breaking news
Aristotle
-
మంచి మాట: సాధన.. ఓ తపస్సు
ఏ విద్యలోనైనా పట్టు రావాలంటే సాధన అవసరం. అది నిరంతరం కొనసాగాలి. ‘అభ్యాసం కూసు విద్య..’ అన్నారు కదా పెద్దలు. అభ్యసించటానికి శ్రద్ధాసక్తులే కాక అకుంఠిత దీక్ష కావాలి. దానికి పట్టుదల కలవాలి. ఇష్టపడి నేర్చుకున్న ఒక విద్యను అభ్యసించవలసి వుంటుంది. ఆ విద్యను సరిగా ఒక గురువు వద్ద నేర్చుకోవాలి. సుశిక్షితులైన పిదప నేర్చిన విద్యను అభ్యసించాలి. అపుడే దానికొక దిశ – దశ ఏర్పడతాయి. సక్రమ మార్గం ఏర్పడుతుంది. నేర్చుకున్న విద్య కరతలామలకమవ్వాలంటే అభ్యాసం వల్లే సాధ్యం. సరైన శిక్షణ లేని విద్య సాధన చేయటం సమయం వృథా. ఇక్కడ జాగరూకత చాలా అవసరం. తపస్సుకు మనో నిశ్చలత అత్యంత ప్రధానమైనది. ఒక దైవాన్ని మనస్సు లో ప్రతిష్టించుకోవాలి. ఆ దేవుడి నామాన్నో.. మంత్రాన్నో ఉచ్చరిస్తూ వుండాలి. జగాన్ని మరవాలి. పెదవుల కదలికలు నెమ్మది.. నెమ్మదిగా అదృశ్యమై మీ ఉచ్ఛ్వాస,.. నిశ్వాసాలే ఆ నామ, మంత్రాలవుతాయి. ఇది తపస్సులో గొప్ప దశ. ఆ అద్భుత స్థితికి చేరగలిగామా.. తపస్సులో అత్యున్నత దశకు చేరుకున్నట్టే. సాధనలో కూడ అంతటి త్రికరణ శుద్ధి కావాలి. అపుడే మనం అభ్యసిస్తున్నా దానిలో గొప్ప ప్రావీణ్యం పొందుతాం. ఎలాగూ మన మనస్సుకు నచ్చిన విద్యను ఎంపిక చేసుకుంటాం కనుక ఆమూలాగ్రంగా నేర్చుకోవాలి. ఏకాగ్రతతో సాధన చేయాలి. మన శక్తియుక్తుల్ని ధారపోయాలి. సంకల్పం... పట్టుదల..మనోనిశ్చలత.. ఏకాగ్రత.. ఈ శక్తుల పిల్ల కాలువలన్నీ సాధన అనే మహా నదిగా మారిన వేళ.. మార్చుకున్న వారికి విద్య స్వాధీనమై.. విద్వత్తు వశమవదా..! సా.. ధ.. న అనే మూడు అక్షరాల వెనుక ఇన్ని శక్తుల కలయిక ఉందని.. ఉంటుందని గ్రహించాలి. అలా గ్రహించిన వారే వాటిని తమలో అంతర్గతంగా వుంటే గుర్తిస్తారు. లేకుంటే అలవరచుకుంటారు. అటువంటి వారే ఆ సాధనా తపస్సులో పరిపూర్ణులవుతారు. ఆ తపోఫలితాన్ని పొందుతారు. సాధారణంగా ఎవరైనా.. నేర్చుకున్న విద్యను సాధన చేస్తారు. ఇది లోకరీతి. గురువు చెప్పిన విద్యను దాని లోతుపాతులను క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే బాగా అభ్యసించాలి. జీవితంతో పోల్చి చూసుకోవాలి. స్వీయ అనుభవాలు, ఇతరుల అనుభవాలు పరిశీలించాలి. ఆ సాధనకు విచక్షణ, వివేచనల తోడు చేసి మరింతగా గట్టిపరచుకోవాలి. కొందరికి అద్భుత ప్రతిభా వ్యుత్పత్తులంటాయి. వారి వైఖరే వేరు. అసలు గురువునుండి విద్యను గ్రహించి ఆకళింపు చేసుకునే పద్ధతే విభిన్నం. కౌరవులకు .. పాండవులకు విలువిద్య నేర్పే ఆరంభ దశలోనే.. బాణంతో చేధించవలసిన పక్షికన్ను తప్ప ఇంకేమి కనుపించటంలేదన్న అర్జునుడి మాటలతో అతనే ఆ విద్యకు సరైన అర్హుడని నిర్ణయించుకున్నాడు ద్రోణాచార్యుడు. గొప్ప కలయిక వారిరువురిది. ఏకాగ్రతతో గురువు చెప్పిన విద్యను సాధన చేయసాగాడు. ఓ రాత్రివేళ.. దీపంలేని తరుణాన... భోజనం చేయగలిగిన పార్థుడు ఒక అద్భుతమైన ఆలోచన చేశాడు. చీకటిలో శబ్దాన్ని బట్టి.. ఆ దిశ వైపు బాణం వేసి వేటాడటం నేర్చుకున్నాడు. గొప్పగా సాధన చేసాడు. పట్టు సంపాదించాడు. తన గురువు మెప్పు పొందాడు. గురువు నేర్పిన విద్యను సాధన చేసే క్రమంలో వచ్చే ఆలోచనలకు తన అద్భుత ఊహశక్తిని మేళవించి తాను నేర్చిన.. నేర్చుకుంటున్న విద్యకు ఒక రూపు.. కోణం.. ఓ వైవిధ్యతను.. ఓ విభిన్నతను కలిపి ఆ విద్యను పరివ్యాపితం చేసాడు తన శక్తి యుక్తులతో. తన గురు ప్రశంస పొందాడు. అలా విశేషమైన ప్రతిభ కల శిష్యులుంటారు. ప్రతిభకు వైవిధ్యం తోడైతే అది ఓ అద్భుతమే. అంతే కాదు.. ఓ నవ నవోన్మేషమే అవుతుంది. విశ్వనాథ సత్యనారాయణ, మంగళంపల్లి బాలమురళీకృష్ణ ప్రభృతులు అటువంటి ప్రతిభ సంపన్నులే. నిరంతర సాధన మన సామర్థ్యాన్ని పెంచుతుంది. ఎనలేని ఆత్మ విశ్వాసాన్నిస్తుంది. పొరపాట్లు.. తప్పిదాలను గమనించి వాటిని సరిదిద్దుకునే అవకాశమిస్తుంది. విద్యాప్రతిభను ప్రదర్శించే సందర్భాలు నల్లేరు మీద బండిలా సాగాలంటే అభ్యాసం తప్పదు. భూ గర్భంలోని రత్నం వంటిదే ప్రతిభ. రత్నాన్ని వెలిక్కితీసి సానపెడితే కాని ధగధగద్ధాయమానంగా ప్రకాశించదు. మనలోని పాడగలిగే గొంతుకకైనా.. అద్భుత కవితాశక్తికైనా... చిత్రలేఖనా ప్రతిభకైనా మార్గదర్శకత్వం చేయగల గొప్పగురువు కావాలి. ఆయన నుండి పొందిన మన జ్ఞానానికొక పరిపుష్టి.. పరిపూర్ణత.. అద్భుత స్వాధీనత.. రాణింపు రావాలంటే సాధన కావాలి. ఒక విద్వాంసుడి.. లేదా ఒక కళాకారుడి ప్రతిభ నిజానికి పేరు ప్రఖ్యాతులు ఎంత బాగా వస్తే వారు అంత ఎక్కువగా సాధన చేయాలి. ఒక కళాకారుడు అత్యున్నత స్థాయికి చేరిన తరువాత అతని ప్రదర్శన తిలకించటానికి వచ్చేప్రేక్షకులు అది అత్యున్నతంగా ఉండాలని... ఉంటుందని ఆశించి వస్తారు. అది ఎంతో సహజమైనది. తాను ఎప్పుడూ ఇస్తున్న ప్రదర్శనే కదా.. సాధన ఎందుకు చేయాలన్న ఆలోచన ఏ కళాకారుడికైనా.. పండితుడికైనా వచ్చిన క్షణం అతడి ప్రతిభాభానుడికి మేఘాలు కమ్ముతాయి. కళాకారులు ఎంతటి లోకప్రసిద్ధులైతే అంతటి సాధన కావాలి. చేయాలి. వారి స్థాయికి తగ్గని ప్రదర్శన ఇవ్వాలి. అలా ఇవ్వాలంటే సాధన చేయక తప్పదు. సాధన చేసే క్రమంలో ఏకాగ్రత.. పట్టుదలలు సడలకూడదు. మనస్సు చంచలం కాకూడదు. సాధన ఎంత కాలం చేయాలి, దీనిని ఎక్కడ ఆపాలి..? అసలు ఆపచ్చా... అన్న ప్రశ్నలు.. సందేహాలు వస్తుంటాయి. సాధన నిలుçపు చేయటం అన్న ఆలోచనే పుట్టకూడదు మనలో. వచ్చిన క్షణం మనలో నేర్చుకునే తపన చనిపోతుంది. చాలానే నేర్చుకున్నామన్న తృప్తి.. ఇంకా నేర్చుకోవలసిన అవసరం లేదన్న ఆలోచనే అందుకు కారణం! సాధనకు దూరమయ్యామంటే నేర్చుకున్న విద్య మీద పట్టు తగ్గచ్చు. అందుకే సాధన ఒక జీవనది కావాలి. ఎంత సాధన చేస్తే. అంత పరిపూర్ణత. అంత అలవోకగా చేయగల సామర్థ్యం వస్తుంది. నేర్చుకునే సమయంలో సాధన చాలా మంది చేస్తారు. ఇది సహజం. ఒక దశకు చేరుకున్న తరువాత శ్రద్ధ పెట్టం. కాని సాధన ఊపిరున్నంత వరకు చేయాల్సిందే. అలా చేసినవారే తమ విద్వత్తును, దానిలోని సారాన్ని అనాయాసంగా చదువరులకు లేదా శ్రోతలకు ఇవ్వగలరు. రంజింప చేయగలరు. ‘మాలో మీరనే ఉత్కృష్టత నిరంతరాభ్యాసం వల్ల ఒక అలవాటుగా మారింది’ అన్నారు గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్. -
అలెగ్జాండర్ ది గ్రేట్!
మాధవ్ శింగరాజు అలెగ్జాండర్ ది గ్రేట్! ‘ది గ్రేట్’ ఎందుకు? గ్రీకు వీరుడనా? గ్రీకు రాజ్యాలన్నిటినీ ఏకం చేశాడనా? పర్షియాను ఆక్రమించుకున్నాడనా? ఇండియా వరకు.. దండయాత్రలతో తనకు తెలిసిన భూభాగాలన్నిటినీ హస్తగతం చేసుకున్నాడనా? అవును. కచ్చితంగా అందుకే. గ్రేట్! కానీ ఇదంతా ఎవరికి గొప్ప?! అలె క్స్ మాతృమూర్తికి గొప్ప. అలెక్స్ తండ్రికి గొప్ప. అలెక్స్కి పిల్లనిచ్చిన మామగారికి గొప్ప. అలెక్స్ ఫ్రెండ్స్కి గొప్ప. అలెక్స్ గురువు అరిస్టాటిల్కి గొప్ప. మరి అలెక్స్ భార్య రొక్సానాకి? గొప్పే. అయితే.. వీళ్లందరికీ అలెగ్జాండర్ ఎందుకు గొప్ప అయ్యాడో అందుకు మాత్రం కాదు! ఆమెపై ప్రేమను రుద్దే ప్రయత్నం ఏరోజూ చెయ్యలేదట అలెగ్జాండర్.. వాళ్ల పెళ్లికి ముందు గానీ, పెళ్లి తర్వాత గానీ! అది గ్రేట్గా అనిపించింది రొక్సానాకు. మగాడంటే అలా ఉండాలి అంటుందట ఆవిడ. అలా అని ప్లూటార్క్ రాశాడు. క్రీ.శ. రెండో శతాబ్దపు గ్రీకు చరిత్రకారుడు ఆయన. శత్రురాజులను పాదాక్రాంతం చేసుకోవడం, స్త్రీ ముందు మోకరిల్లడం రెండూ ఒకటే అలెగ్జాండర్కు. శత్రువును గెలవడం అతడికి గౌరవం. స్త్రీ ఎదుట కిరీటం తీసి నిలబడడం కూడా అతడికి గౌరవమే! (ఓయ్ అలెక్స్.. ఇది కూడా ఒక యుద్ధవ్యూహం కాదు కదా.. స్త్రీ హృదయాన్ని దోచుకోడానికి?!) అంత గొప్ప చక్రవర్తి అలెక్స్ నిజంగానే ఏ స్త్రీ ముందైనా మోకరిల్లి ఉంటాడా? ఉండొచ్చు. లేదా స్త్రీ మనసు తెలుసుకుని మసులుకొని ఉండొచ్చు. స్త్రీ మనసు తెలుసుకుని మసులుకోవడం మాత్రం.. ఆమెకు మోకరిల్లడం కన్నా ఏం తక్కువని?! క్రీ.పూ. 328లో అలెక్స్ ఆస్థానంలో కూడా మోకరిల్లడం అనే సంప్రదాయం ఉండేది. మరీ పైనున్నవాళ్లకు కిందివాళ్లు నీల్ డౌన్ అయ్యేవాళ్లు. పర్షియాను ఓడించి వస్తూ వస్తూ ఆ ఆచారాన్ని తెచ్చుకున్నాడు అలెగ్జాండర్. మోకరిల్లడంలో అభ్యర్థన ఉంటుంది. అర్పణ ఉంటుంది. అఫెక్షన్ ఉంటుంది. భయము, భక్తి, గౌరవం ఉంటాయి. ఇవన్నీ కలిసిందే ‘ప్రపోజల్’! ‘ప్రపోజల్’ అంటే.. ‘నువ్వు నన్ను పెళ్లి చేసుకోగలవా?’ అని అర్థించడం. ప్రియుడు మోకరిల్లి ప్రియురాలిని కనికరించమని (పెళ్లి చేసుకొమ్మని) అడిగే ఈ సంప్రదాయం ప్రతి దేశంలోనూ ఉంది. పువ్విస్తూ ప్రపోజ్ చెయ్యడం, నవ్విస్తూ ప్రపోజ్ చెయ్యడం, పగడం తొడుగుతూ ప్రపోజ్ చెయ్యడం, ముత్యమంత ముద్దిచ్చి ప్రపోజ్ చెయ్యడం.. ఇక ఇవన్నీ మగాళ్ల తిప్పలు, తలనొప్పులు. ఎలా ప్రపోజ్ చేసినా, ఎక్కడ ప్రపోజ్ చేసినా, ఎప్పుడు ప్రపోజ్ చేసినా.. అసలంటూ ప్రపోజ్ చెయ్యడం గ్రేట్. రిప్లయ్ నెగిటివ్గా ఉన్నా హర్ట్ అవకుండా ఉండగలిగితే.. అలెగ్జాండర్ ది గ్రేట్. హ్యాపీ ప్రపోజ్ డే ఇవాళ ‘ప్రపోజ్ డే’. వాలెంటైన్ వీక్ మొదలైన (7-14) రెండో రోజు.. అంటే ఫిబ్రవరి 8న ప్రపోజ్ డే వస్తుంది. -
సోక్రటీస్తో సమానుడు అంబేద్కర్
కనిగిరి : సోక్రటీస్, అరిస్టాటిల్ తో సమానుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్.. అని దళిత ఉద్యమ నిర్మాత డాక్టర్ కత్తి పద్మారావు అన్నారు. రాజధానిలో 150 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు నేపథ్యంలో స్థానిక జూనియర్ కళాశాల ఆవరణలో ఆదివారం రాత్రి నిర్వహించిన బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పుస్తకంతో దేశాన్ని జయంచిన అపర మేధావి అంబేద్కర్ అని పద్మారావు కొనియాడారు. రాజధాని కేంద్రంలో 150 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఏర్పాటులో దళిత, బహుజనులు, ప్రజాస్వామికవాదులు భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. దళిత నాయకులు ఆత్మకూరి చెన్నయ్య, కటికల రత్నం, జి.రవికుమార్ మాదిగ, ప్రొఫెసర్ కేవీఎన్ రాజు మాట్లాడారు. తొలుత అంబేద్కర్ చిత్ర పటానికి నివాళులర్పించారు. అంబేద్కర్ వ్యక్తిత్వ దర్శనం, బహుజన దర్శనం పుస్తకాలను పద్మారావు ఆవిష్కరించారు. కార్యక్రమంలో దళిత, బహుజన నాయకులు రామ్మోహన్, పెరుగు శ్రీధర్, దద్దాల శ్రీనివాసులుయాదవ్, టీఐ ప్రతాప్, కేవీ రత్నం, చింతల పూడి వెంకటేశ్వర్లు, బాల గురవయ్య, దేపూరి వెంకటేశ్వర్లు, శివకాశయ్య పాల్గొన్నారు. -
భిక్షువు
పదం నుంచి పథంలోకి 5 ధాన్యకటకం (గుంటూరు జిల్లా, అమరావతి) క్రీ.శ.100 హాన్ వంశపు యువరాజు యాన్కు ఇదంతా నమ్మశక్యంగా లేదు. నిజంగానే తాను భారతదేశానికి చేరానా? నిజంగానే చేరాడు. ఇప్పుడు తెలుగు గడ్డ మీద ఉన్నాడు. దీనికి నేపథ్యం ఉంది. యాన్ అన్న చైనా చక్రవర్తి మింగ్. ఆయనకు ఒక కలవచ్చింది. ఆ కలలో సువర్ణదేహంతో సూర్యుని తలదన్నే ప్రకాశంతో ఆకాశంలో ఎగురుతూ ఒక మహాపురుషుడు కనిపించాడు. అది ఎవరని విచారిస్తే అతడే బుద్ధుడు అని తెలిసింది. బుద్ధుడు ఇండియాలో ఐదొందల సంవత్సరాల క్రితం ‘డావో’ అంటే ధర్మమార్గాన్ని సామాన్య మానవులకు ఆచరణయోగ్యమైన సూత్రాలుగా ఉపదేశించాడని కూడా తెలిసింది. వాటిని తెలుసుకోవాలి. అందుకే తన తమ్ముణ్ణి ప్రయాణం కట్టమన్నాడు. ఇండియాకు వెళ్లి ఆ ప్రవచనాలను తెలుసుకొని, ఆ మతానికి చెందిన గ్రంథాలని చైనా రాజ్యానికి తీసుకురమ్మని ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞను శిరసావహించడంలో భాగంగా యాన్ దక్షిణచైనాలో గ్వాంగ్ర (కాంటన్ తీరంలోని రేవుపట్టణం) నుంచి ఆంధ్రప్రదేశపు వర్తకుల సహాయంతో నాలుగు నెలలు హిందూ మహాసముద్రం చుట్టి తెన్గ్యూ(తెలుగు) తీరంలోని ధాన్యకటకానికి చేరాడు యాన్.ధాన్యకటకం అతి సుందరమైన నగరం. నదికి కుడి ఒడ్డున యాైభై ‘లీ’ (పదిమైళ్ళు. 1 మైలు = 5 లీ) నిడివిగల మహానగరం. నగరంలో వంద అడుగుల ఎత్తై మహాచైత్యం ఉంది. అది మింగ్ చక్రవర్తికి కలలో కనిపించిన బుద్ధుని భౌతిక అవశేషాలపై కట్టిన స్తూపం. అక్కడ ధాన్యకటకంలోనే బుద్ధుని అష్టాంగమార్గాన్ని ఆచరించే ఆచార్యులు వందలకొలదిగా ఉన్నారు. ఇంతమందిలో ఎవరిని ఆశ్రయించాలి? నది ఒడ్డున విదేశీయుల కొరకు ప్రత్యేకించబడిన పేటలో రెండంతస్తుల మేడ యాన్ రాకుమారుని పరివారానికి విడిది. విపణివీధి ప్రపంచపు నలుమూలల నుండీ వచ్చిన వర్తక శ్రేష్టులతో ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉంటుంది. వీధికి ఇరువైపులా లెక్కలేనన్ని అంగళ్ళు. కళ్ళు చెదిరిపోయేలా రంగురంగుల వస్త్రాలు, ఆభరణాలు, చందనం, కస్తూరి, జవ్వాజి, అగరు, కర్పూరం, వీధిలో వేసే ప్రతి అడుగుకి మనసుని ఆహ్లాదపరిచే సువాసనలు. దంతం, పాలరాయి, కంచు, మంజిష్టల్లో వద్దంకుల (శిల్పులు, వడ్రంగులు) ప్రతిభని ప్రతిబింబించే అపురూప శిల్పసంపద. ఇక ఆహార సామాగ్రుల విషయం సరేసరి. ధాన్యకటకపు పేరు సార్థకమయ్యేలా రకరకాల ధాన్యాలు, పప్పు నూనె దినుసులు, సుగంధ ద్రవ్యాలు. శాలి, మహాశాలి, వ్రీహి, శ్యామకం అని వడ్లలోనే పలురకాలు. ఆంధ్రదేశంలోని నేత కార్మికుల ప్రతిభ అసామాన్యం. పట్టు వస్త్రాలేకాదు, ఉల్లిపొరకన్నా సన్ననైన నూలు రవపట్టం నేయటంలో కూడా దిట్టలు. యాన్ రాకుమారుడికి స్థానిక, విదేశ వర్తకులతో విందులూ వినోదాలతో రెండు నెలలు గడచిపోయాయి. అయినా వచ్చిన పని ఏమాత్రమూ ముందుకు సాగలేదు. అక్కడికి పశ్చిమంగా 500 లీ (100 మైళ్లు) నదీమార్గంలో వెళితే శ్రీపర్వతం (నాగార్డుని కొండ) అనే విశ్వవిద్యాలయం ఉంది. శ్రీపర్వత విశ్వవిద్యాలయంలో అనేక బౌద్ధ గ్రంథాలు ఉన్నాయట, వాటిని చైనా భాషలో వివరించగల ఆచార్యులు కూడా ఉంటారట! ఆ విశ్వవిద్యాలయం ముఖ్యాచార్యుడి పేరు డ్రాగన్ వీరుడు (నాగ - అర్జునుడు). ఆయన ఆహ్వానం లేనిదే వెళ్ళడానికి వీలులేదు. ప్రయత్నిస్తే అక్కడి నుంచి అనుమతి రావడం లేదు. ఆరోజు కామునిపౌర్ణమి. ఊరంతా పండగ. పచ్చని తోరణాలతో, మొగలి చిలకలతో అలంకరించి వీధులు, సంబరాలలో ప్రజలు ఒకరిపై ఒకరు జల్లుకున్న రంగురంగుల పుప్పొడి జాజరతో నిండిపోయాయి. జనం మధ్యలో దారిచేసుకొంటూ చైత్యం వైపు నడవసాగాడు యాన్. అడుగడుగునా అవరోధమే. నృత్యాంగనలు, వివిధ వాయిద్యాలతో పాటగాళ్ళు, పగటి వేషగాళ్లు, విటులు, మధుపానపు మత్తులో చిందులేస్తున్న పురజనులు. వీలు ఉండాలే గానీ ధాన్యకటకంలో ప్రతి రోజూ పండగే! ఒక్క రోమ్ సామ్రాజ్యపు వాణిజ్యం ద్వారా నగరానికి వచ్చే ఆదాయమే కోటి పణాలకి మించుతుంది. ధాన్యకటకపు పౌరుల తలసరి ఆదాయం వంద పణాలకి పైనే. ప్రపంచంలోనే అంతటి సంపన్నమైన నగరం మరొకటి ఉండదేమో! ఎదురుగా వేల దీపాల కాంతితో చైత్యం ధగధగా వెలిగిపోతుంది. చైత్యకుల ఆరామం ముందర ఐదు నిలువుల స్వస్తి తోరణం. ఠంగుఠంగని మోగే గంటలతో బౌద్ధారామంలో కూడా పండగ వాతావరణం నెలకొని ఉంది. ఎదురుగా ఉన్న మైదానంలో నిలువెత్తు యవనిక(స్టేజి), సాయంకాలం ప్రదర్శించాల్సిన నాటకం కొరకు సిద్ధం అవుతోంది. ఎటు చూసినా ఉరుకులు పరుగులు పెడుతున్న భిక్షువులు. ఏమిటో హడావుడి? రాకుమారుడు యాన్, ఆరామంలో అందరికీ సుపరిచితుడే. పలకరించిన వారినందరికీ ఒంటిచేత్తో నమస్కరిస్తూ ఆచార్యుని విడిది చేరాడు. పీఠంపై అసమాన తేజస్సుతో వెలిగిపోతున్న ఒక ఆచార్యుడిని చూశాడు. ఆ బుద్ధభగవానుడే ఎదుట ప్రత్యక్షమయ్యాడా? అని ఒక క్షణం నివ్వెరపోయాడు. యాన్. అతడే ఆచార్య నాగార్జునుడు. అప్రయత్నంగా ఆచార్యుని పాదాలవద్ద సాగిలపడ్డాడు. ‘లే రాకుమారా!’ ఆచార్యుని మాటలు శుద్ధమైన చైనాభాషలో వినపడేసరికి, యాన్ ఆశ్చర్యం ద్విగుణీకృతం అయింది. ‘మీరు వచ్చిన పని దాదాపు పూర్తయింది. శ్రీపర్వతంలోని మత గ్రంథాల నకళ్లు, టీక తాత్పర్యాలతో సహా సిద్ధంగా ఉన్నాయి. ఇక మూడు నెలల్లో వేసవి ముగిసి, సముద్రపు గాలులు నైఋతి నుండి వీస్తాయి. అది మీ ప్రయాణానికి అనుకూలం. అయితే తథాగతుని బోధనలని అక్కడి మతగురువులకు, మీ అన్న మింగ్ చక్రవర్తికి విశదీకరించటం ఆవశ్యకం. దాని కొరకు, విశ్వవిద్యాలయంలోని ఆచార్యుడు కశ్యపమాతంగుడు,తన శిష్యబృందంతో పాటూ మీతో మీ దేశానికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. మీరు అనుమతిస్తే అది మాకెంతో సంతోషదాయకం. ఏమంటారు?’ అన్నాడు నాగార్జునుడు. సమాధానంగా తలవూపుతూ మౌనంగా ఆయన పాదాలపై వాలిపోయాడు చైనా కుమారుడు. చైనాకి తిరుగు ప్రయాణానికి సమయం దగ్గరపడింది. శాతకర్ణి చక్రవర్తి సమకూర్చిన ఓడలు గ్రంథాగారంతో సహా రేవులో సిద్ధంగా ఉన్నాయి. కృష్ణమ్మ అలల మీదుగా వీచి చల్లబడిన పడమటి గాలి మండుటెండల వేడి నుండి కాస్త ఉపశమనం కలిగిస్తోంది. చైనా సాంప్రదాయపు హాన్పూ దుస్తులు వదిలేసి ప్రాంతీయమైన సన్నని పట్టుపంచె, అంగీ ధరించి శ్రీపర్వతంలోని ఆచార్యుని ఉపన్యాసమందిరం వైపు నడవసాగాడు యాన్. అక్కడ కొలువైన విశ్వవిద్యాలయాన్ని ఆశ్చర్యంగా చూస్తున్నాడతడు. విశ్వవిద్యాలయంలో యవన, ద్రవిడ, పారశీక శైలుల్లో అనేక కట్టడాలు. గ్రంథాలయాలు, ఉపన్యాసకూటాలూ, యవనికలూ, వాస్తు శిల్పాగారాలూ, వైద్యశాలలూ, యంత్రాగారాలూ, రసాయన ప్రయోగశాలలూ, వాటి చుట్టూ వసతి గృహాలూ, భోజనశాలలు. క్రీడాంగణంలో సాయంకాలం వ్యాయామానికి నేల యీనినట్లు వచ్చిన విద్యార్థి బృందాలు. జ్ఞానార్జనే ధ్యేయమైతే శ్రీపర్వతానికి మించిన విద్యాలయం ప్రపంచంలోనే లేదు.యాన్ మనఃస్థితి సందిగ్ధావస్తలో ఉంది. అక్కడ మధ్యచైనాకి తిరిగి వెళితే సమస్త రాజభోగాలు ఉంటాయి. ఇంకా పితృదేవతలు అనుగ్రహిస్తే చక్రవర్తిత్వం కూడా దక్కవచ్చు. ఇక్కడే ఉంటే భిక్షువృత్తి స్వీకరించాలి, కానీ అపారమైన జ్ఞాన సముపార్జనకి అవకాశం, అపర బోధిసత్వుడైన ఆచార్యుని శిష్యరికం దొరుకుతాయి. తన భవిష్యత్తు ఏదో నిర్ణయించుకొనే సమయం వచ్చింది. అతడి మనస్సు ఆచార్యుని వైపే మొగ్గింది. తెల్లని తెరచాపలతో రెక్కల గుర్రాలలాంటి పన్నెండు నావలు చైనా ప్రయాణానికి సిద్ధంగా కృష్ణానదిలో ఓలలాడుతున్నాయి. ఒడ్డుపై నిలిచి వాటికి వీడ్కోలు పలికాడు, జ్ఞానతృష్ణతో రాచరికాన్నే త్యజించిన బౌద్ధ భిక్షువు యాన్. అపరబోధిసత్వుడు ఆచార్య నాగార్జునుడు క్రీ.శ. మూడవ శతాబ్దిలో చైనాలో రచించబడిన ‘లిహ్వోలున్’ అనే గ్రంథంలో బౌద్ధమతం ఏవిధంగా కృష్ణాతీరం నుండి చైనాకి పాకిందో వివరించబడింది. ఈ గ్రంథం ఇండియా తీరాన్ని ‘తెన్గ్యూ’ దేశమనే పేరుతో సంబోధించింది. హాన్ వంశానికి సమకాలీనమైన శాతవాహన సామ్రాజ్యంలో బౌద్ధమతం ఎంతో ఉచ్ఛదశలో ఉంది. ఆంధ్రప్రదేశ్ నలుమూలలలో దొరికిన బౌద్ధ శిథిలాలే అందుకు నిదర్శనం. అజంతా చిత్రాలు, అమరావతి శిల్పసంపద ఆనాటి వైభవోపేతమైన జనజీవనానికి అద్దంపడతాయి. అంతేకాదు చైనా, టిబెట్, శ్రీలంకల్లో దొరికిన బౌద్ధ వాఞ్మయం ఆనాటి వాణిజ్యాన్ని, వస్తు సంస్కృతిని వివరిస్తాయి. ‘పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ’ అనే రోమన్ గ్రంథం దక్షిణ భారతదేశంలోని రేవు పట్టణాలు, వ్యాపారం, పరిశ్రమల గురించి వివరిస్తుంది. క్రీ.శ. 1వ శతాబ్దిలో రచించబడిన రోమన్ గ్రంథం, ‘హిస్టోరియా న్యాచురాలిస్’ రచయిత, ప్లైనీ ద ఎల్డర్, క్రిష్ణాతీరంలో తయారయ్యే వస్త్రాల కోసమే రోమన్ స్త్రీలు సాలుకి కోటి సెస్టర్సీస్ (రోమన్ వెండినాణెం) వెచ్చిస్తున్నారని వాపోయాడు. ముడినూలు, పట్టులను వస్త్రాలుగా నేసే సాలీలకి ఆంధ్రదేశం ఎల్లప్పుడూ ప్రఖ్యాతి గాంచింది. ఆధునికయుగంలో ఇంగ్లండ్లో పారిశ్రామిక విప్లవం, బ్రిటిష్ ప్రభుత్వపు ద్వంద్వ వైఖరివల్ల మిల్లుబట్టల తాకిడికి మన చేనేత పరిశ్రమ దాదాపు రూపు మాసిపోయింది. ఇక చైనా, జపాన్, ఆగ్నేయ ఆసియా దేశాలకి నాగరికతని, బౌద్ధమతాన్ని పంచినది ఆంధ్రదేశమే. నేటి నాగార్జునసాగర్ డ్యాం వద్ద శ్రీపర్వతం అనే మహావిశ్వవిద్యాలయం ప్రపంచానికే తలమానికమై విలసిల్లింది. ఆ కాలంలో ఆచార్య నాగార్జునుని శ్రీపర్వత క్షేత్రం ఎలావుండేదో తెలుసుకోవాలంటే చైనా యాత్రికులు ఫాహియాన్, హ్యూయెన్త్సాంగుల కథనాలు ఒక చక్కని ఆధారం. పదివేలకు పైగా దేశవిదేశాల విద్యార్థులు అక్కడ శిక్షణ పొందేవారు. భారత వైద్యశాస్త్ర వాఞ్మయంలో ఆచార్య నాగార్జునుడి ప్రశంస ప్రారంభించని గ్రంథం లేదు. సుశ్రుతుని శస్త్రవైద్య సంహితను సంకలనం చేసింది అతడే. ఆరోగ్య మంజరి అతడు రచించిన వైద్య గ్రంథాలలో ఒకటి. నేత్రవ్యాధులకి అతడు నిర్దేశించిన చికిత్స చైనాలోనూ ఎంతో ప్రసిద్ధిగాంచింది. పాదరసం, బంగారం మొదలైన ఖనిజాల రహస్యాలు విశదీకరించే రసరత్నాకరం భారతీయ రసాయనశాస్త్రానికే ఆదిగ్రంథం. అతడి మానవాతీత శక్తులపై అనేక కథనాలు ప్రపంచపు నలుమూలలా వ్యాపించాయి. ప్రకృతి ధర్మాలను ఔపోసన పట్టిన సిద్ధపురుషుడు. ఇక బౌద్ధ మహాయానానికి అతడే మూలపురుషుడు. తర్కంలో, తత్వశాస్త్రంలో అతడి ప్రజ్ఞ అనితరసాధ్యం. అతడి మాధ్యమికతత్వం, మతానికే కాక, ఆదిశంకరుని అద్వైతానికి కూడా ప్రామాణికం అయింది. క్లుప్తంగా చెప్పాలంటే అతడు వైద్య, రసాయన, ఖనిజ, ఖగోళ, వృక్ష శాస్త్రజ్ఞుడే కాక మహాయాన బౌద్ధాన్ని సిద్ధాంతీకరించిన తర్కవేత్త. అంతేకాదు, అతడొక గొప్ప రాజనీతిజ్ఞుడు. శాతవాహన చక్రవర్తికి ధర్మోపదేశం చేస్తూ ‘సుహృల్లేఖ’ అనే పేరుతో అతడు రాసిన ఉత్తరాల సంకలనం ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. ఇండియాలోనే కాదు, మధ్య ఆసియా దేశాల్లో కూడా విద్యాలయాల్లోని విద్యార్థులు సుహృల్లేఖని ప్రతిరోజు వల్ల వేసేవారని చైనా యాత్రికుడు ఇత్సింగ్ చెప్పాడు. అరిస్టాటిల్, ప్లాటో వంటి తత్వవేత్తలకి కూడా ఆచార్య నాగార్జునుని గంటం నుండి వెలువడిన అపారమైన రచనాపరంపర ముందు తలవొగ్గక తప్పలేదు. సాయి పాపినేని