breaking news
Gandikota ustavalu
-
ఆశల కోట.. గండికోట..!!
గండికోట వారసత్వ ఉత్సవాలపై జిల్లా వాసుల్లో రోజురోజుకు ఆశలు పెరుగుతున్నాయి. జిల్లాలో అన్ని రకాల పర్యాటక అభివృద్ధికి అవకాశం ఉందని ఇంటాక్తోపాటు ఇతర పర్యాటక అభివృద్ధి సంస్థలు విస్తృత స్థాయిలో ప్రచారం చేయడం, కొత్త ప్రభుత్వం రావడం, మన జిల్లా ముద్దుబిడ్డ వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో జిల్లా వాసుల్లో పర్యాటకరంగం అభివృద్ధిపై అంచనాలు పెరిగాయి. సీఎం ఇటీవల రాష్ట్ర పర్యాటక అభివృద్ధిలో భాగంగా గండికోటతోపాటు జిల్లాలో ఇతర పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని ప్రకటించడంతో పర్యాటకుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. సాక్షి, కడప కల్చరల్ : గండికోట వారసత్వ ఉత్సవాలపై కడప కల్చరల్: జిల్లా ప్రజలు, పర్యాటకాభిమానుల్లో రోజురోజుకు ఆశలు పెరుగుతున్నాయి. ప్రభుత్వ అధికారుల ఆధ్వర్యంలో ఇప్పటికి నాలుగుమార్లు గండికోట ఉత్సవాలు నిర్వహించారు. ఈ ఏడాది జిల్లా వాసి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో జరుగుతున్నాయి గనుక.. జిల్లా వాసుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. గత ప్రభుత్వం ఈ ఉత్సవాలను నిర్వహించేందుకు అంత సుముఖత వ్యక్తం చేయకపోయినా.. జిల్లాలోని పర్యాటక సంస్థలు, అభిమానులు, జిల్లా పట్ల అభిమానం గల అధికారుల సహకారంతో నిర్వహించగలిగారు. గత ప్రభుత్వం ఉత్సవాల నిర్వహణకు అవసరమయ్యే నిధుల గురించి ఏటా పేచీ పెడుతూ వచ్చింది. తొలుత నవంబరులో నిర్వహించగా, అది క్రమంగా ఎప్పటికప్పుడు ఆలస్యమవుతూ ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించారు. మంచి రోజులొచ్చాయి.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రమంతటా పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించడం, జిల్లాలో గండికోటలో గాజు వంతెన, ఇడుపులపాయను పర్యాటక కేంద్రంగా మార్చడం, సోమశిల డ్యాంను పర్యాటకంగా అభివృద్ధి చేయాలన్న నిర్ణయాన్ని ప్రకటించడంతో జిల్లా పర్యాటకుల్లో సంతోషం వ్యక్తమైంది. గతంలో ప్రచారం లేకపోయినా.. నాలుగుసార్లు ఉత్సవాలు నిర్వహించడంతో గండికోట గురించి ప్రజల్లో బాగా ప్రచారం జరిగింది. ప్రస్తుతం వారాంతాలలో అక్కడి హరిత హోటల్లో గదులు దొరకని పరిస్థితి ఏర్పడింది. మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలకు చెందిన యువత పెద్ద సంఖ్యలో సందర్శించేందుకు వస్తున్నారు. దీనికి తగినట్లుగా ప్రస్తుతం గండికోటను అద్దాల వంతెనతో మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని, పెన్నా లోయలో సాహస క్రీడలను ప్రవేశ పెట్టి.. గండికోటను సాహస క్రీడల కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న ముఖ్యమంత్రి ప్రకటనతో జిల్లా పర్యాటకానికి మంచిరోజులు వచ్చాయని ప్రజలు భావిస్తున్నారు. ముఖ్యంగా ప్రపంచ స్థాయిలో ‘ఇండియన్ ›గ్రాండ్ క్యానియన్’గా పేరు గాంచిన గండికోటను అభివృద్ధి చేస్తామన్న ప్రకటన మరింత సంతోష పెట్టింది. దేశానికి గర్వ కారణంగా నిలిచిన గండికోట.. పర్యాటకంగా అభివృద్ధి చెందితే ఆ ప్రభావం జిల్లాలోని మిగతా పర్యాటక ప్రాంతాలపై పడుతుందని, అక్కడ కూడా సందడి పెరుగుతుందని ఆశిస్తున్నారు. వైభవాన్ని చాటి చెప్పాలి రాష్ట్ర మంతటా ఏటా దీపావళి నుంచి ఫిబ్రవరి చివరిలోపు పర్యాటక ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ‘పర్యాటకం–ఉపాధి–ఆదాయం’ నినాదంతో ఈ ఏడాది ఇప్పటికే భీమిలి, విశాఖ, అరకు ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. నవంబరు 9, 10 తేదీలలో భీమిలి ఉత్సవ్, డిసెంబరు 26, 27లలో విశాఖ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఫిబ్రవరిలో అరకు ఉత్సవాల నిర్వహణపై కూడా ప్రకటన వెలువడింది. ఇందులో భీమిలి ఉత్సవ్కు రూ. 50 లక్షలు, విశాఖ ఉత్సవాలకు రూ.కోటి నిర్వహణ కోసం నిధులు కేటాయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్థిక లోటు ఉండటంతో.. గతంలో రూ. 3 కోట్లతో గండికోట ఉత్సవాలు నిర్వహించినా ఈసారి అంత ఖర్చు చేసే పరిíస్థితి కనిపించడం లేదు. ఇచ్చినంతలోనే ఘనంగా జరుపుకునేందుకు అధికారులు రెండు నెలల ముందు నుంచి ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించుకోవాల్సి ఉంది. అందుకు ప్రభుత్వ పర్యాటక అధికారులు కూడా తగిన దిశా నిర్దేశం చేయాల్సిన అవసరం ఉంది. అప్పటికప్పుడు ప్రకటించి హడావుడిగా కార్యక్రమాలు చుట్టేయకుండా.. సినిమా కళాకారుల పాట కచేరీలు, డ్యాన్సులతో పర్యాటకులను ఆకర్శించే ప్రయత్నాలకు ఈ సారైనా స్వస్తి చెప్పాలని.. గండకోట వైభవాన్ని చాటి చెప్పేలా కార్యక్రమాలు రూపొందించాలని జిల్లా వాసులు కోరుతున్నారు. రెండు నెలల ముందు నుంచే స్థానిక కళాబృందాలను ఎంపిక చేసి వారిచే ప్రత్యేకంగా సాధన చేయిస్తే నాణ్యత గల ప్రదర్శనలను చూడవచ్చని సూచిస్తున్నారు. ఈ ఉత్సవాలకు కావాల్సింది సినీ నటుల ప్రదర్శనలు కాదని, వచ్చిన వారంతా తప్పక కోటను, అందులోని ఇతర నిర్మాణాలను తిలకించేలా అధికారులు ప్రణాళికలు రూపొందించాల్సి ఉంటుందని జిల్లా పర్యాటక అభిమానులు భావిస్తున్నారు. సినీ కార్యక్రమాలకు లక్షలాది రూపాయలు ఖర్చు చేయడం కంటే.. అందులో నాలుగో∙వంతు ఖర్చుతోనే తగిన సాధనతో స్థానిక కళాకారులతో నాణ్యతగల ప్రదర్శనలు పొందవచ్చని సూచిస్తున్నారు. ‘గండికోట వారసత్వ ఉత్సవాలు’ పేరిట ఉత్సవాలు జరుగుతున్నాయి గనుక కోట చరిత్ర, ఘనతను తెలిపే కార్యక్రమాలు, చారిత్రక సాహిత్య కార్యక్రమాలు నిర్వహించినపుడే ఉత్సవాల ధ్యేయం నెరవేరగలదని పేర్కొంటున్నారు. మొత్తంపై ఈసారి గండికోట వారసత్వ ఉత్సవాలు అందరినీ అలరించే రీతిలో నిర్వహించగలరని ఆశిస్తున్నారు. ప్రయోజనం ఉండాలి కోట్లాది రూపాయలు పోసి సినీ నటుల ప్రదర్శనలకే ఉత్సవాలను పరిమితం చేయకూడదు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గండికోటకు ఉజ్వల భవిష్యత్తును కల్పించే దిశగా ఉత్సవాలను నిర్వహిస్తారన్న ఆశ ఉంది. – గునిశెట్టి సాయికుమార్, పర్యాటకాభిమాని, కడప కోట ఘనతను చాటాలి గండికోటకు ఘనమైన చరిత్ర ఉంది. ఉత్సవాలలో ఆ చరిత్రను ప్రతిబింబించే కార్యక్రమాలను నిర్వహించాలి. అంత నిధులు వెచ్చిస్తున్నాం గనుక కోట భవితను దృష్టిలో పెట్టుకుని కార్యక్రమాలు రూపొందించాలి. – మన్నూరు వెంకట రమణారెడ్డి, పర్యాటక సంస్థ సభ్యుడు, కడప -
గండికోట ఉత్సవాలకు ముహూర్తం
– జనవరి 19 నుంచి 22 తేదీల్లోపు కడప సెవెన్రోడ్స్: గండికోట వారసత్వ ఉత్సవాలకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. ముఖ్యమంత్రి వీలునుబట్టి జనవరి 19 నుంచి 22వ తేదీల్లోపు రెండు రోజులపాటు ఉత్సవాలు నిర్వహించాలని అధికారికంగా నిర్ణయించారు. ఇటీవల ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు వచ్చినపుడు కలెక్టర్ కేవీ సత్యనారాయణ గండికోట ఉత్సవాల గురించి ఆయన వద్ద ప్రస్తావించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి ఎప్పుడు నిర్వహించాలో తేదీలు ఖరారు చేసి ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్కు చెప్పారు. ఈ నేపథ్యంలో బుధవారం కొత్త కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులు, ఉత్సవ నిర్వహణ కమిటీలతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఉత్సవాలకు గవర్నర్ను ఆహ్వానిస్తామని తెలిపారు. గవర్నర్ పాల్గొనేందుకు ఎస్సీ,ఎస్టీ సంక్షేమ కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు వంటివి ఏర్పాటు చేయాల్సి ఉంటుందని చెప్పారు. మొదటిరోజు గవర్నర్, చివరిరోజు ముఖ్యమంత్రి ఉత్సవాలకు హాజరు కావడం ఆనవాయితీగా ఉందని పేర్కొన్నారు. ఉత్సవాలు పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ కింద మంజూరైన రూ. 16 కోట్లతో గండికోటకు రోడ్డు వెడల్పు పను పనులను తక్షణమే చేపట్టాలని ఈఈని ఆదేశించారు. గండికోట ప్రవేశద్వారం వరకు రోడ్డు పనులు త్వరగా పూర్తి కావాలన్నారు. కోట ప్రాంతాన్ని నందనవనంలా మార్చేందుకు ల్యాండ్ స్కేపింగ్ పనులు చేపడతామన్నారు. గార్డెన్ అభివృద్ధికి అంచనాలు రూపొందించాలని ఉద్యానశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మధుసూదన్ రెడ్డిని ఆదేశించారు. ఆర్కియాలజీ ఉన్నతాధికారుల అనుమతితో కట్టడాల కెమికల్ ట్రీట్మెంట్కు చర్యలు తీసుకుంటామన్నారు. కోటలో లైటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పారు. ఉత్సవాలకు హాజరయ్యే ప్రజలకు తాగునీటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. ఉత్సవాలకు ప్రధాన వేదిక గండికోట ఉంటుందని, అక్కడ నిర్వహించే కొన్ని కార్యక్రమాలు కడప లాంటి ఇతర ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేస్తామన్నారు. థీం సాంగ్కు కొన్ని సవరణలు చేసి రెండు రోజుల్లో ఖరారు చేస్తామని తెలిపారు. నాలుగైదు రోజుల్లో లోగో, పోస్టర్లను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. గండికోట ఉత్సవాల గురించి తెలుగు రాష్ట్రాలతోపాటు బెంగుళూరు, చెన్నైలలో కూడా విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తామని వెల్లడించారు. ఉత్సవాలు ముగిసే వరకు 24 గంటలు విద్యుత్ సరఫరా ఉండాలని ట్రాన్స్కో అధికారులను ఆదేశించారు.ఉత్సవాల నిర్వహణ కోసం తాను టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ను సంప్రదించగా, రూ. 10 లక్షలు మంజూరు చేసేందుకు అంగీకరించారన్నారు. మళ్లీ డిసెంబరు 6,7 తేదీలలో సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో పర్యాటకశాఖ ఆర్డీ గోపాల్, కడప, జమ్మలమడుగు ఆర్డీఓలు చిన్నరాముడు, వినాయకం, జిల్లా పర్యాటకశాఖ అధికారి ఖాదర్బాషా, ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు సిద్దవటం సీతారామయ్య, ఎలియాస్రెడ్డి, ఆహ్వాన కమిటీ సభ్యుడు జానమద్ది విజయభాస్కర్, కల్చరల్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.