breaking news
Government machinery
-
లంక వీడని జనం.. గోదారి ఈదుతున్న యంత్రాంగం
(పశ్చిమ గోదావరి లంక గ్రామాల నుంచి సాక్షి ప్రతినిధులు ఐ.ఉమామహేశ్వరరావు, వీఎస్వీ కృష్ణకిరణ్): చుట్టుముట్టిన వరద.. ఇళ్లను వదిలి రావడానికి ఇష్టపడని లంక వాసులు.. ప్రజాప్రతినిధులు, అధికారులు ఎంత బతిమాలినా లంక వీడేదిలేదని మంకుపట్టు. గత్యంతరం లేక ప్రభుత్వ యంత్రాంగామే పడవలతో గోదావరి దాటుకుని లంకల్లోకి వెళ్లి నిత్యావసరాలు అందిస్తోంది. ప్రతి ఒక్కరినీ ఆదుకుంటోంది. లంక వాసుల క్షేమం కోసం గోదావరి గట్టుపై పోలీసులు, ఫైర్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు, గజ ఈతగాళ్లను నియమించింది. వారు కంటి మీద కునుకులేకుండా గస్తీ కాస్తున్నారు. ప్రజా ప్రతిప్రతినిధులు కూడా వరద నీటిలో గ్రామాలకు వెళ్తున్నారు. శనివారం రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత, దేవదాయ శాఖా మంత్రి కొట్టు సత్యనారాయణ ఆచంట, పాలకొల్లు, నర్సాపురం నియోజకవర్గాల్లో పర్యటించి వరద సహాయక చర్యలను సమీక్షించారు. పశ్చిమగోదావరి జిల్లాలో ప్రభుత్వం 18 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసింది. వరద బాధితులకు పాలు, గుడ్లు, బ్రెడ్, బిస్కెట్ ప్యాకెట్లు, ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, సాయంత్ర భోజనం, వసతి ఏర్పాట్లు చేసింది. ఆచంట నియోజకవర్గంలోని పెదమల్లంక, కోడేరు లంక, అయోధ్యలంక, రావి లంక, పుచ్చల లంక, అణగారి లంకల ప్రజలు కొంత మంది మాత్రమే పునరావాస శిబిరాలకు వచ్చారు. ఈ లంకలకు చెందిన మిగతా వారితోపాటు భీమలాపురం, ఏటిగట్టు ప్రాంత వాసులు సైతం గ్రామాలను వీడి వచ్చేందుకు ఇష్ట పడలేదు. దీంతో ప్రభుత్వ యంత్రాంగమే పడవలపై లంక గ్రామాలకు వెళ్తోంది. వారికి బియ్యం, కూరగాయలు, నూనె, కందిపప్పు, మంచినీరు, పాలు, గుడ్లు వంటి నిత్యావసరాలను అందిస్తోంది. మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు నాలుగు రోజులుగా సిద్దాంతం, ఆచంట మండలంలోని లంక ప్రాంతాల్లో బోట్లపై ప్రయాణిస్తూ లంక వాసుల బాగోగులు చూస్తున్నారు. పునరావాస కేంద్రాల్లోని వారికి ఆహారం, లంకల్లో ఉండిపోయిన వారికి సరుకులు అందించేలా సమన్వయం చేస్తున్నారు. ఆయన శనివారం భోజనాలతోపాటు 600 కిలోలకు పైగా చికెన్, 2 వేలకుపైగా గుడ్లను బాధితులకు అందించారు. ప.గోదావరి జిల్లా లంక గ్రామాల్లోని వారి కోసం నిత్యావసరాలను తరలిస్తున్న దృశ్యం పగలంతా పడవలో.. రాత్రయితే పునరావాసంలో.. దొడ్డిపట్ల రేవులో గోదావరి కట్టకు దిగువన 150పైగా కుటుంబాలు జీవిస్తున్నాయి. కట్టకు సమాంతరంగా వరదనీరు ప్రవహిస్తున్నప్పటికీ నీట మునిగిన ఇళ్ల వద్దే వారంతా పడవల్లో ఉంటున్నారు. ఇళ్లలో సామాన్లు దాదాపు 240 పడవల్లో వేసి, వర్షానికి తడవకుండా బరకాలు కప్పి వాటిపైనే పిల్లలు, పెద్దలు ప్రమాదకర స్థితిలో జీవిస్తున్నారు. పగలు పడవల్లో, రాత్రి పునరవాస కేంద్రాల్లో ఉంటున్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఎంత నచ్చచెప్పినా సురక్షిత ప్రాంతాలకు రావడంలేదు. రెవెన్యూ, పోలీస్, ఫైర్, తదితర సిబ్బంది వారి కోసం గట్టుపై గస్తీ కాస్తున్నారు. దొడ్డిపట్ల రేవు వద్ద గోదావరి గట్టు బలహీనంగా ఉన్న ప్రాంతంలో వరదనీరు గ్రామంలోకి చొచ్చుకుని వస్తుండటంతో యుద్ధ ప్రాతిపదికన గట్టును పటిష్టం చేశారు. డేంజర్ జోన్లో నర్సాపురం గోదావరి నీరు సముద్రంలో కలిసే నర్సాపురానికి వరద తాకిడి ఆందోళనకరంగా మారింది. వరదనీరు నర్సాపురం – పాలకొల్లు ప్రధాన రహదారి పైకి సైతం చేరింది. స్లూయిజ్ల నుంచి నీరు వస్తుండడంతో ప్రభుత్వ యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ముదనూరి ప్రసాదరాజు నాలుగు రోజులుగా యంత్రాంగాన్ని సమన్వయం చేస్తున్నారు. శనివారం రాత్రి వరదనీరు పట్టణంలోకి రాకుండా చర్యలు చేపట్టారు. అన్నానికి మాత్రమే వెళ్తున్నాను! గోదావరి ఇంత ఉధృతంగా ప్రవహించడం మునుపెన్నడూ చూడలేదు. ఏటు గట్టు పక్కనే ఉంటున్న మా ఇల్లు పైకప్పు వరకు మునిగిపోయింది. పది అడుగులు మేర ప్రవాహం ఒక్కసారిగా పెరిగిపోవడంతో సామగ్రిని పడవల్లో వేసి తాళ్లతో చెట్లకు కట్టేశాం. భార్య, బిడ్డలను దొడ్డిపట్ల ప్రభుత్వ హైస్కూల్లోని సహాయక శిబిరంలో ఉంచి నేను రేయింబవళ్లు పడవలను కాపలా కాస్తున్నాను. ప్రభుత్వం మూడు పూటలా ఆహారం అందిస్తుండటంతో ఆ కాసేపు శిబిరానికి వెళ్లి మళ్లీ పడవల దగ్గరకు వచ్చేస్తున్నా. – కొప్పాడి శ్రీను, మత్స్యకారుడు, దొడ్డిపట్ల శివారు, యలమంచిలి మండలం బడిలో తలదాచుకుంటున్నాం! మాకు ముంపు అలవాటే. కానీ, ఈ సారి భయపడేంతగా వచ్చింది. కొబ్బరి చెట్టులో సగభాగం నీళ్లలో నానుతోంది. నేను కూలికి వెళితే, మా ఇంటాయన పడవలో ఇసుక తవ్వగా వచ్చిన డబ్బులతో నాలుగు నూకలు కొనుక్కునే వాళ్లం. వారం రోజులుగా ఏ పనీ లేదు. ఇల్లు వదిలి బడిలో తలదాచుకుంటున్నాం. ప్రభుత్వమే అన్నం పెడుతోంది. అధికారులు రెండు పూటలా మమ్మల్ని చూసి వెళ్తున్నారు. – లంకె సత్యవతి, దొడ్డిపట్ల పునరావాస కేంద్రం, యలమంచిలి మండలం అమ్మ చిరునవ్వు వెనుక.. ఊహకందని ఉప్పెనలో.. ఊహ తెలియని చిన్నారితో.. వీపుపై ఊయల ఊపుతూ.. కష్టమంతా కొట్టుకుపోయినా.. కన్నీళ్లు పెట్టించినా.. ఒడ్డుకొచ్చిన ఊపిరితో.. చిరునవ్వులోనే బాధను దాచుకున్న ఈ మహిళ పేరు సెరి మరియమ్మ. మత్స్యకార కుటుంబానికి చెందిన ఈమె భర్తతో కలిసి దొడ్డిపట్ల ప్రభుత్వ పాఠశాలలోని సహాయక శిబిరంలో తలదాచుకుంటోంది. ప్రభుత్వం ఇచ్చే పాలతో బిడ్డకు ఉగ్గుపడుతూ.. తానూ ఇంత అన్నం తింటోంది. శనివారం ముంపు లంకల్లో పర్యటించిన సాక్షి బృందానికి కనిపించిన చిత్రమిది. -
రేపట్నుంచే రైతు సమన్వయ సమితులు
- మొదటి రోజు పలుచోట్ల నామినేటెడ్ సభ్యులతో సమావేశాలు - అన్ని జిల్లాల్లో ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వ యంత్రాంగం సాక్షి, హైదరాబాద్: రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేసే ప్రక్రియ శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానుంది. గ్రామ, మండల, జిల్లాస్థాయి రైతు సమన్వయ సమితులను 9వ తేదీ నాటికి పూర్తి చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మొదటిరోజున అన్ని జిల్లాల్లోని కొన్ని ముఖ్యమైన గ్రామాలను ఎంపిక చేసి వాటిల్లో సమన్వయ సమితి సభ్యులను నామినేట్ చేసి లాంఛనంగా సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వ్యవసాయశాఖ కమిషనర్ జగన్మోహన్ తెలిపారు. ఎంపిక చేసిన గ్రామాల్లో సమావేశాలకు మంత్రులు, వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యేలా ప్రణాళిక రచించినట్లు ఆయన వివరించారు. తొమ్మిది రోజుల్లో అన్ని రెవెన్యూ గ్రామాలు, మండలాలు, జిల్లాల్లో సమన్వయ సభ్యులను మంత్రులు నామినేట్ చేస్తారు. వాటికి సమన్వయకర్తలను కూడా ఏర్పాటు చేయనున్నారు. మండల, జిల్లాస్థాయిలో ఏర్పాటు చేసే సమన్వయ సమితుల్లో గ్రామాల్లో నియమితులైన సభ్యులను కూడా నామినేట్ చేసే అవకాశాలున్నాయని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. అయితే అది మంత్రులపై ఆధారపడి ఉందని వివరించాయి. గ్రామ సమన్వయ సమితిలో 15 మంది, మండల, జిల్లా సమితుల్లో 24 మంది సభ్యులను నామినేట్ చేస్తారు. రాష్ట్ర సమన్వయ సమితిలో 42 మంది సభ్యులుంటారు. ఆయా సభ్యుల నుంచే సమన్వయకర్తలను నియమిస్తారు. రాష్ట్ర సమన్వయ సమితిని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా నియమించనున్నారు. దాని సమన్వయకర్తకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇవ్వనుంది. ఆయన కార్పొరేషన్ చైర్మన్ స్థాయిని కలిగి ఉంటారని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. అయితే ఇది పూర్తిగా సీఎం పరిధిలోది కాబట్టి ఇప్పుడే ఏమీ చెప్పలేమని ఆ వర్గాలు వివరించాయి. వ్యవసాయశాఖ అధికారులకు నేడు సీఎం శిక్షణ సమన్వయ సమితుల ఏర్పాటు తర్వాత వాటి నిర్వహణ, పెట్టుబడి పథకం అమలు తదితర అంశాలపై వ్యవసాయశాఖ అధికారులకు అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం వ్యవసాయాధికారులకు శిక్షణ ఇవ్వనున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాల యంలో మండల స్థాయి ఏవోలు మొదలు రాష్ట్రస్థాయి అధికారుల వరకు ఈ శిక్షణలో పాల్గొంటారు. సహకా ర, ఉద్యానశాఖ అధికారులు కూడా పాల్గొంటారు. -
భారీ వర్షాలు రైతును దెబ్బతీశాయి
సాక్షి, మచిలీపట్నం/ న్యూస్లైన్, నందిగామ రూరల్ : జిల్లాలో ఈ ఏడాది 1.37 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేయగా, పంట చేతికొచ్చే తరుణంలో రోజులతరబడి కురిసిన భారీ వర్షాలు రైతును దెబ్బతీశాయి. తీతకు సిద్ధంగా ఉన్న పత్తి.. పొలాల్లోనే పూర్తిగా తడిసిపోయింది. మొక్కలపైనే పత్తి మొలకలు వచ్చేసింది. దీనికితోడు పంట పొలాల్లో తేమ శాతం ఎక్కువ కావడం వల్ల ఉన్న మొక్కలు కూడా నిలువునా ఎండిపోతున్నాయి. మొక్కలను బతికించుకునేందుకు పలు రకాల మందులను పిచికారీ చేస్తున్నా ప్రయోజనం కనిపించటం లేదు. వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి పంట సాగు చేసిన రైతులు దెబ్బతిన్న పత్తి, ఎండుతున్న మొక్కలను చూసి కంటతడి పెడుతున్నారు. నేటికీ కొన్ని గ్రామాల పరిధిలో పత్తి పొలాల్లో వర్షపు నీరు దర్శనమిస్తూనే ఉంది. కొన్ని గ్రామాల పరిధిలో దెబ్బతిన్న పత్తిని ఏంచేయాలో తెలియక రైతులు ఊరికి దూరంగా రోడ్ల వెంబడి పారవేస్తున్నారు. జిల్లాలో గతేడాది నవంబరు ఐదున సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసిన ప్రభుత్వ యంత్రాంగం ఈ ఏడాది ఇప్పటివరకు వాటిని ప్రారంభించలేదు. నందిగామ, జగ్గయ్యపేట, కంచికచర్ల, మైలవరం, గంపలగూడెం మార్కెట్ యార్డుల్లో నవంబర్ 15 నుంచి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేస్తామని జిల్లా అధికారులు ప్రకటించారు. వ్యాపారులదే రాజ్యం... రైతుల అవసరం వ్యాపారులకు వరంగా మారింది. వర్షం కారణంగా పత్తి దెబ్బతిన్నదనే సాకుతో కొందరు వ్యాపారులు రైతుల వద్ద నుంచి పత్తిని కారుచౌకగా కొనుగోలు చేస్తున్నారు. వాస్తవంగా పత్తి మద్దతు ధర క్వింటాలుకు రూ.4 వేలు కాగా, రంగు మారిందని, తడిసిందని చెబుతూ వ్యాపారులు తమకు తోచిన ధర చెల్లిస్తున్నారు.