breaking news
dharsanam
-
అప్పన్న దూరదర్శన్
సింహాచలం అప్పన్న నిజరూపదర్శన భాగ్యం కలిగేది ఒకే ఒక్క రోజు.. ఏడాదంతా చందన శోభితుడైన సింహాచలేశుడు.. ఆ గంధపు పూత నుంచి బయల్వెడలి నిజరూప దర్శనం కల్పించేరోజు. అది చందనోత్సవం రోజు. అంత శుభప్రదమైన దినాన దురదృష్టం కొద్దీ సింహాచల ఆలయ అధికారుల నిజ(స్వ)రూపం బట్టబయలై భక్తులను ఆవేదనకు గురి చేసింది. ఆలయ అధికారులు, దళారులు ఇదే తడవుగా చందనస్వామి దర్శనాన్ని స్వార్థ ప్రయోజనాలకు వాడుకోవడం.. నిష్కర్షగా చెప్పాలంటే అయినకాడికి డబ్బులు దండుకోవడం భక్తజనకోటికి మనోక్లేశాన్ని మిగిల్చింది. సంపన్నులకు, అస్మదీయులైన వీఐపీలకు దగ్గరుండి అంతరాలయ దర్శనాలు చేయించిన అధికారులు, దళారులు.. సామాన్యభక్తులకు ‘దూరదర్శన’ భాగ్యం మాత్రమే కల్పించడం విమర్శలకు తావిచ్చింది. 20 అడుగుల దూరం నుంచి కేవలం లిప్తపాటు దర్శనం కల్పించిన అధికారుల తీరు సర్వదా ఖండనలను పాత్రమైంది. అయితేనేం.. ఏదైనా తమకేంటన్న అధికారుల తీరు మారకపోవడమే విస్తుగొలిపింది. – సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : ఏ దేవాలయంలోనైనా మూలమూర్తి ఏడాదంతా ఒకే రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. కానీ ఏడాదంతా చందనపు పూతల చాటున ఉంటూ నిత్యరూపంతో పూజలందుకునే సింహగిరిపై కొలువైన వరాహ లక్ష్మీనృసింహస్వామి వైశాఖ శుద్ధ తదియనాడు మాత్రం నిజరూపంలో సాక్షాత్కరిస్తారు. ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా నిజరూపాన్ని దర్శించి తరించేందుకు లక్షలాది మంది భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి మంగళవారం అర్ధరాత్రి నుంచే సింహాచలం చేరుకున్నారు. మునుపెన్నడూ లేనివిధంగా ఈసారి ఆలయ అధికారులు కేవలం లిప్తపాటు మాత్రమే దర్శనానికి అనుమతినివ్వడం, భక్తులతో అనుచితంగా ప్రవర్తించడం, వీఐపీలకు, దళారులకు మాత్రమే అంతరాలయ దర్శన ఏర్పాట్లు చేయడంతో ఈ ఏడాది కూడా ఆలయనిబంధనలకు, భక్తుల మనోభావాలకు విరుద్ధంగా చందనోత్సవ నిర్వహణ జరిగిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఆలయ వంశపారంపర్య అనువంశిక ధర్మకర్త, కేంద్ర మాజీ మంత్రి అశోకగజపతిరాజు దంపతులు, కుటుంబసభ్యుల తొలి దర్శనం తర్వాత అర్ధరాత్రి 2.15 గంటలకు భక్తులకు దర్శనాలు ప్రారంభించారు. మంగళవారం రాత్రి నుంచే క్యూల్లో ఉన్న భక్తులను దర్శనానికి అనుమతిస్తూనే ఒక్కసారిగా వీఐపీల గేట్లు తెరిచేశారు. ప్రొటోకాల్కు విరుద్ధంగా.. ’గంట’లసేపు మంత్రులు, న్యాయమూర్తులు, ఐఏఎస్ అధికారులు, వీఐపీలు తదితర ప్రముఖులకు ఉదయం 5 నుంచి 6 గంటల వరకు అనుమతిస్తామని స్వయంగా మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు ఈవో చంద్రమోహన్ కొద్దిరోజులుగా ప్రకటిస్తూ వచ్చారు. చందనోత్సవం రోజు వచ్చేసరికి ప్రొటోకాల్ నిబంధనలన్నీ గాల్లోకి ఎగిరిపోయాయి. తెల్లవారుజాము 3 గంటల నుంచే ప్రొటోకాల్ దర్శనాలు మొదలైపోయాయి. దీంతో రూ.500, రూ.200లు టికెట్లు కొనుక్కొని క్యూల్లో నిలుచున్న భక్తులకు కష్టాలు మొదలయ్యాయి. ఆయా టికెట్లకు తొందరగానే దర్శనం అందుతుందని చెప్పిన అధికారులు తీరా ప్రొటోకాల్ దర్శనాల దెబ్బకు మూడు, నాలుగు గంటలపైనే పట్టింది. ఇక ఏకంగా మంత్రి గంటా శ్రీనివాసరావు తెల్లవారుజామున 3 గంటలకు పది వాహనాల్లో సుమారు 70 మందినిపైగా తీసుకుని వచ్చి ఆలయంలో హల్చల్ చేశారు. దాదాపు గంటకు పైగా ఆయన ఆలయంలోనే ఉండిపోవడంతో క్యూలైన్లన్నీ స్తంభించిపోయాయి. ఆయన ఆలయంలో ఉన్నంతసేపు క్యూలైన్లు కదల్లేదు. ఆ తర్వాత గంటా సతీమణి ఓ 30 మందిని తీసుకుని ఆలయంలోకి వచ్చారు. అప్పుడు కూడా సామాన్య భక్తుల క్యూలైన్లు నిలిచిపోయాయి. ప్రొటోకాల్ దర్శనాల వేళలకు ముందుగానే అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్ ఓ మంది అనుచరులతో వచ్చి ఆలయంలో హడావుడి చేశారు. సామాన్య భక్తులకు లిప్తకాలం.. ఆలయ సిబ్బంది దూషణ పర్వం సింహాచలం అప్పన్న ఆలయ ఆచారాలకు విరుద్ధంగా భక్తులకు ఈసారి కేవలం ఒకటి రెండు సెకన్ల పాటే దర్శనం కల్పిస్తూ అధికారులు, ఆలయ సిబ్బంది ఓవర్ యాక్షన్ చేశారు. లఘుదర్శనం అని ప్రకటించినప్పటికీ ఎంతోదూరం నుంచి వచ్చిన భక్తులను అర నిమిషం కాదు కదా.. పదిసెకన్లు కూడా దర్శనానికి అనుమతివ్వకుండా లాగిపడేశారు. ఒకింత వారించిన భక్తులపై సిబ్బంది దూషణ పర్వానికి దిగారు. స్వామి వారి విగ్రహం ఎదురుగూండానే పత్రికల్లో రాయలేని భాష పదేపదే ప్రయోగిస్తూ ఆలయ సిబ్బంది సామాన్యభక్తులపై ప్రతాపం చూపించారు. డిప్యుటేషన్ సిబ్బంది ఎక్కడ? చందనోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని వివిధ ఆలయాల నుంచి 150 మంది దేవాదాయ, ధర్మాదాయశాఖ ఉద్యోగులు డెప్యూటేషన్పై ఇక్కడకు వచ్చారు. విధి నిర్వహణలో మాత్రం వారు ఎక్కడున్నారు.. ఏం చేశారన్నది మాత్రం ఎవరికీ తెలియదు. విధుల కేటాయింపులో పక్కా ప్రణాళిక లేకపోవడంతో చాలా మంది విధులు నిర్వర్తించకుండా ఎవరి పనివారు చూసుకున్నారన్న వాదనలు ఉన్నాయి, పర్యవేక్షించాల్సిన ఈవో రామచంద్రమోహన్ వీఐపీల సేవలో తరించడం, మిగిలిన అధికారులు ప్రొటోకాల్ సేవల్లో మునిగిపోవడంతో డిఫ్యూటేషన్ సిబ్బంది ‘â¶పని’తనం గురించి పట్టించుకునే నాధుడే లేకుండా పోయాడు. రూ. వెయ్యి టిక్కెట్లు ఎన్ని? వెయ్యి రూపాయల వీఐపీ టికెట్లను ఈసారి 8 వేలు ముద్రించామని, బ్యాంకుల్లోనే విక్రయాలు చేస్తామని అధికారులు చెబుతూ వచ్చారు. ఆ మేరకు బ్యాంకుల్లో మంగళవారం సాయంత్రం వరకు విక్రయాలు చేశారు. బుధవారం ఆయా టికెట్లు తీసుకొచ్చిన వారి సంఖ్య 15 వేల మందికిపైగానే ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. 8 వేల టికెట్లు ముద్రిస్తే 15 వేల మంది ఎలా వచ్చారు.. బ్లాక్లో టికెట్ల విక్రయాలు పక్కనపెడితే ఎవరైనా నకిలీ టికెట్లు ముద్రించారా... అధికారులకు తెలిసే ఇదంతా జరిగిందా.. అన్న వాదనలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి, ఈ టికెట్లపై స్వయంగా అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు, పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అనుమానం వ్యక్తం చేస్తూ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారంటేనే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. తీరుమారని రామచంద్ర? అప్పన్న ఆలయ కార్యనిర్వహణాధికారిగా కె.రామచంద్రమోహన్ ఐదేళ్లుగా ఇక్కడే పాతుకుపోయారు. వాస్తవానికి రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో ఓ ఈవో ఐదేళ్లపాటు నిరాటంకంగా కొనసాగడం అనేది ఎక్కడా లేదు.. కానీ రామచంద్రమోహన్ శైలే వేరు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ ముఖ్యనేతల అడుగులకు మడుగులొత్తుతూ నిరాటంకంగా ఐదేళ్లుగా ఉన్నారంటేనే ఆయన పైరవీల ప్రతిభ ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు. ఎన్ని ఆరోపణలు వచ్చినా.. ఎన్ని విమర్శలు వచ్చినా చలించని ఈవో ఈ ఏడాది మాత్రం విమర్శలకు తావివ్వకుండా దర్శన ఏర్పాట్లు చేస్తామని ప్రకటిస్తూ వచ్చారు. కానీ చందనోత్సవం రోజు వచ్చిసరికి తనదైన రీతినే కొనసాగించారు. యథావిధిగా వీఐపీల సేవలోనే తరించారు. ఆలయ సంప్రదాయాలకు విరుద్ధంగా వేళ కాని వేళల్లో వీఐపీలను గంటల తరబడి అనుమతించారు. సర్వదర్శనానికి, టికెట్లు కొనుగోలు చేసి వచ్చిన భక్తులకు అవసరమైన ఏర్పాట్ల గురించి కనీసమాత్రంగా కూడా పట్టించుకోలేదు. -
నిరుపేద గిరిజనులకు తీర్థయాత్రలు
దివ్యదర్శన యాత్ర ప్రారంభం దేవాదాయ శాఖ ఆర్జేడీ చంద్రశేఖర్అజాద్ అడ్డతీగల (రంపచోడవరం) : దివ్యదర్శన యాత్ర ద్వారా నిరుపేద గిరిజనులకు తీర్థయాత్రల భాగ్యం కల్పిస్తున్నట్టు దేవాదాయ ధర్మాదాయశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు ఎస్ఎస్ చంద్రశేఖర్ ఆజాద్ తెలిపారు. నిరుపేద భక్తులకు దేవాదాయశాఖ కల్పించిన ఉచిత తీర్థయాత్ర సదుపాయాన్ని జిల్లాలోనే ప్రథమంగా సోమవారం అడ్డతీగల నుంచి ఆర్జేడీ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఒకసారి ప్రముఖ దేవాలయాలను సందర్శిస్తే అధ్యాత్మిక అనుభూతితో సమాజ హితానికి తోడ్పడడానికి కట్టుబడి తోటి వారిని ఉత్తేజపర్చాలనే బృహత్తర సంకల్పాన్ని పాదుకొల్పాలనేది దివ్యదర్శన యాత్ర లక్ష్యమన్నారు. ఈ యాత్ర నాలుగు నుంచి ఐదు రోజులు ఉంటుందన్నారు. జిల్లా నుంచి 18 నుంచి 70 ఏళ్ల ఆరోగ్యవంతులు ఏడాదికి 10 వేల మంది వరకూ రాష్ట్రంలోని 9 పెద్ద దేవాలయాల దర్శనం కల్పిస్తామని ఆర్జేడీ చంద్రశేఖర్ ఆజాద్ తెలిపారు. 90 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని, ఒకే కుటుంబంలో అత్యధికంగా ఐదుగురు వరకూ వెళ్లవచ్చన్నారు. ప్రతి వారం ఒక మండలంలో ఉన్న 200 మంది నిరుపేదలకు దివ్యదర్శన యాత్రలో భాగస్వాములను చేస్తామని ఆర్జేడీ చెప్పారు. యాత్రలో భక్తులు చేయకూడని పనులను ఆయన వివరించారు. భక్తులు, దేవాదాయశాఖ ఉద్యోగులు, ఆర్టీసీ సిబ్బందితో దీక్షా ప్రమాణం చేయించారు. అనంతరం అసిస్టెంట్ కమిషనర్ రమేష్బాబుతో కలిసి జెండా ఊపి యాత్ర ప్రారంభించారు. గోవిందనామస్మరణతో భక్తులు దివ్యదర్శన యాత్రకు బయలుదేరారు. హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ జిల్లా కన్వీనర్ తణుకు వెంకటరామయ్య, దేవాదాయశాఖ ఇన్స్పెక్టర్లు సతీష్కుమార్, శ్రీనివాస్, రామలింగేశ్వరరావు, ఇతర సిబ్బంది, సమరసత సేవా ఫౌండేషన్ కార్యకర్తలు పాల్గొన్నారు. -
సత్యదేవుడి దివ్యదర్శనం
రాత్రి ఏడు గంటలకు ఐదు బస్సుల్లో శ్రీకాకుళం భక్తుల రాక ఘన స్వాగతం పలికిన అధికారులు అన్నింటా ఉచిత ఏర్పాట్లు అన్నవరం: పేదలకు దేవాలయ దర్శనం చేయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘దివ్యదర్శనం’లో భాగంగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన భక్త బృందం 200 మంది ఐదు బస్సుల్లో శుక్రవారం రాత్రి అన్నవరం చేరుకుంది. వీరికి ఘాట్రోడ్ ముఖద్వారం వద్ద ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, ఈఓ కె.నాగేశ్వరరావు, రాజమహేంద్రవరం ఏసీ రమేష్బాబు, దేవస్థానం పండితులు ఘన స్వాగతం పలికారు. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం ఐదు గంటలకు ఈ బృందం రావాల్సి ఉండగా రెండుగంటలు ఆలస్యంగా వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎంఎల్ఏ, ఈఓ తదితరులు దేవస్థానంలో అన్నీ ఉచితంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు వసతి, అల్పాహారం, దర్శనం, ప్రసాదం ఉచితంగా అందచేస్తున్నట్లు తెలిపారు. తరువాత ఆ భక్తులను నేరుగా సత్యదేవుని దర్శనానికి తీసుకువెళ్లారు. దర్శనం అనంతరం వేదపండితులు వేదాశీస్సులందచేసి ప్రసాదాలు బహూకరించారు. వీరందరికీ సత్యగిరిపై ఉన్న విష్ణుసద¯ŒSలో బస ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం వీరు అల్పాహారం అయ్యాక విజయవాడ వెళ్తారని అధికారులు తెలిపారు. కాగా వీరి వాహనాల రాకకు ఆలస్యంపై ఆరా తీయగా విశాఖజిల్లా వేంపాడు చెక్పోస్టు వద్ద టోల్ ఫీజు కట్టలేదని దివ్యదర్శనం బస్లు ఆపేశారని, కలెక్టర్ జోక్యంతో వాటిని అనుమతించారని తెలిపారు. భక్తులకు అతిథి మర్యాదల్లో భాగంగా మహిళా భక్తులందరికీ మహిళా ఉద్యోగినుల చేత బొట్టు పెట్టించారు. వీరి కోసం సిబ్బందికి ప్రత్యేకంగా డ్యూటీలు వేశారు. దేవస్థానంలో వారికి వైద్యం అందజేయడానికి ప్రత్యేక వైద్య బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. అధికారిక ఉత్తర్వుల మేరకే విధంగా చేయాల్సి వచ్చిందని ఓ అధికారి తెలిపారు. కాగా, వచ్చే వారంలో విజయనగరం, విశాఖ జిల్లాలకు చెందిన భక్తుల బృందాలు కూడా దివ్యదర్శనం పథకం కింద అన్నవరం రానున్నారు. వారికి కూడా ఇదే విదంగా అతిధి మర్యాదలు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు సమాచారం.