breaking news
h1n1 influenza
-
తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తున్న సీజనల్ ఫ్లూ జ్వరాలు
ఇటీవల తెలుగురాష్ట్రాల్లో ఇన్ఫ్లుయెంజా (ఫ్లూ) జ్వరం స్వైరవిహారం చేస్తోంది. పెద్దఎత్తున ప్రజలు దీని బారిన పడుతున్నారు. అయితే ఇవేమీ కొత్త జ్వరాలు కావు. దాదాపు ప్రతి ఏడాదీ వస్తూ ఉండే సీజనల్ జ్వరాలుగానే చెప్పవచ్చు. కాకపోతే ఇవి వైరస్ వల్ల వచ్చే జ్వరాలు కావడంతో ప్రతి ఏడాదీ... ఇన్ఫ్లుయెంజా వైరస్ తన జన్యుస్వరూపం మార్చుకుంటూ వచ్చిన... ప్రజలను బాధిస్తూ ఉంటుంది. మొట్టమొదట తెలుసుకోవాల్సింది ఏమిటంటే... ఇన్ఫ్లుయెంజా అనేది వైరస్తో వచ్చే జ్వరం కావడం వల్ల దీనికి యాంటీబయాటిక్స్ పనిచేయవు. దీనికి యాంటీవైరల్ మెడిసిన్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే వైరస్ సోకిన 48 గంటలలోపు ఇవ్వకపోతే ఆ వైరస్ నశించదు. అటు తర్వాత వైరస్ తీవ్రత దానంతట అదే నెమ్మదిస్తుంది. కాకపోతే ఈలోపు మనిషిని తీవ్రమైన నీరసానికి, నిస్సత్తువకూ గురిచేసి బాధిస్తాయి. ముప్పు ఎవరెవరిలోనంటే... ఆస్తమా, ఎంఫసిమా, సీవోపీడీ వంటి దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నవారు.డయాబెటిస్ బాధితులు వృద్ధులు, చిన్నపిల్లల వంటి రోగనిరోధక శక్తి తక్కువగా ఉండేవారు, గర్భిణులూ, గుండెజబ్బు బాధితుల వంటి వారిలో ఫ్లూ జ్వరం ప్రమాదకరం కావచ్చు. లక్షణాలు ఇలా... హెచ్1ఎన్1లో కనిపించే తొలి లక్షణాలు సాధారణ ఫ్లూ లేదా వైరల్ జ్వరం లాగానే ఉంటాయి. అకస్మాత్తుగా తీవ్రమైన జ్వరం రావడం (హై ఫీవర్... ఇది ఒక్కోసారి 103 ఫారెన్హీట్ వరకూ పెరగవచ్చు) ,పొడి దగ్గు, గొంతు నొప్పి, ముక్కు దిబ్బడ, ముక్కు ఎర్రబారడం, తీవ్రమైన ఒళ్లునొప్పులు ,బాగా నీరసంగా అనిపించడం, కొందరిలో కడుపునొప్పి కూడా రావచ్చు. వ్యాధినిరోధక శక్తి బలంగా ఉన్నవారిలో రెండు మూడు రోజుల్లోనే లక్షణాలు వాటంతట అవే తగ్గిపోవచ్చు. అయితే కొంతమందిలో నీరసం, నిస్సత్తువ, ఒళ్లునొప్పుల వంటివి రెండు వారాల వరకు తగ్గకపోవచ్చు. జ్వరం అనంతర దుష్ప్రభావాలుచాలామందిలో లక్షణాలు తగ్గిపోయినప్పటికీ కొందరిలో మాత్రం వైరస్ ఊపిరితిత్తుల వరకు చేరి వైరల్ న్యూమోనియాకూ, ఇంకొందరిలో వైరల్ న్యూమనైటిస్కూ, ఇది మరికొందరిలో మరింత తీవ్రమైతే ఏఆర్డీఎస్ (అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రేస్ సిండ్రోమ్) అనే తీవ్రమైన శ్వాస సమస్యలకూ దారితీయవచ్చు. అరుదుగా ఇంకా మరికొందరిలో గుండె కండరం కాస్తంత దెబ్బతిని గుండె కండరాల వాపు (మయోకార్డిటిస్) సమస్య రావచ్చు. ఇక ఈ ఫ్లూ ప్రభావం కారణంగా వ్యాధినిరోధక శక్తి కొద్దిగా తగ్గడం వల్ల మరికొందరిలో ఫ్లూ తర్వాత బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు వచ్చే ముప్పు కూడా ఉంటుంది. ఎప్పుడెప్పుడు కనిపిస్తుందంటే... మన దేశంలో హెచ్1ఎన్1 కేసులు సాధారణంగా రెండు సీజన్లలో ప్రధానంగా కనిపిస్తుంటాయి. మొదటిదశల్లో వర్షాకాలంలో అంటే... జూలై నుంచి అక్టోబర్ వరకు (ప్రస్తుతం ఈ స్పెల్ నడుస్తోంది) ఇక రెండో దశ చలికాలంలో అంటే... ప్రధానంగా డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు. ఆ టైమ్లో కూడా అప్రమత్తంగా ఉండటం అవసరం. సాధారణంగా సీజనల్ ఫీవర్లా వచ్చే ఈ ఫ్లూ పెద్దగా ప్రమాదకరం కాదుగానీ... మొదటి 48 గంటల పాటు చాలా అప్రమత్తంగా ఉండాలి. దాదాపు తేలిగ్గానే తగ్గిపోయే ఈ ఫ్లూ జ్వరం మాత్రం కొన్నిసార్లు ప్రాణాపాయ స్థితికి దారితీయవచ్చు. అందుకే మొదటి 48 గంటల సమయం కూడా కీలకమని గుర్తించాలి. ఫ్లూ వ్యాప్తి ఇలా... ఈ ఫ్లూ జ్వరం తాలూకు వైరస్ గాలి ద్వారానే ఒకరి నుంచి మరో వ్యక్తికి వ్యాపిస్తుంటుంది. ప్రధానంగా వ్యాధి సోకిన బాధితుడు మాట్లాడుతున్నప్పుడు, దగ్గుతున్నప్పడు లేదా తుమ్మినప్పుడు బయటకు వచ్చే తుంపర్ల ద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది.పరోక్ష పద్ధతుల్లోనైతే... బాధితుడి తుంపర్లు డోర్ నాబ్స్ మీద లేదా వారు వాడిన ఫోన్ మీదగానీ లేదా వారు ముట్టుకున్న మెట్ల రెయిలింగ్స్ మీద పడ్డ తర్వాత, వేరొకరు వాటిని ముట్టుకున్నప్పుడు కూడా వైరస్ వ్యాపిస్తుంది. ఈ తరహా వ్యాప్తిని ‘ఫోమైట్’వ్యాప్తిగా చెబుతారు. వైరస్ సోకగానే లక్షణాలు బయటకు కనిపించకపోయినప్పటికీ... అప్పట్నుంచే వైరస్ అతడి నుంచి మరొకరికి వ్యాపించవచ్చు. అలాగే జ్వరం మొదలయ్యాక దాదాపు వారం రోజుల వరకు వైరస్ ఇతరులకు సోకే అవకాశం ఉంటుంది.నివారణ మార్గాలు ఇలా.. కోవిడ్ సమయంలో పాటించిన జాగ్రత్తల వంటివి అంటే మాస్క్ పెట్టుకోవడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, శానిటైజర్స్ వాడటం వంటి జాగ్రత్తలు పాటించాలి. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచడం, ఇంటి కిటికీలు తెరిచి గాలి సరిగా తిరిగేలా చేయడం ద్వారా మూసిన గదుల్లో వైరస్ వ్యాప్తి అవకాశాన్ని తగ్గించాలి. నీళ్లు, గోరు వెచ్చని సూప్, ఓఆర్ఎస్ వంటి ద్రవాలు / ద్రవాహారాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. శరీరం డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలి. ఊపిరితిత్తుల వ్యాధులు, గుండెజబ్బులు, డయాబెటిస్ బాధితుల వంటి వారు మరింత అప్రమత్తంగా ఉండటంతో పాటు ఫ్లూ నివారణ కోసం ప్రతి ఏడాదీ ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవాలి.జలుబుతో ఇవీ పోలికలు... ఈ ఫ్లూ జ్వరానికి సాధారణ జలుబుతోనూ కొన్ని పోలికలు కనిపిస్తుంటాయి. సాధారణ జలుబులోలాగే ఒళ్లునొప్పులూ కనిపించవచ్చు. అయితే మొదట్లో పొడి దగ్గు వస్తూ ఉన్నప్పటికీ క్రమంగా తర్వాత్తర్వాత కళ్లె పడటం, ముక్కునుంచి స్రావాలు రావడమూ కనిపిస్తుంది. దగ్గు కూడా వస్తుంటుంది. వీటితో పాటు మెడికల్ ఎమర్జెన్సీని సూచించే లక్షణాలు కూడా కనిపిస్తాయి. ప్రధానంగా శ్వాస వేగంగా తీసుకుంటూ ఉండడం, శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది, ఛాతీ లోపలికి లాగినట్లు అనిపించడం వంటి లక్షణాలుంటాయి. పెదవులు లేదా చర్మం నీలంగా మారడం, అయోమయం, తీవ్రమైన నీరసం/నిస్సత్తువ ఉంటాయి. జ్వరం తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరగడం, పల్స్ ఆక్సిమీటర్లో ఆక్సిజన్ మోతాదులు వేగంగా తగ్గుతూ పోవడం ఆక్సిజన్ తగ్గిన లక్షణాలు, రక్తపోటు (బీపీ) అకస్మాత్తుగా పడిపోవడం కళ్లె / తెమడలో రక్తపు చారిక కనిపించడం వంటివి కనిపిస్తాయి.చికిత్స తీసుకోవడం తప్పనిసరి.. సాధారణంగా బాధితులు తీవ్రమైన జ్వరం, పొడి దగ్గు, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలుంటే డాక్టర్లను సంప్రదించాలి. ఇది వైరల్ ఫీవర్ కావడంతో దీనికి యాంటీబయాటిక్స్ పనిచేయవు. అందుకే ఈ సమస్యకు ‘ఒసెల్టామివిర్’(టామీ ఫ్లూ) అనే యాంటీ వైరల్ మందును ఇవ్వాల్సి ఉంటుంది. దీన్ని మొదటి 48 గంటలలోపు ఇవ్వడం వల్ల మంచి ప్రభావం ఉంటుంది. లక్షణాలు బలంగా కనిపిస్తూ సమస్యలు తీవ్రమైనప్పుడు ల్యాబ్ రిపోర్టు కోసం ఎదురుచూస్తూ చికిత్స ఆలస్యం చేయకూడదనే వైద్య మార్గదర్శకాలు ఉన్నందున తమ అనుభవంతో ఫ్లూను అనుమానించినప్పుడు డాక్టరు యాంటీ వైరల్ మందు ‘ఒసెల్టామివిర్’ను ఇస్తారు.ఇదీ చదవండి: శానిటైజర్ మితిమీరి వాడడం.. చర్మానికి హానికరంఅయితే కొన్నిసార్లు అవసరాన్ని బట్టి డాక్టర్లు యాంటీబయాటిక్స్ను సూచిస్తారు. ఈ ఫ్లూ ప్రభావంతో వ్యాధినిరోధక శక్తి తగ్గడంతో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ సోకి వాటి లక్షణాలూ కనిపిస్తున్నప్పుడు యాంటీబయాటిక్స్ను సూచిస్తారు. జ్వరం, ఒళ్లునొప్పులు తగ్గడానికి పారాసిటమాల్ ఇస్తారు. దగ్గు తగ్గడానికి కాఫ్ సిరప్లను సూచిస్తారు. కొందరిలో ఫ్లూ తీవ్రంగా మారి, ఊపిరితిత్తులను ప్రభావితం చేయడం వల్ల శ్వాస తీసుకోవడం కష్టమై, రక్తంలో ఆక్సిజన్ తగ్గి, ఐసీయూలో చేర్చాల్సిన పరిస్థితీ రావచ్చు. బాధితుల్లో ఆక్సిజన్ సాచ్యురేషన్ తగ్గినప్పుడు ఐసీయూలో చేర్చి ఆక్సిజన్ ఇవ్వాల్సిరావచ్చు. అందుకే పల్స్ ఆక్సిమీటర్లో ఆక్సిజన్ మోతాదు 94 శాతం కంటే తక్కువగా ఉంటే తక్షణం వైద్యులను సంప్రదించాలి. – సాక్షి హెల్త్ డెస్క్ -
ఢిల్లీలో స్వైన్ ఫ్లూ కలకలం.. వైద్యుల హెచ్చరిక
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీలో వైరస్ల దాడి మొదలైంది.. మారుతున్న వాతావరణం, తేమతో H1N1 స్వైన్ ఫ్లూ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇది సాధారణ జ్వరమే అనుకుంటే పొరపాటే.. కొందరిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఆక్సిజన్ స్థాయిలు పడిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తుండటంతో వైద్యులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.తాజాగా ఢిల్లీలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన పలువురు వైద్యులు, ఇతరులు H1N1 బారినపడినట్లు సమాచారం. దీంతో ఆసుపత్రులకు ఫ్లూ లక్షణాలతో వస్తున్న రోగుల సంఖ్య కూడా పెరుగుతోంది. జ్వరం, దగ్గు, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలతో చాలామంది వైద్యులను సంప్రదిస్తున్నారు. కాగా, H1N1 సోకితే సాధారణంగా అకస్మాత్తుగా జ్వరం, పొడి దగ్గు, తలనొప్పి, గొంతునొప్పి, చలి, తీవ్ర అలసట, ఒళ్లు నొప్పులు కనిపించవచ్చు. కొన్ని సందర్భాల్లో ఇన్ఫెక్షన్ తీవ్రంగా మారి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆక్సిజన్ స్థాయిలు తగ్గడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. అయితే ప్రతి జ్వరం H1N1 అని భావించాల్సిన అవసరం లేదు. ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్లతోనూ ఇలాంటి లక్షణాలు కనిపించవచ్చు. అందుకే లక్షణాలు తీవ్రంగా ఉంటే వైద్యుల సలహా తీసుకోవడం ముఖ్యం.ఇది కూడా చదవండి: లివింగ్ బ్యాంక్లివి లవ్ డ్రా చేసుకోండి.. ఈ లక్షణాలుంటే అలర్ట్!జ్వరం, దగ్గుతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీలో నొప్పి, తగ్గని అధిక జ్వరం, గందరగోళం, పెదాలు నీలంగా మారడం లేదా లక్షణాలు క్రమంగా తీవ్రం కావడం వంటి సంకేతాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణులు, మధుమేహం ఉన్నవారు, గుండె లేదా ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి.H1N1 Alert in DelhiDelhi has issued an advisory amid concern over H1N1 (swine flu). Common symptoms include fever, cough, sore throat, runny nose, body ache, headache and tiredness. People should maintain hand hygiene, cover their mouth while coughing or sneezing, avoid…— Vishawkarmjit Singh (@Vicki_00001) August 21, 2026వ్యాప్తిని అడ్డుకోవాలంటే..ఫ్లూ, ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల వ్యాప్తిని తగ్గించేందుకు చేతులను తరచూ శుభ్రం చేసుకోవడం, దగ్గేటప్పుడు లేదా తుమ్మేటప్పుడు నోరు, ముక్కును కప్పుకోవడం, అనారోగ్యంగా ఉన్నప్పుడు ఇతరులకు దూరంగా ఉండడం, లక్షణాలు ఉన్నప్పుడు ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలి. మొత్తంగా.. ఢిల్లీలో పెరుగుతున్న ఫ్లూ కేసుల నేపథ్యంలో భయపడాల్సిన అవసరం లేకపోయినా, నిర్లక్ష్యం మాత్రం చేయొద్దని వైద్యులు సూచిస్తున్నారు. సాధారణ జ్వరం అనుకుని వదిలేయకుండా.. లక్షణాలు తీవ్రంగా మారుతున్నాయా? శ్వాసలో ఇబ్బంది ఉందా? అనే విషయాలను గమనించడం కీలకం. -
అప్రమత్తతే అత్యంత కీలకం.. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదకర పరిస్థితులు!
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: ఇన్ఫ్లూయెంజా లైక్ ఇల్నెస్ (ఐఎల్ఐ), సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇల్నెస్ (ఎస్ఏఆర్ఐ)... గత కొంత కాలంగా వైద్య పరిభాషలో తరచుగా వినియోగిస్తున్న పదాలివి. ఆస్పత్రుల్లో జ్వరం, తీవ్ర శ్వాసకోశ సమస్యలకు సంబంధించిన కేసులు వేగంగా పెరుగుతున్నాయి. సీజన్ మార్పు నేపథ్యంలో జ్వరాలు, జలుబు, దగ్గు లక్షణాలు రావడం సహజమే అయినప్పటికీ ప్రస్తుతం వీటి తీవ్రత కాస్త ఎక్కువగా ఉంటోంది. వైరస్ ప్రభావంతో వస్తున్న ఈ సమస్యలను ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రమాదకర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. వైద్యుల సహకారాన్ని తీసుకోవాలని, ప్రభుత్వ వైద్య సేవలను విస్తృతం చేసిన క్రమంలో ఆస్పత్రులకు వెళ్లి చికిత్స పొందాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ హెచ్చరిస్తోంది. ఈ మేరకు దేశంలోని రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూ ప్రత్యేకంగా మార్గదర్శకాలు జారీ చేసింది. జాగ్రత్తలు తప్పనిసరి... ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐఎల్ఐ, ఎస్ఏఆర్ఐ కేసులు వేగంగా వృద్ధి చెందుతున్నాయి. రాష్ట్రాల వారీగా వచ్చిన నివేదికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తే వీటి పెరుగుదల స్పష్టమవుతోంది. ఈ క్రమంలో ఇటీవల కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. కేంద్ర మంత్రులతో పాటు నీతి ఆయోగ్ సభ్యులు, సంబంధిత శాఖలు, సంస్థలు ఈ సమావేశంలో పాల్గొన్నాయి. దేశవ్యాప్తంగా పరిస్థితులను సమీక్షించిన అనంతరం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ రాష్ట్రాలకు పలు అంశాలపై సూచనలు చేసింది. తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల్లోనూ ఈ అంశాలను ప్రస్తావిస్తూ తక్షణ చర్యలను సూచించింది. తాజాగా నమోదవుతున్న జ్వరాలు, శ్వాస కోశ సంబంధిత వ్యాధులకు కారణం హెచ్1ఎన్1, హెచ్3ఎన్2 వైరస్ ప్రభావం ఉన్నట్లు అధ్యయనా లు చెబుతున్నాయి. ఈ వైరస్ ప్రభావంతో వస్తున్న వ్యాధులు ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశా లు ఎక్కువగా ఉండటంతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. వ్యాధి లక్షణాలున్నవారు వెంటనే వైద్యుడి సంరక్షణలో జాగ్రత్తలు పాటించి చికిత్స పొందాలని చెపుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధులున్న వారిపై ఈ వైరస్ ప్రభావం అధికంగా ఉండటంతో వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. వైరస్ సోకిన వ్యక్తులతో మెదిలే సమయంలో మాసు్కలు ధరించడంతో పాటు భౌతికదూరం పాటించడం, చేతులు క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవడం లాంటి చర్యలు తప్పకుండా తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సూచనలు జారీ చేసింది. కోవిడ్–19 జాగ్రత్తలు మరవద్దు.. దేశవ్యాప్తంగా కోవిడ్ కట్టడిలో ఉన్నా.. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, వ్యాధుల తీరును పరిశీలి స్తే కోవిడ్ కేసుల పెరుగుదలకు అవకాశాలున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో టెస్టింగ్, ట్రాకింగ్, ట్రీట్మెంట్, వ్యాక్సినేషన్ అంశాలను తప్పకుండా పాటించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. జ్వరాలు, శ్వాస సంబంధిత వ్యాధులపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కలిగించాలని, జాగ్రత్త చర్యలపై చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని సూచించింది. అదేవిధంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆస్పత్రుల్లో మందులను అందుబాటులో ఉంచాలని, వైద్య పరికరాల పనితీరును సరిచూసుకోవాలని కోరింది. ఆక్సిజన్ వస తులను పునఃసమీక్షించుకోవాలని స్పష్టం చేసింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొదలు అన్ని రకాల ఆస్పత్రులను సన్నద్ధం చేయాలని ఆదేశించింది. కాగా, ‘గత కొన్ని నెలలుగా కోవిడ్–19 కేసులు గణనీయంగా తగ్గినప్పటికీ, కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ టెస్ట్ పాజిటివిటీ రేట్ క్రమంగా పెరుగుతుండటం తక్షణమే పరిష్కరించాల్సిన అంశం’అని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ శనివారం రాష్ట్రాలకు రాసిన లేఖలో పేర్కొన్నారు. కొత్తగా నమోదవుతున్న కేసులు తక్కువగానే ఉంటున్నా, కోవిడ్ కట్టడికి ఐదంచెల వ్యూహం అమలుపై అప్రమత్తంగా ఉండాలి అని కోరారు. ఇన్ఫ్లూయెంజా ఏటా సీజనల్గా వ్యాప్తి చెందేదే అయినప్పటికీ ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితులు, వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం, ఎక్కువ మంది జనం ఒకే చోట గుమికూడటం వంటి కారణాలతో హెచ్1ఎన్1, హెచ్3ఎన్2 వంటి కేసులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. -
హైదరాబాద్ పై స్వైన్ఫ్లూ పంజా
* ఒక్కరోజే ముగ్గురు మృతి, మరొకరి పరిస్థితి విషమం * ఈ ఏడాదిలో 25 మందికి సోకిన ప్రాణాంతక వైరస్ * నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ యంత్రాంగం * భయాందోళనలో నగరవాసులు సాక్షి, హైదరాబాద్: నగరంపై స్వైన్ఫ్లూ పంజా విసురుతోంది. ప్రమాదకరమైన వైరస్ బారినపడి బుధవారం ఒక్కరోజే ముగ్గురు మరణించారు. మరొకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఉప్పల్కు చెందిన శ్రీనివాస్(47) ఆదిత్య ఆస్పత్రిలో, జీడిమెట్లకు చెందిన గర్భిణి కవిత(25) గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మెదక్ జిల్లాకు చెందిన దేవరాజ్(45)ను ఓ ప్రైవేట్ ఆసుపత్రి నుంచి గాంధీకి తరలిస్తుండగా ఆయన చనిపోయారు. మెహిదీపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కార్వాన్కు చెందిన మహేశ్వరి(25) పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు హైదరాబాద్లో 25 మందికి స్వైన్ ఫ్లూ సోకగా ఆరుగురు మృత్యువాతపడ్డారు. దీంతో నగరవాసుల్లో భయాం దోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆసుపత్రుల్లో నిత్యం స్వైన్ఫ్లూ కేసులు నమోదవుతున్నాయి. రాష్ర్టంలోని ఇతర ప్రాంతాల్లో నమోదైన కేసులు కూడా నగరానికే వస్తున్నాయి. నాలుగేళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన ఈ వైరస్(హెచ్1ఎన్1 ఇన్ప్లుయాంజా) సాధారణంగా జూన్ నుంచి అక్టోబర్ మధ్య చురుగ్గా ఉంటుంది. కానీ ఇప్పుడు కూడా ఇది విజృంభిస్తుండటం ఆందోళనకు గురిచేస్తోంది. వాతావరణంలో ప్రవేశించిన తర్వాత రెండుమూడు గంటలకు మించి ఈ వైరస్ బతకదు, అయితే ప్రస్తుతమున్న ప్రతికూల పరిస్థితుల వల్ల ఇది బలపడుతున్నట్లు వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రమాద ఘంటికలు ఈ వైరస్ వ్యాప్తి అడ్డుకునేందుకు చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారు. బాధితులను ప్రత్యేక వార్డుల్లో ఉంచి, పూర్తిగా నయమయ్యాకే బయటకు పంపాలి. కానీ వైరస్ సోకిన వారు ఆస్పత్రుల నుంచి తమకుతాముగా వెళ్లిపోతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. అలా వెళ్లిన వారితో ఆ వైరస్ ఇతరులకు వ్యాపిస్తోంది. ఖైరతాబాద్ మక్తాలో స్వైన్ఫ్లూ సోకిన ఓ వ్యక్తి(40) గాంధీ ఆస్పత్రిలో రెండు రోజులపాటు చికిత్స తీసుకున్నాడు. ఆసుపత్రి నచ్చలేదంటూ మంగళవారం వెళ్లిపోయాడు. అలాగే ఈ నెల ఒకటిన అనుమానిత వైరస్తో శ్రీనగర్కాలనీకి చెందిన వ్యక్తి గాంధీ ఆసుపత్రిలో చేరాడు. ప్రపంచాన్ని వణికిస్తున్న ఎబోలా వైరస్ లక్షణాలు కనిపించడంతో నమూనాలను ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పంపి పరీక్షించారు. ఎబోలా కాదని తేలినా అది ఏ రకమైన వైరస్ అన్నది మాత్రం నిర్ధారణ కాలేదు. అయితే వైద్య సేవలు సరిగాలేవని ఆ వ్యక్తి ఆసుపత్రి నుంచి వెళ్లిపోయాడు. ఇలాంటి వారి వల్ల ఇతరులకు ముప్పు పొంచి ఉంది. ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన అధికారుల నిర్లక్ష్యానికి ఈ ఉదంతాలే నిదర్శనం. వైరస్ సోకిన వారిని ప్రత్యేక వార్డుల్లో ఉంచి, కౌన్సెలింగ్ నిర్వహించాల్సిన పర్యవేక్షణ బృందం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఆరోగ్య శాఖ డెరైక్టర్ నేతృత్వంలో జిల్లాకో బృందం ఉన్నప్పటికీ ఫలితం కనిపించడం లేదు. కాగా, రోగి వెళ్లిపోతానంటే అడ్డుకోలేమని గాంధీ వైద్యాధికారులు అంటున్నారు. అలా వెళ్లిపోయిన వారి వివరాలను ఆరోగ్య శాఖ డెరైక్టర్కు అందిస్తామని, వారి ఆధ్వర్యంలోని పర్యవేక్షణ బృందాలే తదుపరి చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు. క్షణాల్లో వ్యాపించే స్వైన్ప్లూ వంటి ప్రమాదకరమైన వైరస్ విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరముందని గాంధీ వైద్యులే వ్యాఖ్యానిస్తున్నారు.


