breaking news
Cell phones Theft
-
లేడీస్ హాస్టల్స్ టార్గెట్.. ఊహించని రీతిలో దొరికాడు
క్రైమ్: లేడీస్ హాస్టల్స్ను టార్గెట్ చేసుకుని చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి.. అనూహ్యంగా పోలీసులకు చిక్కాడు. హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలంలోని ఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీ గర్ల్స్ హాస్టల్లో సెల్ఫోన్లు, ల్యాప్ట్యాప్ల చోరీ కలకలం రేగింది. ఏకంగా హాస్టల్లో ఓ బాత్రూం డోర్ బద్దలు కొట్టి మరీ చోరీలు చేశాడు ఆగంతకుడు. దీంతో.. బెంబేలెత్తిన విద్యార్థులు కాలేజీ ఎదుట ఆందోళన సైతం చేపట్టారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. అయితే.. అందరినీ హడలెత్తించిన దొంగ ఊహించని విధంగా దొరికాడు. సెల్ ఫోన్లు, ల్యాప్టాప్ను దొంగలించి రాత్రి పొలాల గుండా పారిపోతుండగా.. చీకట్లో ఓ వ్యవసాయ బావిలో పడిపోయాడు. ఉదయం కేకలతో అతన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. తాడు సాయంతో బయటకు తీసి అదుపులోకి తీసుకున్నారు. -
సెల్ఫోన్ చోరుల కొత్త పంథా..
సెల్ఫోన్ల దొంగలు రూట్ మార్చారు. ఒకప్పుడు చోరీ చేసిన ఫోన్లను యథాతథంగా వినియోగించడం/విక్రయించడం జరిగేది. ఆ తర్వాత కొన్నాళ్లకు ఇలా తస్కరించిన ఫోన్ల ఐఎంఈఐ నెంబర్లను ట్యాంపరింగ్/క్లోనింగ్ చేసి వాడటం మొదలెట్టారు. ఆపై ఇతర రాష్ట్రాలు, దేశాలకు విదేశాలకు తరలించేయడం చేశారు. తాజాగా చోరీ ఫోన్లను స్పేర్ పార్ట్స్గా మార్చి అమ్మేస్తున్నట్లు నగర పోలీసులు గుర్తించారు. ఈ ముఠాల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలోని పిక్పాకెటింగ్ గ్యాంగ్లు ఒకప్పుడు కేవలం పర్సుల్ని మాత్రమే టార్గెట్ చేసేవి. అయితే ప్లాస్టిక్ కరెన్సీగా పిలిచే క్రెడిట్, డెబిట్ కార్డుల వినియోగం పెరిగిన తరవాత వీరి దృష్టి సెల్ఫోన్లపై పడింది. పీడీ యాక్ట్ ప్రయోగం ప్రారంభమయ్యే వరకు కరుడుగట్టిన రౌడీషీటర్లు కూడా ముఠాలు కట్టి మరీ వ్యవస్థీకృతంగా సెల్ఫోన్ చోరీలకు పాల్పడ్డారని పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికీ మరికొన్ని చోటా మోటా ముఠాలు ఈ దందాలో ఉన్నాయని అంటున్నారు. ఒకరి ‘ఏరియా’ల్లోకి మరోకరు ప్రవేశిస్తుండటంతో వీటి మధ్య అనేక సందర్భాల్లో గ్యాంగ్ వార్స్ జరిగాయి. గల్లీ దుకాణాల కేంద్రంగానే.. అనధికారిక సమాచారం ప్రకారం రాజధానిలో ఏటా దాదాపు లక్ష వరకు సెల్ఫోన్లు చోరీకి అవుతున్నాయి. రాజధాని నగరంలో అనేక ఛోటామోటా ముఠాలు సెల్ఫోన్ పిక్పాకెటింగ్, స్నాచింగ్ను వ్యవస్థీకృతంగా చేస్తున్నాయి. బస్సు ప్రయాణికులు, పాదచారులను లక్ష్యంగా చేసుకుని ఈ సెల్ఫోన్ నేరం అనేది కొనసాగుతోంది. వీరిబారిన పడే వారిలో మధ్య తరగతి వారే ఎక్కువగా ఉంటున్నారు. ఇలాంటి ఫోన్లను స్పేర్పార్ట్స్గా మార్చడం ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఈ దందాను పెద్ద దుకాణాలు, మార్కెట్లలో కాకుండా గల్లీల్లో ఉండే చిన్న చిన్న దుకాణాల కేంద్రంగా చేస్తున్నారనే సమాచారం ఉంది. వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నాం. – నగర పోలీసు ఉన్నతాధికారి గతంలో ఐఎంఈఐ నెంబర్ మార్చేసి... ప్రపంచంలో తయారయ్యే ప్రతి మొబైల్ ఫోన్కీ ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫికేషన్(ఐఎంఈఐ) నెంబర్ ఉంటుంది. సదరు సెల్ఫోన్ను ఎవరు వాడుతున్నది తెలుసుకోవడానికి ఇది ఉపకరిస్తుంది. ఐఎంఈఐ నెంబర్ ట్యాంపర్ చేసేందుకు ఉపకరించే గ్యాడ్జెట్ ఇంటర్నెట్లో లభిస్తున్నాయి. చోరీ ఫోన్లకు దొంగల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసే వ్యక్తులు ఈ గ్యాడ్జెట్స్ను వినియోగించి దానికి ఉన్న నెంబర్కు బదులు మరో ఐఎంఈఐ నెంబర్ కేటాయించేసేవారు. మరోపక్క పనికి రాని పాత ఫోన్లను రూ.వందల్లో కొనుగోలు చేస్తూ వాటి మదర్ బోర్డ్పై ఉన్న ఐఎంఈఐ నెంబర్ స్ట్రిప్ను ట్యాంపరింగ్ ద్వారా సేకరించి చోరీ వాటికి వేసేసే వారు. ఇలా చేస్తే సాంకేతికంగా చోరీ ఫోన్లను పట్టుకోవడం సాధ్యం కాదు. ఇలా విడగొట్టేసి.. అలా విక్రయాలు ఇటీవల కాలంలో చోరీ ఫోన్లను ఖరీదు చేసే నగర వ్యాపారుల పంథా పూర్తిగా మారిపోయినట్లు సిటీ పోలీసులు గుర్తించారు. వీటిని యథాతథంగా విక్రయిస్తే నిఘా సమస్య ఉంటోందని భావించారు. దీంతో స్పేర్పార్ట్స్గా మార్చేసి అమ్ముతున్నారు. ఐఎంఈఐ నెంబర్ అనేది ఫోన్ మదర్ బోర్డ్కు సంబంధించిన అంశం. ఈ నేపథ్యంలోనే దీన్ని మాత్రం అమ్మకుండా మిగిలిన అన్ని విడి భాగాలకు సెల్ఫోన్ దుకాణాలకు అమ్మేస్తున్నారు. ఇలా చేయడంతో లాభం తక్కువగా ఉన్నప్పటికీ రిస్క్ అనేది ఉండదన్నది చోరీ సొత్తు విక్రేతల ఉద్దేశం. కొందరు సెల్ఫోన్ రిపేరింగ్ షాపులతో పాటు ఇతర ప్రాంతాల్లోని మార్కెట్లతో ఈ తరహా విక్రేతలకు సంబంధాలు ఉంటున్నాయని అధికారులు తేల్చారు. ఈ దందా చేస్తున్న వ్యాపారుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ► కొన్నేళ్ల నుంచి కరోనా ముందు రోజుల వరకు ఈ చోరీఫోన్లు దేశం దాటేశాయి. ► ఈ ఫోన్లను వ్యవస్థీకృత ముఠాలు ఇతర రాష్ట్రాలతో పాటు దేశాలకు తరలించేసిన సందర్భాలు అనేకం. ► ఐ–ఫోన్ల వంటివైతే ఒక్కో విడతలో నాలుగైదు ఫోన్లు చొప్పున బ్యాంకాక్ తీసుకువెళ్ళి అక్కడ మార్కెట్లో అమ్మేసి వచ్చిన చోరులు అనేక మంది ఉన్నారు. ► నగరంలో జగదీష్ మార్కెట్ మాదిరిగా ఆ దేశంలోనూ ఓ భారీ సెకండ్ హ్యాండ్ ఫోన్ల మార్కెట్ ఉందని, అయితే ఐ–ఫోన్లకే గిరాకీ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో పాటు గుల్బర్గాలో ఉన్న సెకండ్ హ్యాండ్ మార్కెట్లో దేశంలో చోరీ మాల్కు కేరాఫ్ అడ్రస్ అని పోలీసులు గుర్తించారు. ఇలానే రిటర్న్ మాల్ పేరుతో చైనాకు చోరీ ఫోన్లు పంపిన సందర్భాలు అనేకం. -
రూ.7 కోట్ల విలువైన సెల్ఫోన్లతో పరార్
నగరి (చిత్తూరు జిల్లా): తమిళనాడులోని శ్రీపెరంబదూరు ఫ్లెక్స్ ఇండియా కంపెనీ నుంచి ముంబైకి రెడ్మీ సెల్ఫోన్ల లోడు తీసుకెళ్తున్న కంటైనర్ను సినీ ఫక్కీలో హైజాక్ చేసి.. అందులోని రూ.7 కోట్ల విలువైన ఫోన్లను ఎత్తుకుపోయిన ఘటన చిత్తూరు జిల్లా నగరి–పుత్తూరు మధ్య జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ప్రాథమిక సమాచారం మేరకు మంగళవారం సాయంత్రం బయలుదేరిన కంటైనర్ను మరో రెండు లారీలు వెంబడిస్తూ వచ్చాయి. సెల్ఫోన్లతో వస్తున్న కంటైనర్ మంగళవారం రాత్రి నగరి మండలంలోని తడుకుపేట వద్ద గల ఆంధ్రా చెక్పోస్టు దాటగానే రెండు లారీలపై వచ్చిన దుండగులు కంటైనర్ డ్రైవర్ మహమ్మద్ ఇర్ఫాన్పై దాడి చేశారు. అతడి కాళ్లు, చేతులు కట్టేసి.. నోట్లో గుడ్డలు కుక్కి కళ్లకు గంతలు కట్టారు. ఆ తరువాత కంటైనర్ను హైజాక్ చేశారు. అక్కడి నుంచి 8 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన అనంతరం డ్రైవర్ను కింద పడేసి కంటైనర్ను తీసుకుపోయారు. గాయాల పాలైన ఇర్ఫాన్ మంగళవారం రాత్రి 10 గంటలకు నగరి పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. విచారణ ప్రారంభించిన పోలీసులు బుధవారం ఉదయం పుత్తూరు శివారులో రోడ్డుపై వదిలి వెళ్లిన కంటైనర్ను కనుగొన్నారు. సగం సెల్ఫోన్లు ఎత్తుకుపోయారు ► కంటైనర్లో 16 బాక్సుల రెడ్మీ ఫోన్లు తీసుకురాగా.. దుండగులు వదలివెళ్లిన లారీలో 8 బాక్సులు మాత్రమే ఉన్నాయి. ► మిగిలిన 8 బాక్సులను దుండగులు వారు తెచ్చిన లారీల్లోకి ఎక్కించి తీసుకెళ్లినట్టు భావిస్తున్నారు. ► కంటైనర్లో తెచ్చిన సెల్ఫోన్ల విలువ వే బిల్ ప్రకారం రూ.14 కోట్లు కాగా.. చోరీకి గురైన సెల్ఫోన్ల విలువ రూ.7 కోట్లుగా తేలింది. ► సెల్ఫోన్లు పంపిన సంబంధిత కంపెనీ ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు చేయకపోవడంతో పూర్తి వివరాలు తెలియరాలేదు. ► గాయపడిన డ్రైవర్ ఇర్ఫాన్ను ఆస్పత్రికి తరలించారు. సీఐ రాజశేఖర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
దొంగల అరెస్టు: 78 సెల్ఫోన్లు స్వాధీనం
చాంద్రాయణగుట్ట: సెల్ఫోన్ల చోరీకి పాల్పడుతున్న ఇద్దరిని దక్షిణ మండలం టాస్క్ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 78 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నగర టాస్క్ఫోర్స్ అదనపు డీసీపీ ఎన్ .కోటిరెడ్డి కథనం ప్రకారం... ముషీరాబాద్కు చెందిన పండ్ల వ్యాపారి మహబూబ్ లదాఫ్ (32) ఆర్థిక సమస్యలు ఎదుర్కొటున్నాడు. తలాబ్కట్టకు చెందిన మహ్మద్ జహీర్ షా (28) సెల్ఫోన్లు చోరీ చేసి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడమని లదాఫ్ను పురిగొల్పాడు. లదాఫ్ సెల్ఫోన్ షాపుల వద్దకు వెళ్లి.. వాటి యజమానులను మాటల్లో పెట్టి ఫోన్లు చోరీ చేయడం మొదలెట్టాడు. ఎత్తుకొచ్చిన సెల్ఫోన్లను జహీర్కు ఇచ్చి డబ్బు తీసుకునేవాడు. జహీర్ ఆ ఫోన్లను విడిభాగాలుగా చేసి విక్రయించేవాడు. విశ్వసనీయ సమాచారం అందుకున్న దక్షిణ మండలం టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 78 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.