breaking news
harvesting water
-
వరుణుడిపైనే ఖరీఫ్ ఆశలు
దుర్భిక్షం వర్షాలు కురిస్తేనే సాగునీరు దేవుడిపైనే భారం ఎండిన మంచినీటి చెరువులు గ్రామాల్లో దాహం కేకలు విజయవాడ సిటి : ఈ ఏడాది ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారింది. జూన్ నెల పూర్తికావస్తున్నా నేటికి చినుకు రాలకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. సాగునీటి కోసం 20 రోజుల నుంచి ఎదురుచూపులు చూస్తున్నా వరుణుడు కరుణించకపోవడంతో కాలువలు, చెరువులు ఎండిపోయాయి. దుక్కులు దున్ని చినుకురాక కోసం ఎదురుచూపులు చూస్తున్న రైతన్నలు ఈ ఏడాది ఖరీఫ్ సాగు ఎలా చేపట్టాలో అర్థం కాక అయోమయంలోపడ్డారు. వర్షాలు కురిస్తేనే సాగునీరు విడుదలయ్యే అవకాశం ఉండడంతో వచ్చేనెల వరకు సాగునీటి విడుదల కష్టమని అధికారులు చెబుతున్నారు. మరోవైపు కనీసం మంచినీటికైనా నీరు విడుదల చేస్తారో లేదోనని ప్రజలు ఆందోళన చెం దుతున్నారు. ఈక్రమంలో రుతుపవనాలు జాడ లేక వర్షం కురవకపోవడం, భూగర్భజలా లు అడుగంటడంతో కృష్ణా జిల్లాలో తీవ్ర కరువుపరిస్థితులు నెలకొన్నాయి. పశ్చిమ కృష్ణా మెట్టప్రాంతంలో నెలరోజులుగా వర్షాలు లేక మంచినీటికి కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.మచిలీపట్నం, గుడివాడ, అవనిగడ్డ, చల్లపల్లి, ఉయ్యూరు, డెల్టాప్రాంతంలో కూడా అదే పరిస్థితి నెల కొంది. జిల్లాలో రెండువేలకు పైగా మంచినీటి చెరువులు ఎండిపోయాయి. జూన్లో కూడా విపరీతమైన వడగాడ్పులు వీస్తుండడంతో జిల్లాలో డెల్టా, మెట్ట ప్రాంతాలలో ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఎగువ నుంచి నీరు వచ్చేనా? కర్ణాటకలో కూడా వర్షాలు లేకపోవడంతో ఆల్మట్టీ, నారాయణపూర్ డ్యామ్లలో కూడా జలసిరులు నిండుకున్నాయి. ఈరెండు ప్రాజెక్టులు నిండితేనే శ్రీశైలం,సాగర్లోకి నీరు చేరి దిగువనున్న కృష్ణానదికి విడుదల చేసే పరిస్థితి ఉంది. ఎగువ ప్రాంతంలో కర్ణాటక, మహారాష్ట్ర, సాగర్లో వర్షపు నీరు కిందికి వస్తే కృష్ణా డెల్లాకు నీరు విడుదల అయ్యే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. మరోవైపు రాష్ట్ర విభజన జరగడం తెలంగాణా ఎగువ నుంచి నీరు విడుదల మరో సమస్యకానుంది. తూర్పు కృష్ణాలో ఆరున్నర లక్షల ఎకరాల్లో ప్రతి ఏటా వరినాట్లు వేస్తారు. జూలైలో కూడా సాగు నీరు విడుదల కాకపోతే నాట్లు ఆలస్యమై సెప్టెంబర్, నవంబర్ నె లలో తుఫానులు అధికంగా వచ్చే సీజన్లో పంట దెబ్బతింటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పశ్చిమ కృష్ణాలో అదే పరిస్థితి ఎండవేడిమి, విద్యుత్ కోతలతో పశ్చిమకృష్ణా మెట్ట ప్రాంతంలో నాలుగున్నర లక్షల మెట్టపొలాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈప్రాంతంలో దాదాపు వెయ్యికి పైగా చెరువులురెండు నెలలుగా ఎండిపోయాయి. మరో వైపు ఎండవేడిమి, విద్యుత్ కోతలతో వ్యవసాయ బోర్లు సరిగా పని చేయడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరువూరు, మైలవరం, జగ్గయ్యపేట, నంది గామ, నూజివీడు, విస్సన్నపేట ప్రాంతాల్లో కూడా ప్రజలు మంచినీటికి అల్లాడుతున్నారు. పశువులకు కూడా నీటి కొరత ఏర్పడడంతో పశుపోషకులు ఇబ్బందులు పడుతున్నారు. అడుగంటిన భూగర్బజలాలు కొద్ది రోజులుగా ఎండవేడిమికి భూగర్భజలాలు కూడా అడుగంటాయి. బావులలో, బోర్లలో నీరు లోతుకు వెళ్లాయి. జిల్లాలో డెల్టా ప్రాంతంలో 4.90మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉన్నాయి. మెట్టప్రాంతంలో 1.20మీటర్ల లోతులోకి వెళ్లాయని అధికారులు తెలిపారు. జిల్లా సగటున 8.75 మీటర్ల లోతుకు వెళ్లి నట్లు భూగర్బజల అధికారులు వివరించారు. గత నెల కంటే ఈ నెలలో రెండు మీటర్ల లోతుకు భూగర్బజలాలు వెళ్లాయి. 25 నుంచి నీరు విడుదల ప్రభుత్వం ఈ నెల 25 నాటికి కృష్ణా డెల్లాకు మంచినీరు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. ఈ నెల 20 నాటికి డెల్టాలో అన్నికాలువలు మరమ్మతులు పూర్తిచేసి అప్పగించాలని అధికారులు కాంట్రాక్టర్లను ఆదేశించారు. ై వర ్షపు నీటితోనైనా తాగడానికి నీరు ఇచ్చేం దుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. -
శివారు చేలు...నైస్తున్నాయ్
సాగునీరందక అన్నదాత కష్టాలు పది రోజులుగా విడుదల కాని నీరు దిగుబడి తగ్గిపోతుందంటున్న రైతులు శివారు ప్రాంతాల్లో చేలన్నీ నోళ్లు తెరుస్తున్నాయ్.. పదిరోజులుగా పొలాలకు నీరందక.. పంట దక్కే పరిస్థితి కానరాక రైతులు ఆందోళనకు గురవుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే పెట్టుబడులు కూడా రాదని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. మచిలీపట్నం, న్యూస్లైన్ : దాళ్వా సాగులో అన్నదాతకు అన్నీ కష్టాలే మిగులుతున్నాయి. సాగునీరు సక్రమంగా అందకపోవటంతో ఎన్నో ఆశలతో వరిసాగు చేసిన రైతులకు నిరాశే మిగిలే పరిస్థితి దాపురించింది. సాగునీటిని విడుదల చేయండి మహాప్రభో అంటూ రైతులు చేస్తున్న మొర నీటి పారుదల శాఖాధికారులకు పట్టడం లేదు. రేపు, మాపు అంటూ అధికారులు చెప్పటమే తప్ప కాలువల్లో నీటిమట్టం పెరిగిన దాఖలాలు లేవు. శివారు ప్రాంతాల్లోని పొలాల్లో పైరు ఎండిపోతున్నా చుక్కనీరు విడుదల చేసేందుకు అధికారులు చొరవ చూపకపోవటంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మూడు లక్షల ఎకరాల్లో రబీలో వరిసాగు జరగాల్సి ఉంది. సాగునీటి విడుదలలో జాప్యం కారణంగా 2.65 లక్షల ఎకరాల్లోనే వరిసాగు జరిగింది. నాలుగు రోజుల పాటు నీరు ఇవ్వటం, పది రోజుల పాటు ఇవ్వకపోవటంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సకాలంలో సాగునీరు విడుదల కాకుంటే ఈ ప్రభావం దిగుబడులపై పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పది రోజులుగా విడుదల కాని నీరు... సముద్రతీరంలోని కోడూరు, నాగాయలంక, బందరు, పెడన, కృత్తివెన్ను, బంటుమిల్లి మండలాల్లో దాళ్వా పంటను సాగు చేశారు. కోడూరు, నాగాయలంక మండలాలకు కేఈబీ కాలువ ద్వారా సాగునీరు అందాల్సి ఉంది. కోడూరు మండలంలోని ఊటగుండం, మందపాకల, పోటుమీద గ్రామాలకు కాలువల ద్వారా సక్రమంగా నీరు అందకపోవటంతో పొలాలు నెర్రెలిచ్చాయి. బుధవారం నీటిపారుదల శాఖ ఎస్ఈ శ్రీనివాసరావు, ఈఈ గంగయ్య ఊటగుండం గ్రామానికి వచ్చారు. అక్కడున్న పరిస్థితులను చూసి.. పొలాలు నెర్రెలిచ్చి కనపడటంతో మారు మాట్లాడకుండా వెళ్లిపోయారని రైతులు చెబుతున్నారు. గురువారం కోడూరు ప్రధాన కాలువలో కొంతమేర నీటి మట్టం పెరిగినా శివారు ప్రాంతాలకు ఇంకా నీరు చేరలేదని ఊటగుండం, పోటుమీద గ్రామాల రైతులు చెబుతున్నారు. బందరు మండలంలోని పెదయాదర, తుమ్మలచెరువు, తుమ్మలపాలెం, వాడగొయ్యి, చిన్నాపురం తదితర ప్రాంతాలకు 9/8, 9/7, 9/6, 9/5, 9/3 కాలువల ద్వారా సాగునీరు సరఫరా కావాల్సి ఉంది. ఈ కాలువలన్నింటికి తొమ్మిదో నంబరు ప్రధాన కాలువ ద్వారా నీరు విడుదల కావాల్సి ఉంది. గత పది రోజులుగా ప్రధాన కాలువలో నీటి మట్టం పడిపోవటంతో అన్ని గ్రామాల్లోని పొలాలూ నెర్రెలిచ్చి దర్శనమిస్తున్నాయి. అధికారులకు రైతులు ఫోన్ చేసి సాగునీరు విడుదల చేయాలని కోరితే సాయంత్రానికి కాలువ మట్టం పెరుగుతుందని చెప్పటమే తప్ప ఆచరణలో జరగటం లేదని రైతులు వాపోతున్నారు. పది రోజుల పాటు పొలానికి నీరు అందకుంటే ఈ ప్రభావం దిగుబడిపై పడి ఖర్చులు కూడా రావని రైతులు చెబుతున్నారు. బంటుమిల్లి మండలంలోని సాతులూరు, ముంజులూరు, పెదతుమ్మిడి గ్రామాల్లో సాగునీటి ఎద్దడి అధికంగా ఉంది. కృత్తివెన్ను మండలం లక్ష్మీపురం లాకుల వద్ద ఐదు అడుగుల నీటి మట్టం ఉంటే శివారు ప్రాంతాలకు సాగునీరు అందుతుంది. ఈ లాకుల వద్ద కేవలం మూడడుగుల నీటి మట్టం ఉండటంతో చివరి భూములకు సాగునీరు అందటం లేదు. కృత్తివెన్ను మండలంలోని గరిసిపూడి, చందాల, దోమలగొంది, లక్ష్మీపురం, చినపాండ్రాక తదితర గ్రామాల్లో పొలాలు నెర్రెలిచ్చాయి. ప్రధాన కాలువల్లోనే నీటి మట్టం తగ్గిపోవటంతో రైతులు పంటను కాపాడుకునేందుకు ఆయిల్ ఇంజన్లను వాడుతున్నారు. ఉన్న కొద్దిపాటి నీటిని ఆయిల్ ఇంజన్ల ద్వారా మళ్లిస్తుండటంతో దిగువకు నీరు చేరని పరిస్థితి నెలకొంది. దీనికి తోడు ఎగువ ప్రాంతాల రైతులు నీటిపారుదలశాఖ అధికారులు, సిబ్బందిని తమ దారిలోకి తెచ్చుకుని ప్రధాన కాలువలకు అడ్డుకట్టలు వేసి నీటిని దిగువకు వెళ్లకుండా దారి మళ్లిస్తున్నారు. ప్రస్తుతం వరి పైరు చిరుపొట్ట, పొట్టదశలో ఉందని ఈ సమయంలో పైరుకు నీరు అందకుంటే కంకులు లోపలే అవిసిపోతాయని రైతులు చెబుతున్నారు. దాళ్వాకు ఎకరానికి ఇప్పటికే రూ.15 వేలకు పైగా ఖర్చు చేశామని నీరు విడుదల చేయకుంటే ఖర్చంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుందని ఆవేదన చెందుతున్నారు.