breaking news
Oceanography
-
అనుమతుల్లో ఆలస్యం.. ఎన్ఐవో ల్యాబ్ నిర్మాణంలో జాప్యం
సాక్షి, న్యూఢిల్లీ: విశాఖపట్నంలోని రిషికొండలో తలపెట్టిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ (ఎన్ఐవో) ల్యాబొరేటరీ నిర్మాణంలో అసాధారణ జాప్యం జరుగుతున్న విషయం వాస్తవమేనని కేంద్ర సైన్స్, టెక్నాలజీశాఖ సహాయమంత్రి డాక్టర్ జితేంద్రసింగ్ అంగీకరించారు. రాజ్యసభలో గురువారం వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిచ్చారు. జాప్యానికి కారణాలను వివరించారు. ఎన్ఐవో ల్యాబొరేటరీ నిర్మాణానికి కోస్టల్ రెగ్యులేషన్ జోన్ అనుమతి సాధించడంలో జాప్యం జరిగిందని చెప్పారు. అలాగే స్కీమ్లకు తుదిరూపం ఇవ్వడంలో, ఇతర పాలనాపరమైన అనుమతులు పొందడంలో జాప్యం జరిగినట్లు తెలిపారు. ల్యాబొరేటరీ భవనాల ఆకృతులను రూపొందించేందుకు భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) సంస్థను ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ (పీఎంసీ)గా ఎంపికచేసి 2009లో పని అప్పగించినట్లు చెప్పారు. పీఎంసీ రూ.30 కోట్ల ప్రాథమిక అంచనా వ్యయంతో ల్యాబొరేటరీ భవనాల డ్రాయింగ్లను సమర్పించిందన్నారు. కాంట్రాక్ట్ బాధ్యతల ప్రకారం ఎన్ఐవో క్యాంపస్కు సంబంధించి ప్లానింగ్, డిజైనింగ్, ఎగ్జిక్యూషన్ పనులను పీఎంసీనే చేపట్టాలన్నారు. కానీ ఒప్పందంలోని బాధ్యతలను అది నేరవేర్చనందున ఎన్ఐవో క్యాంపస్ నిర్మాణంలో తీవ్ర జాప్యం జరిగిందని చెప్పారు. అందువల్ల బీఎస్ఎన్ఎల్కు అప్పగించిన పీఎంసీ కాంట్రాక్టును రద్దుచేయడానికి ఉభయుల మధ్య అంగీకారం కుదిరిందని తెలిపారు. ఈ ఒప్పందం రద్దయిన వెంటనే ప్రభుత్వం కొత్త పీఎంసీ కోసం టెండరు పిలుస్తుందన్నారు. కొత్త పీఎంసీకి పనులు అప్పగించిన తర్వాత ఆరునెలల్లో పాలనాపరమైన, ఆర్థిక అనుమతులు పొందగలమని భావిస్తున్నట్లు చెప్పారు. క్యాంపస్, భవనాల నిర్మాణం ప్రారంభమైన తర్వాత 18 నెలల్లో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. -
సముద్రశాస్త్ర అధ్యయనం అవసరం
కర్నూలు (కల్చరల్) : ప్రస్తుత తరం విద్యార్థులు సముద్ర శాస్త్రాన్ని అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కేజీ గంగాధర్రెడ్డి అన్నారు. స్థానిక జిల్లా కేంద్ర గ్రంథాలయంలో తెలుగు కళాస్రవంతి ఆధ్వర్యంలో పుస్తకావిష్కరణ సభలో ఆయన ప్రసంగించారు. ప్రముఖ సముద్రశాస్త్రవేత్త ఎంపీఎం రెడ్డి..కర్నూలు జిల్లాలో పుట్టి ప్రపంచంలోని సముద్రాలన్నింటినీ చుట్టి వచ్చారన్నారు. భారతదేశపు తొలి సముద్రపు శాస్త్రవేత్తగా గుర్తింపు పొందిన ఆయన బాలల కోసం సముద్రశాస్త్ర పుస్తకాలు రచించడం అభినందనీయమన్నారు. సముద్ర శాస్త్రం 5వ భాగాన్ని ప్రముఖ కథారచయిత ఇనాయతుల్లా, ఆరో భాగాన్ని రిటైర్డు తెలుగు ప్రొఫెసర్ డాక్టర్ గంగిరెడ్డి సమీక్షించారు. ప్రతిభ విద్యాసంస్థల గౌరవ సలహాదారు డాక్టర్ అరుణాచల్రెడ్డి, పుస్తక రచయిత డాక్టర్ ఎంపీఎం రెడ్డి, ప్రముఖ జనపద కవి డాక్టర్ వి.పోతన, ఫ్రెండ్స్ బుక్డిపో అధినేత పుల్లారెడ్డి, డాక్టర్ అహ్మద్హుసేన్ తదితరులు పాల్గొన్నారు. -
సముద్ర మథనానికి.. ఓషనోగ్రఫీ
అప్కమింగ్ కెరీర్: ఒక దేశానికి విలువైన ఆస్తి.. చుట్టూ ఉన్న సువిశాలమైన మహా సముద్రం. ప్రాచీన కాలంలో సముద్రాల ద్వారానే ఖండాంతర వ్యాపారం జరిగింది. ఒక దేశం నుంచి మరో దేశానికి వలసలు కొనసాగాయి. నాగరికత విస్తరించింది. దేశాభివృద్ధిలో సముద్రాల పాత్ర ఎంతో కీలకం. సముద్ర తీరం లక్షలాది మందికి జీవనాధారం. భూగోళంపై జీవం పుట్టుక నుంచి ఇప్పటి దాకా ప్రతిదశలో మానవుడి జీవితంపై ప్రభావం చూపుతున్న సముద్రాల అధ్యయన శాస్త్రమే.. ఓషనోగ్రఫీ. భూగోళంపై నివాస యోగ్యమైన భూమికంటే సముద్రాలే ఎక్కువ శాతం విస్తరించి ఉన్నాయి. సముద్రాలను అధ్యయనం చేసేవారిని ఓషనోగ్రఫర్లు అంటారు. ఓషనోగ్రఫీని కెరీర్గా ఎంచుకున్న వారికి మంచి అవకాశాలు, అధిక వేతనాలతో కూడిన ఉద్యోగాలు లభిస్తుండడంతో నేటి యువత దృష్టి ఈ రంగంపై పడింది. ఓషనోగ్రఫీ కోర్సులకు డిమాండ్ పెరిగింది. ఓషనోగ్రఫర్ల విధులు భిన్నంగా ఉంటాయి. క్షేత్రస్థాయిలో, కార్యాలయాల్లోనూ పనిచేయాల్సి ఉంటుంది. సముద్ర తరంగాలు, అలలు, సముద్ర సంబంధిత భౌతిక, రసాయన ప్రక్రియలను అధ్యయనం చేయాలి. ఈ డేటాను విశ్లేషించి, వాతావరణ పరిస్థితులను ముందుగానే అంచనా వేయాలి. ఓషనోగ్రఫర్లకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో అవకాశాలు లభిస్తున్నాయి. జాతీయ లేబొరేటరీల్లో పరిశోధకులుగా సేవలందించొచ్చు. యూనివర్సిటీల్లో ఫ్యాకల్టీగానూ పనిచేయొచ్చు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ, సెంటర్ ఫర్ ఎర్త్ సైన్స్ స్టడీస్, నావల్ ఫిజికల్ అండ్ ఓషనోగ్రఫిక్ లేబొరేటరీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆ్ఫ్ ఓషన్ టెక్నాలజీ తదితర జాతీయస్థాయి సంస్థల్లో ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. ఈ రంగంలో సవాళ్లు కూడా ఉంటాయి. అవసరాన్ని బట్టి సముద్రాలపై ఎక్కువ రోజులు పనిచేయాల్సి వస్తుంది. అందుకు తగ్గట్లుగా ఓషనోగ్రఫర్లు ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. పరిశీలనా శక్తిని, తార్కిక ఆలోచనా విధానాన్ని, బేసిక్ సెన్సైస్పై పట్టును పెంచుకుంటే కెరీర్లో ఉన్నతంగా రాణించేందుకు వీలుంటుంది. అర్హతలు సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్ పూర్తిచేసిన తర్వాత ఓషనోగ్రఫీలో బ్యాచిలర్స్ డిగ్రీ చదవాలి. అనంతరం మాస్టర్ డిగ్రీ పూర్తిచేయాలి. సీఎస్ఐఆర్ - నేషనల్ ఎలిజిబిలిటీ టెస్టు లేదా గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్(గేట్)లో ఉత్తీర్ణత సాధించి, పీహెచ్డీ పూర్తిచేస్తే మెరుగైన అవకాశాలను అందుకోవచ్చు. వేతనాలు పీజీ/పీహెచ్డీ పూర్తిచేసిన ఓషనోగ్రఫీ సైంటిస్ట్లకు ప్రారంభంలో నెలకు రూ.30 వేల దాకా వేతనం లభిస్తుంది. సీనియారిటీ పెరిగితే నెలకు రూ.లక్షన్నర దాకా అందుతుంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో చేరితే అధిక వేతనాలతో పాటు ఇతర ప్రయోజనాలు దక్కుతాయి. ఓషనోగ్రఫీ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు ఆంధ్రా యూనివర్సిటీ వెబ్సైట్: http://www.andhrauniversity.edu.in/ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ-గోవా వెబ్సైట్: http://www.nio.org/ కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వెబ్సైట్: http://www.cusat.ac.in/ అన్నామలై యూనివర్సిటీ-తమిళనాడు వెబ్సైట్: http://annamalaiuniversity.ac.in/ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-ఖరగ్పూర్ వెబ్సైట్: http://www.iitkgp.ac.in/ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-మద్రాస్ వెబ్సైట్: http://www.iitm.ac.in/ సముద్రమంత అవకాశాలు ‘‘ఇటీవలి కాలంలో సముద్ర విభాగాల పరిశోధనలకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం పెరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సెన్సైస్ను ప్రారంభించాక పరిశోధనలు మరింత ఊపందుకున్నాయి. సముద్ర అంతర్భాగంలో చోటుచేసుకునే మార్పులు, వనరుల అన్వేషణకు శాటిలైట్ ప్రయోగాలు పెరిగాయి. దీంతో అక్కడ నుంచి వస్తున్న డేటాను విశ్లేషించేందుకు నిపుణులు అందుబాటులో లేరు. దీంతో ఓషనోగ్రఫీ కోర్సులను దేశంలోని మరికొన్ని ఐఐటీలు, విశ్వవిద్యాలయాల్లో ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఓషనోగ్రఫీని కెరీర్గా ఎంచుకొని రీసెర్చ్ ఓరియెంటెడ్గా పనిచేసే వారికి ఎన్నో అవకాశాలున్నాయి. ఎంఎస్సీ పూర్తయితే చాలు.. ప్రైవేట్ కన్సల్టెన్సీలు నెలకు రూ.లక్ష వరకు వేతనం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వ రంగంలో ప్రారంభంలో తక్కువ వేతనం వచ్చినా మున్ముందు కెరీర్లో ఉన్నతంగా ఎదిగే అవకాశం ఉంది. సుదీర్ఘమైన సముద్రతీరం ఉన్న ఆంధ్రప్రదేశ్తోపాటు దేశ, విదేశాల్లోనూ ఓషనోగ్రఫర్లకు మంచి డిమాండ్ ఉంది’’ - ప్రొఫెసర్ కె.వి.ఎస్.ఆర్.ప్రసాద్, హెడ్ ఆఫ్ ది డిపార్టుమెంట్, ఓషనోగ్రఫీ, ఆంధ్రా యూనివర్సిటీ