breaking news
Indian IT industry employees
-
Green Card: గ్రీన్ కార్డులకు కోటా రద్దు
వాషింగ్టన్: అమెరికాలో శాశ్వత నివాస హక్కు(గ్రీన్ కార్డు) పొందేందుకు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న భారతీయ ఐటీ నిపుణుల కల సాకారమయ్యే పరిణామమిది. గ్రీన్ కార్డుల జారీకి ఇప్పటివరకు ఉన్న దేశాలవారీ కోటాను ఎత్తివేయాలనే ప్రతిపాదనకు ప్రతినిధుల కాంగ్రెస్ భారీ మెజారిటీతో ఆమోదం తెలిపింది. జో లోఫ్గ్రెన్, జాన్ కర్టిస్ అనే సభ్యులు ‘ది ఈక్వల్ యాక్సెస్ టు గ్రీన్ కార్డ్స్ ఫర్ లీగల్ ఎంప్లాయ్మెంట్(ఈఏజీఎల్ఈ)చట్టం– 2021’ను సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు అనుకూలంగా 365 మంది వ్యతిరేకిస్తూ 65 మంది ఓటేశారు. సెనేట్ ఆమోదం కూడా పొందితే అధ్యక్షుడు బైడెన్ సంతకంతో ఈ ప్రతిపాదనలు చట్ట రూపం దాల్చుతాయి. ప్రస్తుత వలస విధానంలో భారత దేశానికి కేటాయించిన 7 శాతం కోటా.. హెచ్–1బీ వర్కింగ్ వీసాపై అమెరికాలో ఉంటున్న అత్యున్నతస్థాయి భారతీయ నిపుణులకు గ్రీన్కార్డు లభించడంలో ప్రధాన అడ్డంకిగా మారింది. తాజా బిల్లులో, 7 శాతం పరిమితిని ఎత్తివేయడంతోపాటు ఈ కోటాను 15 శాతానికి పెంచాలని ప్రతిపాదించారు. ఈ సందర్భంగా ఇమిగ్రేషన్, సిటిజన్ షిప్పై ఏర్పాటైన కాంగ్రెస్ ఉప కమిటీ చైర్మన్ లోఫ్గ్రెన్ మాట్లాడుతూ.. ‘తాజా నిబంధనలు అమలైతే, నైపుణ్యాల ఆధారంగా గ్రీన్కార్డులు అందుతాయి. అమెరికా కంపెనీలు ఉత్పత్తులు, సేవలు, ఉద్యోగాలను కల్పించేందుకు గాను అత్యున్నత స్థాయి నిపుణులను ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది’అని లోఫ్గ్రెన్ పేర్కొన్నారు. ప్రస్తుత నిబంధనలపై సుమారు 10 లక్షల మంది భారతీయ నిపుణులు ఆందోళన చెందుతున్నారు. -
మహిళలకు వేతనాలు తక్కువే!
* భారతీయ ఐటీ కంపెనీలపై రీసెర్చ్ సంస్థ నివేదిక * పురుషులతో పోలిస్తే వ్యత్యాసం పెరుగుతోందని వెల్లడి న్యూఢిల్లీ: భారతీయ ఐటీ పరిశ్రమ ఉద్యోగుల్లో మహిళలు, పురుషుల మధ్య వ్యత్యాసం భారీగా పెరుగుతోందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. వేతనాల పెంపు విషయంలో మహిళలు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకోవాలంటూ వ్యాఖ్యానించి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఉదంతం నేపథ్యంలో ఇది ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, ఆరంభంలో ఒకే స్థాయి వేతనాలతోనే మహిళ, పురుష ఉద్యోగులు తమ కెరీర్ను మొదలు పెడుతున్నప్పటికీ.. కొంతకాలానికి వేతనాల్లో వ్యత్యాసం ఎగబాకుతోందని కెటలిస్ట్ ఇండియా డబ్లూఆర్సీ అనే సంస్థ తన అధ్యయన నివేదికలో పేర్కొంది. మహిళలకు వేతనాలు తక్కువగా ఉంటున్నాయని తెలిపింది. కాగా, నాదెళ్లలాంటి దిగ్గజ వ్యక్తి ఇలా వ్యాఖ్యానించడం దురదృష్టకరమని.. అయితే, తన తప్పును వెంటనే అంగీకరించి ఆయన క్షమాపణ చెప్పడం గొప్పవిషయమని కెటలిస్ట్ ఇండియా డబ్ల్యూఆర్సీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ షాచి ఇర్డే పేర్కొన్నారు. సుమారు 58 దిగ్గజ కార్పొరేట్ కంపెనీలు, ప్రొఫెషనల్ సంస్థల నుంచి సేకరించిన సమాచారంతో ఈ నివేదికను రూపొందించింది. అన్నిరంగాల్లోనూ...: వ్యాపారం, ఆర్థిక రంగం, సామాజిక రంగం ఇలా మగాళ్లకు అవకాశాలున్న ప్రతిచోటా మహిళలకూ అవకాశాలు ఇవ్వాల్సిందేనని ఇర్డే అన్నారు. ఒక్క టెక్నాలజీ రంగంలోనే కాకుండా.. ఇతర పారిశ్రామిక రంగాల్లోనూ ఉద్యోగుల వేతనాల్లో స్త్రీ-పురుష వ్యత్యాసం స్పష్టంగా కనబడుతోందని కెటలిస్ట్ గ్లోబల్ రీసెర్చ్ పేర్కొంది. ‘భారత్ విషయానికొస్తే... టెక్నాలజీ రంగంలో మేం చేసిన అధ్యయనం ప్రకారం మహిళలు-పురుషులు ఇద్దరూ ఒకే విధమైన బాధ్యతలు, వేతనాలతో ఉద్యోగాల్లో చేరుతున్నారు. అయితే, కొంతకాలం గడిచేసరికి వేతనాల్లో తేడా భారీగా ఉంటోంది. దాదాపు 12 ఏళ్ల కెరీర్ను చూస్తే.. పురుషులతో పోలిస్తే మహిళా ఉద్యోగులకు సుమారు రూ.3.8 లక్షల మేర వేతన వ్యత్యాసం ఉంటోంది. ఈ తేడాను తొలగించేందుకు నాయకత్వపరమైన, పటిష్ట చర్యలు అవసరం’ అని ఇర్డే వ్యాఖ్యానించారు.