స్టీల్‌ వంతెనలకు సై! | All Set For Steel Bridge Construction in Hyderabad | Sakshi
Sakshi News home page

స్టీల్‌ వంతెనలకు సై!

Feb 27 2019 10:59 AM | Updated on Feb 27 2019 10:59 AM

All Set For Steel Bridge Construction in Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో  రెండు ప్రాంతాల్లో వాయిదా పడుతూ వస్తోన్న స్టీల్‌ బ్రిడ్జిల పనులకు అవాంతరాలు తొలగిపోయాయి. టెండరు నిబంధనల్లో ప్రభుత్వం మినహాయింపులివ్వడంతో రెండు ప్రాంతాల్లో దాదాపు రూ. 949 కోట్ల విలువైన పనులకు ఆటంకాలు తొలగిపోయాయి. ఎస్సార్‌డీపీలో భాగంగా దాదాపు రూ.24 వేల కోట్ల పనులకు సిద్ధమైన జీహెచ్‌ఎంసీ..పనులు త్వరితంగా జరిగేందుకుగాను రెండు ప్రాంతాల్లో సంప్రదాయ పద్ధతికి భిన్నంగా స్టీల్‌బ్రిడ్జిలు నిర్మించాలని తలపెట్టింది. ఇందుకుగాను దాదాపు ఆర్నెళ్లక్రితం టెండర్లు ఆహ్వానించింది. స్టీల్‌బ్రిడ్జిలు నిర్మించిన అనుభవమున్న  ఏజెన్సీలే  టెండర్లు వేసేందుకు అర్హమైనవనే నిబంధన విధించడంతో ఎవరూ ముందుకు రాలేదు. దేశంలోనే అలాంటి పనులు చేసిన ఏజెన్సీలు వేళ్లమీద లెక్కించేన్ని మాత్రమే ఉన్నాయి. రెండు పర్యాయాలు టెండర్లు పిలిచినా ఒక్క టెండరు కూడా దాఖలు కాకపోవడంతో పరిస్థితిని వివరిస్తూ..

టెండరు నిబంధనల్లో మినహాయింపులకు అనుమతించాలని కోరుతూ జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. అందుకు ప్రభుత్వం  సమ్మతించడంతో టెండరు నిబంధనల్ని సవరించారు. స్టీలు బ్రిడ్జి నిర్మించిన సంస్థలే కాకుండా ఆర్‌సీసీ బ్రిడ్జిల్లో కొన్ని స్పాన్లు స్టీల్‌ కాంపొజిషన్‌తో కూడిన పనులు చేసిన అనుభవమున్న సంస్థలు కూడా టెండరులో పాల్గొనేందుకు అర్హమైనవేననడంతో ఒక్కో ప్రాజెక్టుకు రెండేసి సంస్థలు టెండర్లు దాఖలు చేశాయి. ఎస్సార్‌డీపీలో భాగంగా ఇప్పటికే వివిధ ఫ్లై ఓవర్ల పనులు చేపట్టిన ఎంవీఆర్‌తో పాటు ఎన్‌సీసీ టెండర్లు దాఖలు చేశాయి. టెండర్ల టెక్నికల్‌ ఎవాల్యుయేషన్‌ జరుగుతోందని, త్వరలోనే ఖరారు చేయనున్నట్లు జీహెచ్‌ఎంసీ చీఫ్‌ ఇంజినీర్‌ ఆర్‌.శ్రీధర్‌(ప్రాజెక్టŠస్‌) తెలిపారు. టెండరు ఖరారైనప్పటికీ, ఎన్నికల కోడ్‌ ముగిసేంత దాకా ఎల్‌ఓఏ  ఇచ్చే పరిస్థితి కానీ, అగ్రిమెంట్‌ కుదుర్చుకునే పరిస్థితి కానీ లేదు.  ఎన్నికల కోడ్‌ ముగిశాకే అగ్రిమెంట్‌తో పాటు పనులు ప్రారంభం కాన్నాయి. రెండు ప్రాంతాల్లో ఈ స్టీల్‌బ్రిడ్జిల పనులకు మొత్తం రూ. 949 కోట్లు ఖర్చు కానుంది. వివరాలిలా ఉన్నాయి.

నల్లగొండ క్రాస్‌రోడ్‌ నుంచి..
నల్లగొండ క్రాస్‌ రోడ్‌ నుంచి సైదాబాద్, సంతోష్‌నగర్‌ల మీదుగా ఒవైసీ జంక్షన్‌ వైపు దాదాపు 4 కి.మీ.ల మేర ఈ స్టీల్‌ బ్రిడ్జి  నిర్మించనున్నారు. ఈ మార్గం వెంబడి పలు ప్రార్థనామందిరాలు, శ్మశాన వాటికలతోపాటు ఆస్పత్రులు, పోలీస్‌స్టేషన్‌ తదితరమైనవి ఉన్నాయి. తీవ్ర ట్రాఫిక్‌ రద్దీతో మిథాని, సంతోష్‌నగర్‌ తదితర ప్రాంతాల నుంచి న్యూసిటీలోకి వచ్చేందుకు, తిరిగి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ బ్రిడ్జి నిర్మాణంతో ట్రాఫిక్‌ ఇక్కట్లు తీరనున్నాయని అధికారులు చెబుతున్నారు.

ఈ బ్రిడ్జి వివరాలు..
పొడవు : 4 కి.మీ.
నాలుగు లేన్లు  
ప్రయాణించే వాహనాలు: 70,576(2015 గణాంకాల మేరకు)
అంచనా వ్యయం : రూ.523. 37 కోట్లు 

ఇందిరాపార్కు నుంచి ..
ఇందిరాపార్కు  నుంచి వీఎస్‌టీ జంక్షన్‌ వరకు, రామ్‌ నగర్‌ నుంచి బాగ్‌ లింగంపల్లి వరకు మరో రెండు స్టీల్‌ బ్రిడ్జిలునిర్మించనున్నారు. ఈ రెండూ ఒకే ప్రాజెక్టుగా చేపట్టారు.

వివరాలిలా ఉన్నాయి..
ఇందిరాపార్కు– వీఎస్‌టీ జంక్షన్‌
పొడవు : 2.6 కి.మీ.
వెడల్పు : 16.61 మీటర్లు
ఎత్తు: భూమికి 20 మీటర్లు
రామ్‌నగర్‌ – బాగ్‌లింగంపల్లి
పొడవు: 0.84 కి.మీ.
వెడల్పు: 13.61 మీటర్లు  
అంచనా వ్యయం: రూ.426 కోట్లు

హిందీ మహావిద్యాలయ, విద్యానగర్, రామ్‌నగర్, వీఎస్టీల నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్‌ మీదుగా సచివాలయం, లక్డీకాపూల్‌   తదితర ప్రాంతాలకు వెళ్లే వారికి .. రామ్‌నగర్‌ నుంచి బాగ్‌లింగంపల్లి మీదుగా హిమాయత్‌నగర్, లిబర్టీ, సచివాలయం తదితర ప్రాంతాలకు వెళ్లే వారికి ఈ బ్రిడ్జిలు సదుపాయంగా ఉంటాయి. 

40 శాతం సమయం ఆదా..
నగరీకరణ, ట్రాఫిక్‌ ఇబ్బందులతో పనులకు దీర్ఘసమయం çపడుతుండటంతో నిర్మాణ సమయాన్ని తగ్గించేందుకు స్టీల్‌బ్రిడ్జిల నిర్మాణానికి సిద్ధమయ్యారు. బ్రిడ్జిలోని పిల్లర్లు, గర్డర్లకు పూర్తిగా స్టీల్‌ వాడతారు. బ్రిడ్జి శ్లాబ్‌ మాత్రం కాంక్రీట్‌ నిర్మాణమే చేస్తారు. సంప్రదాయ పద్ధతిలోని ఫ్లై ఓవర్ల కంటే వీటికి 40 శాతం మేర సమయం ఆదా అవుతుందని అధికారులు  పేర్కొన్నారు. ఖర్చు దాదాపు 25 శాతం అదనం కానున్నప్పటికీ, నగరీకరణ, ఆస్తుల సేకరణ అంశాలను పరిగణనలోకి తీసుకుంటే నిర్మాణ సమయం కలసి వస్తుందని చెబుతున్నారు. హుగ్లీ నదిమీద నిర్మించిన హౌరా బ్రిడ్జి ఇలాంటిదే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement