breaking news
cbi nampally court
-
జగన్కు బెయిల్ మంజూరు
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప లోక్సభ సభ్యుడు జగన్మోహన రెడ్డికి నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. క్విడ్ప్రోకో కేసుకు సంబంధించి సిబిఐ ఛార్జిషీట్లు దాఖలు చేయడం పూర్తి చేసింది. తమ దర్యాప్తు ముగిసిందని కూడా సీబీఐ వెల్లడించింది. సుప్రీం కోర్టు సూచనల మేరకు గడువు ముగియడంతో బెయిల్ కోసం జగన్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్పై ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఈరోజు బెయిలు మంజూరు చేసింది. జగన్మోహన రెడ్డి క్విడ్ప్రోకో కేసులో 8 కంపెనీలకు సంబంధించి ఆధారాలు లభించలేదని సిబిఐ కోర్టుకు తెలిపింది. వైఎస్ జగన్ సహా 73 మందిపై దర్యాప్తు పూర్తిచేసినట్లు సీబీఐ కోర్టుకు వివరించింది. పదింట ఎనిమిది కేసుల్లో ఎలాంటి క్విడ్ప్రోకో జరగలేదని దర్యాప్తు సంస్థ నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టుకు మెమో రూపంలో వెల్లడించింది. హైకోర్టు ఆదేశించిన అన్ని అంశాలపై దర్యాప్తు పూర్తి చేశామని నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన మెమోలో సిబిఐ వివరించింది. మొత్తం పది కంపెనీలకు సంబంధించి దర్యాప్తు చేశామని, ఇందులో ఎనిమిది కంపెనీల్లో క్విడ్ప్రోకోకు ఎలాంటి ఆధారాలు లేవని సిబిఐ వివరించింది. సండూర్, కార్మెల్ ఏషియా హోల్డింగ్, పివిపి బిజినెస్ వెంచర్స్, జూబ్లీ మీడియా కమ్యూనికేషన్స్, క్లాసిక్ రియాల్టీ, ఆర్ఆర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్, సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్, మంత్రి డెవలపర్స్లలో క్విడ్ప్రోకోకు ఆధారాలు లభించలేదని సిబిఐ వెల్లడించింది. 16 కోల్కతా కంపెనీలకు సంబంధించి ఇడి, ఐడి దర్యాప్తు చేస్తున్నాయని తెలిపింది. తాజా దర్యాప్తుతో మాజీ మంత్రి శంకర్రావు, టిడిపి నేత ఎర్రన్నాయుడుల పిటిషన్లపై దర్యాప్తు పూర్తయినట్లు సిబిఐ తెలిపింది. -
జగన్కు బెయిల్ ఇవ్వద్దు: సీబీఐ
-
జగన్కు బెయిల్ ఇవ్వద్దు: సీబీఐ
హైదరాబాద్ : క్విడ్ ప్రో కో కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం దర్యాప్తు పూర్తైందని నాంపల్లి సీబీఐ కోర్టుకు సీబీఐ తెలిపింది. జగన్ బెయిల్ పిటిషన్పై సీబీఐ అధికారులు నాంపల్లి సీబీఐ కోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. రాజకీయంగా అత్యంత ప్రభావశీలి అయిన జగన్ను ఈ పరిస్థితుల్లో విడుదల చేస్తే విచారణకు ఆటంకం కలుగుతుందని కౌంటర్లో సీబీఐ పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో బెయిల్ మంజూరు చేయరాదని కోర్టును కోరింది. రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు దాఖలు చేసిన ఆర్సీ నెంబర్ 19/ఏ కేసుకు సంబంధించి అన్ని అంశాల్లో తమ దర్యాప్తు ముగిసిందని సీబీఐ... కోర్టుకు వెల్లడించింది. నాలుగు నెలల్లో దర్యాప్తు పూర్తి చేయమని మాత్రమే కోర్టు చెప్పిందని...పిటిషనర్కు బెయిల్ మంజూరు చేయాలనే ప్రస్తావన లేదని సీబీఐ కోర్టుకు తెలిపింది. మరో వైపు జగన్కు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాది సుశీల్ కుమార్ వాదనలు వినిపిస్తున్నారు. దర్యాప్తు పూర్తయిందని చెప్పినందున బెయిల్ మంజూరు చేయాలని సుశీల్ కుమార్ కోర్టును కోరారు.