breaking news
Chikun gunya
-
ఊరికి జ్వరమొచ్చింది..
రామాయంపేట(మెదక్): ఊరు మంచం పట్టింది. వైద్యసేవల్లేక ఊరు ఊరంతా విలవిలలాడుతోంది. మెదక్ జిల్లా రామాయంపేట మండలం దొంగల ధర్మారంలో చికున్ గున్యా వణికిస్తోంది. గ్రామంలో 400 మంది చికున్గున్యాతో బాధపడుతున్నారు. ఏ ఇంట్లో చూసినా జ్వరపీడితులే. సరైన వైద్యసేవలు అందుబాటులో లేకపోవడంతో 15 రోజులుగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కొందరు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి చికిత్స చేయించుకున్నా ఫలితం లేదు. గ్రామంలో పారిశుధ్యం లోపించింది. రోడ్లపై ఎక్కడ చూసినా మురుగునీరే. ఇళ్ల మధ్య నుంచే మురుగునీరు పారుతోంది. దోమలు విజృంభిస్తున్నాయి. గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సరైన వసతులు లేవని, కేవలం రెండు, మూడు మందు బిళ్లలు ఇచ్చి పంపుతున్నారని బాధితులు వాపోతున్నారు. మా దృష్టికి రాలేదు.. ఈ విషయమై జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటేశ్వర్రావును ‘సాక్షి’ఫోన్లో సంప్రదించగా గ్రామంలోని పరిస్థితి తమ దృష్టికి రాలేదన్నారు. వారికి చికున్ గున్యా వ్యాధి సోకినట్లు అనుమానిస్తున్నామని తెలిపారు. ఇటీవల కొందరు గ్రామంలోని పీహెచ్సీకిరాగా, తమ సిబ్బంది చికిత్స చేసి పంపారని పేర్కొన్నారు. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి బాధితులకు వైద్య సేవలు అందిస్తామని చెప్పారు. -
చికున్గున్యా టీకా సిద్ధం
న్యూయార్క్: ప్రపంచాన్ని వణికిస్తున్న రోగాల్లో చికున్ గున్యా మొదటి వరుసలో ఉంటుంది. అలాంటి ఈ చికున్ గున్యాను దీర్ఘకాలంగా నివారించడానికి ప్రస్తుతం పరిశోధకులు వ్యాక్సిన్ సిద్ధం చేశారు. మొదట్లో ఆసియా, ఆఫ్రికా, యూరోప్ దేశాలను వణికించిన ఈ వైరస్ ప్రస్తుతం అమెరికన్లను సైతం గడగడలాడిస్తోంది. ఈ వ్యాక్సిన్ తమ పరిశోధనల్లో స్థిరమైన ఫలితాలను ఇచ్చినట్లు ఫిలడెల్ఫియాలోని విస్టర్ ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్ కరుపయ్య ముత్తుమణి తెలిపారు. ఈయన భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త. ఈ వ్యాక్సిన్ దీర్ఘకాలికంగా కూడా ఎంతో ప్రభావం చూపుతుందని ఆయన పేర్కొన్నారు. ఎంతో వేగంగా వైరస్ను ఎదుర్కొని వ్యాధి నిరోధకతను పెంపొందించడంలో ఈ వ్యాక్సిన్ ప్రముఖ పాత్ర వహిస్తుందని పేర్కొన్నారు. ఈ పరిశోధన ఫలాలను ఇన్ఫెక్షన్స్ డీసీజెస్ జర్నల్లో ముద్రించినట్లు తెలిపారు.