మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులకు ఆంధ్రా బ్యాంకు రుణం
హైదరాబాద్లో 4 ఆస్పత్రులకు రూ.800 కోట్లు ఇచ్చే అవకాశం
ఆంధ్రా బ్యాంకు ప్రతినిధులతో వైద్య ఆరోగ్య శాఖ చర్చలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో ప్రభుత్వం నిర్మించబోయే నాలుగు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులకు రుణం ఇవ్వడానికి ఆంధ్రా బ్యాంకు ముందుకు వచ్చింది. ఒక్కో ఆస్పత్రికి రూ.200 కోట్ల చొప్పున రూ.800 కోట్లు ఇవ్వడానికి అంగీకారం తెలిపింది. బుధవారం ఈ మేరకు సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో ఆంధ్రా బ్యాంకు ప్రతినిధులు చర్చలు జరిపారు. రుణ షరతులు తదితర అంశాలపై ఓ అంచనాకు వచ్చాక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డితోనూ చర్చలు జరుపుతారు. ఎల్బీ నగర్లోని విక్టోరియా మెమోరియల్ హోం వద్ద, రాజేంద్రనగర్లోని మైలార్దేవ్పల్లి వద్ద, పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్ పక్కన, మియాపూర్ బస్ టర్మినల్ పక్కన మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.
ఈ ఆస్పత్రుల్లో మహిళలు, పిల్లల సంరక్షణతో పాటు ఇతర అన్ని రకాల వైద్య సేవలు అందిస్తారు. ఒక్కో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో 500 పడకలకు అదనంగా మరో 250 పడకలు తల్లులు, పిల్లల సంరక్షణ కోసం నిర్మిస్తారు. ఆయా ఆస్పత్రులను నిర్మించడానికి అవసరమైన అంచనాలు, ప్రణాళిక తయారు చేయాల్సిందిగా ప్రభుత్వం ఇప్పటికే అధికారులను ఆదేశించింది. గతంలో ఒక విదేశీ బ్యాంకు నుంచి రుణం తీసుకోవాలని ప్రభుత్వం యోచించింది. అయితే ఆ దేశ కరెన్సీ ద్వారా వాయిదాలు చెల్లించే సందర్భంలో రూపాయి విలువ పడిపోతే మరింత భారం కావచ్చొని భావించింది. దీంతో ఆ రుణాన్ని వద్దనుకుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రా బ్యాంకు నుంచి రుణం తీసుకునేందుకు కసరత్తు జరుగుతోంది.