breaking news
Kolkata Metro Rail
-
మెట్రో ట్రాక్పై హైడ్రామా: 24 నిమిషాలు స్తంభించిన బ్లూ లైన్!
కోల్కతా: శనివారం ఉదయం కోల్కతా మెట్రో నెట్వర్క్లో తీవ్ర కలకలం చెలరేగింది. కాళీఘాట్ మెట్రో స్టేషన్లో ఒక వ్యక్తి ఆత్మహత్యా యత్నానికి ఒడిగట్టడంతో బ్లూ లైన్ పరిధిలోని రైలు సర్వీసులు ఒక్కసారిగా నిలిచిపోయాయి. ఉదయం పూట ఆఫీసులకు, ఇతర పనులకు వెళ్లే వందలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మెట్రో సిబ్బంది, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ స్పందించి సకాలంలో చర్యలు చేపట్టడంతో ఒక ప్రాణం నిలబడటంతో పాటు ప్రయాణికులకు పెద్ద ఉపశమనం లభించింది.ఉదయం 7.20కి స్తంభించిన రైళ్లుమెట్రో రైల్వే అధికారులు అందించిన సమాచారం ప్రకారం.. శనివారం ఉదయం సుమారు 7:20 గంటల సమయంలో కాళీఘాట్ స్టేషన్లోని అప్ లైన్ పట్టాలపైకి ఒక వ్యక్తి అకస్మాత్తుగా దూకాడు. అది గమనించిన వెంటనే అప్రమత్తమైన మెట్రో సిబ్బంది, ప్రమాదాన్ని నివారించేందుకు ట్రాక్లకు సరఫరా అయ్యే విద్యుత్ను తక్షణమే నిలిపివేశారు. ఆ వెంటనే అక్కడ రెస్క్యూ ఆపరేషన్ను ప్రారంభించారు. ఈ ఊహించని ఘటనతో కవి సుభాష్- దక్షిరేశ్వర్ స్టేషన్ల మధ్య నడిచే బ్లూ లైన్ రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.ప్రయాణికుల రద్దీ.. పాక్షిక సర్వీసుల నిర్వహణరద్దీగా ఉండే ఉదయం వేళల్లో మెట్రో సేవలు ఆగిపోవడంతో పలు స్టేషన్లలో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. మెట్రో అధికారులు వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. అందులో భాగంగా, ప్రభావితం కాని మార్గాల్లో పాక్షిక సర్వీసులను నడిపారు. దక్షిరేశ్వర్ నుంచి మైదాన్ వరకు, అలాగే మహానాయక్ ఉత్తమ్ కుమార్ (టోలీగంజ్) నుంచి కవి సుభాష్ స్టేషన్ల మధ్య మాత్రమే ఈ సమయంలో రైళ్లను నడిపించారు.ప్రాణాలతో బయటపడిన వ్యక్తిమెట్రో సిబ్బంది, ఆర్పిఎఫ్ బలగాలు సకాలంలో స్పందించడంతో సదరు వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే అతనికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత అధికారులు ట్రాక్లను క్షుణ్ణంగా తనిఖీ చేసి, అంతా సవ్యంగా ఉందని నిర్ధారించుకున్నాక ఉదయం 7:44 గంటలకు బ్లూ లైన్ పూర్తిస్థాయి సేవలను పునరుద్ధరించారు. కేవలం 24 నిమిషాల్లోనే పరిస్థితిని సాధారణ స్థితికి తెచ్చినప్పటికీ, రద్దీ సమయంలో జరిగిన ఈ అంతరాయం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
మెట్రోలో చెయ్యి ఇరుక్కుని వ్యక్తి మృతి
కోల్కతా : నగరంలోని పార్క్ స్ట్రీట్ మెట్రో స్టేషన్లో జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మెట్రో రైలు తలపుల మధ్య చెయ్యి ఇరుక్కోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కోల్కతాలోని కస్బా ప్రాంతానికి చెందిన సజల్ కాంజీలాల్ శనివారం సాయంత్రం పార్క్ స్ట్రీట్ మెట్రో స్టేషన్లో రైలు ఎక్కేందుకు యత్నించాడు. తొలుత తలపుల మధ్య చెయ్యి పెట్టి మెట్రో ఎక్కబోయాడు. అయితే డోర్స్ లాక్ అయి మెట్రో ముందుకు కదలింది. దీంతో రైలు అతన్ని లాక్కువెళ్లింది. ఇది గమనించిన సిబ్బంది ట్రైన్ను నిలిపివేశారు. తీవ్రంగా గాయపడిన సజల్ను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతను మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మెట్రో జనరల్ మేనేజర్ పీసీ శర్మ ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించినట్టు తెలిపారు. ట్రైన్ డోర్ సెన్సార్లు పనిచేయకపోవడానికి కారణం తెలియాల్సి ఉందన్నారు. అయితే ఈ ప్రమాదం జరిగిన వెంటనే ట్రైన్ను నిలిపివేసి, విద్యుత్ సరఫరా ఆపివేశామని పేర్కొన్నారు. అలాగే ప్రయాణికులను కూడా మెట్రో నుంచి దింపివేశామని వెల్లడించారు. ఈ ఘటన అనంతరం మెట్రో సేవలకు కొద్దిపాటి అంతరాయం ఏర్పడింది. స్టేషన్ వద్దకు చేరుకున్న ప్రయాణికులు ఈ ప్రమాదానికి మెట్రో అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ ఘటనపై స్పందించిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. ఇలా జరగడం బాధకరమని పేర్కొన్నారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. -
నీళ్ల అడుగున కూ.. చుక్.. చుక్
- సాంకేతిక అద్భుతం.. ఈ సొరంగం - హుగ్లీ నదికి 30 మీటర్ల దిగువన కోల్కతా మెట్రో రైలు కోసం.. - దేశంలో తొలిసారిగా నదీగర్భంలో టన్నెల్ నిర్మాణం ఉధృతంగా ప్రవహిస్తున్న ఓ నది దిగువ భాగం.. అక్కడ సొరంగంలో పొడవాటి రైల్వే ట్రాక్.. దానిపై నుంచి దూసుకెళ్లే రైళ్లు.. ప్రయాణికులతో కిటకిటలాడే రైల్వే స్టేషన్లు.. ఈ మాటలు చెపుతుంటే విదేశాలు, హాలీవుడ్ సినిమాలు గుర్తుకురావడం సహజమే. కానీ ఇప్పుడు మనదేశంలో కూడా ఇలాంటి అండర్గ్రౌండ్ రైల్వే ట్రాక్ సిద్ధమవుతోంది. అది కూడా సిటీ ఆఫ్ ప్యాలెసెస్గా పేరుగాంచిన కోల్కతాలో.. మనదేశంలో తొలిసారిగా ఓ నదీ గర్భంలో నిర్మిస్తున్న రైల్వే ట్రాక్ ఇదే కావడం గమనార్హం. విశేషం ఏమిటంటే మన దేశంలో ఇప్పటికీ నదీ గర్భంలో నుంచి వెళ్లే ఒక రహదారి కూడా లేదు. కానీ.. ఇప్పుడు ఏకంగా అండర్ గ్రౌండ్ మెట్రోనే రెడీ చేసేస్తున్నారు. సాంకేతిక అద్భుతం.. ఇది అత్యంత రద్దీగా ఉండే హౌరా–సెల్దా రైలు టెర్మినళ్లను కలుపుతుంది. ఈ రెండు స్టేషన్లలో రోజుకు సుమారు 25 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఇకపై వీరంతా ఈ మెట్రోను వినియోగించుకోవచ్చు. సొరంగం గుండా ప్రయాణించే ఈ రైలు మార్గాన్ని సాంకేతిక అద్భుతంగా నిఫుణులు పేర్కొంటున్నారు. ప్రతి రెండున్నర నిమిషాలకు ఒక రైలు ఇక్కడి ప్లాట్ఫామ్పై ఆగుతుంది. హుగ్లీకి 30 మీటర్ల దిగువన.. హుగ్లీ నదికి దిగువ భాగంలో సుమారు 30 మీటర్ల లోతులో వేల టన్నుల మట్టిని తవ్వేస్తున్నారు. సొరంగాల తవ్వకం కోసం తొలిసారిగా ఎర్త్ ప్రెషర్ బ్యాలెన్సింగ్ టన్నెల్ బోరింగ్ మెషిన్లను వినియోగిస్తున్నారు. ఈశాన్య భారతంలో వీటిని వినియోగించడం ఇదే తొలిసారి. ఈ సొరంగం కోసం ఇప్పటి వరకూ పది లక్షల టన్నుల మట్టిని తవ్వి పోశారు. ప్రఖ్యాత హౌరా బ్రిడ్జికి అతి సమీపంలోనే ఈ టన్నెల్ రూపుదిద్దుకుంటోంది. రెండు సొరంగాలుగా నిర్మిస్తున్న ఈ ట్రాక్లో ఇప్పటికే ఒక టన్నెల్ నిర్మాణం పూర్తయ్యింది. ఇక రెండో సొరంగం పూర్తి కావడానికి సిద్ధంగా ఉంది. సొరంగం తవ్వడానికి వాటర్ టైట్నెస్, వాటర్ప్రూఫింగ్, గ్యాస్కట్ల డిజైన్ ప్రధాన సవాళ్లని, ఈ సొరంగాన్ని 120 ఏళ్ల వినియోగం కోసం నిర్మిస్తున్నామని, భూకంపాలను సైతం తట్టుకుంటుందని కోల్కతా మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ సతీశ్కుమార్ చెప్పారు. – సాక్షి, తెలంగాణ డెస్క్ ప్రత్యేకతలు ఇవీ.. నదికి ఎంత దిగువన సొరంగం నిర్మిస్తున్నారు.. 30మీటర్లు ఇక్కడ నది లోతు.. (మీటర్లు) 5.13 మెట్రో ట్రాక్ పొడవు 16.6 కి.మీ అండర్గ్రౌండ్ ట్రాక్ పొడవు 10.8 కి.మీ ప్రతి రైలులో కోచ్లు 6 (అన్నీ ఏసీ) మొత్తం సొరంగాలు 2 ప్రయాణికుల సామర్థ్యం 1,000


