breaking news
Jamali elections
-
జమిలి జరగాలంటే...
సార్వత్రిక ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ దేశ రాజకీయాల్లో మరోసారి జమిలి ఎన్నికల అంశం తెరపైకి వచ్చింది. దేశంలో తరచూ ఎన్నికల వల్ల అభి వృద్ధి పనులకు అవరోధం ఏర్పడుతోందని, వివిధ రాష్ట్రాల్లో వేర్వేరుగా ఎన్నికల నిర్వహణ వల్ల ప్రజా ధనం వృథా అవుతోందన్న వాదన వినిపిస్తోంది. దీన్ని నివారించేందుకు రాష్ట్రాలు, లోక్సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందనే డిమాండ్ కొన్ని రాజకీయ పార్టీల నుంచి వ్యక్తమవుతోంది. అన్ని రాష్ట్రాలకూ కాకపోయినా అతితక్కువ గడువు మాత్రమే ఉన్న 12 రాష్ట్రాల అసెంబ్లీలతో కలిపి లోక్సభకూ ఈ ఏడాది చివర్లో ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం మొగ్గు చూపుతోందన్న వార్తలూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలను ఎన్నికల సంఘం పరిశీలిస్తోంది. జమిలి ఎన్నికలు జరగాలంటే రాజ్యాంగంతోపాటు ప్రజా ప్రాతినిధ్య చట్టానికి, లోక్సభ నిబంధనలు, ఫిరాయింపుల నిరోధక చట్టం వంటి వాటికి కేంద్రం యుద్ధప్రాతిపదికన సవరణలు చేయాల్సి ఉందని నిపుణులు సూచిస్తున్నారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ రాజ్యాంగంలో చేయాల్సిన మార్పులు... చట్టసభలు నిర్ణీత ఐదేళ్ల కాలపరిమితిని పూర్తి చేసుకుంటేనే జమిలి ఎన్నికల ప్రక్రియ సాఫీగా సాగుతుంది. అవిశ్వాస తీర్మానాలతో ప్రభుత్వాలు పడిపోయినప్పుడు, హంగ్ ఏర్పడి ఎవరూ ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితి తలెత్తినప్పుడు, అసెంబ్లీని ముందస్తుగా రద్దు చేసినప్పుడు సాధారణ ఎన్నికలతో కాకుండా మధ్యంతర ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుంది. ఇలాంటి వాటిని నివారించడానికి ఎన్నికల సంఘం కొన్ని సూచనలు చేసింది. ఇందుకు రాజ్యాంగ సవరణల ఆవశ్యకత ఏర్పడుతుంది. అవి ఏమిటంటే... - ఆర్టికల్ 83, 172 (1): లోక్సభ కాలావధి ఐదేళ్లు అని రాజ్యాంగంలోని 83 (2) క్లాజ్ చెబు తోంది. అసెంబ్లీల పదవీకాలం మొదటిసారి సమావేశమైనప్పటి నుంచి ఐదేళ్లు అని ఆర్టికల్ 172 (1) సూచిస్తోంది. ఈ రెండింటికీ కాలా వధి ఒకే రీతిలో ఉండేలా సవరణ చేయాలి. - ఆర్టికల్ 85, 174: లోక్సభ రద్దు, వాయిదా, సుప్తచేతనావస్థలో ఉంచే అధికారం రాష్ట్రపతికి కల్పించే రాజ్యాంగ నిబంధన ఆర్టికల్ 85. రాష్ట్రాల గవర్నర్లకు ఇవే హక్కులు ఇచ్చే నిబంధన ఆర్టికల్ 174. ఈ రెండింటిలోనూ మార్పులు చేయాల్సి ఉంటుంది. నిర్దిష్ట కాలావధి కంటే ముందే ఏదైనా సభ రద్దయితే మిగిలిన సమయానికి మాత్రమే ఎన్నికలు జరుగుతాయి. ఉదాహరణకు 2019 ఎన్నికల్లో ఏర్పడిన సభ 2020లోనే రద్దు అయితే మిగిలిన కాలానికి అంటే 2024 వరకూ అసెంబ్లీ ఉండేలా ఎన్నికలు జరుగుతాయన్నమాట. సాధారణ ఎన్నికలకు చాలా సమయం ఉన్న పరిస్థితుల్లో పార్లమెంటుకు కూడా ఈ పద్ధతి వర్తిస్తుంది. - రాష్ట్ర అసెంబ్లీల పదవీకాలాన్ని కుదించాలన్నా, పొడిగించాలన్నా రాజ్యాంగ సవరణ తప్పనిసరి. కొత్త క్లాజులు చేర్చాలి. కుదింపు/పొడిగింపు ఎంతకాలం అనే దానిపై పరిమితి ఉండరాదు. - అవిశ్వాస తీర్మానంతోపాటు ప్రభుత్వ ఏర్పాటుకు ప్రత్యామ్నాయం చూపుతూ విశ్వాస తీర్మానం కూడా ప్రవేశపెట్టాలి. రెండింటికీ ఒకేసారి ఓటింగ్ జరగాలి. తద్వారా చట్ట సభలు ముందస్తుగా రద్దయ్యే అవకాశాలు తగ్గుతాయి. - సాధారణ ఎన్నికలకు కొంచెం సమయం మాత్రమే ఉన్నప్పుడు ఏవైనా చట్ట సభలు రద్దయితే రాష్ట్రపతి పాలన విధించాలి. తాను నియమించుకున్న మంత్రుల ద్వారా పాలన సాగించే అధికారం రాష్ట్రపతికి ఉండాలి. అసెంబ్లీలకు సంబంధించి ఈ పనిని గవర్నర్ చేసేలా చేయాలి. లేదంటే రాష్ట్రపతి పాలన విధించాలి. - హంగ్ ఏర్పడి ప్రభుత్వ ఏర్పాటు సాధ్యం కాకపోయినా, ఏదైనా ప్రభుత్వం రాజీనామా చేసి కొత్త ప్రభుత్వం ఏర్పడే పరిస్థితి లేకున్నా తిరిగి ఎన్నికలు నిర్వహించాలి. అయితే కాలపరిమితి ఐదేళ్లు ఉండదు. మిగిలిన సమయానికి మాత్రమే కొత్త సభ మనుగడలో ఉంటుంది. - ఆర్టికల్ 356: దీని ప్రకారం రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన ఆరు నెలల వరకూ మాత్రమే విధించ వచ్చు. పొడిగించాల్సి వస్తే మళ్లీ రాష్ట్రపతి ఆమో దం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఆరు నెలలకు ఒకసారి పార్లమెంటు ఆమోదంతో మూడేళ్లపాటు రాష్ట్రపతి పాలన కొనసాగించేందుకు కూడా అవకాశం ఉంది. ఐదేళ్ల అవధి మధ్యలో ఏదైనా అసెంబ్లీలో రాష్ట్రపతి పాలన విధించి మూడేళ్ల రాష్ట్రపతి పాలన ముగిశాక కూడా సాధారణ ఎన్నికలకు సమయం ఉన్నప్పుడు ఏం చేయాలన్న అంశాన్ని కూడా నిర్వచించి ఈ ఆర్టికల్లో చేర్చాల్సి ఉంటుంది. ఇదీ జమిలి చరిత్ర... 1952లో లోక్సభ తొలి సార్వత్రిక ఎన్నికలతోపాటు దాదాపు అన్ని రాష్ట్రాల (ఒకటి రెండు మినహాయింపులతో) అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 1967 దాకా ఈ పరిస్థితే కొనసాగింది. 1967లో వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్సేతర ప్రభుత్వాలు ఏర్పడగా అంతర్గత కుమ్ములాటలు లేదా కేంద్రమే రాష్ట్రపతి పాలన విధించడంతో ఆ తర్వాత కొన్ని అసెంబ్లీలు రద్దయ్యాయి. 1971లో ఏడాది ముందుగానే అప్పటి ప్రధా ని ఇందిరాగాంధీ లోక్సభ ఎన్నికలకు వెళ్లడంతో జమిలి ఎన్నికల శకం ముగిసింది. 1999లో జస్టిస్ బీపీ జీవన్రెడ్డి సారథ్యంలోని లా కమిషన్ తన నివేదికలో ఎన్నికల సం స్కరణలపై పలు సూచనలు చేసింది. జమిలి ఎన్నికలు నిర్వహించాలని సిఫారసు చేసి ంది. 2014 సెప్టెంబర్లో సుదర్శన్ నాచియప్పన్ చైర్మన్గా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఏర్పాటైంది. 2015 డిసెంబర్లో ఈ నివేదికను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ప్రధాని మోదీ 2016 సెప్టెంబర్లో తొలిసారిగా జమిలి ఎన్నికల ప్రస్తావన తెచ్చారు. వాస్తవ దృష్టితో చూస్తే పార్లమెంటుతోపాటు 29 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలకు జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని నాచియప్పన్ కమిటీ, నీతి ఆయోగ్ అభిప్రాయపడ్డాయి. 2019లో ఒకేసారి ఎన్నికలకు వెళ్లాలంటే అస్సాం, కేరళ, తమిళనాడు అసెంబ్లీల కాలపరిమితిని రెండేళ్లు తగ్గించాలి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ అసెం బ్లీల పదవీకాలాన్ని దాదాపు మూడేళ్లు కుదించాలి. ఈ త్యాగాలకు అక్కడి అధికార పార్టీలు అంగీ కరించే అవకాశం లేనందున మధ్యేమార్గాన్ని అనుసరించాలని నాచియప్పన్ కమిటీ, నీతి ఆయోగ్ సూచిం చాయి. కొన్ని రాష్ట్రాలను 2019 ఏప్రిల్–మేలలో (మొదటి దశ) జరిగే లోక్సభ సాధారణ ఎన్నికలతో కలిపితే... మిగతా వాటిని 2021 అక్టోబర్–నవంబర్లలో (రెండో దశ) కలిపి ఎన్నికలు నిర్వ హించాలనేది సూచన. ఈ విధంగా దేశంలో ఐదేళ్లలో రెండుసార్లే ఎన్నికలు జరుగుతాయి. 2019 మే తర్వాత రెండున్నర ఏళ్లకు 2021 నవంబర్లో మళ్లీ ఎన్నికలుంటాయి. ఫిరాయింపుల నిరోధక చట్టం.. ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలోకి ఫిరాయించిన ప్రజాప్రతినిధులపై తగిన చర్యలు తీసుకునేందుకు అవకాశం కల్పించే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలోనూ కొన్ని సవరణలు చేస్తేగానీ జమిలి ఎన్నికలు సాధ్యం కాదన్నది న్యాయ కమిషన్ ముసాయిదా చెబుతున్న విషయం. పదవ షెడ్యూల్లోని ఈ అంశంలో పార్టీలు జారీ చేసే విప్లు సభ్యులు అతిక్రమించకూడదని ఈ షెడ్యూల్ చెబుతుంది. అయితే, హంగ్ అసెంబ్లీ ఏర్పడినప్పుడు విప్లు జారీ చేయకుండా చేస్తే ప్రభుత్వ ఏర్పాటు సులభమవుతుంది. తద్వారా ఆ ప్రభుత్వం ఐదేళ్లు నడిచేందుకు అవకాశం ఉంటుంది. ఇవన్నీ జరగాలంటే విప్ల జారీ విషయంలో ఉన్న కఠిన నిబంధనలను సడలించాల్సి ఉంటుంది. చట్ట సవరణ పద్ధతులు... జమిలి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన చట్టాల్లో మార్పులు చేసేందుకు నిర్దిష్ట పద్ధతి ఉంటుంది. చేయాల్సిన మార్పులను అధ్యయనం చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలి. మార్పుల ముసాయిదాను కేంద్ర కేబినెట్ పరిశీలించి ఆమోదించాలి. చట్టాలు, నిబంధనల మార్పు కోరుతూ ఓ బిల్లును పార్లమెంటు ఉభయ సభల్లో ప్రవేశపెట్టాలి. ఆ తరువాత రాష్ట్రపతి ఆమోదముద్రతో ఈ మార్పులన్నీ చట్టరూపం దాల్చి అమల్లోకి వస్తాయి. ఇవన్నీ జరిగాయనుకున్నా మార్పులు, చేర్పుల కారణంగా రాజ్యాంగం తాలూకూ మౌలిక స్వభావానికి విఘాతం కలిగిందని ఎవరైనా సుప్రీంకోర్టు తలుపు తట్టే అవకాశం ఉండటం కొసమెరుపు! ప్రజాప్రాతినిధ్య చట్టం... జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగ సవరణలతోపాటు ప్రజాప్రాతినిధ్య చట్టంలోనూ కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. దీంట్లోని సెక్షన్ 14 లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్కు సంబందించినది. ఇందులోని రెండవ క్లాజ్ ప్రకారం లోక్సభ కాలావధి ముగిసేందుకు 6 నెలలకంటే ఎక్కువ సమయం ఉన్నప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఎన్నికల కమిషన్కు అధికారం లేదు. లోక్సభ నిర్ణీత కాలావధి ముగిశాక లేదా రద్దయినప్పుడే నోటిఫికేషన్ విడుదల చేయవచ్చు. అసెంబ్లీ, లోక్సభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలంటే ఈ క్లాజ్ను సరి చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు రాష్ట్రాల ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో ఏకకాల ఎన్నికలకు సంబంధించిన నిర్వచనాన్ని చేర్చాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అనుకూల వాదన... - ఏటా ఏదో ఒక ఎన్నికలు (పార్లమెంటుకు, రాష్ట్రాల అసెంబ్లీలకు) ఉండటం మంచిది కాదు. గత 30 ఏళ్లలో ఏ ఒక్క ఏడాదీ ఎన్నికలు లేకుండా గడవలేదు. సగటున తీసుకున్నా ఏటా 5 లేదా 6 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగాలి. ఎన్నికల ప్రవర్తనా నియామవళి కారణంగా కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఏ పథకాలు, పనులను చేపట్టే పరిస్థితి లేదు. ఫలితంగా అభివృద్ధికి ఆటంకం కలుగుతోంది. గత మూడేళ్లలో చూస్తే 2014లో ఏడు నెలలు, 2015లో మూడు నెలలకుపైగా, 2016లో రెండు నెలలపాటు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉంది. - జమిలి ఎన్నికల వల్ల ప్రజాధనం ఆదా అవుతుంది. 2014 లోక్సభ ఎన్నికల నిర్వహణకు రూ. 3,780 కోట్లు ఖర్చయింది. జమిలి ఎన్నికలు పెడితే రూ. 4,500 కోట్లు సరిపోతాయని ఎన్నికల కమిషన్ అంచనా వేసింది. లోక్సభ, అసెంబ్లీలకు వేర్వేరు సమయాల్లో ఎన్నికలు జరిగితే దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చవుతాయని అంచనా. - ఎన్నికల నిర్వహణ కోసం భారీగా పారామిలటరీ, పోలీసులమోహరింపుతో శాంతిభద్రతల పర్యవేక్షణలో లోపం ఏర్పడుతుంది. - తరచూ ఎన్నికలు జరిగితే కుల, మత, ప్రాంతీయ భావాలు కొనసాగుతూనే ఉంటాయి. ప్రతికూల వాదన... - ఏకకాలంలో ఎన్నికలు వస్తే భారత్లో 77 శాతం ఓటర్లు కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఒకే పార్టీకి ఓటేస్తారని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తన నివేదికలో పేర్కొంది. - లోక్సభ, అసెంబ్లీలకు ఎన్నికలు వేర్వేరు ఎజెండాలపై జరుగుతాయి. అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక సమస్యలపై ఓటరు తీర్పు ఉంటుంది. జమిలి ఎన్నికలైతే జాతీయాంశాలు ఎన్నికల ప్రచారంలో కీలకపాత్ర పోషించి రాష్ట్రాలకున్న ప్రత్యేక సమస్యలు మరుగునపడతాయి. రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుకే పరిమితమై ఓటరు తీర్పునిచ్చే అవకాశాన్ని జమిలి ఎన్నికలు తగ్గిస్తాయి. - మనది సమాఖ్య వ్యవస్థ. ‘ఒక దేశం–ఒకే ఎన్నిక’ నినాదంగా బాగానే ఉన్నా సమాఖ్య స్ఫూర్తి దెబ్బతింటుంది. లోక్సభతోపాటే ఎన్నికలు జరిగేలా రాష్ట్రాలను బలవంతంగా ఒప్పించినట్లే అవుతుందని, ఇది రాష్ట్రాలపై కేంద్రం పెత్తనాన్ని మరింత పెంచినట్లవుతుందనేది నిపుణుల ఆందోళన. జమిలిపై పార్టీల వైఖరి ఏమిటి? ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్తోపాటు, ఎన్సీపీ, డీఎంకే, ఆర్జేడీ, తృణమూల్ కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, తదితర పార్టీలు జమిలి ఎన్నికల ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి. ఒకేసారి ఎన్నికలు జరపాలన్న కేంద్రంలోని అధికార బీజేపీ ఆలోచనతో ఏకీభవించడం లేదని ఇటీవల జరిగిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ (పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్, లా అండ్ జస్టిస్) సమావేశంలో విపక్ష పార్టీల సభ్యులు పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్రతిపాదన ఆచరణ సాధ్యం కాదని వారు స్పష్టం చేశారు. మరోవైపు తాము జమిలి ఎన్నికలకు సిద్ధమేనంటూ టీఆర్ఎస్, అన్నాడీఎంకే ప్రకటించాయి. జమిలి ఎన్నికలకు జేడీ(యూ) పాక్షిక మద్దతు తెలిపినప్పటికీ ఆర్టికల్ 356 ఉన్నంత కాలం రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసే అవకాశముందని అనుమానం వ్యక్తం చేసింది. -
జమిలి ఎన్నికల చర్చ
దాదాపు ఏణ్ణర్ధం నుంచి అప్పుడప్పుడు వినిపిస్తున్న జమిలి ఎన్నికల ప్రస్తావన మరోసారి తెరపైకి వచ్చింది. ఆదివారం న్యూఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ భేటీలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ పార్లమెంటుకు, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్ని కలపై ప్రారంభమైన నిర్మాణాత్మక చర్చను కొనసాగించాలని ముఖ్యమంత్రులను కోరారు. ఒకేసారి ఎన్నికల నిర్వహణ మనకు కొత్తేమీ కాదు. దేశంలో 1967 వరకూ ఆ పద్ధతే అమల్లో ఉంది. అంటే 1952, 1957, 1962, 1967ల్లో లోక్సభకూ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకూ ఏకకాలంలో ఎన్నికలు జరిగాయి. అంతవరకూ ఏ ఎన్నిక జరిగినా తిరుగులేని విజయం సాధిస్తూ వచ్చిన కాంగ్రెస్ తొలిసారి 1967 లోక్సభ ఎన్నికల్లో బలహీనపడటంతోపాటు కొన్ని రాష్ట్రాల్లో బాగా దెబ్బతింది. అలాంటి చోట చిన్న పార్టీలు విజయం సాధించి కూటములుగా ఏర్పడి సంకీర్ణ ప్రభుత్వాలు నెలకొల్పాయి. ఆ ప్రభుత్వాలు ఎన్నాళ్లో మనుగడ సాధించలేకపోయాయి. మరో పక్క ఇందిరాగాంధీ 1971లో లోక్సభను రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు సిద్ధపడ్డారు. ఫలితంగా జమిలి ఎన్నికల సంప్రదాయానికి గండిపడింది. అప్పటినుంచీ దేశంలో ఇంచుమించు ఏడాదికో, రెండేళ్లకో ఏదో ఒక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు వస్తూనే ఉన్నాయి. జమిలి ఎన్నికలు పోయి ఇలా వేరు ఎన్నికలు రావడంలో నిజంగా సమస్య లున్నాయా? ఉంటే ఎవరికున్నట్టు? వాజపేయి నేతృత్వంలో 1999లో ఎన్డీఏ ప్రభుత్వం ఉండగా లా కమిషన్ సమ ర్పించిన 170వ నివేదిక ఎన్నికల సంస్కరణలపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరిం చింది. అందులో జమిలి ఎన్నికల అవసరాన్ని చర్చించింది. 2012లో బీజేపీ సీనియర్ నేత ఎల్కే అడ్వాణి రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీకి ఈ అంశంపై లేఖ రాశారు. నిరుడు సెప్టెంబర్లో ప్రణబ్ ముఖర్జీయే ఏకకాలంలో ఎన్నికలపై అన్ని పార్టీలూ ఏకాభిప్రా యానికి రావాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సంఘం సరేసరి. అది సందర్భం వచ్చిన ప్పుడల్లా ఈ ప్రతిపాదన గురించి చెబుతూనే వస్తోంది. పార్లమెంటరీ స్థాయీ సంఘం కూడా జమిలి ఎన్నికలకే ఓటేసింది. చాలా పార్టీలు కూడా ఈ ప్రతిపాదన సహేతుకమై నదని అంటున్నాయి. కాకపోతే ఆచరణ సాధ్యంకాదని పెదవి విరుస్తున్నాయి. ఎందుకంటే అందుకోసం కొన్ని అసెంబ్లీల గడువు కాలాన్ని పెంచాల్సి ఉంటుంది. మరికొన్నిటికి కోత వేయాల్సివస్తుంది. ఇలా ఇంతమంది ఇన్ని రకాలుగా చెబుతున్నారు... కోరుకుంటున్నారు గనుక అది మంచిదే కావొచ్చునని భావించనవసరం లేదు. నిజమే–జమిలి విధానం వల్ల ఎన్నికల వ్యయం గణనీయంగా తగ్గిపోతుంది. ఆర్ధిక ఇబ్బందులతో సతమతమయ్యే మన దేశంలో ఈ ఇది చెప్పుకోదగ్గ ఆదాయే. కొంత మేర నల్ల డబ్బు ప్రభావమూ తగ్గొచ్చు. దీన్ని సమర్ధించేవారు చెబుతున్న బలమైన కారణం మరొకటుంది. అది ప్రభుత్వ విధానాలకు సంబంధించింది. తరచు ఎన్నిక లుండటం వల్ల ప్రభుత్వ విధానాలకూ, కార్యక్రమాలకూ గండిపడుతున్నదని జమిలి ఎన్నికల సమర్ధకులు చెప్పే మాట. ఏ ఏ సందర్భాల్లో గండి పడిందో ఇలాంటివారు నిర్దిష్టమైన ఉదాహరణలిస్తే అందులోని లాభనష్టాలపై చర్చించవచ్చు. చిల్లర వర్త కంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్డీఐ) అనుమతించడానికి సంబంధించిన బిల్లుపై 2012లో దేశవ్యాప్తంగా నిరసనలొచ్చినా, రాజ్యసభలో అప్పట్లో యూపీఏ ప్రభుత్వం మైనారిటీలో ఉన్నా ఆ బిల్లు సునాయాసంగా నెగ్గింది. ఆ బిల్లును వ్యతి రేకిస్తున్నానని చెప్పిన టీడీపీ ఆఖరి నిమిషంలో తన ఎంపీలను సభకు గైర్హాజరయ్యేలా చేసి కాంగ్రెస్కు తోడ్పడింది. బీఎస్పీ, ఎస్పీలు సైతం ఆ పనే చేశాయి. కనుక ప్రభు త్వాలకు జీవన్మరణ సమస్యగా మారిన కీలక సంస్కరణలేవీ ఎన్నికల కారణంగా ఎప్పుడూ ఆగలేదు. ఎన్నో వైవిధ్యతలున్న దేశంలో జమిలి ఎన్నికలతో ఏకరూపత సాధించాలను కోవడంలోని తర్కమేమిటో బోధపడదు. వేర్వేరు ఎన్నికలుండటంవల్ల ప్రజా స్వామ్యం, ఫెడరలిజంలు పరిఢవిల్లుతాయి... పరిపుష్టమవుతాయే తప్ప బలహీనప డవు. రాష్ట్రాల ఎన్నికల్లో ప్రాంతీయ ఆకాంక్షలు, సమస్యలు ఎజెండాలోకి వస్తాయి. అభివృద్ధికి సంబంధించి వేర్వేరు రాష్ట్రాల ప్రజలు వేర్వేరు మార్గాలు ఎంచుకుంటారు. ఒక రాష్ట్రంలో ఎంతో ప్రజాదరణ పొందిన పార్టీ మరోచోట ఎవరికీ తెలియక పోవచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, 108 వంటివి ఇతర కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో లేవు. మరోపక్క విపక్షాల ఏలుబడిలోని చాలా రాష్ట్రాలు ఆ పథకాలను అమలు చేసి అనంతర కాలంలో ప్రజాదరణ పొందాయి. జమిలి ఎన్నికల్లో ప్రాంతీయ ఆకాంక్షలు, సమస్యలు మరుగునపడతాయి. సృజనాత్మకత, ప్రజా సంక్షేమ పథకాల అమలులో పోటీ తగ్గుతాయి. జాతీయ అంశాలే ప్రధానమవుతాయి. ఇది ఫెడరలిజం స్ఫూర్తికి హాని కలిగిస్తుంది. 1999 మొదలుకొని జరిగిన జమిలి ఎన్నికల ఫలితాలకు సంబంధించిన డేటాను గమనిస్తే కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ ఒకే పార్టీకి ఓటేసే అవకాశాలు 77 శాతం ఉంటాయని తేలిందని ఒక పరిశోధన తేల్చిచెప్పింది. ఒకేసారి ఎన్నికలకు వెళ్లాలన్న విధానం అటు పౌరులకు, ఇటు ప్రభు త్వాలకు కూడా గుదిబండగా మారుతుంది. ఒక అంశంపై అధికార పక్షం స్వేచ్ఛగా ప్రజల తీర్పు కోరడానికి సిద్ధపడటం అసాధ్యమవుతుంది. అటు ప్రజలు సైతం అలా డిమాండ్ చేసే హక్కు కోల్పోతారు. నిజానికి అభివృద్ధి చెందిన అమెరికా, జర్మనీ తది తర దేశాల్లో కూడా జమిలి ఎన్నికల విధానం అమల్లో లేదు. పైగా అధికార పక్షం మైనా రిటీలో పడితే ఏం చేయాలో జమిలి ఎన్నికలు కోరేవారు చెప్పడంలేదు. ప్రస్తుత ఎన్నికల విధానంలో సమస్యలున్న మాట వాస్తవం. ముఖ్యంగా ఎన్ని కల వ్యయం, నల్ల డబ్బు చలామణి అంతకంతకూ పెరుగుతున్నాయి. వీటి కట్టడికి ఏం చేయాలో, ఎన్నికలు జరిగే తీరును ప్రక్షాళన చేసేందుకు ఇంకేమి చర్యలు అవసరమో ఎన్నికల సంఘం చర్చించాలి. పార్టీలకు ఎన్నికల నిధుల్ని ప్రభుత్వం సమకూర్చడంతో సహా అనేక ప్రతిపాదనలు ముందుకొస్తున్నాయి. పార్టీలన్నీ చిత్త శుద్ధితో వ్యవహరిస్తే ఈ అంశాల్లో ఏకాభిప్రాయం కష్టం కాదు. ప్రభుత్వాలు ప్రజాకంటకంగా మారిన ప్పుడు పౌరులకు ‘రీకాల్’ చేసే హక్కుండాలని వాదనలు వినిపిస్తున్నవేళ... అందుకు అసలే అవకాశమీయని జమిలి ఎన్నికలు ప్రధాన చర్చగా మారడం వింత కలిగిస్తుంది.