కేరళలో బీజేపీ పాగా వేయడం ఈజీ కాదు
కేరళ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో పాతుకుపోయిన ప్రభుత్వాలకు చరమగీతం పాడుతామని, ఆ రాష్ట్రాల్లో ఇక తమ పార్టీ దూసుకుపోతుందని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించిన మర్నాడే.. ఆ పార్టీకి కేరళలో చేదు అనుభవం ఎదురైంది. మలప్పపురం పార్లమెంట్ నియోజకవర్గానికి సోమవారం జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. ఒడిశాలోని భువనేశ్వర్లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆదివారం అమిత్ షా మాట్లాడుతూ పైన పేర్కొన్న మూడు రాష్ట్రాల్లో దూసుకుపోతామని చెప్పారు.
మలప్పురంలో మున్నెన్నడు లేనివిధంగా బీజేపీ డబ్బులు కుమ్మరించినా, వీధి వీధిన, వాడవాడలా ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోలతోపాటు బీజేపీ అభ్యర్థి ఎన్.శ్రీప్రకాష్ పోస్టర్లను, హోర్డింగ్లను భారీగా ఏర్పాటు చేసినా ఫలితం దక్కలేదు. ఎలాగైనా విజయం సాధించాలనే ఉద్దేశంతో తనను గెలిపిస్తే స్వచ్ఛమైన గోమాంసం అందుబాటులో ఉండేలా చూస్తానని కూడా శ్రీప్రకాష్ హామీ ఇచ్చారు. పార్టీ నాయకుల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు తాను అలా అనలేదని, తన మాటలను వక్రీకరించారని ఆ తర్వాత ఆయన సర్దుకున్నారు. మలప్పురంలో ఎక్కువ మంది ముస్లింలు నివసిస్తున్నా హిందువుల ఓట్లను సమీకరించడంలో బీజేపీ విఫలమైంది.
ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నాయకత్వంలోని ఎల్డీఎఫ్ తరఫున పోటీ చేసిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అభ్యర్థి కునాలి కుట్టి 5,15,330 ఓట్లతో ఘన విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థికి 65,675 ఓట్లు మాత్రమే వచ్చాయి. పాలకపక్షం ఎల్డీఎఫ్ తరఫున పోటీ చేసిన ఎంబీ ఫైజల్కు 3,44,307 ఓట్లు వచ్చాయి. ఈ నియోజకవర్గం నుంచి ఓడిపోయినా ఓట్ల శాతాన్ని భారీగా పెంచుకోవాలని బీజేపీ ఆశించింది. ఆశించిన ఫలితం రాలేదు గానీ 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి వచ్చిన ఓట్ల కంటే ఇప్పుడు 970 ఓట్లు ఎక్కువ వచ్చాయి. ప్రధాని నరేంద్రమోదీ ప్రతిష్టను ఉపయోగించడంతో పాటు ఆరెస్సెస్ వర్గాలు ఇల్లిల్లు తిరిగి ప్రచారం చేసినా, ప్రచార ఆర్భాటానికి ఎంతో ఖర్చుపెట్టినా దక్కిన అదనపు ఓట్లు 970 కావడం స్థానిక బీజేపీ వర్గాలను నిరాశకు గురిచేసింది. ఈసారి కూడా సెక్యులరిజమే విజయం సాధించిందని, సెక్యులరిజానికి పట్టం కంటే కేరళలో మత రాజకీయాలకు ఓట్ల రాలవని మరోసారి రుజువైందని యూడీఎఫ్ వర్గాలు వ్యాఖ్యానించాయి.