎక్కువగా ప్రధానంగా కమ్యునికేషన్ స్కిల్స్, సమాధానాలు చెప్పడంలో ఆత్మవిశ్వాసం లేకపోవడం, సర్టిఫికేట్లలో వైరుధ్యాలు ఉండటమే ప్రధాన కారణాలని నిపుణులు చెబుతున్నారు. బ్లాక్ లిస్ట్... ఒక యూనివర్సిటీని బ్లాక్ లిస్ట్ లో పెడితే ఆ విషయం బహిరంగంగానే ప్రకటిస్తారు. పైగా ఆ విషయాన్ని అన్ని కాన్సులేట్లకు సమాచారం ఉంటుంది. యూనివర్సిటీ బ్లాక్ లిస్ట్ లో ఉంటే ముందు అసలు వీసా ఇవ్వరు. ఉన్నత చదువుల కోసం ఏ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలన్న సమస్య తలెత్తినప్పుడు విద్యార్థులకు వచ్చిన జీఆర్ఈ స్కోర్ ఆధారంగా కన్సల్టెంట్లు ఫలానా యూనివర్సిటీలో అడ్మిషన్ వస్తుంది. ప్రాసెస్ చేస్తామని చెబుతుంటారు. లేదా స్నేహితులు చెబితేనో యూనివర్సిటీలకు దరఖాస్తు చేస్తుంటారు. అయితే దరఖాస్తు చేయడానికి ముందుగానే ఆ యూనివర్సిటీకి సంబంధించిన పూర్తి వివరాలు వెబ్ సైట్ లో క్షుణ్ణంగా శోధించాలి. ఆ తర్వాతే ముందుకెళ్లాలి. యూనివర్సిటీల క్రెడెన్షియల్స్ ను ప్రధానం అధ్యయనం చేయాలి. ఇక్కడి నుంచి వెళుతున్న విద్యార్థులకు అవసరమైన సలహాలు సూచనలు ఇవ్వడానికి అమెరికాలో అనేక తెలుగు అసోసియేషన్లు పనిచేస్తున్నాయి. యూనివర్సిటీ వివరాలను సేకరించిన తర్వాత మీరు చేరబోయే కోర్సు, దాని క్రెడిట్స్ విషయంలో బాగా అధ్యయనం చేయాలి. వ్యక్తిగత నేపథ్యం మీరు వీసా కోసం దరఖాస్తు చేసినప్పుడు డీ-160 లో అనేక వివరాలను పొందుపరుస్తారు. మీ ఈ మెయిల్ తో పాటు మీ పూర్తి వివరాలు అందులో ఉంటాయి. దాని ఆధారంగా అనుమానం వచ్చినప్పుడు మీ ఫేస్ బుక్, ట్విట్టర్ అకౌంట్లను కూడా పరిశీలించే అవకాశం ఉంటుంది. అందువల్ల ఉన్నత చదువులు చదవాలనుకున్న విద్యార్థుల వ్యక్తిగత నేపథ్యం తెలుసుకోవడానికి ఆ వివరాలతో ఒక అంచనాకు వచ్చే అవకాశాలుంటాయి. చాటింగులు సమస్యలు తేవొద్దు ఫేస్బుక్లో చేసే కాజువల్ పోస్టులు, స్నేహితులు, బంధువులతో చాటింగ్లో తెలిసోతెలియకో చేసే వ్యాఖ్యలు.. ఒక్కోసారి విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలో పడేసే అవకాశముంది. ముఖ్యంగా విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులు, ఉద్యోగార్థులు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సామాజిక వేదికల్లో జాగ్రత్తగా ప్రవర్తించకపోతే మున్ముందు తీవ్ర ఇబ్బందులు తప్పవని చెప్తున్నారు. ఇటీవలి కాలంలో కొందరు విద్యార్థులకు పోర్ట్ ఆఫ్ ఎంట్రీ వద్ద కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయి. తాము ఏ ప్రశ్నలకు సమాధానం ఇవ్వకముందే తమ ఉద్దేశాలు ఇమ్మిగ్రేషన్ అధికారులు స్పష్టంగా పసిగట్టడంతో విద్యార్థులు నివ్వెరపోయారు. అమెరికాలో చదువు కోసం వస్తున్నప్పటికీ, అక్కడ ఉద్యోగం వెతుక్కోవాలని భావిస్తున్నామని ఏదో మాటమాటల్లో ఫేస్బుక్ చాటింగ్లో చేసిన వ్యాఖ్యలు, ఇమ్మిగ్రేషన్ తనిఖీలను ఎలా బోల్తా కొట్టించాలనే విషయంలో అమెరికాలోని స్నేహితులు ఇచ్చిన తమకు సలహాలు వంటివి తమను ఇమ్మిగ్రేషన్ అధికారులకు పట్టించాయని, ఫేస్బుక్లో ఓరకంగా స్పందించి.. తమ ముందు మరోరకంగా సమాధానం చెప్పడాన్ని అధికారులు ఎత్తిచూపారని పలువురు విద్యార్థులు అంగీకరించారు. జాగ్రత్త వహించాల్సిందే... మీ పేరున ఫేస్ బుక్ ఓపెన్ చేస్తే ఇవన్నీ కనిపించేవేనని గమనించాలి. విద్యార్థుల ప్రొఫైల్ను పూర్తిస్థాయిలో అంచనా వేయడానికి అధికారులు ఫేస్బుక్ వంటి బహిరంగ వేదికలపై విస్తృతంగా ఆధారపడుతున్నారు. ఫేస్బుక్ అనేది ఒక విద్యార్థి స్వభావానికి ముఖచిత్రమని, దీనిని వినియోగించడంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా విదేశాలకు వెళ్లడం, ఉద్యోగం కోసం అన్వేషిస్తున్నప్పుడు ఫేస్బుక్ వంటి సోషల్ మీడియాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఇందుకు సన్నద్ధమయ్యేందుకు ముందే ఫేస్బుక్లోని తమ ఖాతాలను సమూలంగా ప్రక్షాళన చేసి.. పనికిమాలిన విషయాలను తొలగించాలని, రాజకీయ అభిప్రాయాలు, ఇతరుల పోస్టులపై పెట్టిన కామెంట్లు, చాటింగ్లు వంటి విషయంలోనూ అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అంతేకాకుండా వారు అనుసరించే పేజీలు, గ్రూపులనూ పరిశీలించే అవకాశముంటుందని, కాబట్టి ఈ విషయంలో ఉద్యోగార్థులు, ఉద్యోగార్థులు అత్యంత అప్రమత్తంగా ఉంటూ.. తమ విద్య, ఉద్యోగాలకు అవసరయ్యే గ్రూపులు, పేజీలతో మాత్రమే ఫేస్బుక్లో టచ్ ఉండాలని సూచిస్తున్నారు. వీసా ఉంటే చాలదు... పాస్ పోర్టులో వీసా ఉంది కదా అని అమెరికా వెళ్తామంటే అన్ని వేళలా సాధ్యం కాదు. వీసా ఉన్నంత మాత్రాన అమెరికాలో అడుగుపెట్టడానికి అనుమతి లభించినట్టు కాదని అమెరికన్ కాన్సులేట్ స్పష్టం చేసింది. ఒక విదేశీయుడిని అమెరికాలో ప్రవేశించడానికి దరఖాస్తు చేసుకునేందుకు అనుమతిని మంజూరు చేయడమే వీసా ప్రధాన లక్ష్యమని అమెరికన్ కాన్సులేట్ స్పష్టం చేసింది. మీరు అమెరికాలో ఎంతకాలం ఉంటారు. ఏ పర్పస్ కోసం వెళుతున్నారు. అనుమతించాలా లేదా వంటి అన్ని అధికారాలు పోర్ట్ ఆఫ్ ఎంట్రీ వద్ద డిపార్ట్ మెంట్ ఆఫ్ హోం ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) కి చెందిన ఇమిగ్రేషన్ అధికారులు పర్యవేక్షిస్తారు. పోర్ట్ ఆఫ్ ఎంట్రీ వద్ద (అది విమానాశ్రయం కావొచ్చు.. సీపోర్టు కావొచ్చు, ల్యాండ్ బోర్డర్ కావొచ్చు) మీ ఎంట్రీని తిరస్కరించే పూర్తి అధికారం ఇమిగ్రేషన్ అధికారికి ఉందన్న విషయాన్ని అంతా గమనించాలి. అవగాహన పెంచుకోవాలి అమెరికా చదువుకోవడమనగానే ఏదో ప్రైవేటు ఉద్యోగం చేసుకుని పూర్తి చేసుకోవచ్చన్న భావన నుంచి విద్యార్థులు బయటకు రావాలి. అమెరికాలో అడుగు పెట్టడానికి లేదా అనుమతించకుండా తిరస్కరించడానికి డిపార్ట్ మెంట్ ఆఫ్ హోం ల్యాండ్ సెక్యూరిటీకి, కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ ఆఫీసర్ కు ఉంటుంది. అయితే ప్రతి ఒక్కరిని వాళ్లు తిరస్కరించరు. ప్రైవేటు ఉద్యోగాలు చేయొచ్చు... యూనివర్సిటీలు మారొచ్చు... వంటి విషయాలపైన కాకుండా ఉన్నత చదువు అన్న ఆలోచన, స్పష్టతతో వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తడం లేదు. అందువల్ల ప్రతి ఒక్కరు ఒక అవగాహనకు వచ్చిన తర్వాతే ముందడుగు వేయాలి. అనవసరమైన ఇబ్బందులు పడొద్దు. ఈ విషయంలో తమ ఫోరంను సంప్రదించిన విద్యార్థినీ విద్యార్థులకు పూర్తి అవగాహన కల్పిస్తున్నాం. - కలవల విశ్వేశ్వర్ రెడ్డి (తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం (టీడీఎఫ్ - యూఎస్ఏ - అధ్యక్షుడు) కోర్సు క్రెడిట్స్ ఏంటో తెలుసుకోండి కొన్ని లీగల్ ఫర్స్ తో చర్చించాం. యూనివర్సిటీని బ్లాక్ లిస్ట్ లో పెడితే ఏ అమెరికన్ కాన్సులేట్ కూడా విసా జారీ చేయదన్న విషయం ముందుగా గుర్తుపెట్టుకోవాలి. మనల్ని ప్రశ్నించిన అధికారులను ఏ విధంగా కన్విన్స్ చేశామన్నదే ముఖ్యం. ప్రధానంగా ఆర్థిక పరమైన విషయాలతో పాటు యూనివర్సిటీ లో చేరబోయే కోర్సుకు సంబంధించిన టర్మ్, క్రెడిట్స్ పై పూర్తి అవగాహనతో సమాధానాలు చెప్పాలి. - రాం అన్నాడి (తెలంగాణ డెవలప్ మెంట్ - స్టూడెంట్స్ సర్వీసెస్ కమిటీ చైర్మన్) -
అమెరికా వెళ్లబోయి అబుదాబీలో...
-
అమెరికా వెళ్లబోయి అబుదాబీలో చిక్కుకుని..
► అబుదాబీ ఎయిర్పోర్టులో తెలుగు విద్యార్థుల అవస్థలు ► సిలికాన్ వ్యాలీ, ఎన్పీయూ విద్యార్థులకు చేదు అనుభవం ► పాస్పోర్టులు లాగేసుకున్న ఇమిగ్రేషన్ అధికారులు ► దిక్కుతోచక ఎయిర్పోర్టులో దిగాలుగా ఉన్న 40 మంది విద్యార్థులు ► కనీస సమాచారం ఇవ్వని అధికారులు ► సోమవారం రాత్రి నుంచి ఇబ్బందులు పడుతున్న పట్టించుకున్న వాళ్లేలేరు (సాక్షి వెబ్ ప్రత్యేకం) అమెరికా వెళ్లి ఉన్నత చదువులు చదవాలని బయలుదేరిన వందలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. గత కొద్దిరోజులుగా కాలిఫోర్నియాలోని రెండు యూనివర్సిటీల బ్లాక్ లిస్ట్లో పెట్టారన్న ప్రచారం రోజురోజుకూ కొత్త మలుపు తిరుగుతోంది. ఈ విషయంలో ఎలాంటి అధికారిక సమాచారం లేకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తాజాగా కాలిఫోర్నియాలోని నార్త్ వెస్ట్రన్ పాలిటెక్నిక్ యూనివర్సిటీ, సిలికాన్ వ్యాలీ యూనివర్సిటీల్లో అడ్మిషన్లు పొందిన దాదాపు 40 మంది విద్యార్థినీ విద్యార్థులను అబుదాబీ ఎయిర్పోర్టులోనే ఆపివేశారు. వీరిలో హైదరాబాద్ నుంచి వెళ్లిన వారు 10 మంది విద్యార్థులుండగా, ఆయా రాష్ట్రాల నుంచి బయలుదేరిన విద్యార్థులు మరో 30 మంది వరకు ఉన్నారు. వీరిలో 10 మంది విద్యార్థులు సోమవారం హైదరాబాద్, ముంబై మీదుగా అబుదాబి చేరుకున్నారు. వారంతా అబుదాబి నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు కనెక్టింగ్ ఫ్లయిట్కు బయలుదేరాలి. హైదరాబాద్ నుంచే కాకుండా దేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు ఉన్నారు. పాస్పోర్టులు లాగేసుకున్న అధికారులు ఎతిహాద్ ఎయిర్ వేస్కు చెందిన విమానంలో బయలుదేరిన వీరిని అబుదాబి ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ అధికారులు నిలిపివేశారు. అక్కడి నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు కనెక్టింగ్ ఫ్లయిట్ విమానం బోర్డింగ్కు అనుమతించలేదు. పైగా విద్యార్థినీ విద్యార్థులందరి నుంచి పాస్పోర్టులను లాగేసుకున్నారు. అదేమంటే... మాకున్న ఆదేశాల మేరకు మిమ్మల్ని అనుమతించడం లేదన్నారు. అంతకు మించిన ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో వారంతా ఒక్కసారిగా షాకయ్యారు. ఏం చేయాలో వారికి పాలుపోని పరిస్థితి ఎదురైంది. లాంజ్లోంచి ఎక్కడికీ కదలనివ్వలేదు. గంటల తరబడి లాంజ్లోనే ఉండిపోయారు. వారికి సరైన సమాచారం ఇచ్చే వాళ్లు కూడా కరవయ్యారు. దాంతో జరిగిన విషయాన్ని ఎవరికి వారు తల్లిదండ్రులకు సమాచారం చేరవేశారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మంగళవారం సాయంత్రం ఎయిర్పోర్ట్ అధికారి ఒకరు వచ్చి వాళ్లకు ఫుడ్ కూపన్స్ అందజేశారు. బుధవారం తిరిగి పంపిస్తాం.. సోమవారం రాత్రి నుంచి మంగళవారం రాత్రి వరకు ఆ విద్యార్థులకు అధికారుల నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. అయితే మంగళవారం రాత్రి ఒక అధికారి వారి వద్దకొచ్చి బుధవారం ఉదయం ఫ్లయిట్ ఏర్పాటు చేస్తున్నారని, అందరినీ తిరిగి ఇండియాకు పంపిస్తారని చెప్పారు. పాస్పోర్టులను మాత్రం వారికి ఇవ్వలేదు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత తిరిగి మాకు అందజేస్తారని చెబుతున్నారని ఎన్పీయూలో ఎంఎస్ అడ్మిషన్ కోసం వెళ్లిన వికాస్ సాక్షితో చెప్పారు. ఎన్నో ఆశలతో... ఉన్నత చదువుల కోసం ఎన్నో ఆశలతో బయలుదేరామని, ఎవరో ఎక్కడో చేసిన తప్పిదానికి మమ్మల్ని బలి చేస్తున్నారని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. రెండు రోజులుగా అబుదాబిలో నానా కష్టాలు పడుతున్న వారికి తమ భవిష్యత్తు ఏమిటో అర్థంకాక బాధపడుతున్నామని చెబుతున్నారు. ఇలాంటి విషయాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారన్నారు. దాదాపు 40 మంది విద్యార్థులు రెండు రోజులుగా అబుదాబిలో ఆగిపోతే ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఏం జరుగుతుందో తెలియక... గడిచిన వారం రోజులుగా ఈ యూనిర్సిటీల్లో అడ్మిషన్లకు వెళుతున్న విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఈ వర్సిటీల్లో ప్రవేశం పొందిన పలువురు విద్యార్థులను గత వారం శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఇమిగ్రేషన్ అధికారులు తిప్పిపంపారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల కిందట ఎయిర్ ఇండియా అధికారులు ఉత్సాహం ప్రదర్శించిన మరో 19 మంది విద్యార్థులకు అసలు బోర్డింగ్ పాస్ ఇవ్వకుండా హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచే తిప్పిపంపారు. అదేమంటే... మాకున్న సమాచారం మేరకు మిమ్మల్ని అనుమతించమని, ఒకవేళ అనుమతించినా అమెరికా నుంచి తిరిగి పంపించివేస్తారంటూ ముక్తసరి సమాధానమిచ్చారేగానీ కారణాలను వెల్లడించలేదు. బ్లాక్ లిస్ట్లో పెట్టలేదన్న వర్సిటీలు ఇమిగ్రేషన్ అధికారులు అనుమతి నిరాకరిస్తున్న దశలో ఆందోళన చెందిన విద్యార్థులు ఆయా యూనిర్సిటీ అధికారులను సంప్రదించారు. మెయిల్స్ ద్వారా సంప్రదించిన పలువురు విద్యార్థులతో పాటు ఆ రెండు వర్సిటీలు తమ వెబ్సైట్లో కొన్ని వివరాలిచ్చాయి. తమ యూనివర్సిటీలను బ్లాక్ లిస్ట్లో పెట్టారన్న విషయం వాస్తవం కాదని ఖండించాయి. అదొక ప్రచారంగా కొట్టిపారేశాయి. ఇమిగ్రేషన్ అధికారులకు వీసా, ఐ20, అడ్మిషన్ ప్యాకేజీ, ట్రాన్స్స్క్రిప్ట్స్ వంటి సరైన పత్రాలను చూపించాలని, ఎలాంటి సమస్య తలెత్తదని పేర్కొన్నాయి. ఫ్యారిస్లో దాడుల ఘటన తదనంతరం భద్రతా చర్యలు ముమ్మరం చేయడంవల్ల సెక్యూరిటీ పరమైన అంశాలే తప్ప ఇతరత్రా ఇబ్బందులు లేవని సమాచారమిచ్చాయి. అసలేం జరుగుతోంది? అమెరికాలోని వందలాది యూనివర్సిటీలుండగా వేటికీ తలెత్తని సమస్య వీటికి మాత్రమే ఎందుకు వచ్చిందన్నది ప్రధానాంశం. బ్లాక్ లిస్ట్లో పెట్టలేదంటూ ఆ యూనిర్సిటీలు చెబుతున్న దాంట్లో వాస్తవమెంతో తెలియక విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. బ్లాక్ లిస్ట్లో పెట్టనప్పుడు కొందరు విద్యార్థులనైనా అనుమతించాలి కదా... అలా కాకుండా ఆ యూనివర్సిటీలకు వెళుతున్న వారందరినీ ఎందుకు తిప్పిపంపిస్తున్నారన్న విషయంపై ఎవరూ స్పష్టమైన సమాచారం ఇవ్వడం లేదు. అయితే ప్రస్తుతం ఆ యూనిర్సిటీల్లో చదువుతున్న ఇద్దరు విద్యార్థులతో మాట్లాడినప్పుడు, బ్లాక్ లిస్ట్లో పెట్టలేదని చెబుతున్నారు. మాకు ఇటీవలే సెకండ్ సెమిస్టర్ పరీక్షలు కూడా పూర్తయ్యాయని, బ్లాక్ లిస్ట్లో పెడితే పరీక్షలు నిర్వహించడానికి వీలుండదని, అలాంటి పరిస్థితి ఏమీ లేదని ఎన్పీయూలో ఎంఎస్ చేస్తున్న హైదరాబాద్కు చెందిన విద్యార్థి చెప్పారు. ఈ యూనివర్సిటీల్లో గత సెమిస్టర్ కాలంలో 4500 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. అమెరికాలో సోదాలు ఇటీవలి ప్యారిస్ దాడుల నేపథ్యంలో కాలిఫోర్నియా అంతటా సోదాలు ముమ్మరం చేసినట్టు అక్కడి విద్యార్థులు చెబుతున్నారు. ప్రధానంగా వర్సిటీల్లో చదువుతూ ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్న వారిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కాలిఫోర్నియా రాష్ట్రానికి వస్తున్న విద్యార్థుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడం కూడా సోదాలకు ఒక కారణంగా చెబుతున్నారు. జనవరి తొలివారంలో స్పష్టత... ప్యారిస్ దాడులను దృష్టిలో ఉంచుకొని పోలీసులు అడుగడుగునా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అమెరికాలో ఘనంగా నిర్వహించుకునే క్రిస్మస్ పండుగ, నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలోనే తనిఖీలు ముమ్మరం చేశారని అంతకు మించిన ఎలాంటి సమస్యలు లేవని అక్కడివారు సమాచారమిచ్చారు. స్పష్టమైన సమాధానాలు ఇవ్వలేకే... ఈ యూనిర్సిటీల్లో అడ్మిషన్లు పొందిన విద్యార్థులు గత వారం అమెరికా వెళ్లగా ఇమిగ్రేషన్ అధికారులు ఆరుగురు విద్యార్థులను తిప్పిపంపారు. అలా తిప్పిపంపడమే అసలు సమస్యకు ప్రధాన కారణమైందని విశ్లేషిస్తున్నారు. శాన్ఫ్రాన్సిస్కో విమానాశ్రయం పోర్ట్ ఆఫ్ ఎంట్రీ వద్ద అధికారులు అడిగిన ప్రశ్నకు ఒకదానికి మరొకటి పొంతన లేని సమాధానాలు చెప్పిన కారణంగా వారిని తిప్పిపంపినట్టు తెలుస్తోంది. దాని ప్రభావమే మిగతా విద్యార్థులపై పడిందని చెబుతున్నారు. అమెరికా ప్రభుత్వం కొన్ని అనుమానాలు వ్యక్తం చేసిన కారణంగా ఎయిర్ ఇండియా అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో ఎవరో కొంతమంది విద్యార్థుల వల్ల సమస్యలు తలెత్తితే ఎయిర్ ఇండియా అదికారులు మిగతా విద్యార్థులను ఇబ్బందుల పాలు చేశారని అంటున్నారు. పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో అనుమతి నిరాకరిస్తే వారందరినీ తిరిగి తీసుకురావలసి ఉంటుందని, దాన్ని తప్పించుకోవడానికే ఎయిర్ ఇండియా అధికారులు ఈ రకంగా చేశారని కూడా వినిపిస్తోంది. దుష్ర్పచారం వద్దు... భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నత చదువుల కోసం వస్తున్న విద్యార్థులను గందరగోళానికి గురిచేయరాదని తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ నేషనల్ కల్చరల్ చైర్మన్ శ్రీనివాస్ మనప్రగడ, రీజినల్ వైస్ ప్రెసిడెంట్ అప్పిరెడ్డి, యువ సంస్థ ప్రతినిధి సతీష్లు అన్నారు. ఆ రెండు యూనివర్సిటీలను బ్లాక్ లిస్ట్లో పెట్టారన్న ప్రచారం వల్ల ప్రస్తుతం ఆ యూనిర్సిటీల్లో చదువుతున్న విద్యార్థులు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుందని, వారితో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆందోళనకు గురవుతారని చెప్పారు. ఆ రెండు యూనివర్సిటీల్లో ప్రస్తుతం నాలుగు వేల మంది తెలుగు విద్యార్థులున్నారని, తప్పుడు ప్రచారం చేసి వారి భవిష్యత్తును పాడుచేయొద్దని కోరారు. వదంతులను నమ్మొద్దని వారు కోరారు. కొంత మంది తత్తరపాటే ఇమిగ్రేషన్ అధికారులు ప్రశ్నించినప్పుడు కొంత మంది విద్యార్థులు తత్తర పడటం, పొంతన లేని సమాధానాలు ఇవ్వడం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తి ఉంటాయని, అంతమాత్రంగా నిజమైన ప్రతిభ కలిగిన విద్యార్థులకు నష్టం కలిగించే ప్రచారం వద్దని ఆయన కోరారు. శాన్ ఫ్రాన్సిస్కో నుంచి కొంత మంది విద్యార్థులను తిప్పిపంపినప్పుడు ఎయిర్ ఇండియా ఒక్కో విద్యార్థి నుంచి విపరీతంగా డబ్బులు వసూలు చేసిందని మనప్రగడ శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కొక్కరి నుంచి 1.45 లక్షల రూపాయలు వసూలు చేయడం దారుణమన్నారు. శాన్ ఫ్రాన్సిస్కో నుంచి తిరిగి తీసుకెళ్లాల్సిన బాధ్యత వారిపైనే ఉంటుందన్న ఉద్దేశంతో దాదాపు 20 మంది విద్యార్థులకు బోర్డింగ్ పాస్ జారీ చేయకుండా వెనక్కి పంపించిందని ఆయన తప్పుబట్టారు.