-
విలువైన వ్యాస పెన్నిధి
కడపలోని సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం రాయలసీమకు చెందిన ప్రాచీన తెలుగు కవుల్ని నేటితరం వారికి పరిచయం చేయాలని ఓ ప్రణాళిక వేసుకుంది. కుమార సంభవం కావ్యకర్త ‘నన్నెచోడుడు’ ఈ ప్రణాళిక ఫలమే. మూల మల్లికార్జున రెడ్డి సంపాదకత్వంలో వెలువడిన ఈ పుస్తకంలో ఏడు వ్యాసాలున్నాయి. మహాపండితుడు నడకుదుటి వీరరాజు పంతులు రాసిన ‘కవిరాజ శిఖామణి కావ్య విశేషములు’ ఈ సంకలనంలోని మొదటి వ్యాసం. కావ్యావతారికలో ఇష్టదేవతా ప్రార్థన, గురుస్తుతి, పూర్వకవి ప్రశంస, కుకవి నింద మొదలైన విషయాల్ని ప్రస్తావించి నన్నెచోడుడు తర్వాతి కవులకు మార్గదర్శి అయ్యారని వీరరాజు పంతులు అన్నారు. కుమార సంభవంలోని కొన్ని పదాల్ని కందుకూరి వీరేశలింగం అన్యదేశ్యాలుగా భావించటం పొరపాటనీ, అవి మూలద్రావిడ భాషా పదాలే అనీ నిరూపించారు. ఆయన వాడిన ‘అప్రతీత పదములు’ అన్నమాట సరికాదనీ, అవి ఆ కవి కాలంలో వ్యవహారంలో వుండి, తర్వాతి కాలంలో కనుమరుగయ్యాయనీ చెప్పారు. ఆయన చర్చించిన ‘శబ్ద పరికర సంపత్తి’ భాగం భాషాశాస్త్రరీత్యా ఎంతో విలువైనది. 1926 నాటి ఈ అమూల్య వ్యాసం ఈ గ్రంథానికి పెన్నిధి. నన్నయ్యకు నన్నోచోడుడు నూరేండ్ల తర్వాతివాడని సోపపత్తికంగా నిరూపించారు వేటూరి ఆనందమూర్తి. చిలుకూరి పాపయ్య శాస్త్రి తమ ‘నన్నెచోడుని వర్ణనా నైపుణ్యము’లో సంస్కృత కవుల వర్ణనల్లో రసదృష్టి ప్రధానమైతే, తెలుగు కవుల వర్ణనల్లో ఆలంకారికత, చాతుర్యం, వైదగ్ధ్యం ప్రాముఖ్యాన్ని వహిస్తాయని చెప్పారు. నన్నెచోడుని కావ్యం అనల్ప కల్పనాశక్తి, అపూర్వ వర్ణనాయుక్తులు సుందర సంగమమనీ; మనస్తత్వ నిరూపణలో తిక్కన, సూరనలకు నన్నెచోడుడు మార్గదర్శకుడనీ అన్నారు సి.నారాయణ రెడ్డి. నన్నెచోడుని వర్ణనల్లోని వన్నెచిన్నెల్ని తమ వ్యాసంలో చక్కగా ప్రదర్శించారు వి.రాజేశ్వరి. రతీమన్మధుల సంవాదంలోని మనస్తత్వ చిత్రణలోని సూక్ష్మతల్ని నిరూపించారు. నన్నెచోడుని అష్టాదశ వర్ణనల్లోని ప్రగల్భతను ప్రస్తుతించారు ఆరుద్ర. కవి గడుసుదనాన్నీ, గమ్మత్తుల్నీ సోదాహరణంగా పేర్కొన్నారు. కుమారసంభవాన్ని తొలిసారిగా (మొదటి సంపుటం 1908, రెండవ సంపుటం 1914) ప్రచురించిన మానవల్లి రామకృష్ణ కవి వ్యాసం, కుమారసంభవం గురించి పరిశోధన చేసిన వేదం వెంకట్రాయశాస్త్రి, అమరేశం రాజేశ్వరశర్మ, తిమ్మావఝల కోదండరామయ్య గార్ల వ్యాసాలు సంకలింపబడివుంటే ఈ గ్రంథం సమగ్రతతో శోభిల్లివుండేది. ఘట్టమరాజు నన్నెచోడుడు (విమర్శ వ్యాసాలు) పేజీలు: 152; వెల: 100 ప్రధాన సంపాదకుడు: ఆచార్య కె.చంద్రయ్య ప్రతులకు: సభ్య కార్యదర్శి మరియు రిజిస్ట్రార్, సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం, యోగి వేమన విశ్వవిద్యాలయం, 1–1254, యర్రముక్క పల్లె, కడప–516004. ఫోన్: 08562–255517 -
పుస్తక పరిచయం
చరిత్ర తాటాకు చప్పుళ్లపై ధిక్కారస్వరం పురాణగాథల్ని సరికొత్తగా పునర్లిఖించడమనే కోవలోకి చేరిన తాజా తెలుగు నవల బెజ్జారపు రవీందర్ ‘తాటక‘. బాధితుల పాయింట్ ఆఫ్ వ్యూలోంచి పీడకుల దమననీతిని ఎం.ఆర్.ఐ. స్కాన్ చేయడమే ఇటువంటి నవలల ప్రధానోద్దేశం. ఆనంద్ నీలకంఠన్ నవలలు ‘అసుర‘, ‘అజయ’ సాహితీ ప్రపంచంలో ఎంత సంచలనాన్ని సృష్టించాయో తెల్సిందే. మనకు తెల్సిన ‘తాటక‘ రామాయణంలోని ఒక రాక్షస స్త్రీ. యాగ రక్షణార్థం విశ్వామిత్రుడి ఆదేశం మేరకు రామలక్ష్మణులు సంహరించిన పాత్ర. రచయితే చెప్పినట్లు, ‘ఒళ్ళంతా నల్లరంగు పులుముకొని, నోటికి ఇరువైపులా నిమ్మకాయలు, ఎర్రటి కృత్రిమ నాలుక, భారీ కృత్రిమ స్తనాలు, పిరుదులు, కాళ్ళకు గజ్జెలతో భయానకంగా’ తలపుకు వచ్చే రూపం ‘తాటక‘. కానీ చలామణీలో వున్న చరిత్ర మాటున మరుగునపడ్డ చీకటి కోణాల్ని ఆవిష్కరిస్తుంది ‘తాటక‘. ఆధిపత్య బ్రాహ్మణ భావజాలాన్ని బట్టబయలు చేస్తుంది. నాస్తికత్వాన్ని తెగనరకడానికి జరిగిన కుట్రల్ని తేటతెల్లం చేస్తుంది. అటవీభూముల ఆక్రమణకోసం ఆదిమ స్థానిక తెగలను అంతమొందించే దుర్మార్గాలను కళ్ళకు కడ్తుంది. సరళంగా, సూటిగా, సాధ్యమైనంతవరకు సత్యానికి దగ్గరగా ఉందనిపించేట్లుగా సాగిన ఈ రచన కొత్త ప్రశ్నల్ని సంధిస్తుంది. పాఠకుడి చైతన్య పరిధిని విçస్తృతం చేయడానికి ప్రయత్నిస్తుంది. అన్నింటికీ మించి అభివృద్ధి పేరిట అడవుల్లోని గిరిజనులపై దాష్టీకాలు పెచ్చరిల్లుతున్న కాలంలో ‘తాటక’ రిలవెంట్గా తోస్తుంది. ‘బలహీనుడిలోనూ కొన్ని బలహీనత లుంటాయి. అయినా నా సానుభూతి ఎప్పుడూ దెబ్బతిన్నవాడివైపే వుంటుంది’ అంటుంది ఇందులోని ఒక పాత్ర(అష్టకుడు). నవల చేసిన పని కూడా అదే. ‘పరాజితుల గాథలను కీర్తించడం ప్రమాదాల్లోకెల్లా ప్రమాదం’ అంటూనే రచయిత ఆ ప్రమాదాన్ని తలపెట్టాడు. అందుకు నిజంగా అభినందనీయుడు. ఠి ఎమ్మార్ ఆనంద్ తాటక; బెజ్జారపు రవీందర్; 144 పేజీలు; రూ.80; ప్రతులకు: పాలపిట్ట బుక్స్. ఫోన్: 040–27678430 మడేలుమిట్ట కతలు రచన: వింజమూరు మస్తాన్బాబు; పేజీలు: 160; వెల: 50; ప్రతులకు: రచయిత, రజక సమాఖ్య కార్యాలయం, 5/360, 2వ అంతస్థు, కె.పి.కాంప్లెక్స్, స్టోన్హౌస్పేట, నెల్లూరు–524002. ఫోన్: 9491920429 ‘జ్ఞాపకాలుగా కనిపించే ఈ కతలు స్వీయాత్మకంగా ఉంటూనే, సహజ పరిణామాలకు అద్దం పడుతున్నాయి. చాకలివృత్తి జీవుల జీవనపోరాటం ఈ కథల వస్తువు. కథలోని అనుభవాలు ఆశు పద్ధతిని జీర్ణం చేసుక్ను లిఖిత పద్ధతిలో రాయబడ్డాయి.’ ‘జానపదవాణి, పౌరాణిక వాసన, సాంఘిక వాస్తవికత పెనవేసుకుని ఆసక్తికరంగా చదివిస్తాయి.’ ‘కావలి పరిసర ప్రాంత భాషా యాసా పలుకుబళ్ల’తో ‘ఒక కొత్త కుల వాతావరణాన్ని పరిచయం చేస్తాయి.’ -
పుస్తక పరిచయం.. అర్ధనారీశ్వరుడు
ఒక రచయిత తాను చనిపోయానని ప్రకటించుకునేంత వేదనకు గురైంది ఈ పుస్తకం వల్లా? (దేవరన్యాయం, నియోగం సంతానాల పాత్రలు ఎన్నోవున్న) మహాభారత గ్రంథాన్ని అక్కున చేర్చుకోగలిగినవారు పెరుమాళ్ మురుగన్లాంటి రచయితలను ఎందుకు తూలనాడుతున్నారు? అని మద్రాస్ హైకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది ఈ నవల గురించిన కేసులోనా? అనిపిస్తుంది ఈ పుస్తకం పూర్తిచేశాక. పశ్చిమ తమిళనాడులోని నమక్కాల్ జిల్లా తిరుచెంగోడు పట్టణ ప్రాంతంలోని ఓ సామాజిక సాంప్రదాయం ఈ నవలకు నేపథ్యం. పిల్లలు లేనివాళ్లు అక్కడి అర్ధనారీశ్వరుడికి జరిగే రథోత్సవ వేడుకల్లో 14వ రోజున సాంఘిక కట్టుబాట్లను వదిలి, ఆ రాత్రి ఎవరితోనైనా శృంగారంలో పాల్గొని పిల్లల్ని కనవచ్చు. ఆ రోజు కలిసేది సాక్షాత్తూ దేవుడే! పిల్లలు లేని కాళి, పొన్న దంపతుల కథ ఇది. ఇద్దరూ గౌండర్లే. కాని కాళి కాటాయి విభాగానికీ, పొన్న వెంటువ విభాగానికీ చెందినవారు. ప్రేమించి పెళ్లిచేసుకుంటారు. ‘నేను పదిమంది పిల్లలను కన్నా వాడే నా మొదటి పిల్లాడు’ అనుకునేంత ప్రేమ వాళ్లది. కానీ పన్నెండేళ్లయినా వాళ్లకు పిల్లలు కలగరు. ‘నా బదులు నువ్వు ఒక మేకను కట్టుకొని వుంటే అది నేను మింగిన పసరు మందులు మొత్తం మింగివుంటే ఈ పాటికి మందలు మందలుగా పిల్లలను కనేది’ అనుకునేంత బాధ వాళ్లది. ఒక అతిసాధారణ గ్రామీణ జంటకు ఉండగలిగే చైతన్యపు పరిధిలో వారిముందున్న ప్రతి అవకాశాన్నీ స్పృశించాడు రచయిత. ఆ సమాజంలో పిల్లలు లేనివాళ్లు ఎదుర్కోగలిగే సూటిపోటి మాటల్నీ, వివక్షనీ, నిరసననీ అన్నీ చూపించాడు. పిల్లలు లేకుండా ఆనందంగా జీవిస్తున్న నల్లప్ప మామ పాత్రను సమాంతరంగా నడిపించడం ద్వారా ఒక ప్రత్యామ్నాయాన్ని కూడా వాళ్ల ముందుంచాడు. ‘సంతోషం గురించి తెలియని వెర్రివాళ్లు పిల్లలను పుట్టించి బాధపడనీ. అది చూసి నవ్వుకుందాం మనం’ అంటాడు నల్లప్ప. కానీ అంత గుండె దిటవు లేదు వారికి. ‘ప్రతి ఒకరిని ఏదో ఒక లోపంతోనే సృష్టించాడు ఆ దేవుడు. ఆ లోపాలను సవరించుకునే మార్గాలు కూడా ఆ దేవుడే ఇచ్చాడు.’ మరి ఆ ‘దేవుడి మార్గం’లో వెళ్లాలా? వద్దా? వెళ్లాక మునుపటిలాగా ముఖాలు చూసుకోగలమా? వెళ్లి తీరాలని పట్టుబట్టే పొన్న ఇంటివాళ్లు, వెళ్లమనడానికి నోరురాని కాళి... ఈ సున్నితమైన బాహ్య, అంతః ఘర్షణే నవలంతా నిజానికి! ఏ సంచలనాన్నో సృష్టించడం కోసం కాకుండా, ఒక పాత ఆచారపు ఆలంబనగా కథ నడిపించాడు రచయిత. పక్షాలు వహించకుండా, సంయమనం కోల్పోకుండా, కావాల్సినంత విశృంఖల శృంగారాన్ని దట్టించే అవకాశం వుండీ దాని జోలికి పోకుండా పద్ధతిగా నవలను నడిపించాడు. అయితే, దాచుకునేంత షెల్ఫ్లైఫ్ లేని ఈ పుస్తకం వివాదాస్పదం కాకపోయివుంటే ఇంత ఆసక్తితో చదివేలా చేసేదా అన్నది అనుమానమే! ఈ పుస్తకాన్ని ఎల్.ఆర్.స్వామి చక్కగా అనువదించారు. ఏ మాత్రం అభిరుచి లేని ముఖచిత్రంతో ప్రచురించింది మాత్రం విశాలాంధ్ర! పి.శివకుమార్ అర్ధనారీశ్వరుడు; తమిళ మూలం: పెరుమాళ్ మురుగన్; తెలుగు: ఎల్.ఆర్.స్వామి; పేజీలు: 152; వెల: 120; ప్రతులకు: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, విజయవాడ; ఫోన్: 0866-2430302 -
పిట్టకు ఆహ్వానం
- పుస్తక పరిచయం సుజాత పట్వారి తన పుప్పొడి కవితా సంకలనం తర్వాత పిట్టకు ఆహ్వానం పలుకుతోంది. ఈ సంకలనంలోని కవితలు గతానికీ, వర్తమానానికీ వారధి కట్టే ప్రయత్నం చేస్తాయి. జ్ఞాపకానికి పెద్ద పీట వేస్తూ, కవయిత్రి మానసిక సంఘర్షణకు అద్దం పడతాయి. వర్తమానాన్ని ఎదుర్కోగలిగే బలాన్ని గతం నుండి, జ్ఞాపకాల నుండి, గతించిన వ్యక్తుల నుండి తెచ్చుకుంటుందా కవయిత్రి అనిపిస్తుంది. తాను పోగొట్టుకున్న తన కోసం నిరంతర అన్వేషణ! తాను ఆహ్వానం పలుకుతున్నది చెట్టు మీద ఉన్న పిట్టకు తన లోకం/లోగిలిలోకా లేక తనలో ఉన్న పిట్టకు బయటి ప్రపంచంలోకా అన్న ఆలోచన ఈ పుస్తకం చదువుతున్నంతసేపూ వెంటాడుతుంది. బాల్యపు బెంగలే కాదు, భవిష్యత్తుపై ఉత్సుకతే కాదు, ‘ఓ తాత్విక గంభీరత’ను కూడా ఈ కవితలు వెల్లడిస్తాయి. బుద్ధుడికి దొరికిన ఏనుగుపిల్ల, రావి ఆకులు కూడా ఇందులో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ముందే చెప్పినట్లు, తన కోసం తనలోకే ఓ అన్వేషణ, అది కూడా సాధ్యపడని ఓ నిరంతర యుద్ధం. ‘యుద్ధాల్ని చూస్తూ చూస్తూ/ యుద్ధంగా మారినదాన్ని/ తుపాను కన్ను కనిపించాలే కానీ/ ధనుర్విద్య ఎంతసేపు’ అంటూ యుద్ధం మీదే యుద్ధాన్ని ప్రకటిస్తుంది. చిత్రకారుడి ఏమరుపాటు రంగుల బీభత్సం కూడా ఓ అద్భుతమైన జ్ఞాపకంగానో, స్ఫూర్తినిచ్చే సంఘర్షణగానో మిగిలిపోతుంది. జిలేబి కట్టిన కాగితం, మిగిలిన ఆఖరు ముక్క, కాగితంలో దేవుడి బొమ్మ-- దాచుకోలేని, పారవేయనూలేని ద్వైదీభావం ముందు ముందు సుజాత రచనల్లో మరింత చర్చకు వస్తుందని ఆశిస్తున్నా. - సునీతారాణి పిట్టకు ఆహ్వానం; సుజాత పట్వారి; వెల: 50; ప్రతులకు: ప్రముఖ పుస్తకాల షాపుల్లో. కవయిత్రి ఫోన్: 9440927122 -
జీనా హై తో మర్నా సీఖో
పుస్తక పరిచయం పుస్తకంలోకి అడుగు పెట్టకముందే, ఆ కాలాతీత యోధుడు మనల్ని ఎన్నో ప్రశ్నలు అడుగుతాడు. ఒక నిమిషం ఏకాగ్రతతో ఆయన కళ్లకేసి చూడండి: ‘నాకు సమాధానాలు కావాలి’ అని అడుగుతున్నాయవి. సెంట్రల్ యూనివర్సిటీ, రోహిత్, జేఎన్యూ, అతి సహనం, అతి అసహనం... ఎన్నో అడుగుతూనే ఉన్నాడు. మన దగ్గర సమాధానం ఉందో లేదో తెలియదు, ఉన్నా చెబుతామో లేదో తెలియదు... అయినా సరే లోపలికి వెళతాం. ఉస్మానియా యూనివర్సిటీలో 1960ల చివరి నుండి-70ల తొలిరోజుల విద్యార్థి ఉద్యమం జార్జిరెడ్డిగా దర్శనమిస్తుంది. ‘ఉద్యమ’ నిర్వచనాలు తారుమారవుతున్న కాలం. సైద్ధాంతిక బలం ఎక్కువై, ఆచరణ బలహీనత ఒక సామాజిక రోగంగా మారుతున్న కాలం. సిద్ధాంత సారం సిద్ధాంతాల్లోనే ఉండిపోయి, ప్రగతిశీల ‘మేధ’ కనిపించీ కనిపించని కాలంలో... జార్జిరెడ్డి జీవితాన్ని చదువుకోవడం అంటే లీలమ్మ, రఘునాథరెడ్డి పుత్రుడి గురించో, అత్యంత ప్రతిభావంతుడైన ఒక విద్యార్థి గురించో, ఇతరుల క్షేమం గురించి తప్ప తన జీవితం గురించి పట్టించుకోని ఒక బలమైన విద్యార్థి నాయకుడి గురించో మాత్రమే చదువుకోవడం కాదు; ‘జీనా హైతో మర్నా సీఖో’ అంటూ ఈ కాలానికి అవసరమైన ధైర్యవచనాలను ధైర్యంగా చదువుకోవడం.బా...గా... కుంచించుకుపోయిన జీవితాన్ని విశాలం చేసుకోవడం. ఈ పుస్తకానికి ముందు చే గువేరా జీవితాన్ని పరిచయం చేశారు ‘చూపు’ కాత్యాయని. జార్జిరెడ్డి గురించి చదువుతున్నంత సేపూ ఎక్కడో ఒక చోట చే గుర్తుకు వస్తూనే ఉంటాడు. - యాకుబ్ పాషా యం.డి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తాతా.. నీకు టాటా..
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
Advertisement