breaking news
bye-laws
-
RRR దాకా మహా నగర విస్తరణకు మార్గదర్శనం
సాక్షి, సిటీబ్యూరో: భవన నిర్మాణ రంగానికి సరికొత్త దిశా నిర్దేశం చేసేందుకు హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) సన్నద్ధమవుతోంది. అంతర్జాతీయ ప్రమాణాలకనుగుణంగా నిర్మాణాలు చేపట్టేలా సమగ్ర బిల్డింగ్ బైలాస్ (Building Bye Laws) రూపకల్పనకు కసరత్తు చేపట్టింది. ఈ మేరకు పలు దేశ విదేశాలకు చెందిన మెట్రోపాలిటన్ నగరాల్లోని బిల్డింగ్ బైలాస్పై అధ్యయనం చేసి మహా నగర అవసరాలకు అనుగుణంగా బైలాస్ను (నియమ, నిబంధనలు) రూపకల్పన చేసేందుకు ఒక కన్సల్టెన్సీని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ఆసక్తిగల సంస్థల నుంచి త్వరలో రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ను స్వీకరించనున్నట్లు హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు.మహా నగర పరిధిని ట్రిపుల్ ఆర్ వరకు విస్తరించిన నేపథ్యంలో భవిష్యత్ అవసరాల దృష్ట్యా సమగ్ర మాస్టర్ ప్లాన్ను రూపొందించేందుకు హెచ్ఎండీఏ కార్యాచరణ చేపట్టిన సంగతి తెలిసిందే. రీజినల్ రింగ్రోడ్డు (Regional Ring Road) వరకు మౌలిక, ప్రజారవాణా సదుపాయాల విస్తరణ, పచ్చదనం పెంపు, నీటివనరుల సంరక్షణ తదితర అంశాలపై మాస్టర్ప్లాన్ను రూపొందిస్తున్నారు. ఈ క్రమంలోనే భవన నిర్మాణాలకు శాస్త్రీయమైన బైలాస్ను సైతం అందుబాటులోకి తెచ్చేందుకు హెచ్ఎండీఏ కసరత్తు చేపట్టింది. దీనివల్ల నిర్మాణ సంస్థలకు అనుమతులను అందజేయడంలో అనవసరమైన జాప్యాన్ని నివారించడమే కాకుండా అడ్డదిడ్డ నిర్మాణాలను అరికట్టేందుకు అవకాశం ఉంటుందని అధికారులు చెప్పారు. మరోవైపు ఎలాంటి నిబంధనల ఉల్లంఘనకు తావులేకుండా నిర్మాణాలు జరుగుతాయని పేర్కొన్నారు. ఆకాశ హర్మ్యాలకు అంతర్జాతీయ ప్రమాణాలు..నగరంలో నిర్మాణ రంగం స్థిరంగా కొనసాగుతోంది. గత పదేళ్లుగా బహుళ అంతస్తుల భవనాలు పెరిగాయి. ప్రస్తుతం 57 నుంచి 65 అంతస్తుల హైరైజ్ భవనాలు నిర్మాణమవుతున్నాయి. అదేక్రమంలో విశాలమైన విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీ సదుపాయాలు విస్తరిస్తున్నాయి. కానీ కచ్చితమైన నిబంధనలు పాటించడం లేదనే అభిప్రాయం బలంగా ఉంది. ఒక భవనానికి మరో భవనానికి ఒకేలా నిబంధనలు అమలు కావడం లేదు. మరోవైపు డీవియేషన్స్ సైతం ఎక్కువగా నమోదవుతున్నాయి. హెచ్ఎండీఏ (HMDA) అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి డీవియేషన్లను (ఉల్లంఘనలను) గుర్తించినపప్పటికీ వాటిని సవరించడంలో విఫలమవుతున్నారు. మరోవైపు ఈ ఉల్లంఘనల వల్ల అనుమతులను ఇవ్వడంలో కూడా జాప్యం నెలకొంటోంది. ఈ నేపథ్యంలో నిర్మాణ రంగం భవితవ్యాన్ని దృష్టిలో ఉంచుకొని బిల్డింగ్ బైలాస్ రూపకల్పనపై దృష్టి సారించారు. వివిధ నగరాలపై అధ్యయనం.. ప్రస్తుతం ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో బిల్డింగ్ బైలాస్ అమల్లో ఉన్నాయి. నివాస భవనాలకు, వ్యాపార, వాణిజ్య భవనాలకు, ఆసుపత్రులు, విద్యాసంస్థలు వంటి భవనాలకు ప్రామాణికమైన నిబంధనలను పాటిస్తున్నారు. భవనాల నిర్మాణం, భద్రత, పర్యావరణ పరిరక్షణ,నగర అభివృద్ధి వంటి అంశాలను లక్ష్యాలుగా చేసుకొని ఈ నిబంధనలు రూపొందించారు.ఇందుకోసం ముంబయిలో ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్ఎస్ఐ), ఢిల్లీలో ఫ్లోర్ రేషియో ఏరియా (ఎఫ్ఏఆర్) వంటి ప్రామాణికమైన పద్ధతులను అమలు చేస్తున్నారు. నిర్మాణ వైశాల్యం, ప్లాట్ వైశాల్యం ఏ విధంగా ఉండాలనేది ఈ ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది. చదవండి: హైదరాబాద్లో ఇక పక్కాగా 'వరద' నివారణ ఒక్కో ప్రాంతంలో ఎఫ్ఎస్ఐ ఒక్కో విధంగా ఉంటుంది. ఉదాహరణకు దక్షిణ ముంబైలో ఎఫ్ఎస్ఐ 1.33 శాతం ఉంటే, సబర్బన్ ప్రాంతాల్లో 2.7 శాతం, ఆసుపత్రులు, విద్యాసంస్థలకు 5.32 శాతం చొప్పున ఉంది. ఢిల్లీలోనూ ఆయా ప్రాంతాలకు అనుగుణంగా ఎఫ్ఏఆర్ను నిర్ణయించారు. ఇదే తరహాలో హైదరాబాద్లో నిర్దిష్టమైన ప్రమాణాలు రూపొందించాలని హెచ్ఎండీఏ భావిస్తోంది. భవనం చుట్టూ ఖాళీ స్థలం (సెట్బ్యాక్), భవనం ఎత్తు, ఓపెన్ స్పేస్ ఏరియా వంటివి కూడా కచ్చితమైన ప్రమాణాలతో రూపొందించాలి. అలాగే.. జపాన్, అమెరికా, యూరప్ దేశాల్లోని బిల్డింగ్ బైలాస్పైనా అధ్యయనం చేసి ఇప్పటి వరకు ఉన్న ప్రమాణాల కంటే మరింత మెరుగైన ప్రమాణాలను, నియమ నిబంధనలను రూపొందించేందుకు కసరత్తు జరుగుతుందని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు.తుది దశలో మాస్టర్ప్లాన్.. రాబోయే 25 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ట్రిపుల్ ఆర్ వరకు హైదరాబాద్ మహానగర విస్తరణకు అనుగుణంగా హెచ్ఎండీఏ సమగ్ర మాస్టర్ప్లాన్ రూపకల్పన చేపట్టింది. ముసాయిదా ప్రణాళికలను త్వరలో ప్రకటించనున్నారు. మాస్టర్ప్లాన్ ప్రణాళికలు తుదిదశలో ఉన్నాయని, వచ్చే సెప్టెంబర్ నాటికి ముసాయిదా అందుబాటులోకి వస్తుందని అధికారులు భావిస్తున్నారు. -
‘శ్రవణం’పై నీలినీడలు
బెలాను ఉల్లంఘిస్తున్న టీటీడీ కొత్త కో-ఆర్డినేటర్ను నియమించే ప్రయత్నాలు తిరుపతి: బాల్యం నుంచే వినికిడి లోపం ఉన్న చిన్న పిల్లలకు వినికిడి లోపాలను సరిచేసి, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు టీటీడీ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన శ్రవణం(బాలవిద్యాలయ) ప్రాజెక్ట్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఇన్నాళ్లూ ప్రాజెక్ట్ నిర్వహణ భారాన్ని మోసిన చెన్నైకి చెందిన బాలవిద్యాలయ డెరైక్టర్ సరస్వతీనారాయణస్వామిని శ్రవణం కోఆర్డినేటర్ బాధ్యతల నుంచి తప్పించిన టీటీడీ యాజమాన్యం ట్రస్ట్ బైలాస్కు విరుద్ధంగా స్థానికంగా పలుకుబడి గలిగిన ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు సన్నాహాలు చేస్తోంది. ట్రస్ట్ బైలాస్ ప్రకారం శ్రవణం ప్రాజెక్ట్ డెరైక్టర్గా మహిళలను నియమించాల్సి ఉంది. అందుకు భిన్నంగా సిఫార్సులకు లొంగి మగవారిని డెరైక్టర్గా నియమించే పనిలో టీటీడీ నిమగ్నమైంది. తిరుపతికి చెందిన ఒక ఈఎన్టీ వైద్య నిపుణుడిని శ్రవణం కోఆర్డినేటర్గా నియమించనున్నట్లు తెలిసింది. అయితే అందుకు విరుద్ధంగా మహిళలను కాదని, మగవారిని ప్రాజెక్ట్ కోఆర్డినేటర్గా నియమించే ప్రతిపాదనను పలువురు వ్యతిరేకిస్తున్నారు. 2006 డిసెంబర్ 15న అప్పటి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి శ్రవణం ప్రాజెక్ట్ను ప్రారంభించి ప్రాజెక్ట్ నిర్వహణకు టీటీడీ రూ.30 కోట్లు మంజూరు చేసినట్లు ప్రకటించారు. వినికిడి లోపం ఉన్న బాలల సంక్షేమానికి పాటుపడుతున్న చెన్నైకి చెందిన బాలవిద్యాలయానికి శ్రవణం నిర్వహణ బాధ్యతలను అప్పగించారు. శ్రవణం ప్రాజెక్ట్లో పనిచేయడానికి అవసరమైన ఉపాధ్యాయినుల నియామకం, వారికి జీతభత్యాల చెల్లింపు బాధ్యతలు ఆ సంస్థకే అప్పగించి నిర్వహణ ఖర్చులతో కలిపి టీటీడీ రీయింబర్స్ చేసేలా 2006 డిసెంబర్ 5న ఎంవోయూపై సంతకాలు జరిగాయి. తిరుపతిలో ఏర్పాటు చేసిన బాలవిద్యాలయానికి మంచి ఆదరణ ఉండడంతో మహబూబ్నగర్, విశాఖపట్నాలలో సబ్సెంటర్స్ ఏర్పాటు చేయాలని టీటీడీ పాలకమండలి 2012 ఏప్రిల్ 3న జరిగిన సమావేశంలో తీర్మానాన్ని (నెం,24) కూడా ఆమోదించింది. సరస్వతీనారాయణస్వామి నేతృత్వలో శ్రవణం నిర్వహణ తీరును టీటీడీ ఉన్నతాధికారులు మెచ్చుకున్న సందర్భాలు, విమర్శలు వెలువడినప్పుడు సమర్థించిన సందర్భాలు ఉన్నాయి. చిన్న, చిన్న లోపాలు ఉన్నా ప్రాజెక్ట్ లక్ష్యాలను సాధించేందుకు ఆమె చిత్తశుద్ధితో కృషి సాగించారు. ప్రస్తుతం బాలవిద్యాలయలో సుమారు 220 మంది వినికిడి లోపం ఉన్న చిన్నపిల్లలు ఉన్నారు. కోఆర్డినేటర్ను మారిస్తే ప్రాజెక్ట్ మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ పనిచేసే ఉపాధ్యాయులు సిబ్బంది అంతా మహిళలే అయినందున శ్రవణం ప్రాజెక్ట్ కోఆర్డినేటర్గా అనుభవం ఉన్న టీ టీడీ సెంట్రల్ ఆస్పత్రి రిటైర్డ్ మహిళా వైద్యులను నియమించాలని కోరుతున్నారు. లేకుంటే ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించకుండా ప్రాజెక్ట్(బాలవిద్యాలయం)ను పూర్తిస్థాయిలో టీటీడీనే నిర్వహించాలని కోరుతున్నారు.