breaking news
Paramedical courses
-
పారామెడికల్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
అనంతపురం మెడికల్: అనంతపురం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 2017–18 సంవత్సరానికి గాను పారా మెడికల్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వరరావు తెలిపారు. దరఖాస్తులు http://dme.ap.nic.in, www.appmb.org.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. సెప్టెంబర్ 5వ తేదీలోపు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. మొదటి కౌన్సెలింగ్ సెప్టెంబర్ 15న, రెండో కౌన్సెలింగ్ సెప్టెంబర్ 22న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మెడికల్ కళాశాలలో ఉంటుందన్నారు. కోర్సుల వారీగా డీఎంఎల్టీ–10, డీఓఏ–10, డీఏఎన్ఎస్–30, డీఎంఐటీ–10, డీఈసీజీ–3, డీఆర్జీఏ–6, డీడీఆర్ఎ–3 ఖాళీలున్నట్లు తెలిపారు. ఇంటర్ అర్హత ఉన్న వారంతా దరఖాస్తు చేసుకునేందుకు అర్హులన్నారు. -
నకిలీ సర్టిఫికెట్లు పెట్టి.. కొలువులు కొల్లగొట్టి!
వైద్య ఆరోగ్య శాఖలో అక్రమాల బాగోతం కాంట్రాక్టు ఉద్యోగాల్లో చేరిన వందలాది మంది అనర్హులు ‘సాక్షి’కి అందిన అక్రమాల చిట్టా త్వరలో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించనున్న ప్రభుత్వం హైదరాబాద్: పారామెడికల్ కోర్సులు చేయకుండానే నకిలీ సర్టిఫికెట్లు పెట్టారు.. సంతకాలు ఫోర్జరీ చేశారు.. టెన్త్ సర్టిఫికెట్లు కూడా నకిలీవి పెట్టారు.. వైద్య ఆరోగ్యశాఖలోని కాంట్రాక్టు కొలువుల్లో చేరారు.. అసలు ఈ సర్టిఫికెట్లను పరిశీలించకుండానే అధికారులు రిజిస్ట్రేషన్ చేశారు. కాంట్రా క్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో... ప్రభుత్వ ఇనిస్టిట్యూట్లలో శిక్షణ పొందిన కొందరు కాంట్రాక్టు ఉద్యోగుల ఫిర్యాదుతో ఈ బాగోతం బయటపడింది. హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్, సూర్యాపేట, మిర్యాలగూడ, ఒంగోలు కేంద్రంగా ఢిల్లీ నుంచి ఈ నకిలీ ‘మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఎంపీహెచ్ఏ)’ డిప్లొమా వచ్చినట్లు వెల్లడైంది. ఈ సర్టిఫికెట్లను పరిశీలించకుండానే వైద్యవిధాన పరిషత్లోని పారా మెడికల్ బోర్డు అధికారులు రిజిస్ట్రేషన్ చేయడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అక్రమాలు వెల్లడైనా ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో ఈ వ్యవహారం వెనుక పెద్దల హస్తం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఢిల్లీ కేంద్రంగా దందా..: ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి ఐదు వేల జనాభాకు ఒక ‘మల్టీపర్పస్ మేల్ వర్కర్’ను నియమించాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు 2002లో జిల్లాల వారీగా నోటిఫికేషన్లు జారీ చేసింది. ప్రభుత్వ ఇనిస్టిట్యూట్లలో శిక్షణ పొందిన 1,050 మంది అభ్యర్థులతో పాటు మరో పది వేల మంది వీటికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇలా దరఖాస్తు చేసుకున్న వారిలో సూర్యాపేట కేంద్రంగా కొనసాగిన ఓ పారిశుద్ధ్య టెక్నాలజీ సంస్థ నుంచి ఢిల్లీలోని ఓ ఇనిస్టిట్యూట్ పేరుతో నకిలీ సర్టిఫికెట్లు పొందారు. ఇందుకు భారీగా సొమ్ము చెల్లించారు. దీనిపై ఆరోపణలు రావడంతో అప్పట్లోనే ఆ సంస్థపై పోలీసులు దాడి చేసి సీజ్ చేశారు. కానీ రూ.లక్షలు పెట్టి కొన్న ఆ సర్టిఫికెట్లతో కొంత మంది కాంట్రాక్టు కొలువులు పొందారు. ఇవి నకిలీలలు: నకిలీ సర్టిఫికెట్లతో తెలంగాణ, ఏపీల్లో ఇప్పటికే అనేకమంది కాంట్రాక్టు ప్రతిపాదికన చేస్తున్నారు. కొంతమంది నకిలీల జాబి తా ‘సాక్షి’ చేతికి చిక్కింది. వాటిలో కొన్ని..ఓ అభ్యర్థికి 1996 డిసెంబర్లో సూర్యాపేటలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ శానిటేషన్ టెక్నాలజీలో డిప్లొమా పూర్తిచేసినట్లు సర్టిఫికెట్ జారీ చేశారు. అయితే కోర్సు పూర్తికాకముందే 1996 ఆగస్టులోనే ప్రొవిజనల్ సర్టిఫికెట్ జారీచేశారు. ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న చాలామంది అభ్యర్థుల డిప్లొమా, ప్రొవి జనల్ సర్టిఫికెట్లపై రిజి స్ట్రార్ సంతకం ఫోర్జరీ చేయబడి ఉంది. రిజిస్ట్రార్ కల్నల్ ఎస్. కటారియాకు బదులు వేర్వేరుగా సంతకాలు ఉన్నాయి. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి పేరు నాగేశ్వరరావు కాగా... వైద్య ఆరోగ్యశాఖకు ఆయన సమర్పించిన డిప్లొమా, ప్రొవిజినల్ సర్టిఫికెట్లపై జ్ఞానేశ్వరరావు అని ఉంది. ఒక అభ్యర్థి నకిలీ ఎస్సెస్సీ సర్టిఫికెట్ దాఖలు చేశాడు. ఆ సర్టిఫికెట్తో పాటు డిప్లొమా, ప్రొవిజనల్పైనా ఒకే వ్యక్తి చేతిరాత ఉండడం గమనార్హం. వారిని తొలగించాల్సిందే.. నకిలీ, ఫోర్జరీ సర్టిఫికెట్లతో అనేక మంది వైద్యారోగ్యశాఖలో హెల్త్ వర్కర్ ఉద్యోగాలు పొందారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో నకిలీలు ఎక్కువగా ఉన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు కుమ్మక్కై పోస్టులు పంచుకున్నారు. ప్రభుత్వం నకిలీలను తొలగించకుంటే ఆందోళన చేపడతాం. - మన్నె శ్రీనివాస్ పిళ్లై, హెల్త్ వర్కర్స్ అసోసియేషన్ నాయకుడు -
పారామెడికల్ కోర్సులు.. కౌన్సెలింగ్ వివరాలు
బీఎస్సీ (నర్సింగ్), బీపీటీ (బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ), బీఎస్సీ-ఎంఎల్టీ (మెడికల్ లేబొరేటరీ టెక్నాలజీ) కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే కౌన్సెలింగ్ కోసం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో కలిపి ఐదు కేంద్రాల్లో ఆన్లైన్ విధానంలో ఈ నెల 14 నుంచి 17 వరకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. కౌన్సెలింగ్ కేంద్రాలు.. హైదరాబాద్: జేఎన్టీయూహెచ్, కూకట్పల్లి; వరంగల్: ఆన్లైన్ కౌన్సెలింగ్ సెంటర్, కాకతీయ యూనివర్సిటీ; తిరుపతి: ఓల్డ్ ఎంబీఏ బిల్డింగ్, ఎస్వీ యూనివర్సిటీ; విజయవాడ: అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ; విశాఖపట్నం: ఆంధ్రా యూనివర్సిటీ, డిస్టెన్స్ స్కూల్ బిల్డింగ్ ఎదురుగా. రెండు రాష్ట్రాల్లోని విద్యార్థులు ఈ ఐదు కేంద్రాల్లో ఎక్కడైనా కౌన్సెలింగ్కు హాజరుకావచ్చు. రెండో విడత నిర్వహించే కౌన్సెలింగ్లో వికలాంగుల సీట్లు భర్తీ చేస్తారు. మెరిట్ కార్డుతో: బీఎస్సీ (నర్సింగ్), బీపీటీ, బీఎస్సీ(ఎంఎల్టీ) కోర్సులకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఎన్టీఆర్ యూనివర్సిటీ వెబ్సైట్ (జ్ట్టిఞ://్టటఠజిట.్చఞ.జీఛి.జీ)లో అఫ్లికేషన్ నెంబర్/ రిజిస్ట్రేషన్ నెంబర్/ పేరు నమోదు చేసి మెరిట్ కార్డును డౌన్లోడ్ చేసుకొని సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో కౌన్సెలింగ్ షెడ్యూల్లో తెలిపిన విధంగా ఆయా తేదీల్లో కౌన్సెలింగ్కు హాజరుకావాలి. కావల్సిన సర్టిఫికెట్లు: దరఖాస్తు కాపీ; రిజిస్ట్రేషన్ కార్డు; మెరిట్ ఆర్డర్ కార్డు; జనన ధ్రువీకరణ పత్రం (ఎస్ఎస్సీ/తత్సమాన) క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ (ఇంటర్మీడియెట్) మార్కుల జాబితా; టీసీ (ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్); ఆరు నుంచి ఇంటర్మీడియెట్ వరకు స్టడీ సర్టిఫికెట్లు; తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ కాకుండా ఇతర రాష్ట్రాల్లో చదివి ఉంటే... తహసీల్దార్/ఎంఆర్ఓ జారీ చేసిన పదేళ్ల రెసిడెన్స్ సర్టిఫికెట్; ఎస్సీ/ఎస్టీ/బీసీ అభ్యర్థులు ఎంఆర్ఓ/తహసీల్దార్ జారీ చేసిన శాశ్వత కులధ్రువీకరణ పత్రం, నేటివిటీ సర్టిఫికెట్; గతంలో స్కాలర్షిప్ పొంది ఉంటే సంబంధిత కాపీ; 01-01-2014 తర్వాత తహసీల్దార్ జారీ చేసిన తల్లిదండ్రుల ఆదాయ ధ్రువీకరణ పత్రం..; అన్ని సర్టిఫికెట్ల ఒరిజినల్ పత్రాలు, గెజిటెడ్ అధికారితో అటెస్ట్ చేసిన జిరాక్స్ కాపీలను వెంట తెచ్చుకోవాలి. ఫీజులు: కౌన్సెలింగ్ ఫీజు: రూ.1,000. ఈ మూడు కోర్సుల్లో ఏదైనా కోర్సులో సీటు పొందిన వర్సిటీ ఫీజు కింద రూ.4,500 కౌన్సెలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన బ్యాంకు కౌంటర్లో చెల్లించాలి. బీఎస్సీ ఎంఎల్టీ (కోర్సు వ్యవధి-మూడేళ్లు): స్పెషల్ ఫీజు కింద మొదటి సంవత్సరం రూ.6,500, మిగిలిన రెండేళ్లు రూ.4,500 చొప్పున కళాశాలల్లో చెల్లించాలి. బీపీటీ (కోర్సు వ్యవధి-నాలుగున్నరేళ్లు): స్పెషల్ ఫీజు మొదటి సంవత్సరం రూ.13,500, మిగిలిన మూడేళ్లు రూ.8,500 చొప్పున కళాశాలలో చెల్లించాలి. బీఎస్సీ(నర్సింగ్-కోర్సు వ్యవధి-నాలుగేళ్లు): స్పెషల్ ఫీజు మొదటి సంవత్సరం రూ.16,500, మిగిలిన మూడేళ్లు రూ.10,000. చొప్పున చెల్లించాలి. ఈ మూడు కోర్సుల్లో స్పెషల్ ఫీజులు కాకుండా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన విధంగా ట్యూషన్ ఫీజులను ఆయా కళాశాలల్లో చెల్లించాలి. పభుత్వ నిబంధనల ప్రకారం ఆయా వర్గాలకు ఫీజు రీయింబర్స్మెంట్ సదుపాయం ఉంది. కాలేజీల సంఖ్య: కోర్సు ప్రభుత్వ ప్రైవేట్ బీఎస్సీ నర్సింగ్ 12 196 బీపీటీ - 38 బీఎస్సీ ఎంఎల్టీ 10 44 (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో కలిపి కాలేజీల సంఖ్య) వివరాలకు: http://ntruhs.ap.nic.in -రాజ్కుమార్ ఆలూరి, న్యూస్లైన్, విజయవాడ. -
ఇంటర్ తర్వాత దారెటు..
విద్యార్థి చదువుల సోపానాల్లో కీలకమైన ఇంటర్మీడియెట్ పరీక్షలు ముగిశాయి. ఈ దశలో వేసే అడుగు భవిష్యత్తు కెరీర్కు పునాది వంటిది. అందుకే ఎంపిక చేసుకునే కోర్సు విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ నేపథ్యంలో ఇంటర్ తర్వాత విద్యార్థులకు అందుబాటులో ఉండే అవకాశాలపై స్పెషల్ ఫోకస్.. ఇంటర్మీడియెట్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపీసీ, బైపీసీ, సీఈసీ పూర్తిచేసిన విద్యార్థులు విశ్లేషించుకోవాల్సిన అంశాలు.. తనకు అందుబాటులో ఉన్న అవకాశాలు ఏమిటి? తనకు ఇష్టమైన సబ్జెక్టులేమిటి? బలాలు, బలహీనతలు ఏమిటి? కుటుంబ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? వంటి విషయాలను విశ్లేషించుకొని స్పష్టమైన లక్ష్యాన్ని ఎంపిక చేసుకోవాలి. ఇంటర్మీడియెట్ తర్వాత ప్రధానంగా రెండు మార్గాలు తారసపడతాయి. అవి.. 1. ఉద్యోగావకాశాలు. 2. ఉన్నత విద్యావకాశాలు. విద్యార్థులు తమ లక్ష్యం ఏమిటనే దానిపై స్పష్టత ఏర్పరుచుకోవాలి. ఇప్పుడు చేసే తెలివైన ఆలోచన నాలుగు దశాబ్దాల కెరీర్కు బాటలు వేస్తుంది. ఇంటర్ పూర్తయ్యేనాటికి ఏది మంచి? ఏది చెడు? అని తెలుసుకునే మానసిక బలం ఉంటుంది కాబట్టి కెరీర్పై స్పష్టమైన లక్ష్య నిర్దేశనం చేసుకొని, దానికి అనుగుణంగా ముందడుగు వేయాలి. ఇంటర్ ఎంపీసీ పదో తరగతి పూర్తయ్యాక ఎక్కువ మంది విద్యార్థులు ఇంజనీరింగ్ కెరీర్ను అందుకునే లక్ష్యంతో ఇంటర్మీడియెట్లో ఎంపీసీ గ్రూపులో చేరుతారు. ఈ ఏడాది ఇంటర్ను దిగ్విజయంగా పూర్తిచేసే వారు ఐఐటీ, నిట్లు, బిట్స్ పిలానీ క్యాంపస్లు, ట్రిపుల్ ఐటీలు, యూనివర్సిటీ క్యాంపస్ కళాశాలల్లో సీటు సంపాదించేందుకు ప్రయత్నించవచ్చు. ఐఐటీలు, నిట్ల్లో చేరాలనుకుంటే.. జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్డ్లో ప్రతిభ కనబరచాలి. రాష్ట్రంలో ఎంపీసీ విద్యార్థులు ఎక్కువగా రాసే పరీక్ష ఎంసెట్. రాష్ట్రంలోని టాప్ 10 ఇంజనీరింగ్ కళాశాలలు.. బోధనా విధానం, క్యాంపస్ ప్లేస్మెంట్ల విషయాల్లో నిట్, ఐఐటీలతో పోటీపడుతున్నాయి కాబట్టి వాటిలో సీటు సంపాదించేందుకు ప్రయత్నించాలి. ఇంజనీరింగ్వైపు వెళ్లని వారు సంప్రదాయ డిగ్రీ కోర్సులైన బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో చేరొచ్చు. వీటితో పాటు బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ (బీబీఎం), బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ), బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (బీసీఏ), బీఎస్సీ (హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్), బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (బీఎఫ్ఏ) వంటి కోర్సులను కూడా ఎంపిక చేసుకోవచ్చు. ఇంటర్ బైపీసీ ఇంటర్మీడియెట్ బైపీసీ పూర్తిచేసిన వారు రాష్ట్ర స్థాయిలో ఎంసెట్ రాయొచ్చు. దీంతోపాటు జిప్మర్, ఎయిమ్స్, క్రిస్టియన్ మెడికల్ కాలేజ్, ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్, బెనారస్ హిందూ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ, అమృత విశ్వవిద్యా పీఠం, డీవై పాటిల్, మణిపాల్ యూనివర్సిటీ తదితర ఎంట్రన్స్లు రాసి మెడికల్ కోర్సులో చేరొచ్చు. రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ, మెడికల్ సీట్లు మాత్రం పరిమితంగానే ఉన్నాయి. దాంతో ఎంబీబీఎస్ కోర్సులో చేరాలనుకునే వారికి తీవ్ర పోటీ ఎదురవుతోంది. ఇంటర్ బైపీసీ విద్యార్థులకు బీడీఎస్, బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీయూఎంఎస్, బీఎన్వైఎస్, బీవీఎస్సీ అండ్ ఏహెచ్, అగ్రికల్చర్, ఫిజియోథెరపీ, ఫార్మసీ, బయోటెక్నాలజీ, బయోఇన్ఫర్మాటిక్స్ వంటి కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. నర్సింగ్ కోర్సుల్లోనూ చేరొచ్చు. ఇంటర్మీడియెట్ (సెన్సైస్-ఎంపీసీ/బైపీసీ) అర్హతతో డిప్లొమా ఇన్ ఫార్మసీ (డి.ఫార్మసీ) కోర్సులో చేరొచ్చు. పారామెడికల్ కోర్సులు ఇంటర్ బైపీసీ తర్వాత తక్కువ కాల వ్యవధిలో ఉద్యోగావకాశాలు అందించే కోర్సులు.. పారా మెడికల్ కోర్సులు. రోగికి డయాగ్నసిస్, ట్రీట్మెంట్, థెరపీ సరిగా జరిగేలా డాక్టర్కు సహకరించే వారే పారామెడికల్ నిపుణులు. ఆరోగ్య రంగంలో పారామెడికల్ నిపుణుల అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. దాంతో పారామెడికల్ కోర్సులు పూర్తిచేసిన వారికి ఆరోగ్య రంగంలో అవకాశాలు అపారం. మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, డయాలసిస్ టెక్నీషియన్,ఈసీజీ టెక్నీషియన్, బ్లడ్ బ్యాంకింగ్ టెక్నీషియన్, అనస్థీసియా టెక్నీషియన్, కార్డియాలజీ టెక్నీషియన్, ఆప్తాల్మిక్ టెక్నీషియన్, డార్క్ రూమ్ టెక్నీషియన్, మెడికల్ ఇమేజింగ్, ఎంపీహెచ్పీపీ, థియేటర్ టెక్నీషియన్ వంటి కోర్సులు విస్తృత ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. బైపీసీ విద్యార్థులకు బ్యాచిలర్ డిగ్రీ అంటే వెంటనే గుర్తొచ్చేది సంప్రదాయ బీజెడ్సీ. కానీ మారుతున్న పరిస్థితులు, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఇప్పుడు విద్యా సంస్థలు వినూత్న కాంబినేషన్లతో కోర్సులను అం దుబాటులో ఉంచుతున్నాయి. ఇటీవల కాలంలో బయోటెక్నాలజీ, మైక్రో బయాలజీ, జెనెటిక్స్ వంటి విభాగాలు విస్తరిస్తుండటంతో ఆయా సబ్జెక్టులతో కోర్సులను అందిస్తున్నాయి. విద్యార్థులు ఆసక్తి ఉంటే ఇలాంటి గ్రూప్లను ఎంపిక చేసుకోవచ్చు. ఇంటర్ సీఈసీ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వ్యాపార రంగం శరవేగంగా విస్తరిస్తుండటంలో కామర్స్ విద్యార్థులకు అవకాశాలు పెరిగాయి. ఇంటర్లో సీఈసీ పూర్త్తిచేసిన విద్యార్థులు డిగ్రీ స్థాయిలో బీకాంలో చేరొచ్చు. దాంతో పాటు ప్రతిష్టాత్మక జాబ్ ఓరియెంటెడ్ ప్రొఫెషనల్ కోర్సులైన సీఏ, సీఎస్ వంటి కోర్సులను పూర్తిచేయొచ్చు. బీకాం పూర్తయ్యాక రెగ్యులర్గా మాస్టర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్(ఎంబీఏ), ఎంకాం (మాస్టర్ ఆఫ్ కామర్స్) తదితర కోర్సుల్లో చేరొచ్చు. ప్రత్యేక కోర్సులు సంప్రదాయ కోర్సులు, ప్రొఫెషనల్ కోర్సులతోపాటు కొన్ని స్పెషల్ కోర్సులకూ అవకాశాలు పెరుగుతున్నాయి. మారుతున్న సామాజిక, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో హాస్పిటాలిటీ అండ్ హోటల్ మేనేజ్మెంట్, ఫ్యాషన్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫొరెన్సిక్ సైన్స్, ఆప్టోమెట్రీ, డెయిరీ టెక్నాలజీ, న్యూట్రిషన్, హోంసైన్స్, ఓషనోగ్రఫీ, జెమ్మాలజీ, ఆడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ థెరపీ, ఫుడ్ టెక్నాలజీ, ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ అండ్ వైల్డ్ లైఫ్, మర్చెంట్ నేవీ, ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్, ఇంటీరియర్ డిజైన్, ఫిల్మ్ అండ్ మీడియా, సెక్రటేరియల్ వర్క్ తదితర స్పెషల్ కోర్సులనూ ఇంటర్ తర్వాత ఎంచుకోవచ్చు. సెట్ల సోపానాలు ఇంటర్ తర్వాత వివిధ రకాల ఉమ్మడి ప్రవేశ పరీక్షల ద్వారా ఉన్నత కెరీర్కు సోపానాలు వేసుకోవచ్చు. ఉదాహరణకు చిన్న వయసులోనే ప్రభుత్వ ఉద్యోగం సాధించి కెరీర్లో అత్యున్నత స్థాయికి చేరుకునే అవకాశం కల్పిస్తోంది డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డీఈడీ). ఇంటర్ తర్వాత రెండేళ్ల డీఈడీ కోర్సులో ప్రవేశానికి పాఠశాల విద్యాశాఖ ప్రతి ఏటా డైట్సెట్ను నిర్వహిస్తోంది. ఈ ప్రవేశ పరీక్షలో మంచి ర్యాంకు సాధించడం ద్వారా రాష్ర్టవ్యాప్తంగా ఉన్న డీఎడ్ కోర్సులో ప్రవేశం పొందొచ్చు. అదే విధంగా హాస్పిటాలిటీ ఎడ్యుకేషన్కు సంబంధించి దేశంలోని ప్రముఖమైన సంస్థ నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ (ఎన్సీహెచ్ఎంసీటీ). ఇది బీఎస్సీ (హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్) కోర్సులో ప్రవేశాలకు ఏటా జారుుంట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) నిర్వహిస్తోంది. కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్), లా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (లాసెట్), ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీఈసెట్), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) ఎంట్రెన్స్ టెస్ట్ వంటివి ఈ కోవకు చెందుతాయి. ఇంటిగ్రేటెడ్ కోర్సులు డిగ్రీ ఒక దగ్గర, పీజీ మరోచోట కాకుండా వరుసగా రెండూ ఒకే చోట పూర్తిచేయాలనుకునే వారి కోసం ప్రవేశపెట్టినవే.. ఇంటిగ్రేటెడ్ కోర్సులు. ఈ కోర్సుల ద్వారా ఇంటర్ తర్వాత ఎలాంటి విరామం లేకుండా పీజీ పూర్తిచేయొచ్చు. ఒకవేళ కోర్సులో చేరిన మూడేళ్ల తర్వాత వద్దనుకుంటే.. డిగ్రీ సర్టిఫికెట్; నాలుగేళ్ల తర్వాత వద్దనుకుంటే హానర్స్ సర్టిఫికెట్ తీసుకునే వెసులుబాటు కూడా ఉంది. రాష్ట్రంలోని దాదాపు అన్ని యూనివర్సిటీల్లో ఇంటిగ్రేటెడ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఉద్యోగావకాశాలు ఇంటర్మీడియెట్ అర్హతతో వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్, ఆర్పీఎఫ్, సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ, భారతీయ రైల్వేల్లో వివిధ ఉద్యోగాలు, ఎస్ఎస్సీ నిర్వహించే వివిధ ఉద్యోగాలు, యూపీఎస్సీ నిర్వహించే స్పెషల్ క్లాస్ రైల్వే అప్రెంటీస్ ఎగ్జామ్ ఇలా చాలా ఉద్యోగావకాశాలున్నాయి. వీటిలో ఖాళీల భర్తీకి ఎంప్లాయ్మెంట్ న్యూస్, రోజ్గార్ సమాచార్, ప్రముఖ దినపత్రికల్లో నోటిఫికేషన్లు వెలువడుతుంటాయి. రాష్ట్ర స్థాయిలో వీఆర్వో, వీఆర్ఏ, గ్రూప్-4, ఎక్సైజ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు వంటి ఉద్యోగావకాశాలుంటాయి. సరైన ప్రణాళికతో చదివితే కొలువును సొంతం చేసుకోవచ్చు. ఉద్యోగం చేస్తూనే దూరవిద్య ద్వారా ఉన్నత విద్యను అభ్యసించొచ్చు. అందుబాటులో దూరవిద్య వివిధ కారణాల వల్ల రెగ్యులర్గా చదవలేనివారికి పలు యూనివర్సిటీలు దూరవిద్య విధానంలో రకరకాల కోర్సులు అందిస్తున్నాయి. తక్కువ ఫీజులతో కోర్సులు పూర్తి చేయడంతోపాటు ఉన్నత విద్యకు బాటలు వేసుకోవచ్చు. కోర్సులు పూర్తయ్యాక ఇచ్చే సర్టిఫికెట్లకు రెగ్యులర్ సర్టిఫికెట్లతో సమానంగా గుర్తింపు ఉంటుంది. ఇవి అటు ఉన్నత విద్యకు, ఇటు ఉద్యోగావకాశాలకు ఉపయోగపడతాయి. ఇగ్నో, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలు దూరవిద్యా విధానంలో కోర్సులందిస్తున్నాయి. ఈ కోర్సులు ప్రయోజనకరం పై చదువులు చదవడానికి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే వారికి వివిధ ప్రభుత్వ సంస్థలందించే కోర్సులు ప్రయోజనకరంగా ఉంటాయి. సెట్విన్, స్వామి రామానందతీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్, ఎంఎస్ఎంఈ వంటి సంస్థలు స్వయం ఉపాధి లేదంటే ఏదైనా ఉద్యోగాన్ని పొందేందుకు ఉపయోగపడే స్వల్పకాలిక కోర్సులు అందిస్తున్నాయి. ఇలాంటి వాటిలో హోటల్ మేనేజ్మెంట్, బ్యూటీషియన్, సెల్ఫోన్ రిపేరింగ్, ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, ఎలక్ట్రీషియన్, డీజిల్ మెకానిక్, రేడియో అండ్ టీవీ మెకానిజం, జ్యుయెలరీ మేకింగ్, కార్పెంటరీ, డీటీపీ, వెబ్ డిజైనింగ్, ఎంఎస్ ఆఫీస్, మల్టీమీడియా వంటి కోర్సులు ఉన్నాయి. అన్ని కోణాల్లోనూ విశ్లేషించుకోవాలి మన బాగోగులను కోరుకునే వారి నుంచి సరైన సలహాలు తీసుకున్న తర్వాత విద్యార్థులు తమ ఆసక్తికి అనుగుణంగా కోర్సును ఎంపిక చేసుకోవాలి. ఆ కోర్సును జాతీయ, రాష్ట్ర స్థాయిలో అందించే ప్రముఖ సంస్థలు, అర్హతలు, ప్రవేశ విధానం తదితర అంశాలను క్షుణ్నంగా తెలుసుకోవాలి. ఇందుకోసం విద్యార్థులు ఇంటర్నెట్ను ఉపయోగించుకోవాలి. ఆయా సంస్థల వెబ్సైట్లను సందర్శించడం ద్వారా సమాచారాన్ని తెలుసుకోవచ్చు. వీలైతే ఆయా సంస్థల్లో చదువుకున్న పూర్వ విద్యార్థులను సంప్రదించాలి. ప్రస్తుతం ఆ కోర్సుకు డిమాండ్ ఎలా ఉంది? అది చేస్తే భవిష్యత్ ఎలా ఉంటుంది? తదితరాలను విశ్లేషించుకోవాలి. లక్ష్యం దిశగా ప్రయాణం ఇంటర్మీడియెట్ తర్వాత బీటెక్, ఎంబీబీఎస్, ఎల్ఎల్బీ, హోటల్ మేనేజ్మెంట్, సీఏ.. ఇలా ఏ కోర్సులో చేరినప్పటికీ స్పష్టమైన దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. వాటి సాధన కోసం కోర్సులో అడుగుపెట్టిన రోజు నుంచి నిజాయితీగా కష్టపడాలి. కలల్ని నిజం చేసుకునేందుకు అవసరమైన నైపుణ్యాల సముపార్జనకు కృషి చేయాలి. ఆయా రంగాలలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు ఒంటబట్టించుకోవాలి. సబ్జెక్టు పరిజ్ఞానంతో పాటు వాటి అప్లికేషన్ నైపుణ్యాలను సంపాదించుకుంటే చేసిన కోర్సు ఏదైనా అత్యుత్తమ ఫలితాలు సొంతమవుతాయి.