breaking news
List farmers
-
అర్హులైన రైతుల జాబితా పంపించాలి
రాంనగర్ :మండలస్థాయి అధికారులందరూ సమన్వయంతో పనిచేసి రుణమాఫీకి అర్హులైన రైతుల జాబితాను సిద్ధం చేసి పంపించాలని కలెక్టర్ టి.చిరంజీ వులు ఆదేశించారు. గురువారం స్పెషల్ ఆఫీసర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, వ్యవసాయశాఖ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. పంట రుణాల వివరాలను బ్యాంకు అధికారులు ఇప్పటికే అందించారన్నారు. వాటిని గ్రామం వారీగా, కుటుంబం వారీగా పరిశీలించి ప్రతి కుటుంబానికి రూ. లక్ష వరకు రుణమాఫీ అయ్యే విధంగా జాబితా రూపొందించి ప్రతి గ్రామ పంచాయతీ నోటీసు బోర్డులో ప్రదర్శించాలన్నారు. అలాగే ఈ నెల 29న గ్రామ సభలు నిర్వహించి లిస్టులు ఫైనల్ చేసి పంపించాలని కలెక్టర్ సూచించారు. ఒకే రైతు రెండు, మూడు బ్యాంకుల్లో రుణం పొంది ఉన్నట్లైతే వాటిని కన్సాలిడేట్ చేసి ముందు తీసుకున్న అప్పు లేదా ఏది ఎక్కువ అప్పు ఉంటే అందులో నుంచి రూ. లక్ష వరకు మాఫీ అయ్యే విధంగా లిస్టు ఫైనల్ చేయాలన్నారు. రుణమాఫీకి అర్హులైన ఏ ఒక్క రైతు కూడా జాబితాలో మిస్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అదే విధంగా రుణమాఫీకి అర్హులు కాని వారి పేర్లు విధిగా తొలగించాలని ఆదేశించారు. సమగ్ర కుటుంబ సర్వే డాటాను వేగవంతం చేయాలని రెవెన్యూ అధికారులకు కోరారు. కొన్ని చోట్ల డాటాను కంప్యూటరీకరించడంలో వెనుకబడి ఉన్నందున ఆయా ప్రాంతాలలో ఆర్డీఓలు చొరవ తీసుకుని వేగవంతంగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. డాటా ఎంట్రీల విషయంలో పంచాయతీ కార్యదర్శులు ఎక్కడైనా హాజరుకాకపోయినట్లైతే వారిని సస్పెండ్ చేయాలని డీపీఓకు ఆయన ఆదేశించారు. మున్సిపల్ ప్రాంతాలలో కమిషనర్లు ప్రత్యేక శ్రద్ధ వహించి డాటా ఎంట్రీని వేగవంతం చేయాలని సూచించారు. ప్రభుత్వం ఇటీవల పంపిణీ చేసిన భూమికి వెంటనే డాక్యుమెంటేషన్ను పూర్తి చేయాలని తహసీల్దార్లకు కోరారు. అతేగాకుండా రేషన్కార్డులకు ఆధార్ సీడింగ్ కూడా ఈ నెల 31వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జేసీ ప్రీతిమీనా, జేడీఏ నర్సింహారావు, జెడ్పీ సీఈఓ దామోదర్రెడ్డి, డ్వామా పీడీ సునంద, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
రైతుల జాబితా సిద్ధం చేయండి
రాంనగర్ :రుణమాఫీకి అర్హులైన రైతుల జాబితా సిద్ధం చేసి ఈ నెలాఖరులోగా ప్రభుత్వానికి అందజేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ ఆదేశించారు. ఆర్థిక, వ్యవసాయశాఖల ముఖ్య కార్యదర్శులతో కలిసి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, బ్యాంకర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. సకాలంలో పంట రుణాలు పొందిన రైతుల జాబితాను బ్యాంకుల వారీగా, గ్రామాల వారీగా సిద్ధం చేయాలని సూచించారు. రైతుల జాబితా రూపొందించేటప్పుడు పారదర్శకత పాటించాలన్నారు. ప్రతి మండలానికి డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారిని ఇన్చార్జిగా నియమించాలని, ప్రభుత్వం జారీ చేసిన నిర్ధిష్టమైన ఫార్మాట్లో రైతుల వివరాలు పొందుపర్చాలని చెప్పారు. సేకరించిన రైతుల వివరాలపై మరోమారు సామాజిక తనిఖీ నిర్వహించి ఈ నెలాఖరు లోగా తుది జాబితాను ప్రభుత్వానికి సమర్పించాలని కోరారు. 2014 మార్చి 31 నాటికి బకాయిపడిన పంట రుణాలకు రూ.లక్ష వరకు రుణమాఫీ వర్తిస్తుందని ఆయన వివరించారు. వీడియో కాన్ఫరెన్సులో జిల్లా కలెక్టర్ చిరంజీవులు, జేసీ ప్రీతి మీనా, వ్యవసాయశాఖ జేడీ నర్సింహ, జిల్లా సహకార అధికారి ప్రసాద్, బ్యాంకుల ఉన్నతాధికారులు, కంట్రోలింగ్ అధికారులు పాల్గొన్నారు. 24లోగా రూపొందించాలి: కలెక్టర్ రైతుల పంట రుణాల మాఫీ విషయంలో ప్రభు త్వ మార్గదర్శకాల మేరకు బ్యాంకులు ఈనెల 24 లోగా జాబితాలు సిద్ధం చే యాలని జిల్లా కలెక్టర్ టి. చిరంజీవులు కోరారు. బుధవారం తన ఛాంబర్ లో జరిగిన బ్యాంకర్ల సమన్వయ కమిటీ సమావేశంలో పంట రుణాల మాఫీపై చర్చించారు. ఈనెల 24లోగా బ్యాంకుల వారీగా, గ్రామాల వారీగా జాబితాలు రూపొందించి మరుసటి రోజు నుంచి కంప్యూటరైజేషన్ పూర్తి చేయాలని సూ చించారు. మండల స్థాయి బ్యాంకర్ల సమన్వయ కమిటీ సమావేశంలో చర్చించి జాబితాలు సిద్ధం చేయాలని, వాటిని తహసీల్దార్లు, మండల అభివృద్ధి అధికారులు ధ్రువీకరించాల్సి ఉంటుందన్నారు. అనంతరం జాబితాపై సామాజిక తనిఖీ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇందులో గ్రామస్తులను, స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేసి వారి అభిప్రాయాలు స్వీకరించిన అనంతరం తుది జాబితా సిద్ధం చేస్తామన్నారు. రైతుల జాబితా తయారు చేసేటప్పుడు మండల, గ్రామ స్థాయి వ్యవసాయ అధికారులు, సహకార సిబ్బంది బ్యాంకర్లకు సహకరించాలని ఆదేశించారు. అవసరమైతే ఆదర్శరైతుల సహకారం కూడా తీసుకోవచ్చని బ్యాంకర్లకు సూచించారు. ప్రభుత్వం నుంచి వచ్చిన మార్గదర్శకాలను ఆయా బ్యాంకుల బ్రాంచ్ మేనేజర్లకు పంపాలని కంట్రోలింగ్ అధికారులను కోరారు. సమావేశంలో జేసీ ప్రీతిమీనా, జేడీఏ నర్సింహరావు, జిల్లా సహకార అధికారి ప్రసాద్, వివిధ బ్యాంకుల ఉన్నత అధికారులు పాల్గొన్నారు.