అన్నికులాల పేదలకు ‘కల్యాణలక్ష్మి’
మంత్రి జూపల్లి కృష్ణారావు
అయిజ : బంగారు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అన్నికులాల పేదలకు కల్యాణలక్ష్మి పథకం వర్తింపజేస్తామని, వాటర్గ్రిడ్ ద్వారా ప్రతి ఇంటికీ మంచినీరు ఇస్తామని మంత్రి జూ పల్లి హామీఇచ్చారు.బుధవారం అయిజ నగరపంచాయతీలోని తెలంగాణ చౌరస్తాలో టీఆర్ఎస్ నాయకులు ఉత్తనూరు తిరుమలరెడ్డి ఆధ్వర్యం లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. కరుడుగట్టిన కాంగ్రెస్ నాయకులు సీ మాంధ్ర నాయకులతో జతకట్టి తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నించారని విమర్శించారు.
అప్పట్లో కేసీఆర్ పాదయాత్ర చేస్తుంటే అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. 59ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఆర్డీఎస్ గురించి పట్టించుకోలేదని, అదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇటీవల మహాదీక్ష చేయడం నాటకమన్నారు. తుమ్మిల్ల లిఫ్ట్ సర్వేకు రూ.600కోట్లు మంజూరుకానున్నాయని వెల్లడించారు. ఇదితెలిసి ఆ క్రెడిట్ తాను సొంతం చేసుకోవాలని అలంపూర్ ఎమ్మెల్యే సంపత్కుమార్ దీక్షను చేపట్టాడని, దానికి కాంగ్రెస్ పెద్దలందరూ హాజరయ్యారని, నాగం జనార్దన్రెడ్డి, టీడీపీ నాయకులు రేవంత్రెడ్డి హాజరుకావడం అనైతికమన్నారు. అంతకుముందు జెడ్పీచైర్మన్ బండారుభాస్కర్, టీఆర్ఎస్ పార్టీ గద్వాల ఇన్చార్జ్ కృష్ణమోహన్రెడ్డి, ఉత్తనూరు తిరుమల్రెడ్డి జూపల్లిని టీఆర్ఎస్ నాయకులు ఘనంగా సన్మానించారు.
నాలుగు గురుకుల పాఠశాలలు మంజూరు
అలంపూర్ నియోజకవర్గానికి నాలుగు గురుకుల పాఠశాలలు మంజూరుచేస్తామన్నారు. అలంపూర్ నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు బీటీ రోడ్లు నిర్మిస్తామన్నారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయం నూతన భవనం, జూనియర్ కళాశాల అదనపు గదుల నిర్మాణం కోసం శంకుస్థాపనచేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ అధ్యక్షులు రాముడు, నగరపంచాయతీ చైర్పర్సన్ రాజేశ్వరి, ఎంపీపీ సుందర్రాజు, జెడ్పీటీసీ చంద్రావతి, మాజీఎంపీ మందా జగన్నాథం, మందా శ్రీనాథ్, ఆర్డీఎస్ ప్రాజెక్టు కమిటీ మాజీ చైర్మన్ తన గల సీతారామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.