breaking news
The new law
-
తెలుసా! ఐటీ రూల్స్ మారాయి...
ఆదాయపన్ను కొత్త చట్టం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తోంది. కొత్త పన్ను ప్రయోజనాల్లేకపోయినా.. ఉన్న వాటిల్లో వేతన జీవులు తప్పకుండా తెలుసుకోవాల్సిన కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇంటి అద్దె భత్యం, పిల్లల విద్య కోసం చేసే ఖర్చులపై మరింత అదనపు ప్రయోజనం దక్కనుంది. యాజమాన్యం సమకూర్చే కారు, ఇంటి సేవలపై పన్ను బాధ్యతలు పెరగనున్నాయి. బ్యాంకుల్లో నగదు జమలు, నగదు ఉపసంహరణల నుంచి.. ప్రాపర్టీ కొనుగోలు సమయంలో పాన్ సమర్పించడం వరకు పలు మార్పులు చోటుచేసుకున్నాయి. వాహన కొనుగోళ్ల విషయంలోనూ పాన్ నిబంధనలు మారాయి. హోటల్ బిల్లులు, జీవిత బీమా ప్రీమియం చెల్లింపులు ఒక పరిమితి దాటతే పాన్ సమర్పించాలి. ఇంటి యజమానితో తనకున్న సంబంధాన్ని కిరాయిదారు వెల్లడించాల్సిందే. ఇలా కొత్త ఆర్థిక సంవత్సరంలో ఆదాయపన్ను పరంగా వస్తున్న ముఖ్యమైన మార్పుల సమాహారమే ఈ వెల్త్ స్టోరీ...ఇప్పుడు హైదరాబాద్ వాసులకూ మరింత మెరుగైన హెచ్ఆర్ఏ పన్ను ప్రయోజనం అందుబాటులోకి వస్తోంది. ఈ నగరంలోని వేతన జీవులకు ఇప్పటి వరకు వేతనంలో భాగంగా పొందే ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ)పై పన్ను మినహాయింపు 40 శాతంగానే ఉండేది. ప్రస్తుతం ముంబై, ఢిల్లీ, కోల్కతా, చెన్నై నగరాల్లోని వేతన జీవులకు మాత్రమే 50 శాతం పన్ను మినహాయింపు నిబంధన వర్తిస్తోంది.ఏప్రిల్ 1 నుంచి ఈ జాబితాలో కొత్తగా హైదరాబాద్, పుణె, అహ్మదాబాద్, బెంగళూరు చేరనున్నాయి. దీంతో మొత్తం ఎనిమిది నగరాల పరిధిలోని వారు హెచ్ఆర్ఏపై మరింత అధిక ప్రయోజనం పొందే అవకాశం రానుంది. కొత్త ఆదాపన్ను విధానంలో రిటర్నులు దాఖలు చేసే వారికి ఈ ప్రయోజనం లేదు. పాత పన్ను విధానంలో రిటర్నులు సమర్పిస్తున్న వారు హెచ్ఆర్ఏ పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇదీ ఫార్ములా.. హెచ్ఆర్ఏ పన్ను మినహాయింపునకు సంబంధించి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 10(13ఏ) కింద వీటిని పేర్కొన్నారు.ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ)⇒ యాజమాన్యం నుంచి వాస్తవంగా అందుకుంటున్న నెలవారీ హెచ్ఆర్ఏ మొత్తం. ⇒ ఇక్కడ పేర్కొన్న ఎనిమిది మెట్రోల్లో నివసించే వారికి మూలవేతనం, డీఏ మొత్తంలో 50 శాతం, ఇతర మెట్రోల్లోని వారికి 40 శాతం. ⇒ వాస్తవంగా చెల్లించిన అద్దె మొత్తం నుంచి మూల వేతనంలో 10 శాతాన్ని తీసివేయగా వచ్చే మొత్తం. ఉదాహరణకు మూలవేతనం రూ.30వేలు ఉంటే.. ఇందులో 10% రూ.3,000 అవుతుంది. ప్రతి నెలా రూ.10,000 అద్దె చెల్లిస్తున్నట్టు అయితే ఇందులో రూ.3,000 మినహాయించగా రూ.7,000 వస్తుంది. నోట్: ఈ మూడింటిలో ఏది తక్కువ అయితే సంవత్సరం మొత్తం మీద ఆ మేరకు పన్ను మినహాయింపును ఆదాయం నుంచి క్లెయిమ్ చేసుకోవచ్చు.ఈ ప్రయోజనానికి ఇవి తప్పనిసరి.. ⇒ వేతన జీవులై ఉండాలి. ⇒ సీటీసీలో హెచ్ఆర్ఏ భాగంగా ఉండాలి. ⇒ అద్దె ఇంట్లోనే నివసిస్తూ ఉండాలి. ⇒ ఇంటి అద్దెకు సంబంధించి రుజువులు ఉండాలి. ⇒ పాత పన్ను విధానంలోనే రిటర్నులు వేయాలి.వాహన అలవెన్స్లుయాజమాన్యాలు ఉద్యోగుల అధికారిక, వ్యక్తిగత వినియోగానికి సమకూర్చే కార్ల విషయంలోనూ పన్ను పరంగా మార్పులు రానున్నాయి. 1. ఉద్యోగే కారును సొంతంగా కలిగి ఉండడం లేదా అద్దెకు తీసుకున్న సందర్భాల్లో.. అయ్యే వ్యయాలను పనిచేసే సంస్థ భరిస్తుంటుంది. ఇలాంటి కేసుల్లో.. ⇒ ఇంజన్ సామర్థ్యం 1.6 లీటర్ల వరకు ఉంటే: ప్రతి నెలా రూ.5,000తోపాటు, అదనంగా డ్రైవర్ కోసం చేసే ఖర్చు రూ.3,000పై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ⇒ ఇంజన్ సామర్థ్యం 1.6 లీటర్లకు మించి ఉంటే: ప్రతి నెలా రూ.7,000తోపాటు, డ్రైవర్ కోసం చేసే చెల్లింపులు రూ.3,000 పన్ను పరిధిలోకి వస్తాయి. 2. ఒకవేళ కారును యాజమాన్యం కొనుగోలు చేసి లేదా కిరాయికి తీసుకుని ఉద్యోగికి సమకూర్చిన సందర్భాల్లో.. ⇒ ఇంజన్ సామర్థ్యం 1.6 లీటర్ల వరకు ఉంటే: ప్రతి నెలా రూ.2,000తోపాటు డ్రైవర్కు చెల్లింపుల పేరిట రూ.3,000 మొత్తంపై పన్ను చెల్లించాలి. ⇒ ఇంజన్ సామర్థ్యం 1.6 లీటర్లకు మించి ఉంటే: ప్రతి నెలా రూ.3,000తోపాటు డ్రైవర్కు చెల్లింపుల పేరిట రూ.3,000 మొత్తంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 3. ఒకవేళ ఉద్యోగి స్వయంగా సమకూర్చుకున్న కారుపై యాజమాన్యం నిర్వహణ అలవెన్స్ చెల్లిస్తున్నట్టయితే.. ⇒ ఇంజన్ సామర్థ్యం 1.6 లీటర్ల వరకు ఉంటే: ఉద్యోగి కారు కోసం వాస్తవంగా చేసిన వ్యయం నుంచి రూ.5,000 మినహాయించగా వచ్చే మొత్తంపై పన్ను చెల్లించాలి. డ్రైవర్ కోసమూ యాజమాన్యం చెల్లింపులు చేస్తుంటే మరో రూ.3,000 మొత్తంపై పన్ను చెల్లించాల్సి వస్తుంది. ⇒ ఇంజన్ సామర్థ్యం 1.6 లీటర్లకు మించి ఉంటే: ఉద్యోగి కారు కోసం వాస్తవంగా చేసిన వ్యయం నుంచి రూ.7,000 మినహాయించగా వచ్చే మొత్తంపై... డ్రైవర్ పేరిట మరో రూ.3,000పైనా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ⇒ ఒకవేళ కారును పూర్తిగా అధికారిక అవసరాల కోసమే వినియోగించినట్టయితే, అటువంటప్పుడు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇందుకు సంబంధించి అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్త పెట్టుకోవాలి. ఇంటి సేవలు, యుటిలిటీలు..⇒ స్వీపర్లు, గార్డెనర్లు, వాచ్మెన్ వేతనాల కోసం ఉద్యోగులకు యాజమాన్యాలు చేసే వాస్తవ చెల్లింపులపైనా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ⇒ గ్యాస్, విద్యుత్, నీటిని ఇతర సంస్థల నుంచి పొందినట్టయితే, ఆయా సర్వీస్ ప్రొవైడర్లకు ఉద్యోగి చేసిన వాస్తవ చెల్లింపులపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ యాజమాన్యం తన సొంత వనరుల నుంచి వీటిని అందించినట్టయితే అప్పుడు ఒక్కోయూనిట్కు అయ్యే వాస్తవ వ్యయంపై పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ⇒ ఒక సంవత్సరంలో పనిచేసే సంస్థ నుంచి పొందిన బహమతులు లేదా గిఫ్ట్ వోచర్ల విలువ రూ.15,000 మించితే ఆ మొత్తంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ⇒ పనిచేసే సమయంలో సంస్థ ఉద్యోగులకు ఆహారం, పానీయాలను ఉచితంగా పెయిడ్ వోచర్ల రూపంలో అందిస్తుంటే ఆ మొత్తంపై పన్ను ఉండదు. ఒక్కో భోజనం ఖర్చు గరిష్ట పరిమితి రూ.200.పిల్లల విద్య, హాస్టల్ ప్రయోజనాలుపిల్లల విద్యకు సంబంధించి చేసే ఖర్చులపై మరింత పన్ను మినహాయింపునకు ఇకమీదట అవకాశం లభించనుంది. నెలవారీ ఒక్కొక్కరికి ఉన్న రూ.100 పరిమితి రూ.3,000కు పెరగనుంది. గరిష్టంగా ఇద్దరు పిల్లలకు సంబంధించి ఈ మొత్తంపై పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాగే, హాస్టల్ కోసం చేసే వ్యయాలపై ప్రస్తుతం ఉన్న నెలవారీ రూ.300 కాస్తా రూ.9,000కు పెరగనుంది. అంటే ఇంత మొత్తంపై ఇకనుంచి పన్ను లేకుండా చేసుకోవచ్చు. ఆదాయపన్ను చట్టం, 2026లోని 280 నిబంధన కింద ఈ ప్రయోజనాలను పొందుపరిచారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకూ ఈ ప్రయోజనం ఒకే విధంగా అమలు కానుంది. రుజువులు అవసరం..⇒ ఆదాయపన్ను చట్టం నిబంధనలు, 2026 కింద పాత పన్ను విధానంలో పలు పన్ను మినహాయింపులను క్లెయిమ్ చేసుకోవాలని భావించే వారు తప్పకుండా డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది. ⇒ హెచ్ఆర్ఏ క్లెయిమ్ కోసం ఆర్థిక సంవత్సరంలో అద్దె చెల్లింపులు రూ.1,00,000 దాటితే అప్పుడు ప్రాపర్టీ యజమాని పేరు, చిరునామా, పాన్, అతడితో ఉన్న సంబంధం (రెంటల్ అగ్రిమెంట్) రుజువులు చూపించాలి. ⇒ లీవ్ ట్రావెల్ కన్సెషన్ కోసం ప్రయాణాలకు అయిన వ్యయాల రుజువులు సమర్పించాలి. ⇒ ‘ఇంటి ప్రాపర్టీ ఆదాయం’ నుంచి వడ్డీని మినహాయింపు క్లెయిమ్ చేసుకునేట్టు అయితే గృహ రుణదాత పేరు, చిరునామా, పాన్ వివరాలు ఇవ్వాల్సి వస్తుంది. వీటిల్లోనూ మార్పులు..⇒ బ్యాంకుల్లో రూ.50,000కు మించి నగదు డిపాజిట్ చేయాలంటే ప్రస్తుతం పాన్ జిరాక్స్ కాపీ ఇవ్వాల్సి వస్తోంది. ఏప్రిల్ 1 నుంచి ఒక ఆర్థిక సంవత్సరంలో నగదు జమలు, ఉపసంహరణల లావాదేవీల మొత్తం రూ.10 లక్షలకు మించినప్పుడే పాన్ ఇస్తే సరిపోతుంది. ⇒ ప్రాపర్టీ (ఇల్లు లేదా భూమి) కొనుగోలు/విక్రయం, ఉమ్మడి అభివృద్ధి (జాయింట్ డెవలప్మెంట్) లావాదేవీ విలువ రూ.20 లక్షలు మించితే పాన్ సమర్పించాలి. ప్రస్తుతం ఈ పరిమితి రూ.10 లక్షలుగా ఉంది. ⇒ ప్రస్తుతం ద్విచక్ర వాహన కొనుగోళ్లకు పాన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇతర అన్ని వాహన కొనుగోళ్ల సమయంలో ధరతో సంబంధం లేకుండా పాన్ ఇవ్వాలన్న నిబంధన అమల్లో ఉంది. ఏప్రిల్ 1 నుంచి ఏ వాహనం కొనుగోలు చేస్తున్నా.. రూ.5 లక్షలకు మించితే పాన్ ఇవ్వాల్సి ఉంటుంది. ⇒ హోటల్ లేదా రెస్టారెంట్ బిల్లు, కన్వెన్షన్ సెంటర్లు, బాంక్వెట్ హాల్స్, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలకు చెల్లింపులు రూ. లక్షకు మించితే పాన్ సమర్పణ తప్పనిసరి. ⇒ జీవిత బీమా పాలసీల కొనుగోలు సమయంలో ఇకమీదట పాన్ ఇవ్వడం తప్పనిసరి. ప్రస్తుతం వార్షిక ప్రీమియం రూ.50,000 మించిన పాలసీలకే ఇది అమల్లో ఉంది. -
కొత్త చట్టం
- స్థానిక సంస్థల పాలనలో మార్పులు - {పత్యేక అధికారుల నియామకం సాక్షి ప్రతినిధి, చెన్నై: స్థానిక సంస్థల పరిపాలనలో మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. ఇందుకు సంబంధించి త్వరలో కొత్త చట్టం తీసుకురావాలని భావిస్తోంది. తమిళనాడులో 12 కార్పొరేషన్లు, 125 మున్సిపాలిటీలు 12,524 పంచాయతీలు, 529 పట్టణ పంచాయతీలు, 385 పంచాయతీ యూనియన్లు 31 జిల్లా పంచాయతీ అనే స్థానిక సంస్థలు ఉన్నాయి. 2011లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మేయర్, చైర్మన్, కౌన్సిలర్ల పదవులకు ఎన్నికలు నిర్వహించారు. ఆనాటి ఎన్నికల్లో ఎన్నికైనవారు అక్టోబరులో బాధ్యతలు స్వీకరించారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఐదేళ్లకు నిర్వహిస్తుండగా, ఈ లెక్కన గత ఎన్నికల పదవీకాలం ఈనెల 24వ తేదీతో ముగుస్తుంది. సామాజికపరమైన రిజర్వేషన్లు సక్రమంగా అమలు చేయలేదని డీఎంకే వేసిన పిటిషన్తో ఈనెల 17, 19 తేదీల్లో జరగాల్సిన ఎన్నికలను కోర్టు రద్దు చేస్తూ తీర్పు నిచ్చింది. ఈ ఏడాది డిసెంబరులోగా కొత్తగా నోటిఫికేషన్ను జారీచేసి ఎన్నికలు జరపాలని కోర్టు ఆదేశించింది. దీంతో ఈనెల 25వ తేదీలోగా రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు మేయర్లు, చైర్మన్లు, అధ్యక్షులు ఎన్నిక కాలేని పరిస్థితి నెలకొంది. ఎన్నికలు నిర్వహించే వరకు స్థానిక సంస్థల్లో ప్రజలచేత ఎన్నుకోవాల్సిన పదవులు ఖాళీగానే ఉంటాయి. దీంతో స్థానిక సంస్థలకు ప్రజాప్రతినిధులు వచ్చే వరకు పరిపాలన సాగించేందుకు ప్రత్యేక అధికారి అవసరం ఏర్పడింది. అంటే ఈనెల 24వ తేదీలోగా ప్రత్యేక అధికారుల నియామకం పూర్తిచేయాల్సిన ఒత్తిడి ప్రభుత్వంపై పడింది. ఈ పరిస్థితిలో పురపాలనశాఖ కొత్త చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించింది. కార్పొరేషన్లలో 1996కు ముందు కమిషనర్ లేదా జిల్లా కలెక్టర్లే ప్రత్యేక అధికారులుగా వ్యవహరిస్తూ కార్పొరేషన్ను పాలించేవారు. 20 ఏళ్ల తరువాత నేడు ప్రత్యేక అధికారిని నియమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే కొత్త చట్టంతో ప్రత్యేక అధికారులను నియమించడమా లేదా కమిషనర్లకు, జిల్లా కలెక్టర్లకే బాధ్యతలు అప్పగించడమా అని ప్రభుత్వం ఆలోచిస్తోంది. చెన్నై గ్రేటర్ కార్పొరేషన్ కావడంతో కమిషనర్ కాకుండా సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే మున్సిపాలిటీలు, పంచాయతీల్లో సైతం ప్రస్తుతం ఉన్న కమిషనర్లరే ప్రత్యేక అధికారులుగా నియమించే అవకాశం ఉంది. స్థానిక సంస్థల్లో అధికారిక పాలన ప్రారంభించేందుకు ముందుగా పన్నీర్సెల్వం అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం కానుంది. మంత్రి వర్గం తీర్మానించిన తరువాత గవర్నర్ ఆమోదానికి పంపి ఆ తరువాత అమల్లోకి తెస్తారు. -
‘ఎర్ర’దొంగల కోసం కొత్త చట్టం
ఏపీలో ‘కఫిపొసా’ తరహా చట్టానికి సిద్ధమవుతున్న ప్రతిపాదనలు స్టోరీ బోర్డు హైదరాబాద్: ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న స్మగ్లర్ల ఆటకట్టించడానికి ఆంధ్రప్రదేశ్ ఉన్నతాధికారులు పటిష్టమైన చట్టానికి రూపకల్పన చేస్తున్నారు. అటవీ చట్టంలో ఉన్న సెక్షన్ 49 ప్రకారం పోలీసు అధికారులు ఎర్రచందనాన్ని సీజ్ చేసినా.. తమంతట తాముగా స్వాధీనం చేసుకునే అధికారం లేదు. సదరు స్మగ్లర్ అక్రమ రవాణా ద్వారా భారీగా ఆస్తులు కూడబెట్టాడని తెలిసినా వాటిని స్వాధీనం చేసుకునే అవకాశం ఉండట్లేదు. దీంతో ఈ పరిస్థితుల్ని మార్చి, ఎర్రచందనం అక్రమ రవాణాదారులకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావడంతో పాటు ప్రస్తుతం ఉన్న అటవీ చట్టంలోనూ సవరణలకు సన్నాహాలు చేస్తోంది. అంతర్జాతీయ స్మగ్లింగ్ను నిరోధించడం కోసం కస్టమ్స్ అధికారులు ప్రయోగిస్తున్న ‘ది కన్సర్వేషన్ ఆఫ్ ఫారిన్ ఎక్సేంజ్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ స్మగ్లింగ్ యాక్టివిటీస్ యాక్ట్ (కఫిపొసా)-1974’ తరహాలో తీసుకురావడానికి అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ తరహా చట్టం అమలులోకి వస్తే ఎర్రచందనం స్మగ్లర్లకు బెయిల్ కష్టతరం కావడంతో పాటు వారికి సంబంధించిన ప్రైవేట్ ఆస్తుల్ని సైతం స్వాధీనం చేసుకునేందుకు మార్గం సుగమం అవుతుందని చెప్తున్నారు. అయితే అటవీ సంబంధ విషయాలు కేంద్రం-రాష్ట్రం ఉమ్మడి జాబితాలో ఉన్నవి కావడంతో వీటి అమలుకు కేంద్ర ప్రభుత్వం నుంచీ అనుమతి పొందడం అనివార్యంగా మారింది. మరో నెల రోజుల్లో ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇలా.. వాస్తవానికి ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) ప్రకారం ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి నమోదు చేయడానికి ప్రత్యేక సెక్షన్లు ఏవీ లేవు. దీంతో పట్టుబడ్డ ఎర్రచందనం కూలీలు, స్మగ్లర్లపై పోలీసులు అటవీ చట్టంలోని కొన్ని సెక్షన్లతో పాటు చోరీ (ఐపీసీ 379), అనుమతి లేకుండా ఓ ప్రాంతంలో గుమిగూడటం (ఐపీసీ 147), మారణాయుధాలతో గుమిగూడటం (ఐపీసీ 148), ఓ నేరం చేసేందుకు సమూహంగా గుమిగూడటం (ఐపీసీ 149) తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి సరిపెట్టాల్సి వస్తోంది. వీటిలో నిందితులకు తేలిగ్గా బెయిల్ లభించే అవకాశం ఉండటంతో స్మగ్లర్లను వీలైనంత ఎక్కువ కాలం జైల్లో ఉంచేందుకు హత్యాయత్నం (ఐపీసీ 307), ప్రభుత్వ అధికారిపై దౌర్జన్యం/దాడి చేయడం (ఐపీసీ 353) వంటి సెక్షన్లు జోడిస్తున్నారు. సదరు స్మగ్లర్లు, కూలీలను అరెస్టు చేసే సందర్భంలో ఈ పరిణామాలు ఎదురైనా, కాకున్నా అనివార్యంగా వీటిని జోడించాల్సి వస్తోంది. ఫలితంగా కేసు న్యాయస్థానంలో విచారణకు వచ్చినప్పుడు నిరూపించడం కష్టంగా మారి వీగిపోయే పరిస్థితులు ఉన్నాయి.


