breaking news
Attaluri Aruna
-
‘మలిన’ చరితకు ముగింపు
పసిబిడ్డలు మట్టితో ఆడుకుంటున్నట్టు నా మనుషులు మలంతో ఆడుతున్నారు. మలంతోనే పాడుతున్నారు. అదే మలినంలో తింటూ, దానిపక్కనే పడుకొంటూ 4000 సంవ త్సరాల నుంచీ కులం అనే మలాన్ని నెత్తిన మోస్తున్నారు నా జాతి స్త్రీలు. స్వచ్ఛతకీ, కులానికీ మధ్యనున్న అతి సున్నితమైన అంశం నా జాతి జనుల ప్రాణాలు. వేలయేళ్ల మానవ మలాల్లోంచి బయట పడలేకా, అందులో పడి చావలేకా లక్షలాది మంది దళితులు గిజగిజలాడుతున్నారు. ఏదీ దొరక్క ఈ పనిచేస్తున్నారన్నది సర్దిచెప్పుకునే సమా ధానం. అలా అయితే వాళ్లు మాత్రమే ఈ పనినెందుకు చేస్తున్నారు? ఇదెవ్వరూ ఆలోచించరు. ఎవ్వరూ చేయనిది వీళ్ళెందుకు చేస్తున్నారు? అన్నది మాత్రమే శతాబ్దాల నయ వంచనకు సంబంధించిన ప్రశ్న. నువ్వు దళితుడివి కాబట్టి నువ్వీపని చేయాల న్నారు. అంతేకాదు. దళి తుడు మాత్రమే ఈ పని చేయాలన్నారు. అంతేనా దళితుల్లోని కొందరు మాత్రమే ఈ పనిచేయా లన్నారు. అంతేనా దళితు ల్లోని స్త్రీలు ఈ పనిని కచ్చి తంగా చేయాలన్నారు. అలా 4000 ఏళ్లుగా నా జాతి స్త్రీలు, మొత్తంగా దళిత సమాజం ఈ మురికిని మోస్తూనే ఉన్నది. ఇప్పటికి దాదాపు 6 లక్షలకుపైగా ఈ అమానవీయ పనినుంచి విముక్తుల య్యారు. సఫాయి కర్మచారీ ఆందోళన దాదాపు 2లక్షల మందిని ఈ పనినుంచి విముక్తి చేసింది. దేశవ్యాప్తంగా ఇంకా 2లక్షలకు పైబడి మనుషులు ఆత్మగౌరవం ఇసుమం తైనా లేని ఈ పనినే చేస్తున్నారు. వారి విముక్తికే నా ఈ అవార్డు అంకితం అంటున్న రామన్ మెగసెసె అవార్డు గ్రహీత తెలుగు బిడ్డ బెజవాడ విల్సన్తో సాక్షి ప్రత్యేక ఇంటర్వ్యూ. నాకు ఊహ తెలిసేప్పటికే మానవ మలాన్ని చేతుల్తో ఎత్తి నెత్తినమోసే అమానవీయ పనిని నా తాత ముత్తాతల నుంచి కొన్ని లక్షల మంది దళిత జనులు చేస్తున్నారు. ఇది అమానుషమనీ, మానవ విసర్జితాలను చేతుల్తో ఎత్తివే యడం దుర్మార్గమనీ, మనిషి ఆత్మాభిమానాన్ని, గౌరవాన్ని దెబ్బతీస్తుందనీ, ఇటువంటి వ్యవస్థను సమూలంగా నిర్మూ లించాలనీ అర్థం చేసుకునే సరికి నా పాఠశాల విద్య పూర్త య్యింది. కుప్పంలోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో పదవ తరగతి పూర్తి చేసుకొని కర్ణాటకలోని కోలార్ బంగారు గనుల్లోని నా స్వగృహానికి వచ్చినప్పుడు విద్యుద్దీపాలతో మిలమిలా మెరిసిపోయే నా ప్రాంతంలో మానవ మలంలో మునిగితేలుతున్న నా వారి జీవితాలను అతి దగ్గరనుంచి చూసాను. తాగుడుతో జీవితాలు ధ్వంసం అవుతున్నాయని తాగుడు మానమన్నాను. ఈ పనికి సారా తాగక తప్పద న్నారు. నెత్తిన బక్కెట్లో నుంచి ముఖంపైకి కారుతున్న మలాన్ని చేతుల్తో తుడుచుకుంటూ, అది పూర్తిగా కారిపోక ముందే గమ్యాన్ని చేరుకోవాలని పరుగులా నడుస్తున్న వారిని చూసి బోరున ఏడ్చాను. ఇది మానెయ్యమని కాళ్లా వేళ్లా పడ్డాను. ఎవ్వరూ వినలేదు. కిందపడి గిలగిలా కొట్టు కున్నాను. చివరకు ఎలాగో నన్ను ఇంటికి లాక్కొచ్చారు. ఆ రాత్రంతా వేడి నీళ్ళుండే అతి పెద్దట్యాంకు వద్ద ఎత్తై ప్రదే శంలో కూర్చుని ఏడ్చాను. ఏడుస్తూ ఆలోచించాను. అయితే ఈ వేణ్ణీళ్లలో పడి చావడమా? లేకపోతే వీరితో ఈ పనిని మాన్పించడమా? అని తీవ్రంగా ఆలోచించాను. వేడి వేడిగా కిందకి జారిపోతున్న నీళ్లు నన్నంతపని చేయొద్ద న్నాయి. తెలతెలవారుతుండగా చెట్లపైన వాలిన పక్షులూ ఏదో చెప్పుకుంటూ ఎగిరెళ్లిపోతుంటే ఆకాశంవైపు చూశాను. అక్కడే దొరికింది సమాధానం. ఈ ఆకాశానికి చెబితే నా సమస్య తీరుతుంది. ఆకాశం ఎక్కడైనా ఆకాశమే కదా.. నా ప్రజలు ఎక్కడైనా మోసేది మలాన్నే కదా. ఆ కథనే అన్ని చోట్లా వినిపిస్తాను అనుకుని లేచాను. అలా విల్సన్ తన లక్ష్యాన్ని ఎంచుకున్నాడు. ఇక విశ్ర మించేందుకు అతనికి తీరిక దొరకలేదు. చివరకు పెళ్లికి కూడా. అప్పుడు కోలార్ లోనూ, ఇప్పుడు ఢిల్లీలోనూ సఫాయి కర్మచారీ ఆందోళన్ ఆఫీసే ఆయన నివాసం. అయితే అంబేడ్కర్ పరిచయ మయ్యాకే కులానికీ, ఈ మలి నానికీ ఉన్న సంబంధం తనకు అర్థం అయ్యిందంటాడు విల్సన్. 1990లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కూలీసంఘం వాళ్ళు చిత్తూరు నుంచి హైద రాబాద్ వరకు అంబేడ్కర్ శత జయంతి ఉత్సవాల సంద ర్భంగా నిర్వహించిన సైకిల్ యాత్ర అంబేడ్కర్ని పరి చయం చేసింది. ‘నా జాతి జనుల విముక్తి కేవలం మలం బక్కెట్లను తన్ని తగలెయ్యడంలో లేదనీ, కులం మూలాల్లో ఉందనీ అప్పుడే తెలుసుకున్నాను. కులాన్ని సమూలంగా నిర్మూ లించినప్పుడే దళితులకు గౌరవప్రదమైన జీవితం. సర్వ మానవ సమానత్వం సాధ్యం అవుతుంది. కులం చేసిన గాయం యింకా నా జాతి మదిలో సలుపుతూనే వుంది. అలాగే పురుషాధిపత్యం కూడా. అంబేడ్కర్ తరువాత నాకి ష్టమైన, నన్ను ప్రభావితం చేసిన వ్యక్తి మహానుభావుడు ఎస్ఆర్ శంకరన్.’ ‘ఆ తరువాత సఫాయి కర్మచారీ ఆందోళన్ని స్థాపిం చాం. మూడు దశాబ్దాలకు పైగా ఇదే పనిచేస్తున్నాం. నేను పెద్దగా చేసిందేమీ లేదు. మనుషుల్ని మనుషులుగా బతకనివ్వమన్నానంతే. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నుంచి మొదలు కొని ఈ రోజు వరకు 22 రాష్ట్రాల్లో 6000 మంది వాలం టీర్లతో మా సంస్థ పనిచేస్తోంది. ప్రత్యేకించి మహిళా స్కావెంజింగ్ వర్కర్స్ మా సంస్థలో కీలకమైన వాలంటీర్లు. 2014లో సుప్రీంకోర్టు తొలిసారిగా మా పనిని గుర్తించింది. ఈ అమానవీయ పనిని దుర్మార్గమైనదిగా వ్యాఖ్యానిం చింది. ఇందుకు కారకులైన వారిని శిక్షార్హులుగా ప్రకటిం చింది. అటువంటి వారికి జైలు శిక్షని ఖరారు చేసింది. చనిపోయిన వారి కుటుంబాలకు పది లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని చెప్పింది. ఇప్పటికి 1,268 మంది సెప్టిక్ ట్యాంక్లు క్లీన్ చేస్తూ మరణించారు. వారిలో 36 మందికి మాత్రమే నష్టపరిహారం వచ్చింది. అది కూడా పూర్తిగా కాదు. మ్యాన్హోల్స్లో పడి మరణిస్తున్నవారు లెక్కేలేదు. ఈ పనిచేసినందుకు జలమండలి ఐదువేల రూపాయలి స్తుంది. కానీ చస్తే ఎవ్వరి బాధ్యతా ఉండదు. నా జీవితం ఉన్నంత వరకు నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది.’ (వ్యాసకర్త: అత్తలూరి అరుణ ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, సాక్షి) -
ఊరి చివర ఒంటరి చిన్నారి!
నవనీత (12) ఇల్లు ఊరికి చివరన.. అరిచినా ఎవరికీ వినిపించనంత దూరంలో ఉంటుంది. వర్షం వస్తే ఆ ఇల్లు చెరువు అవుతుందనడానికి సాక్ష్యంగా ఇంటి పైకప్పుకి కన్నాలు! పొగచూరిన బాల్యానికి గుర్తుగా మూడురాళ్లపై అన్నం గిన్నె, ఆ గిన్నెలో కొద్దిగా అన్నం. విద్యుత్ సౌకర్యం కూడా లేని ఆ చీకటి గదిలో ఆ అమ్మాయి, తమ్ముడు ఎలా ఉంటారోనని ఆ ‘ఇల్లు’ చూసినవారికెవ్వరికైనా అనిపిస్తుంది. గుండెల్లో గుబులు కమ్ముకుంటుంది. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో ఈ ఇద్దరు చిన్నారులు కనీసం తోడు కూడా లేకుండా జీవిస్తుండడం దినదిన సాహసమే. అత్తలూరి అరుణ రంగారెడ్డి జిల్లా దోమ మండలం, మోత్కూర్ గ్రామానికి చెందిన గూడ రామచంద్ర, యాదమ్మలకి ముగ్గురు పిల్లలు. ఆ దంపతులకు నవనీత రెండో కూతురు. ఆమెకో పెళ్ళైన అక్క, ఆరో తరగతి చదివే తమ్ముడు. ఇంటికి ఆధారమైన నాన్నకి ఊహించని విధంగా జబ్బు చేసింది. సర్కార్ దవాఖానాలో కూడా చూపించుకునే స్థోమత లేనంత కటిక దారిద్య్రంలో 2010లో టీబీతో ఆయన కన్ను మూశాడు. ఏ జబ్బు చేసిందో తెలియదు. ఆ ఊరిలో చాలా మందిని కబళించిన వ్యాధే నవనీత అక్కనూ కాటేసింది. అక్క హఠాత్తుగా మరణించింది. కళ్ళెదుటే అక్క కన్ను మూస్తే అక్క కొడుకుకి నవనీతే తల్లిగా మారింది. దుఃఖంలో నుంచి నవనీత తల్లి యాదమ్మ బయటకు రాలేకపోయింది. మనోవేదనతో మంచం పట్టింది. మతిభ్రమించి ఎటో వెళ్లిపోయింది. ఒకటిన్నర సంవత్స రాలు గడిచినా ఆమె ఆచూకీ లేదు. శ్మశానాన్ని తలపించే తన ఇంటిని చూసి చాలా రోజులు బావురుమంది నవనీత. చెల్లాచెదురైన ఈ చిన్నారులు ముగ్గురూ అన్నం పెట్టే దిక్కులేక పస్తులున్నారు. అనుకోని జబ్బులతో ఆ ఊరు ఊరే వల్లకాడులా మిగిలిపోతే ఇక వీరి ఆకలిగోడు ఎవరికి వినిపిస్తుంది? ఆకలితో... అలమటించారు. కన్నీళ్లు కడుపునింపవని అర్థం అయ్యింది నవనీతకు. రక్తసంబంధం తన బాధ్యతని గుర్తు చేసింది. జీవితం మిగిల్చిన చేదు జ్ఞాపకాలను చెరిపేసుకుంటూ నవనీత జీవించడం మొదలుపెట్టింది. తన కోసం కాదు. తన తమ్ముడి కోసం, అక్క బిడ్డకోసం. కటిక పేదరికం... చదువుపై నవనీతకు ఉన్న ఆశని చిదిమేసింది. తన తమ్ముడినైనా చదివించాలని ఆ చిన్ని మనసు శపథం చేసింది. నాలుగవ తరగతి నుంచి పనిలోకి వెళ్లిన నవనీతకు రెండేళ్లు గడిచేసరికి పనే సర్వస్వం అయ్యింది. ఆరోక్లాసుని అర్ధంతరంగా మానేసింది. చదువంటే ప్రాణంగా భావించే నవనీత తమ్ముడి చదువుకోసం తన చదువే కాదు, అన్ని ఇష్టాలను వదిలేసింది. నవనీత చేతులిప్పుడు పెద్దవాళ్లతో పోటీపడి మరీ పత్తి చేలో పత్తి తీస్తున్నాయి. వయసుకి మించిన బతుకుభారాన్ని మోయడానికి అలవాట పడిన నవనీతకు ఇప్పుడు మట్టి తట్ట పెద్ద బరువనిపించడం లేదు. కంపచెట్లల్లో.... కందిచేలల్లో పడీ పడీ చాకిరీ చేస్తోన్న ఈ బాలికను చూస్తే బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు, వాస్తవికతకు మధ్య ఉన్న అగాధం ఏమిటో అర్థం అవుతోంది. మరోవైపు తన తమ్ముడికోసం తాను ఏదైనా చేస్తానంటున్న నవనీతకు మరో ప్రమాదం పొంచి ఉంది. అదే భద్రత. అన్నీ ఉండి, తల్లీతండ్రీ నీడన పెరిగే పిల్లలకే రక్షణ కరువైన ఈ రోజుల్లో ఈ చిన్నారి భద్రత గాలిలో దీపమే. ఇన్నాళ్లూ ఆ ఇంటికి వచ్చిపోయే బావ, ఇటీవలే కొడుకుని తీసుకెళ్లాడు. మళ్లీ తీసుకొస్తానని చెప్పి మరీ వెళ్ళాడు. ఆ పిల్లాడు నవనీత చేతుల్లోనే పెరిగాడు కనుక పూర్తి బాధ్యత నవనీత పైనే వదిలినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఊరి చివరనున్న ఆ పూరి గుడిసెలో ధైర్యంగా జీవిస్తున్న నవనీతకిప్పుడు బతుకుపై భరోసా కల్పించాలి. ఆమె కోరుతోంది కూడా అదే. చెప్పాల్సింది ప్రభుత్వమే తల్లీ తండ్రీ లేక దిక్కులేని వారిగా మారిపోతున్న నవనీత లాంటి వారిని అక్కున చేర్చుకునే వ్యవస్థ మనకు లేదు. ప్రభుత్వ రక్షణ లేదు. నవనీత చదువు మాత్రమే కాదు, ఆమె భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకమయింది. దీనికి సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వమే. - సత్తయ్య, బాలల హక్కుల పరిరక్షణ కమిటీ డివిజన్ ఇంచార్జ్, మోత్కుర్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎమ్మార్వోల చేత సర్వే చేయించాలి ప్రభుత్వ పథకాలు ఇటువంటి పిల్లలకు కూడా వర్తింపజేయాలి. వారికి జీవనోపాధిని కల్పించే బాధ్యతను కూడా ప్రభుత్వమే చేపట్టాలి. ఏ ప్రాంతమైనా ఎమ్మార్వోల చేత సర్వే చేయించి ఇటువంటి పిల్లలను గుర్తించి వారికి ఉపాధి కలిగించే సాంకేతిక శిక్షణతో కూడిన విద్య నేర్పించాలి. - రవీందర్ గౌడ్, విద్యావంతుల వేదిక, మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు