మహిళా మావోయిస్టు లొంగుబాటు | Sakshi
Sakshi News home page

మహిళా మావోయిస్టు లొంగుబాటు

Published Sun, Apr 19 2015 2:32 AM

Women Maoist surrender

వరంగల్ క్రైం : సీపీఐ మావోయిస్టు అజ్ఞాత మహిళా నక్సలైట్, జనతనా సర్కార్‌లో వ్యవసాయ కమిటీ ఇన్‌చార్జి మచ్చ సుగుణ అలియాస్ అరుణ అలియాస్ శాంత శని వారం వరంగల్ ఓఎస్‌డీ సన్‌ప్రీత్‌సింగ్ ఎదుట లొంగిపోయూరు. ఈ మేరకు హన్మకొండలోని హెడ్‌క్వార్టర్స్‌లో శని వారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఓఎస్‌డీ వివరాలు వెల్లడించారు. భూపాలపల్లి మండలం పంబాపూర్‌కు చెందిన మచ్చ సుగుణకు 40 ఏళ్ల క్రితం మచ్చ సోమయ్య అలియాస్ సురేందర్ అలియాస్ సతీశ్‌తో వివాహమైంది. వివాహానంతరం వారికి ఇద్దరు కుమార్తెలు, ఇద్ద రు కుమారులు జన్మించాక మచ్చ సోమయ్య మావోయిస్టు పార్టీ సాహిత్యానికి ఆకర్షితుడై ఏటూరునాగారం-మహదేవపూర్ ఏరియా కమిటీ సభ్యుడిగా చేరాడు.

మచ్చ సుగుణ తన కుమార్తెలు, కుమారుల వివాహానంతరం తన భర్త ఆదేశాల మేరకు పార్టీలో చేరింది. మచ్చ సోమయ్య ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టు పార్టీలో డీసీఎస్‌గా పనిచేస్తున్నాడు. మొదట పార్టీ ఆదేశాల మేరకు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో భాట్టూమ్ ఏరియా కమిటీలో పనిచేసింది. తర్వాత జనతనా సర్కార్ (ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు అనుబంధ సంస్థ)లో కృషి అను వ్యవసాయ కమిటీలో ఏసీఎం స్థాయి లో పామెడ, కుంట, ఎర్రారం ఏరియాలో పనిచేసింది.

ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో ఏర్పడిన అంతర్గత విభేదాలు, పార్టీపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతతోపాటు ఆరోగ్య సమస్యలు, తెలంగాణ రాష్ట్రంలో  లొంగిపోయిన నక్సలైట్లకు అందిస్తున్న ప్రోత్సాహానికి ఆకర్షితురాలై పోరుబాట వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని నిర్ణయించుకుని  స్వచ్ఛందంగా లొంగిపోయింది. లొంగిపోయిన మచ్చ సుగుణపై రూ.లక్ష రివార్డు ఉంది.

మచ్చ సోమయ్య లొంగిపోవాలి..

ఛత్తీస్‌గఢ్ డీసీఎస్‌గా క్రియాశీలక పాత్ర పోషిస్తున్న మచ్చ సోమయ్య ఎక్కడ ఉన్నా, వెంటనే లొంగిపోవాలని సుగుణ ఈ సందర్భంగా తన భర్తను కోరింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement