ఏపీ భవన్‌లో ‘టీ’ నిరసనలు | Telangana Protests over AP Bhavan at New delhi | Sakshi
Sakshi News home page

ఏపీ భవన్‌లో ‘టీ’ నిరసనలు

Feb 11 2014 5:50 AM | Updated on Mar 28 2019 5:23 PM

సంపూర్ణ తెలంగాణ కోరుతూ ఆ ప్రాంతానికి చెందిన నేతలు సోమవారం ఏపీ భవన్‌లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నినాదాలతో ఏపీభవన్ ప్రాంగణాన్ని హోరెత్తించారు

సాక్షి, న్యూఢిల్లీ: సంపూర్ణ తెలంగాణ కోరుతూ ఆ ప్రాంతానికి చెందిన నేతలు సోమవారం ఏపీ భవన్‌లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు.   నినాదాలతో ఏపీభవన్ ప్రాంగణాన్ని హోరెత్తించారు. ఉదయం 8.30 గంటలకు టీ.జేఏసీ చైర్మన్ కోదండరాం నేతృత్వంలో వందలాది కార్యకర్తలు ఏపీ భవన్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలపడం, హైదరాబాద్ శాంతిభద్రతలపై గవర్నర్ ఆజమాయిషీ పెట్టడం వంటి అంశాలను వ్యతిరేకించారు.
 
 ఎటువంటి ఆంక్షలు లేని తెలంగాణ బిల్లునే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి జేఏసీ నేతలు దేవీప్రసాద్, శ్రీనివాస్‌గౌడ్, అద్దంకి దయాకర్, విఠల్ తదితరులు హాజరయ్యారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్, బీజేపీ ఎమ్మెల్యే లు యెండల లక్ష్మీనారాయణ, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డి, టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు స్వామిగౌడ్, సుధాకర్‌రెడ్డి, మహమూద్ తదితరులు సంఘీభావం ప్రకటించారు.  అనంతరం విద్యార్థి, న్యాయవాద, ఉద్యోగ, విద్యుత్ జేఏసీల నేతలు విడివిడిగా అంబేద్కర్ విగ్రహం ముందు సాయంత్రం వరకు ఆటపాటలతో నిరసనలు కొనసాగించారు.
 
 కిరణ్ రాజీనామా చేస్తారా! : డీఎస్
 న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి రాజీనామా చేస్తారంటూ వస్తున్న వార్తలపై పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ విస్మయం వ్యక్తం చేశారు. ‘‘సీఎం నిజంగా రాజీనామా చేస్తారా? నాకైతే తెలియదు. ఒకవేళ మీరు (మీడియా) ఊహిం చినట్లుగా సీఎం రాజీనామా చేస్తే కేంద్రం తీసుకొనే నిర్ణయమేమిటో మీరే చూస్తారు’’ అని వ్యాఖ్యా నించారు. రెండు రాష్ట్రాలు అయిపోతుంటే మళ్లీ నాలుగో కృష్ణుడు ఎందుకని అన్నారు. తెలంగాణ బిల్లు ఆమోదం పొందుతుందని చెప్పారు. డీఎస్ సోమవారం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ను వేర్వేరుగా కలిశారు. తెలంగాణ బిల్లు, సీఎం వ్యవహారం, రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని వివరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..    రాష్ర్ట విభజన అంశం, సీఎం వ్యవహారంపై చర్చిం చారు. తెలంగాణపై బీజేపీ ఇప్పుడు వెనక్కుపోయి పార్టీ పరపతిని పోగొట్టుకుంటుందని అనుకోవడం లేదని చెప్పారు.  కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనమవు తుందని తెలిపారు. రాష్ర్ట విభజనపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు  ద్వంద్వ వైఖరి అవలం బిస్తున్నారన్నారు.    
 
 నేడు తెలంగాణ బంద్: విద్యార్థి జేఏసీ,టీపీఎఫ్
 తెలంగాణ బిల్లులోని ఆంక్షలకు వ్యతిరేకంగా  విద్యార్థి జేఏసీ, తెలంగాణ ప్రజా ఫ్రంట్ (టీపీఎఫ్) మంగళవారం తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చాయి,  బంద్‌కు అన్ని పార్టీలు, ప్రజా, విద్యార్థి సంఘాలు సహకరించాలని కోరాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement