breaking news
JNNURM funds
-
గ్రేటర్ ఆర్టీసీకి మరో 150 కొత్త బస్సులు
సాక్షి,సిటీబ్యూరో: హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచే లక్ష్యంతో మరో 150 కొత్త మెట్రో డీలక్స్ బస్సులకు ప్రభుత్వం ఈ బడ్జెట్లో నిధులు కేటాయించింది. తెలంగాణ రాష్ట్రంలో రూ.345 కోట్లతో బస్సుల కొనుగోళ్లు, ఇతర సదుపాయాలు కల్పించనున్నట్లు ప్రకటించింది. ఇందులో నగరానికి సంబంధించి ఇప్పటికే రూ.80 కోట్లతో 80 వోల్వో బస్సులను అందజేసినట్లు పేర్కొంది. అలాగే జేఎన్ఎన్యూఆర్ఎం నిధులతో మరో 150 కొత్త బస్సులను కొనుగోలు చేసేందుకు రాష్ర్టం తన వాటాగా అందజేయవలసిన నిధులను ఈ బడ్జెట్లో కేటాయించింది. నగరం ఒకవైపు అనూహ్యంగా విస్తరిస్తోంది. కొత్త కొత్త కాలనీలు వెలుస్తున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న 3850 బస్సులు ఏ మాత్రం చాలడం లేదు. మరో 1000 బస్సుల కోసం డిమాండ్ ఉండగా, ప్రభుత్వం 150 బస్సుల కోసం మాత్రమే నిధులను అందజేయనున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం 34 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ సేవలను వినియోగించుకుంటుండగా, సమీప భవిష్యత్తులో మరో 10 లక్షల మంది ప్రయాణికులు పెరిగే అవకాశం ఉంది. ఇందుకు తగిన విధంగా బస్సుల సంఖ్యను పెంచాల్సి ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
ప్రత్యేక మున్సిపల్ కేడర్ ఉంటేనే జేఎన్ఎన్యూఆర్ఎం నిధులు
న్యూఢిల్లీ: రాష్ట్రాల్లోని మున్సిపాలిటీల్లో పాలన, పనులకు ప్రత్యేకంగా మున్సిపల్ కేడర్ (సిబ్బంది) ఉంటేనే ‘జవహర్లాల్ నెహ్రూ జాతీయ పట్టణ నవీకరణ’ పథకం కింద నిధులు ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం నిబంధనలు విధించనుంది. ఢిల్లీలో సోమవారం జరిగిన ‘ఇన్నోవేషన్స్ ఆఫ్ అర్బన్ గవర్నెన్స్’ సదస్సులో కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కమల్నాథ్ మాట్లాడారు.‘‘దేశంలో పట్టణాలు వేగంగా విస్తరిస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో భూమిని, వనరులను సమర్థవంతంగా వినియోగించగల అధికారులు, సిబ్బంది కావాలి. ప్రస్తుతం కొందరు ఉద్యోగులకు పట్టణ పాలనలో శిక్షణ ఇచ్చి వినియోగించుకోవచ్చు. కానీ, వారు కొద్దికాలం తర్వాత వేరే శాఖలకు బదిలీ కావొచ్చు. లేక వారే వెళ్లిపోవచ్చు. అందువల్ల మున్సిపల్ పాలనకు సంబంధించి ప్రత్యేక కేడర్ ఉంటేనే జేఎన్ఎన్యూఆర్ఎం నిధులు మంజూరు చేసేలా నిబంధన అమలుచేయనున్నాం’’ అని కమల్నాథ్ తెలిపారు. మేయర్లకు మరిన్ని అధికారాలు.. పట్టణాల పాలనాధికారులకు సరైన అధికారాలు లేనందున సమస్యలు వస్తున్నాయని, దేశవ్యాప్తంగా మేయర్లు పాలనా సమస్యలు ఎదుర్కొంటున్నారని ప్రధాని సలహాదారు శ్యామ్ పిట్రొడా పేర్కొన్నారు. అందువల్ల మేయర్లకు మరిన్ని అధికారాలు ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. పట్టణాలకు సంబంధించిన నిర్ణయాలన్నీ రాష్ట్ర ప్రభుత్వాలే తీసుకుంటున్నాయని, స్థానిక ప్రభుత్వాలకు అసలు భాగస్వామ్యమే ఉండడం లేదని ప్రధాని కార్యదర్శి ఆర్.రామానుజం వ్యాఖ్యానించారు.