breaking news
Dandayatra
-
‘దండయాత్ర’లో దోమలదే విజయం
అమరావతి: రాష్ట్రంలో విపరీతంగా పెరిగిపోయిన దోమలను నియంత్రించడానికి దండయాత్ర పేరుతో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం వథా ప్రయాసగానే మిగిలిపోయింది. దోమలు కాదు కదా.. కనీసం గుడ్లను కూడా ప్రభుత్వం నాశనం చేయలేకపోయింది. దీంతో ఎన్నడూ లేనంతగా రాష్ట్రం జ్వరాల గుప్పిట్లో విలవిల్లాడింది. ప్రధానంగా మున్సిపాలిటీలు, ఏజెన్సీ ప్రాంతాల్లో 2016 సంవత్సరంలో ఎప్పుడూ లేనంతగా డెంగీ, మలేరియా, చికెన్గున్యా జ్వరాలు జనాన్ని గుక్కతిప్పుకోకుండా చేశాయి. ఇది ఎంతగా అంటే ఒక దశలో ప్రభుత్వాస్పత్రుల్లో జ్వర బాధితులకు వారం రోజులు గడిచినా పడకలు దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో వైద్యులు కూడా చేతులెత్తేశారు. కనీసం సెలైన్ బాటిళ్లు కూడా దొరకని పరిస్థితి. విశాఖపట్నం, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు తదితర జిల్లాల్లో అయితే డెంగీ జ్వరాలు ఊహించని రీతిలో నమోదయ్యాయి. దీంతో ప్రభుత్వంపై పేద రోగులు దుమ్మెత్తి పోశారు. ఈ వ్యతిరేకతను తాళలేక ఉన్నపళంగా ‘దోమలపై దండయాత్ర–పరిసరాల పరిశుభ్రత’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాన్ని చేపట్టి మూడు రోజుల కిందటే మమ అని ముగించారు. రూ. 20 కోట్ల వ్యయం చేసి చేపట్టిన ఈ దండయాత్ర వథా ప్రయాసగా మిగిలినట్టు వైద్య ఆరోగ్యశాఖలో అధికారులే చెప్పుకుంటున్నారు. ముందస్తు చర్యలు లేకనే జ్వరాలు.. రాష్ట్రంలో జ్వరాలు ఏ సీజన్లో వస్తాయనే ప్రభుత్వానికి ముందస్తు సమాచారం ఉంటుంది. జూన్, జూలై మాసాల్లో జ్వరాలు విజభిస్తుంటాయి. దీనికోసం దోమల గుడ్డు (లార్వా) దశలోనే నిర్వీర్యం చేయాలి. మలాథియాన్, పైరిథ్రిమ్ పిచికారీ చేయడంతో పాటు పారిశుధ్యంపై అవగాహన కల్పించాలి. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ముమ్మర నియంత్రణ చర్యలు చేపట్టాలి. అలాంటివేమీ చేపట్టకుండా సెప్టెంబర్ దాకా వేచిచూసి, అందరూ మంచాన పడ్డాక ప్రభుత్వం కళ్లు తెరిచింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. గుడ్లన్నీ పగిలి దోమలుగా మారి సర్కారు మీదే దండయాత్ర చేశాయి. అన్నిటికీ మించి ఈ ఏడాది డెంగీ జ్వరాలు గత పదేళ్లలో ఎప్పుడూ లేనంతగా నమోదయ్యాయంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. వృథా ప్రయాసగా మిగిలిన ‘దోమలపై దండయాత్ర’ దోమలను కాదు.. వాటి గుడ్లను కూడా నిర్వీర్యం చేయలేకపోయారు 126 వాహనాలు, 4,300 ర్యాలీలు, 38 లక్షలకు పైగా కరపత్రాలు రూ. 20 కోట్ల నిధులు వథా.. ముగిసిన కార్యక్రమం దండయాత్ర బలగం ఇదీ.. దండయాత్రకు వాడిన వాహనాలు 126 ఎన్ని గ్రామాల్లో దండయాత్ర 1.43 లక్షలు ఎన్ని గ్రామాల్లో పారిశుధ్యం చేశారు 1.43 లక్షలు బ్లీచింగ్ పౌడర్ చల్లిన గ్రామాలు 35,953 స్వచ్ఛభారత్ మీటింగ్లు 3,610 కార్యక్రమాలు నిర్వహించిన స్కూళ్లు 5,796 పంచిన కరపత్రాల సంఖ్య 38.42 లక్షలు -
సీఎం దండయాత్ర బలాదూర్
సోదర, సోదరీ దోమణుల్లారా... హస్తిమశకాంతరమంటూ ఎగతాళి చేస్తుంటారు...ఏనుగును చూపించి మనల్ని చులకనగా చూస్తుంటారు. ఇటీవల పరిణామాలు చూస్తుంటే మీకేమనిపిస్తోంది. భీకర యుద్ధాల్లో పనిచేసే గజరాజుల కన్నా మనమే నిజరాజులమని ఆచరణలో నిరూపించాం కదా. ఘీంకార హోరుకన్నా జుం...మనే ఝూంకార నాద ప్రభంజనానికి అల్లాడిపోతున్నారు జనం. ఏజెన్సీ ప్రాంతం నుంచి మైదానం ప్రాంతం వరకు, ఊరూ...వాడల్లో ఎక్కడ చూసినా మన చిరునామాయే... ఎవరి నోట విన్నా మన నామ స్మరణమే. కాదంటారా కామ్రేడ్స్....మనపైనే యుద్ధం చేస్తారట...! దండయాత్ర అనగానే కాకలు దీరిన మహారాజులు, చక్రవర్తుల పేర్లు విన్నాం. వారంతా మరో రాజ్యంపై యుద్ధాలు చేసి జైత్ర యాత్ర చేశారు. మరిదేమిటీ రాష్ట్ర ప్రభుత్వం దండయాత్ర అంటోంది. అదీ మనపైన...మొదట్లో పిల్ల దోమలు తెగ భయపడ్డాయి. అవి కూడా ముందరి కాళ్లను పైకెత్తి వ్వె...వ్వె అంటూ వెక్కిరిస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా సీఎం నారా వారే దండయాత్రలో భాగంగా సమర శంఖం పూరిస్తారట. నేడే జిల్లాకు విచ్చేస్తున్నారు. వాళ్ల బలహీనతలే మనం బలంగా మార్చుకుందాం. ఈ జిల్లా భౌగోళిక పరిస్థితులు మీకు తెలియనివి కావు. అయినా మరోసారి మననం చేసుకుందాం. జిల్లాలో 1069 గ్రామ పంచాయతీలున్నాయి...వీటినే 779 క్లస్టర్లగా విభజించారు...మనల్ని చంపించడానికి అంతమంది గ్రామ కార్యదర్శులను నియమించాలి...వారికి బ్లీచింగ్ పౌడర్, గంబూషియా చేపలు అందజేయాలి. ఇవేవీ మంజూరు చేసిన దాఖలాలు లేవు. చెత్తను, మురుగును తొలగించడానికి పారిశుద్ధ్య కార్మికులను నియమించాలి. 2,600 మందికి మించి కార్మికులు లేరు. ఇక మనం కాటేసిన ఫలితానికి జ్వరమొస్తే వైద్యం చేసే వైద్యులే లేరాయే. ఆసుపత్రుల్లో ఆ పోస్టులన్నీ ఖాళీలే. ఏజెన్సీలో కాళ్లవాపుతో వరుస మరణాలు సంభవిస్తున్నా లోగుట్టు తెలుసుకోక ఇటు అధికారులు ...అటు వైద్య నిపుణులు జుత్తు పీక్కుంటున్నారు. రక్త పరీక్షలు చేసినా పట్టుపడనంత పకడ్బందీగా రోగాలను విస్తరించే తెలివితేటలు మనకే సొంతం. ఏజెన్సీ ప్రాంతంలో 186 పంచాయతీల్లో మనదే రాజ్యం. పోటీ ప్రభుత్వాన్ని నడుపూతూ మనం విసురుతున్న సవాళ్లకు గింగిర్లు తిరిగిపోతున్నారు పరి‘పాలకులు’. నిధులు ఇవ్వకుండా ...యుద్ధ సామగ్రి లేకుండా గాలిలో కత్తులు తిప్పుతూ జనాన్ని మభ్య పెడుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే నీడతో యుద్ధం చేస్తున్నారు. పక్కనున్న రాష్ట్రం జలాలు అడ్డంగా తరలించుకుపోతున్నా అడగలేకపోతున్నారు ... ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా ప్రశ్నించలేకపోతున్నారు .. ‘మాకూ ఏసీబీ ఉంది ... పోలీసులున్నారు ...ఖబడ్దార్’ అంటూ ఢంకా బజాయించి తోక జాడించి రాజీ పడిన చరిత్ర వారిది ... మనకు రాజీలుండవు .. అంతా రాజమార్గమే. చల్...చల్రా భాయ్...