రాష్ట్రానికి తిరిగొస్తే సహకరిస్తాం
సాక్షి, హైదరాబాద్: దేశ విదేశాల్లో ఎక్కడున్నా తెలంగాణ బిడ్డల అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన నేతన్నలకు త్వరలో ఏర్పాటు కానున్న కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్కులో ఉపాధి లభించే అవకాశం ఉందని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్న వారు రాష్ట్రానికి తిరిగి వస్తే పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. గుజరాత్లోని సూరత్కు వెళ్లి అక్కడ చేనేత పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్న తెలంగాణ ప్రాంత చేనేత కార్మికుల బృందం బుధవారం మంత్రి కేటీఆర్ను బేగంపేటలోని క్యాంపు కార్యాలయంలో కలిసింది. రాష్ట్రంలో వస్త్ర పరిశ్రమలు నెలకొల్పేందుకు తిరిగి వస్తే పూర్తిగా సహకరిస్తామని మంత్రి కేటీఆర్ వారికి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
వరంగల్ రూరల్ జిల్లా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్లతో కలసి పని చేయాలని వారికి సూచించారు. ఇక్కడికి తరలివచ్చే ముందే స్థానికంగా మార్కెట్లో ఉన్న డిమాండ్, నైపుణ్యం కలిగిన కార్మికుల లభ్యత తదితర అంశాలపై అధ్య యనం జరపాలని వారిని కోరారు. ఈ మేరకు రాష్ట్రా నికి తిరిగి వచ్చేందుకు సూరత్ చేనేత వ్యాపారులు ఆసక్తి కనబరిచారు. చేనేత రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కొనియాడారు. చేనేత కార్మికులే కాకుండా సూరత్, భివండీ వంటి పట్టణాల్లో నేత పరిశ్రమలను ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్న వారు కూడా రాష్ట్రానికి వచ్చేందు కు సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా వారు కేటీఆర్కు తెలిపారు. తమ జీవన స్థితిగతుల గురించి గత 20 ఏళ్లలో ఏ ప్రభుత్వం ఆలోచించలేదని పేర్కొన్నారు. రాష్ట్రానికి తిరిగి వచ్చేలా సీఎం మౌలిక వసతుల విస్తరణ, టెక్స్టైల్స్, చేనేత రంగానికి అధిక నిధులు కేటాయించడం తమలో కొత్త ఆశలు చిగురింపజేసిందని తెలిపారు.