breaking news
Gravel quarries
-
పెట్రోమంట.. ఫీజుల మోత
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: కరోనా కష్టాల నుంచి కోలుకుంటున్న గ్రానైట్ పరిశ్రమపై మరో దెబ్బ. ఇటీవల పెంచిన ఫీజులు ఆ పరిశ్రమ మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చే పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్కసారిగా 112 శాతం ఫీజులు పెంచడంతో పరిశ్రమ కుదేలవుతుందని యాజమాన్యాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే విద్యుత్, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి సతమతమవుతుంటే ఈనెల 1 నుంచి అమల్లోకి తెచ్చిన నూతన మైనింగ్ పాలసీతో ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోని గ్రానైట్ పరిశ్రమకు గడ్డుకాలం వచ్చింది. దీంతో గ్రానైట్ రంగంలో చిన్న తరహా పరిశ్రమగా ఉన్న కంకర క్వారీలు, మిల్లులను యాజమాన్యాలు రెండు రోజులుగా బంద్ చేసి నిరసన వ్యక్తం చేస్తున్నాయి. పెంచిన ఫీజులను తగ్గించాలని ఆందోళనబాట పట్టాయి. దిక్కుతోచని స్థితిలో... నిబంధనల ప్రకారం మూడేళ్లకోసారి మైనింగ్శాఖ ఫీజులు పెంచుతుంది. ఇది కూడా కొంతమేర పెరగడంతో పరిశ్రమపై అంతగా భారం పడలేదు. కానీ 2015 తర్వాత ఒక్కసారిగా ఆరేళ్లకుగాను 112 శాతం ఫీజులను పెంచుతూ ప్రభుత్వం 17 జీఓలను విడుదల చేసింది. దీనికితోడు ఇదే నెలలో విద్యుత్ చార్జీలు కూడా పెంచడం, గత నెల రోజుల్లో డీజిల్, పెట్రోల్ రేట్లు భారీగా పెరగడంతో గ్రానైట్ పరిశ్రమల నిర్వహణ, రవాణా ఖర్చు తడిసి మోపెడవుతోంది. రాష్ట్రంలో 500 గ్రానైట్ క్వారీలు, సుమారు 1,200 గ్రానైట్ పరిశ్రమలు, 750 కంకర మిల్లులు, 2,549 కంకర క్వారీలు ఉన్నాయి. ఏ సెక్టార్నూ వదల్లేదు.. గ్రానైట్ రంగంలో ఏ సెక్టార్నూ వదలకుం డా విపరీతంగా ఫీజులు పెంచారు. ఇప్పటి వరకు ఉన్న డెడ్ రెంట్ (ఏటా చెల్లించే రుసుం), సీనరేజీ, దరఖాస్తు రుసుం, లీజు బదిలీ, లీజు పునరుద్ధరణ (రెన్యువల్) ఫీజులు, రిఫండబుల్, నాన్ రిఫండబుల్ డిపాజిట్లు భారీగా పెరిగాయి. ఒక హెక్టార్ క్వారీకి ప్రస్తుతం వార్షిక డెడ్రెంట్æ రూ.లక్ష ఉండగా, ఇప్పుడు రూ.2 లక్షలకు పెరిగింది. కలర్ గ్రానైట్ క్వారీ డెడ్రెంట్ రూ.80 వేల నుంచి 1.60 లక్షలైంది. మార్బుల్, భవన నిర్మాణ రాళ్లు, రహదారి కంకర, మాన్యుఫాక్చర్డ్ ఇసుకకు రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెరిగింది. రోడ్డు మెటల్ సీనరేజీ ఫీజు మెట్రిక్ టన్నుకు గతంలో రూ.50 ఉంటే ఇప్పుడు రూ.65కు చేరింది. చిప్స్ రూ.50 నుంచి రూ.658కి, మార్బుల్ రూ.100 నుంచి 130కి పెంచారు. అలాగే, బ్లాక్ గ్రానైట్ గ్యాంగ్ సైజు రాళ్లకు రూ.3వేల నుంచి రూ.3.900కు, కలర్ గ్రానైట్ గ్యాంగ్ సైజు రాళ్లకు రూ.2,300 నుంచి రూ.2,900కి పెరిగింది. కట్టర్ సైజు రాళ్లకు రూ.2వేల నుంచి రూ.2.800కి పెంచారు. అలాగే, రాయల్టీ 80 శాతం పెరగగా, సీవరేజీ ఫీజులోనూ 80 శాతం మొత్తాన్ని పర్మిట్ ఫీజు పేరుతో వసూలు చేయనున్నారు. అంటే కట్టాల్సిన సీనరేజీ ఫీజుతో పాటు 80 శాతం పర్మిట్ ఫీజు జతచేసి ఖనిజాన్ని గని నుంచి రవాణా చేసుకోవాల్సి వస్తుంది. గృహ రంగంపై ప్రభావం మైనింగ్ శాఖ పెంచిన ఫీజుల ప్రభావం గృహ రంగంపై తీవ్రంగా పడనుంది. పెంచిన విద్యుత్ చార్జీలతో నాలుగు కట్టర్లు ఉన్న పరిశ్రమకు నెలకు రూ.50 వేలు అదనంగా విద్యుత్ బిల్లు వస్తుంది. అంటే మైనింగ్ ఫీజుతో మరో రూ.50 వేల భారం పడుతుంది. పెట్రోల్, డీజిల్ ధరలు దీనికి అదనం. ఇప్పటివరకు పాలిష్ గ్రానైట్ ధర చదరపు అడుగుకు నాణ్యత ఆధారంగా రూ.100 నుంచి రూ.200 వరకు ఉంది. పెరిగిన ధరలతో ఇది రూ.30 వరకు పెరిగే అవకాశం ఉంది. ఇక ఇసుకకు పర్మిట్ ఫీజును రాయల్టీపై 40 శాతంగా నిర్ణయించారు. ఇసుక, కంకర తదితర «ధరల భారంతో గృహ నిర్మాణ ఖర్చు కూడా భారీగా పెరుగుతుంది. కేటీఆర్ భరోసా ఇచ్చారు.. కొత్త మైనింగ్ పాలసీతో గ్రానైట్ పరిశ్రమ సంక్షోభంలోకి వెళ్తోంది. ఫీజుల తగ్గింపుతోపాటు మా సమస్యలను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లాం. ఆయన ప్రభుత్వంతో మాట్లాడి సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. మళ్లీ గ్రానైట్ పరిశ్రమకు మంచి రోజులు వస్తాయనే నమ్మకంతో ఎదురుచూస్తున్నాం. – వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి), రాష్ట్ర గ్రానైట్ క్వారీ యజమానుల సంఘం అధ్యక్షుడు బంద్ కొనసాగిస్తాం పెంచిన ఫీజులతో పరిశ్రమలు గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వం పునరాలోచన చేసి పరిశ్రమలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర సంఘం ఇచ్చిన పిలుపు మేరకు బంద్ నిర్వహిస్తున్నాం. పన్నుల తగ్గింపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు బంద్ కొనసాగిస్తాం. – బి.వేణుగోపాల్, అధ్యక్షుడు, ఖమ్మం జిల్లా క్రషర్స్ అసోసియేషన్ -
క్వారీ.. స్వారీ
♦ రాతి నేలలపై కన్ను కర్ణాటక నుంచి వలస ♦ పుట్టగొడుగుల్లా వెలుస్తున్న మిషన్లు ♦ రాత్రంతా బ్లాస్టింగ్లు, రోజంతా క్వారీ ♦ విలవిల్లాడుతున్న వన్యప్రాణులు ♦ కళ్లప్పగించి చూస్తున్న అధికారులు మనూరు: జిల్లాలోనే అతిపెద్ద మండలమైన మనూరులో ఇబ్బడిముబ్బడిగా కంకర క్వారీలు వెలుస్తున్నాయి. పచ్చని పంటపొలాలు రాతి నేలలుగా మారుతున్నాయి. రాతి పొడి కాలుష్యం వల్ల పంటలు ఎదగడంలేదు. ఫలితంగా రైతులే కాక వన్యప్రాణులు సైతం విలవిల్లాడుతున్నాయి. కర్ణాటకలోని బీదర్ జిల్లాకు సరిహద్దున ఉన్న మనూరు మండలంలోని రాతి నేలలపై ఆ రాష్ట్రానికి చెందిన అక్రమార్కులు కన్ను వేశారు. ఇక్కడి భూములను తక్కవ ధరకే కొనుగోలు చేసి క్వారీలు ఏర్పాటుచేస్తున్నారు. స్థానిక చోటామోటా రాజకీయ నాయకులను ఆశ్రయించి, రెవెన్యూ, మైనింగ్ అధికారులకు అమ్యామ్యాలు ఇచ్చి అనుమతులు పొందుతున్నారన్న ఆరోపణలున్నాయి. అలాగే క్వారీకోసం దరఖాస్తు చేసుకున్నదే తడువుగా క్రషింగ్ ప్రారంభిస్తుండటం గమనార్హం. ఎదగని పంటలు కంకర క్వారీల చుట్టూ ఉన్న సాగు భూముల్లో రెండు, మూడేళ్లుగా పంటలు ఎదగడంలేదని ఆయా గ్రామాల రైతులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా క్వారీలు ఏర్పాటు కావడంతో పంటలు ఎదగక జీవనాధారం కోల్పోతున్నామన్నారు. అంతేకాక రాత్రి వేళల్లో భయంభయంగా గడపాల్సి వస్తోందన్నారు. పెద్ద పెద్ద శబ్ధాలతో, పెలుళ్లు సృష్టించడం వల్ల కంటిమీద కునుకులేకుండా పోతుందన్నారు. ఇళ్లకు సైతం బీటలు వారుతున్నాయన్నారు. అలాగే తమ ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని ఆందోళన చెందుతున్నారు. వీటికి తోడు శివారు వెంట ఎక్కడ చూసినా భారీ గోతులు కనిపిస్తున్నాయన్నారు. భారీ గోతుల వల్ల వర్షాకాలంలో ప్రాణనష్టం సైతం జరిగే ప్రమాదం ఉందని వారు చెబుతున్నారు. వన్యప్రాణులు విలవిల జిల్లాలో ఎక్కడా లేనివిధంగా మండలంలోని బీడు భూములో వందల సంఖ్యలో కృష్ణజింకలు, లేళ్లు ఉన్నాయి. ఇవి బోరంచ శివారు నుంచి ఔదత్పూర్, శిఖార్ఖాన వరకు సంచరిస్తుంటాయి. కాగా మోర్గి, గోందేగాం, నాగల్గిద్ద, గుడూర్, ఔదత్పూర్ శివారులో వందల సంఖ్యలో జికంలు ఉన్నాయి. కంకర మిషన్ల బ్లాస్టింగ్ వల్ల అవి పంటచేలలు, గ్రామాల్లోకి వస్తున్నాయని స్థానికులు తెలిపారు. క్వారీల అనుమతులు రద్దు చేయాలి రోజురోజుకు పుట్టుకొస్తున్న క్వారీల అనుమతులను సంబంధిత అధికారులు రద్దుచేయాలని మండలంలోని రైతులు, వన్యప్రాణుల ప్రేమికులు, ఆయా గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. క్వారీల కారణంగా పచ్చని పంటపొలాలు దెబ్బతింటున్నాయన్నారు. మూసివేతకు సిఫార్స్ చేస్తాం అక్రమంగా వెలుస్తున్న కంకర మిషన్లపై చర్యలు తీసుకునేందుకు మైనింగ్ అధికారులకు నివేదిస్తాం. రైతుల ఇబ్బందులను, వారి విన్నపాలను జిల్లా అధికారులకు నివేదించి చర్యలు తీసుకుంటాం. -తారాసింగ్, తహశీల్దార్, మనూరు