breaking news
Malini Parthasarathy
-
జయ ఆరోగ్యంపై... సీనియర్ జర్నలిస్టు ట్వీట్స్!
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ‘అమ్మ’ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఊహాగానాలు వస్తుండటంతో ఆమె అభిమానులు, అన్నాడీఎంకే శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ‘అమ్మ’ ఆరోగ్యంపై వదంతులు, ఊహాగానాలకు తెరదించుతూ సీనియర్ జర్నలిస్టు, హిందూ దినపత్రిక మాజీ ఎడిటర్ మాలినీ పార్థసారథి వరుస ట్వీట్లలో స్పష్టత ఇచ్చారు. సీఎం జయలలిత కోలుకుంటున్నారని, ఆమెకు ప్రాణాపాయం తప్పిందని మాలినీ పార్థసారథి ట్వీట్ చేశారు. జయలలితను ఆస్పత్రిలో పరామర్శించిన అత్యంత సన్నిహితుల ద్వారా ఈ శుభవార్తను తాను వెల్లడిస్తున్నట్టు ఆమె తెలిపారు. జయలలిత కోలుకోవడానికి మరికొంత సమయం పడుతుందని, ఆమె వ్యక్తిగత నేస్తం ద్వారా తాను ఎప్పటికప్పుడు ఆమె ఆరోగ్యం గురించి తెలుసుకుంటున్నట్టు వివరించారు. జయలలిత త్వరలోనే సంపూర్ణంగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు. ప్రస్తుతం జయలలిత స్పృహలోనే ఉన్నారని మాలినీ పార్థసారథి స్పష్టం చేశారు. జ్వరం, డీ హైడ్రేషన్తో సీఎం జయలలిత గత నెల 22న తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. గ్రీమ్స్ రోడ్డులోని అపోలో ఆస్పత్రిలో చేరిన జయలలితకు వైద్య బృందం మెరుగైన చికిత్స అందిస్తున్నారు. అమ్మ కోలుకుంటున్నారని ఆస్పత్రి వర్గాలు ఆదివారం సాయంత్రం బులిటెన్ విడుదల చేసినా.. ఆమె ఆరోగ్యంపై అన్నాడీఎంకే వర్గాల్లో ఆందోళన తగ్గడం లేదు. సోమవారం కూడా ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందుతున్న అభిమానులు పెద్దసంఖ్యలో ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. మరోవైపు అన్నాడీఎంకే సీనియర్ నేతలు, మంత్రులు కూడా సోమవారం ఆస్పత్రి వద్దకు వచ్చి జయలలిత ఆరోగ్యం గురించి వాకబు చేశారు. -
తెలంగాణ ‘ఏకాభిప్రాయం’పై భిన్నాభిప్రాయాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణపై ఏకాభిప్రాయానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై రాజకీయ పక్షాల నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ అంశంపై ‘ది హిందూ సెంటర్ ఫర్ పాలిటిక్స్ అండ్ పబ్లిక్ పాలసీ’ శనివారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన చర్చా గోష్టిలో తెలుగుదేశం మినహా అన్ని రాజకీయ పక్షాల ప్రతినిధులు మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటుపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ), యూపీఏ ప్రకటన చేసిన అనంతరం చోటుచేసుకున్న పరిణామాలతో ఈ అంశం జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశమైందని, అందుకే ఏకాభిప్రాయం కోసం ఏమి చేయాలనే అంశంపై ఈ సదస్సు పెట్టామని సదస్సుకు అధ్యక్షత వహించిన హిందూ సెంటర్ డెరైక్టర్ డాక్టర్ మాలినీ పార్థసారథి తెలిపారు. రాష్ట్రాన్ని విభజించాలన్న సీడబ్ల్యూసీ నిర్ణయం ఆమోదయోగ్యం కాదని గాదె వెంకటరెడ్డి(కాంగ్రెస్) అన్నారు. ఆంధ్రలో తెలంగాణను కలిపినప్పుడు పెద్ద మనుషుల ఒప్పందం కుదిరిందని, దాని అమల్లో విఫలమైతే ఇరు రాష్ట్రాలు విడిపోవచ్చనే షరతు ఉం దని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరామ్ అన్నారు. సమైక్య రాష్ట్రమే పరిష్కారమార్గం ప్రపంచంలో ఎక్కడా మిగులు జలాలపై ఆధారపడిన ప్రాజెక్టులు లేవని, మన రాష్ట్రంలో మాత్రం మూడు ప్రాంతాల్లో ఇలాంటి ప్రాజెక్టులు ఉండటం అతిక్లిష్టమైన సమస్య అని వైఎస్సార్సీపీ నేత ఎం.వి.మైసూరారెడ్డి అన్నారు. ‘తెలంగాణలో నెట్టెంపాడు, కల్వకుర్తి, ఎస్ఎల్బీసీ, రాయలసీమలో తెలుగుగంగ, హంద్రీ - నీవా, కోస్తాలో వెలిగొండ ప్రాజెక్టులు కృష్ణానదిపై నిర్మాణంలో ఉన్నాయి. ఇవన్నీ మిగులు జలాలపై ఆధారపడి నిర్మిస్తున్నవే. రేపు రాష్ట్రం విడిపోతే ఈ మూడు ప్రాంతాల్లోని ఈ ప్రాజెక్టుల భవితవ్యం ఏమిటి?’ అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర రాజధాని అనే భావంతో సీమాంధ్రులు పెట్టుబడులు పెట్టలేదని, వ్యాపారం కోసమే హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టారని కేటీ రామారావు(టీఆర్ఎస్) వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రకటన తర్వాత ఇరు ప్రాంతాలకు చెందిన రాజకీయ పార్టీల్లో స్పష్టమైన విభజన వచ్చిందని సీపీఎం నేత బీవీ రాఘవులు అన్నారు. రాష్ట్రాన్ని విభజించడం వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలను పరిష్కరించాలని సీపీఐ నేత కె.నారాయణ కోరారు. రాష్ట్ర విభజనను కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర సమస్యగా కాకుండా సొంత వ్యవహారంలా చూడటంవల్లే సమస్య ఉత్పన్నమైందని కె.హరిబాబు(బీజేపీ) వ్యాఖ్యానించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 35 శాతం మంది సీమాంధ్రులు ఉన్నారని, తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా వీటిలో 50 నియోజకవర్గాల్లో సీమాంధ్ర నుంచి వచ్చి స్థిరపడినవారు ఉన్నారని సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రి(ఎంఐఎం) అన్నారు. రాజకీయ పక్షాలు స్వల్పకాల ప్రయోజనాలు కాంక్షించడంవల్లే సమస్య ఏర్పడిందని లోక్సత్తా నేత జయప్రకాష్ నారాయణ్ అన్నారు.