ఐదేళ్లలో పది లక్షల మందికి ఉపాధి కల్పనే లక్ష్యం
కొలంబో సదస్సులో మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఐదేళ్లలో పది లక్షల మందికి ఉపాధి కల్పించడం లక్ష్యంగా పనిచేస్తున్నామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. శ్రీలంక రాజధాని కొలంబోలో జరుగుతున్న హ్యూమన్ కాపిటల్ సదస్సు-2016లో ‘బిల్డింగ్ ఎ ఫ్యూచర్ రెడీ వర్క్ఫోర్స్, ఇండియన్ ఎక్స్పీరియెన్స్’ అనే అంశంపై కేటీఆర్ గురువారం ప్రసంగించారు. శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘె, మలేసియాలోని పెరక్ రాష్ట్ర ముఖ్యమంత్రి జంబ్రి అబ్దుల్ ఖదీర్, ప్రపంచ బ్యాంకు మానవాభివృద్ధి విభాగం డెరైక్టర్ అమిత్ధర్ తదితరులు పాల్గొన్న సమావేశంలో భారతదేశ ప్రతినిధిగా కేటీఆర్ హాజరయ్యారు.
దేశంలో ఉపాధి అన్వేషణలో భాగంగా రోజూ వేలాది మంది లేబర్ మార్కెట్లోకి వస్తున్నా.. నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరత తీవ్రంగా ఉందని అన్నారు. దేశంలో వ్యవసాయ రంగంలో కూలీల సంఖ్య క్రమంగా తగ్గుతోందని.. ఈ నేపథ్యంలో ఉత్పత్తి, సేవారంగాల్లో వారికి ఉపాధి కల్పించాల్సిన బాధ్యత వుందని పేర్కొన్నారు. ఉత్పత్తి, సేవారంగాలకు అవసరమైన నైపుణ్య శిక్షణకు ఐటీఐల వంటి సంస్థలు ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో లక్ష్యం నెరవేరడం లేదని తెలిపారు. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ మిషన్ ద్వారా కేంద్రం చేపట్టిన కార్యక్రమాలను, రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించారు.
విదేశీ ప్రతినిధులతో భేటీ
పర్యటనలో భాగంగా శ్రీలంకలో భారత హై కమిషనర్ వైకే సిన్హాతో కేటీఆర్ భేటీ అయ్యారు. శ్రీలంక, తెలంగాణ నడుమ వాణిజ్య సంబంధాల పెంపు, కొలంబో, హైదరాబాద్ మధ్య నేరుగా విమాన సౌకర్యాలపై చర్చించారు. శ్రీలంకకు చెందిన సంస్థలతో హెల్త్కేర్, ప్రత్యామ్నాయ ఇంధన వనరులు, టూరిజం రంగాల్లో జాయింట్ వెంచర్ల ఏర్పాటుకు సహకరించాల్సిందిగా కోరారు. ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్టైల్, లాజిస్టిక్స్ వ్యాపారంలో పేరొందిన జాన్ కీల్స్ కంపెనీతో పెట్టుబడులపై కేటీఆర్ చర్చించారు. వరంగల్ టెక్స్టైల్ పార్కులో పెట్టుబడులు పెట్టాల్సిందిగా గార్మెంట్ ఫ్యాక్టరీలను ఆహ్వానించారు.