breaking news
pocham palli textiles
-
‘ఇక్కత్’కు ఇక్కట్లు!
సాక్షి, యాదాద్రి: పోచంపల్లి ఇక్కత్ పట్టు చీర ప్రమాదంలో పడింది. పేటెంట్ హక్కు కలిగిన ఇక్కత్ పట్టు చీరల డిజైన్లు కాపీకి గురవుతున్నాయి. భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ ట్యాగ్ ) కలిగిన ఇక్కత్ డిజైన్లను కొందరు బడా వ్యాపారులు కాపీ కొట్టి ప్రింటెడ్ పాలిస్టర్ చీరలను తయారు చేసి విక్రయిస్తున్నారు. నేతన్న నేసే పట్టుచీర డిజైన్ను బట్టి గరిష్టంగా రూ.20 వేలు పలుకుతుండగా ప్రింటెడ్ పట్టు చీరల పేరుతో వస్తున్న చీరలు కేవలం రూ.600కే లభ్యమవుతున్నాయి. దీంతో వినియోగదారులు ప్రింటెడ్ చీరల వైపే మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా పట్టు చీరల బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినడంతో పాటు చేనేత వృత్తిదారులు దెబ్బతింటున్నారు. ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో సుమారు 50 వేల చేనేత వృత్తి దారుల జీవనోపాధిపై ప్రింటెడ్ చీరలు తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. చేనేత డిజైన్లు కాపీకి గురికాకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని చేనేత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బ్రాండ్ ఇమేజ్పై దెబ్బ పట్టుదారానికి రంగులద్ది డిజైన్లు కట్టి నేసే ఇక్కత్ పట్టు చీరకు ఓ బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఈ చీరలకు మహిళల్లో విశేష ఆదరణ ఉంది. పోచంపల్లి కేంద్రంగా తయారయ్యే పట్టు చీరలకు అంతర్జాతీయంగా గుర్తింపు కూడా ఉంది. అలాంటి పట్టు చీరల డిజైన్లను నిబంధనలకు విరుద్ధంగా ప్రింట్ చేసి తక్కువ ధరలకు బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నారు. దీంతో చీర ధర పడిపోవడం, ఏది అసిలీనో ఏది నకిలీనో గుర్తించలేకపోవడం, ఆన్లైన్లో మోసాలు జరగడం లాంటివి కూడా చోటు చేసుకుంటున్నాయి. గత రెండేళ్లుగా గుజరాత్లోని సూరత్ కేంద్రంగా పోచంపల్లి డిజైన్లతో ప్రింటెడ్ పాలిస్టర్ చీరలు బహిరంగ మార్కెట్ను ముంచెత్తుతున్నాయి. ఈ చీరలు రూ.600 నుంచి రూ.1000 లోపే లభిస్తుండటంతో కొనుగోలుదారులు ఆకర్షితులవుతున్నారు. భారీగా పడిపోయిన అమ్మకాలు ఉమ్మడి నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో 12,000 మంది చేనేత కళాకారులకు జియో ట్యాగ్ ఉంది. అంటే ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రతినెలా ఒక జియో ట్యాగ్ కళాకారుడితోపాటు మరో ఇద్దరు అనుబంధ కళాకారులు ఉంటారు. అంటే సుమారు 36 వేల మంది నేరుగా వృత్తిలో ఉన్నారు. నెలకు ఒక చేనేత కుటుంబం ఐదు చీరలు తయారు చేస్తుంది. ఇలా తయారైన చీరలతో గతంలో నెలకు రూ. 40 కోట్ల వ్యాపారం జరిగేది. ప్రస్తుతం ప్రింటెడ్ చీరలు రాకతో రూ.20 కోట్లకు అంటే సగానికి సగం వ్యాపారం పడిపోయిందని నేతన్నలు చెబుతున్నారు. మూట వ్యాపారం దాకా విస్తరణ పోచంపల్లి ప్రింటెడ్ పట్టు చీరలు ఇప్పుడు గ్రామాల్లో మూట వ్యాపారం దాకా వచ్చాయి. గతంలో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లోనే లభించే ప్రింటెడ్ చీరలు ఇప్పుడు పల్లెల్లోనూ అమ్ముతున్నారు. ప్రింటెడ్ చీరల అమ్మకాలను అరికట్టాల్సిన యంత్రాంగం చేతులెత్తేయడంతో పోచంపల్లి పట్టు చీరల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోందని స్థానిక సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ప్రింటెడ్ చీరలను అదుపు చేయాలి జీఐ పొందిన ఇక్కత్ చేనేత చీరలను పోలిన ప్రింటెడ్ చీరల తయారీని ప్రభుత్వం అరికట్టాలి. ఇటీవల పోచంపల్లికి వచ్చిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, కేంద్ర జౌళిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రచనా సాహు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాం. గుజరాత్లో ప్రింటెడ్ చీరల తయారీని, షాపింగ్ మాల్స్లో అమ్మకాలను నిరోధించాలి. కల్యాణ లక్ష్మి నగదు సహాయంతోపాటు పోచంపల్లి పట్టు చీరను వధువుకు ఇవ్వాలి. ఇక్కత్ వృత్తిని కాపాడాలి. – తడ్క రమేష్, చేనేత సంఘం నాయకులు, పోచంపల్లి మాల్స్పై మరిన్ని దాడులు చేస్తాం పోచంపల్లి పట్టు చీరలను పోలిన ప్రింటెడ్ చీరలు సూరత్ నుంచి వస్తున్నాయి. షాపింగ్ మాల్స్లో అమ్ముతున్నారన్న విషయాన్ని గుర్తించి దాడులు చేస్తున్నాం. ప్రతి డిజైన్ను కాపీతో ప్రింట్ చేసి చీరలను విక్రయిస్తున్నారు. చేనేత వృత్తిదారులకు ఇది తీరని నష్టం కలిగిస్తోంది. త్వరలో మరిన్ని దాడులు చేయబోతున్నాం. – వెంకటేశ్వర్లు ఎన్ఫోర్స్మెంట్ అధికారి -
ఇక్కత్కు ప్రింటెడ్ దెబ్బ
చేనేత కార్మికుడి శ్రమ, కళ, నైపుణ్యతకు ప్రతిరూపం పట్టు చీర. నాణ్యతను బట్టి రూ.3వేల నుంచి రూ.20వేల వరకు పలికే ‘పట్టు’ నేడు ప్రమాదంలో పడింది. పేటెంట్ హక్కు కలిగిన చేనేత డిజైన్లను కంపెనీలు కాపీ కొట్టి ప్రింటెడ్ సిల్క్ చీరలను తయా రు చేసి.. తక్కువ ధరకు విక్రయిస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు. పేటెంట్ హక్కులకు భంగం వాటిల్లకుండా రాష్ట్ర స్థాయిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఉన్నా నిద్ర వీడడం లేదు. వెరసి చేనేత కార్మికుల జీవనోపాధి ప్రమాదంలో పడే పరిస్థితి నెలకొంది. ఆత్మకూరు(ఎం)(ఆలేరు) : ఇక్కత్ పట్టుచీర డిజైన్లు కాపీకి గురవుతున్నాయి. చేనేత కార్మికుడు తయారు చేసిన పట్టుచీర నాణ్యతను బట్టి రూ.3వేల–రూ. 20వేల వరకు డిమాండ్ పలికితే ప్రింటెడ్ పట్టుచీరల పేరుతో వస్తున్న సిల్క్ చీరలు మార్కెట్లో కేవలం రూ.400కే లభ్యమవుతున్నాయి. దీంతో వినియోగదారులు ప్రిం టెడ్ చీరల వైపే మొగ్గుచూపుతున్నారు. ఫలితంగా చేనేత కార్మి కుల పొట్టగొట్టినట్లవుతోంది. చేనేత కుటుంబ సభ్యులంతా రెక్కలు ముక్కలు చేసుకుని తమకున్న నైపుణ్యంతో రకరకాల డిజైన్ల ను రూపొందిస్తూ, వాటికి రంగులు అద్దుతూ(టై అండ్ డై) పద్ధతిలో తయారు చేస్తున్న పట్టు చీరలను, వాటి డిజైన్లను కొన్ని కంపెనీలు కాపీ కొడుతూ ప్రింటెడ్ పట్టు చీరల పేరుతో మార్కెట్లో విచ్చలవిడిగా చెలామణి చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో చేనేత ప్రభావిత గ్రామాలు యాదాద్రిభువనగిరి జిల్లాలో ముఖ్యంగా భూదాన్పోచంపల్లి, కొ య్యలగూడెం, చౌటుప్పల్, వెల్లంకి, సిరిపురం, సంస్థాన్ నారాయణపురం, రామన్నపేట, గుండాల, మోత్కూర్, ఆలేరు, నల్లగొండ జిల్లాలో గట్టుప్పల, పుట్టపాక, చండూరులో చేనేత పరిశ్రమ విస్తరించి ఉంది. కాగా పోచంపల్లి, పుట్టపాక, గట్టుప్పల్లో టై అండ్ డై వస్త్రాలు, చీరెల తయారీకి ప్రసిద్ధి. ఇక రాజాపేట మండలంలోని రఘునా«థపురం, రేణికుంట, బేగంపేట, ఆలేరు, మూటకొండూర్, చొల్లేరు, కొలనుపాక, దిలావర్పూర్, టంగుటూరు, శ్రీని వాసపురం, గౌరాయిపల్లి, సాదువెల్లి, నల్లగొండ మండలం చర్లపల్లి తదితర గ్రామాల్లో మరమగ్గాలు (సాంచలు) ఉన్నాయి. 20 చేనేత కార్మిక సంఘాలు యాదాద్రిభువనగిరి జిల్లాలో సుమా రు 20 చేనేత పారిశ్రామిక సం ఘాల ఉన్నాయి. ఇందులో ఆరు వేల చేనేత మగ్గాల ద్వారా నెలకు సుమారు 30 వేల పట్టుచీరల వరకు ఎగుమతి చేస్తుంటా రు. చేనేత కార్మికులు తయారు చేసిన పట్టుచీరలను భూదాన్పోచంపల్లి పట్టు శారీ మార్కెట్లో విక్రయిస్తుంటారు. దేశ, విదేశాల నుంచి కొనుగోలుదారులు భూ దాన్పోచంపల్లి పట్టు శారీ మార్కెట్కు వచ్చి పట్టుచీరలను తీసుకెళ్తుంటారు. రోజుకు వెయ్యి పట్టుచీరల ఉత్పత్తి యాదాద్రి భువనగిరి జిల్లాలోని చేనేత సంఘాల పరిలో సుమారు 6వేల మంది చేనేత కార్మికులు ఉన్నారు. వీరు రోజు కు వెయ్యి పట్టుచీరలను ఉత్పత్తి చేస్తున్నారు. చేనేత కార్మికులు తయారు చేస్తున్న పట్టుచీరల్లో రాజ్కోట్, జకాట్, బార్డర్ చీరలు అంటూ రకరకాలుగా ఉంటాయి. బార్టర్ పట్టు చీర ఒక్కటి రూ. 3,500, జకాట్ పట్టుచీర రూ.20,000, రాజ్కోట్ పట్టుచీర రూ.7.500ల వరకు ఉంటుంది. వాటి డిజైన్లను బట్టి 7 చీరలు గల వార్పును చేనేత కార్మికుడు 30 రోజుల నుంచి 60 రోజుల్లో పూర్తిచేస్తాడు. ఇందుకు కూలి కూడా డిజైన్లను బట్టి చేనేత కార్మికుడికి రూ.8,000 నుంచి 36,000 వరకు ఇస్తుంటారు. ఇక్కత్ పట్టుచీరలకు ప్రసిద్ధి భూదాన్పోచంపల్లి. దేశవిదేశాల నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కత్ పట్టుచీరలను కొనుగోలు చేస్తుం టారు. పట్టుచీరల అమ్మకాల మీద రోజుకు రూ. కోటి వరకు లావాదేవీలు నడుస్తున్నాయి తక్కువ ధరకే ప్రింటెడ్ చీరలు చేనేత కార్మికుడు తయారు చేసి న పట్టుచీరలను ప్రస్తుతం మార్కెట్లో లభి స్తున్న ప్రింటెడ్ పట్టుచీరలు సరిపోలి ఉంటున్నా యి. చేనేత పట్టుచీరలు వాటివాటి డిజైన్ల ను బట్టి సుమారు రూ. 20,000 వరకు ఖరీదు ఉండగా.. ప్రింటెడ్ పట్టుచీరల ధర కేవలం రూ.300 –రూ.500కే లభిస్తోంది. చూడడానికి పోచంపల్లి పట్టుచీరల మాదిరిగా ఉండడంతో భువనగిరి, మో త్కూరు, చౌటుప్పల్, ఆలేరు, యాదగిరిగుట్ట, రాజా పేట తదితర ప్రాంతాల్లో విపరీతంగా అమ్ముడవుతున్నాయి. ఇటువంటి చీరలు సూరత్, అహ్మదాబాద్ తదితర ప్రాంతాల్లో మిల్లుల్లో తయారై ఇక్కడికి వస్తున్నట్టు చేనేత కార్మిక సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. ధర తక్కువగా ఉండడం.. అచ్చం చేనేత పట్టుచీరలాగే ఉండడంతో యాదాద్రిభువనగిరి జిల్లాలో రోజుకు లక్ష వరకు చీరలు అమ్ముడవుతున్నట్టు వ్యాపారులు వెల్లడిస్తున్నారు. తనిఖీలు ఏవీ? చేనేత కార్మికులు తయారు చేసిన 11 రకాల పట్టుచీరల డిజైన్లకు 2014లో పేటెంట్ హక్కలు కల్పించబడింది. ఇందుకు 10 మంది సభ్యులతో కూడిన ఎన్ఫోర్స్మెంట్ అధికారుల బృందాన్ని ప్రభుత్వం నియమించింది. ఈ అధికారులు తరచూ వస్త్రదుకాణాలపై చేనేత డిజైన్లను కాపీ కొట్టి చీరలను తయారు చేస్తున్న కంపెనీలపై దాడులు నిర్వహించి కేసులు నమోదు చేయాల్సి ఉంటుంది. కానీ జిల్లాలో మాత్రం తనిఖీలు జరగడం లేదు. ఇండియన్ హ్యాండ్లూమ్ బ్రాండ్ సొంతం నాణ్యమైన, పర్యావరణహితమైన చేనేత వస్త్రాలను ప్రోత్సహించడానికి కేంద్రప్రభుత్వం 2015లో ఇం డియన్ హ్యాండ్లూమ్ బ్రాండ్ను ప్రవేశపెట్టింది. ఈ బ్రాండ్ను దేశంలోనే ప్రప్రథమంగా పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్ సొంతం చేసుకుంది. దీని ద్వారా స్వయంగా వస్త్రోత్పత్తులను జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో మార్కెటింగ్ చేస్తూ రూ.7కోట్ల టర్నోవర్ సాధించింది. దీంతో పార్క్ మెరిట్ అవార్డు, సర్టిఫికెట్ అందుకొంది. దేశవిదేశాలలో ఎగ్జిబిషన్లను నిర్వహిస్తూ ఇక్కత్ ఖ్యాతిని రెట్టింపు చేస్తుంది. 2008లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిరూ.37 కోట్లతో దేశంలో మొదటిసారిగా 5వేల మంది కార్మికులకు ఉపాధి కల్పిం చాలనే లక్ష్యంతో హ్యాండ్లూమ్ పార్క్ను నెలకొల్పారు. హ్యాండ్లూమ్, సిల్క్ మార్క్ నకిలీ వస్త్రాలతో వినియోగదారులు మోసపోకుండా, మగ్గం మీద నేసిన స్వచ్ఛమైన పట్టువస్త్రాలకు ప్రభుత్వం హ్యాండ్లూమ్, సిల్క్ మార్క్ను అందజేసింది. అయితే వినియోగదారులు వస్త్రాలను కొనుగోలు చేసేటప్పుడు ఆ రెండు మార్క్లను చూసి కొనాలి. 60 ఏళ్ల క్రితమే చీరల తయారీ.. భూదాన్పోచంపల్లిలో 60 ఏళ్ల క్రితమే సిల్క్ చీరెలను తయారు చేశారు. 1956లో పోచంపల్లికి చెందిన కర్నాటి అనంతరాములు, చిలువేరు రాంలింగం, చిలువేరు కనకయ్య అనే చేనేత కళాకారులు సిల్క్ చీరెలు, వస్త్రాలపై ఎన్నో నూతన ఆవిష్కరణలకు జీవం పోశారు. పాన్పటోలా, రాజస్థాన్, నారీకుండీ, ఏనుగు, చిలుక అంబాల, సీతాగీతా లాంటి డిజైన్లు పోచంపల్లి సొంతం. మారుతున్న కాలానుగుణంగా నేటి యువత అభిరుచికి అనుగుణంగా డిజైన్లలో ఎన్నో మార్పులు వచ్చాయి. ప్రస్తుతం రా జ్కోట్ చీరలకు డి మాండ్ ఉంది. టై అండ్ డై వీరి సొంతం టై అండ్ డై వస్త్రాలు ప్రపంచంలోనే గుర్తింపు పొందాయి. టై అండ్ డై అంటే ఏమిటంటే.. ‘టై’ అంటే దారానికి రబ్బరు చుట్టడం, డై’ అంటే రంగులద్దడం. దీనినే వాడుక పరిభాషలో ‘ఇక్కత్’ అని కూడా పిలుస్తారు. కానీ ఇలా దారానికి రంగులద్ది డిజైన్లు సృష్టించడం ఒక్క పోచంపల్లి చేనేత కళాకారులకే సొంతం. మిగతా ప్రాంతాల్లో మాత్రం వస్త్రంపైన డిజైన్లు వేస్తారు. ఇక్కత్ వస్త్రాలకు పేటెంట్ ఇక్కత్ వస్త్రాలకు మొట్టమొదటిసారిగా 2003లో కేంద్ర ప్రభుత్వం జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రి(పేటెంట్) సర్టిఫికెట్స్ జారీ చేసింది. ఇందులో 11 చేనేత డిజైన్లకు రిజర్వేషన్లతో పాటు చేనేత వస్త్రాలైన చీరెలు, రుమాలు, కార్పెట్, బెడ్షీట్లు, మ్యాట్స్కు పెటెంట్ హక్కు కల్పించింది. పోచంపల్లి ఇక్కత్ డిజైన్లు, వస్త్రాలను ఎవరైన కాపీ(ప్రింటింగ్) కొట్టినట్లయితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకొనే అవకాశం ఉంటుంది. కార్మికులకు చాలా నష్టం చేనేత కార్మికుడు ఎంతో శ్రమకోర్చి పట్టుచీరను తయారు చేస్తాడు. అటువంటి పట్టుచీర డిజైన్లు కాపీకి గురవుతున్నా అధి కారులు పట్టించుకోవడం లేరు. వెంటనే ఎన్ఫోర్స్మెంట్ అధి కారులు చర్యలు తీసుకోకుంటే ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని చేనేత కార్మికుల ఉపాధి దెబ్బతినే అవకాశం ఉంది. కార్మికులకు చాలా నష్టంగా వాటిల్లే ప్రమాదం ఉంది. – పొడుగు వెంకటేశం, చేనేత కార్మికుడు, పల్లెర్ల, ఆత్మకూరు(ఎం) -
పోచంపల్లి చేనేతకు ‘బ్రాండ్’ పట్టం
సాక్షి, హైదరాబాద్: మన ‘పోచంపల్లి’ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ‘ఇండియా హ్యాండ్లూమ్ బ్రాండ్’ను సాధించడం ద్వారా పోచంపల్లి చేనేత పార్కుకు దేశంలోనే అరుదైన గుర్తింపు లభించింది. కేంద్ర ప్రభుత్వం గత ఆగస్టు 7న ప్రవేశపెట్టిన ఈ బ్రాండ్ తొలిసారిగా నల్లగొండ జిల్లా పోచంపల్లి ఇక్కత్ ఉత్పత్తులకు దక్కింది. ఈ గుర్తింపుతో పోచంపల్లి చేనేత ఉత్పత్తులకు ఇకపై అంతర్జాతీయ వస్త్ర మార్కెట్లో గిరాకీ మరింత పెరగనుంది. స్థూల జాతీయోత్పత్తిలో కీలకపాత్ర పోషిస్తూ అనేక మందికి ఉపాధి కల్పిస్తున్న చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం ఈ బ్రాండ్ను ప్రవేశపెట్టింది. ఈ బ్రాండ్ ఉన్న చేనేత ఉత్పత్తులను మాత్రమే విదేశాలకు ఎగుమతి చేసేందుకు ఇకపై అవకాశం ఉంటుంది. చీరలు, డ్రెస్ మెటీరియల్, బెడ్షీట్లు, శాలువాల తయారీలో దేశంలో పేరెన్నికగన్న చేనేత ఉత్పత్తులకు మాత్రమే ఈ బ్రాండ్ను ఇవ్వాలని నిర్ణయించారు. తెలుగు రాష్ట్రాల నుంచి చీరల విభాగంలో పోచంపల్లి, వెంకటగిరి, ఉప్పాడ, సిద్దిపేట, నారాయణపేట, మంగళగిరి, ధర్మవరం; డ్రెస్ మెటీరియల్స్, బెడ్షీట్ల విభాగంలో పోచంపల్లి ఇక్కత్ ఉత్పత్తులకు ‘ఇండియా హ్యాండ్లూమ్ బ్రాండ్’ పొందే వీలుందని ప్రాథమికంగా నిర్ణయించారు. అయితే ఆయా ఉత్పత్తులకు సంబంధించిన నమూనాలను పరీక్షించిన తర్వాతే బ్రాండ్ వినియోగించేందుకు అనుమతి ఇస్తామని కేంద్ర చేనేత, వస్త్ర పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలోని టెక్స్టైల్ కమిటీ ప్రకటించింది. పోచంపల్లి ఇక్కత్కు గుర్తింపు ‘ఇండియా హ్యాండ్లూమ్ బ్రాండ్’ కోరుకునే ప్రాథమిక చేనేత సహకార సంఘాలు, చేనేత పార్కులు, మహిళా స్వయం సహాయక సంఘాలు దరఖాస్తు చేసుకునే వీలు కల్పిం చారు. ఈ నేపథ్యంలో పోచంపల్లి చేనేత పార్కు.. తాము ఉత్పత్తి చేస్తున్న ఇక్కత్ చీరలు, బెడ్షీట్లు, డ్రెస్ మెటీరియల్కు బ్రాండ్ అనుమతి కోరింది. వస్త్ర ఉత్పత్తిలో ఉపయోగించే దారం, రంగుల నాణ్యత, డిజైన్లలో నవ్యత, పర్యావరణం, ధరించే వారి ఆరోగ్యంపై ఆయా ఉత్పత్తుల ప్రభావం తదితరాలపై టెక్స్టైల్ కమిటీ శల్య పరీక్షలు చేసి పోచంపల్లికి ‘బ్రాండ్’ పట్టం కట్టింది. దీంతో ఇకపై పోచంపల్లి అన్ని ఉత్పత్తులపై ‘ఇండియా హ్యాండ్లూమ్ బ్రాండ్’ లోగోను వినియోగించుకోవచ్చు. ప్రస్తుతం పోచంపల్లి ఉత్పత్తులు ఢిల్లీ, చెన్నై, ముంబై, పుణే వంటి నగరాలతో పాటు అమెరికా, సింగపూర్, ఐరోపా దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. రిలయన్స్ ట్రెండ్స్, మధుర కోట్స్, ఆదిత్య బిర్లా తదితర సంస్థలు పెద్దఎత్తున కొనుగోలు చేసి మార్కెటింగ్ చేస్తున్నాయి. పోచంపల్లి చేనేతపార్కులో 350 మంది కళాకారులు పనిచేస్తుండగా.. ఏటా రూ.5 కోట్ల మేర లావాదేవీలు జరుగుతున్నాయి. ఇప్పుడు బ్రాండ్ దక్కడంతో లావాదేవీలు రూ.7 కోట్లకు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. బ్రాండ్ రావడంతో పోచంపల్లి ఉత్పత్తులకు డిమాండ్ పెరగడంతోపాటు యువతకు ఈ రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని చేనేత పార్కు ప్రతినిధి దామోదర్ ‘సాక్షి’కి చెప్పారు. చేనేత పార్కుకు బ్రాండ్ దక్కడంపై పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అభినందనలు తెలిపారు.