breaking news
Gauri lankes murder
-
ఒకే తుపాకీతో గౌరీ, కల్బుర్గి హత్య
బెంగళూరు: ప్రముఖ పాత్రికేయురాలు, సామాజిక కార్యకర్త గౌరీ లంకేశ్ను, హేతువాది ఎంఎం కల్బుర్గిని ఒకే తుపాకీతో కాల్చి చంపినట్టు తేలింది. కర్ణాటక రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీ గౌరీ హత్య కేసును విచారిస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)కు నివేదిక అందజేసింది. కల్బుర్గి 2015 ఆగస్టు 30న ధార్వాడ్లోని తన ఇంట్లోనే హత్య చేశారు. గౌరి కిందటేడాది సెప్టెంబర్ 5న తన నివాసానికి సమీపంలో దుండగుల చేతిలో ప్రాణాలు కోల్పోయారు. రెండేళ్ల తేడాతో వీరిద్దరినీ ఒకే తుపాకీతో చంపారని సిట్ గతంలో చెప్పినా ఫోరెన్సిక్ నివేదిక సాక్షిగా ఆ విషయం ఇప్పుడు స్పష్టంగా బయటపడింది. 7.65 ఎంఎం దేశవాళీ తుపాకీతో వీరిని చంపినట్టు నివేదిక పేర్కొంది. గౌరీ లంకేశ్ కేసుకు సంబంధించి సిట్ ఇప్పటికే బెంగళూరులోని అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టుకు తొలి చార్జిషీట్ సమర్పించింది. అందులో హిందుత్వ కార్యకర్త నవీన్ కుమార్ను నిందితుడిగా సిట్ పేర్కొంది. అందులో ‘గౌరీ లంకేశ్ హిందూ వ్యతిరేకి.. ఆమెకు బతికే అర్హత లేదు’ అని ప్రధాన నిందితుడు ప్రవీణ్ కుమార్ తనతో చెప్పాడని నిందితుడు నవీన్ పేర్కొన్నట్లు పొందు పరిచారు. లంకేశ్ను హత్య చేసేందుకు బుల్లెట్లు సిద్ధం చేయమని ప్రవీణ్ అడిగాడని నవీన్ చెప్పినట్టు పేర్కొన్నారు. మరో హత్యకు కుట్ర హేతువాది, హిందుత్వ సిద్ధాంత విమర్శకుడు కేఎస్ భగవాన్ హత్యకు కుట్ర జరుగుతున్నట్టు నవీన్ సిట్ వద్ద అంగీకరించాడు. కిందటేడాది నవంబర్లో సంజయ్ బన్సారే అను వ్యక్తి తనను కలసి కేఎస్ భగవాన్ను చంపేందుకు తుపాకీలను సిద్ధం చేయమని అడిగాడని సిట్తో చెప్పాడు. తనకు శ్రీరామ్ సేనే, బజరంగ్దళ్తో సంబంధాలున్నా యని, 2014లో హిందూ యువసేనే అనే సంస్థను స్థాపించానని నవీన్ వెల్లడించాడు. -
రాజకీయం చేయొద్దు
గౌరి లంకేశ్ సోదరుడి విజ్ఞప్తి సాక్షి, బెంగళూరు: గౌరి లంకేశ్ హత్యను రాజకీయం చేయొద్దని, తన సోదరి హత్య కేసులో అంతిమంగా న్యాయం కావాలని ఆమె సోదరుడు ఇంద్రజిత్ లంకేశ్ డిమాండ్ చేశారు. ‘గౌరి తను నమ్మిన సిద్ధాంతాల కోసం పోరాడింది అందువల్ల కావాలంటే సైద్ధాంతిక రంగును జతచేసుకోండి. రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించవద్దని కోరుతున్నా’ అని ఆయన విజ్ఞప్తి చేశారు. సీబీఐ లేక ప్రత్యేక న్యాయమూర్తి లేక సిట్ విచారణ అనేది ముఖ్యం కాదని, అంతిమంగా న్యాయం కావాలని, అందుకోసం ఏం చేయడానికైనా సిద్దమని ఇంద్రజిత్ పేర్కొన్నారు. హత్య వెనుక నక్సల్స్ హస్తం ఉందన్న వార్తల నేపథ్యంలో అన్ని కోణాల్లోను సమగ్ర విచారణ జరపాలని గౌరి కుటుంబం విజ్ఞప్తి చేసింది. ఈ హత్య వెనుక నక్సలైట్లు ఉన్నారా? లేక రైట్ వింగ్ అతివాదుల హస్తముందా? అన్న ప్రశ్నకు జర్నలిస్టు లోకం సమాధానం కోరుతోందని ఇంద్రజిత్ చెప్పారు. సిట్ దర్యాప్తుపై తమకు నమ్మకం ఉందని, ఒకవేళ దర్యాప్తు తీరు సరిగా సాగడం లేదని భావిస్తే సీబీఐ దర్యాప్తు కోరతామని గౌరి లంకేశ్ చెల్లెలు కవిత చెప్పారు. కాగా, గౌరీ హత్య కేసును సీబీఐకి అప్పగించడానికి సిద్ధమేనని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గురువారం ప్రకటించారు. మరోవైపు ఈ హత్య కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) గురువారం దర్యాప్తును ప్రారంభించింది. గౌరి లంకేశ్ ఇంటిని పరిశీలించి కొన్ని ఆధారాల్ని సేకరించారు. హత్య జరిగిన చుట్టుపక్కల ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. హేళన చేయకుంటే హత్య జరిగేది కాదు గౌరి లంకేశ్ మరణంపై బీజేపీ ఎమ్మెల్యే జీవరాజ్ వివాదాస్పద వాఖ్యలు చేశారు. ‘ఆమె ఇటీవల కాలంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తల్ని హేళన చేస్తూ కథనాలు ప్రచురించారు. అలా చేయకుండా ఉంటే ఆమె హత్య జరిగి ఉండేది కాదేమో’ అని జీవరాజ్ వ్యాఖ్యానించారు. మీడియా తన వాఖ్యలను వక్రీకరించిందని తర్వాత వివరణ ఇచ్చారు. గౌరి స్నేహితుడు, దళిత అభ్యుదయ వాది భాస్కర్ ప్రసాద్కు బుధవారం బెదిరింపు కాల్ వచ్చిందని సమాచారం. ఆయన డీజీపీ కార్యాలయంలో గురువారం సాయంత్రం లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.