breaking news
-
మోదీపై వ్యాఖ్యల ఎఫెక్ట్.. రేవంత్ మతి తప్పిందా?: డీకే అరుణ ఫైర్
సాక్షి, మహబూబ్నగర్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ ఎంపీ డీకే అరుణ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. ముఖ్యమంత్రిగా ఉండి ప్రధాని మోదీ కులం గురించి మాట్లాడడానికి సిగ్గు అనిపించడం లేదా? అని ప్రశ్నించారు. రేవంత్ ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నానని అనుకుంటున్నారు. ఇదే సమయంలో రేవంత్ను లక్కీ లాటరీ సీఎం అని అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు.ప్రధాని మోదీపై సీఎం రేవంత్ వ్యాఖ్యల విషయంలో ఎంపీ డీకే అరుణ స్పందించారు. ఈ క్రమంలో తాజాగా డీకే అరుణ మాట్లాడుతూ.. మిస్టర్ రేవంత్ రెడ్డినోరు జారితే ఊరుకోను. ప్రధాని మోదీ సామాజికవర్గం గురించి మాట్లాడే స్థాయి నీకు ఎక్కడిది. రేవంత్ రెడ్డికి మతి తప్పింది.. అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయి ఫస్ట్రేషన్లో ఇలా మాట్లాడుతున్నారు. ప్రజల దృష్టిలో మరల్చడానికి ఇలాంటి చిల్లర కామెంట్స్ చేస్తున్నాడు. ముఖ్యమంత్రిగా ఉండి ప్రధాని మోదీ కులం గురించి మాట్లాడడానికి సిగ్గు అనిపించడం లేదా?.నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే.. తెలంగాణలో రెండోసారి కులగణన ఎందుకు?. ముందు దీనికి సమాధానం చెప్పండి. మీకు చిత్తశుద్ధి లేదు కాబట్టే రెండోసారి కులగణన చేయాల్సి వస్తోంది. మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు, బీసీలు లేరు, మీకు ఓట్లేసిన కార్యకర్తలు కూడా నమ్మడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎప్పుడు దింపేద్దామని ప్రజలే చూస్తున్నారు. ఇప్పటికైనా నీ స్థాయి ఏంటో తెలుసుకో రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నావ్. ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నారని అనుకుంటున్నారా?. అందుకే ఆయన భాష, ప్రవర్తన అలానే ఉంది.. ఇంకా మార్చుకోలేదు. నీలాగా అధికారం ఉందనే గర్వంతో రెచ్చిపోయినవాళ్లు ఇప్పుడు ఎక్కడున్నారో గుర్తుంచుకోవాలి. మాట తీరు మార్చుకో.. ముఖ్యమంత్రి కుర్చీకి గౌరవం ఇవ్వండి.ఢిల్లీ ప్రజలు కాంగ్రెస్కు గాడిద గుడ్డు ఇచ్చినా వీళ్ళకు ఇంకా అహంకారం తగ్గలేదు. మీకు దమ్ముంటే తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయండి. మీరు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ప్రధాని మోదీ దేశ ప్రతిష్టను నలుమూలల చాటుతుంటే ఆయనకు వస్తున్న ఆదరణ చూసి మీరు ఓర్వలేకపోతున్నారు. ఇప్పటికైనా మోదీని చూసి నేర్చుకోండి. పేదరికం నుంచి ప్రధాని వరకు ఆయన ఎలా పైకి వచ్చారో తెలుసుకోండి. రేవంత్.. నువ్వు ఈ స్థాయికి ఎలా వచ్చావో అందరికీ తెలుసు. నువ్వు లక్కీ లాటరీ సీఎం. కాంగ్రెస్ పార్టీకి దిక్కులేక నిన్ను సీఎం సీట్లో కూర్చోపెట్టింది. ఇవ్వన్నీ తెలుసుకోకుండా ప్రధాని మోదీ గురించి మాట్లాడితే ఊరుకునేది లేదు ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. -
మోదీ పుట్టుకతో బీసీ కాదు
సాక్షి, హైదరాబాద్: ప్రదానమంత్రి మోదీ(PM Narendra Modi)ని ఉద్దేశించి రాష్ట్ర సీఎం రేవంత్రెడ్డి(Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ పుట్టుకతో బీసీ కాదని, ఆయన కులం గతంలో ఉన్నత వర్గాల్లో ఉండేదని, గుజరాత్కు సీఎం అయ్యాక ఆయన తన కులాన్ని బీసీల్లో కలిపి ఇత్తేసి పొత్తు కుదిరాడని అన్నారు. మోదీ సర్టిఫికెట్ మాత్రమే బీసీదని, మనస్తత్వం ఇందుకు వ్యతిరేకమని విమర్శించారు. తాను బీసీ ప్రధానిని కనుక ఇక ఎవరూ అవసరం లేదన్నట్టుగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్రావు, ఆయన కుటుంబ సభ్యులపై కూడా సీఎం విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన కార్యక్రమంలో జనాభా లెక్కలు చెప్పని కేసీఆర్కు తెలంగాణలో జీవించే హక్కు లేదని అన్నారు. మరోమారు నిర్వహిస్తున్న కులగణనలో అయినా వివరాలు ఇవ్వకపోతే కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావులకు సామాజిక బహిష్కరణే శిక్ష అని పేర్కొన్నారు. ఈ మేరకు ఈ సమావేశంలో తీర్మానం చేస్తున్నామని, అందరూ ఆమోదించాలని కోరారు. శుక్రవారం గాందీభవన్లో టీపీసీసీ అధ్యక్షుడు ఎ.మహేశ్కుమార్గౌడ్ అధ్యక్షతన కులగణన, ఎస్సీ వర్గీకరణపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కార్యక్రమం జరిగింది. రాష్ట్రంలో కులగణన చేసిన తీరును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎస్సీలను వర్గీకరించిన తీరును మంత్రి దామోదర రాజనర్సింహ.. మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, డీసీసీ అధ్యక్షులు, ఇతర ముఖ్య నేతలకు వివరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. పారదర్శకంగా కులగణన: ‘దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న రెండు సమస్యలకు పరిష్కారం చూపే దిశలో మేం ప్రయత్నిస్తుంటే ప్రత్యర్థి రాజకీయ పక్షాలు, ఆ పారీ్టల నేతలు ఆరోపణలతో, లేనిపోని అపోహలు సృష్టిస్తూ కుల గణన తప్పుల తడక అనే అభిప్రాయం కలిగించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. దేశ వ్యాప్తంగా కులగణన జరిగి బలహీన వర్గాల లెక్క తేల్చి వారి కోటా, వాటా వారికివ్వాలనేది రాహుల్గాంధీ ఆలోచన. ఆ దిశలోనే ముందుకెళ్లి తెలంగాణ ప్రజలకు రాహుల్ ఇచ్చిన మాటను నిలబెట్టేందుకు పారదర్శకంగా కులగణన చేశాం. గ్యాంబ్లర్స్కు కులగణన ఇష్టం లేదు.. కేసీఆర్ గతంలో కాకి లెక్కలతో సర్వే చేశాడు. చెట్ల మీద విస్తరాకులు కుట్టి ఇదే బైబిల్, ఖురాన్, భగవద్గీత అన్నాడు. ఆయన చేసిన లెక్క సక్కదనమైనది అయితే, ఎస్సీల్లో 59 ఉప కులాలుంటే ఆయన సర్వేలో 82 కులాలు ఎలా వచ్చాయి? రాష్ట్రంలో అందరినీ లెక్కపెడుతున్నప్పుడు కేసీఆర్, ఆయన కొడుకు, అల్లుడు వివరాలు ఎందుకు ఇవ్వలేదు? అలా వివరాలు ఇవ్వని కేసీఆర్కు తెలంగాణలో జీవించే హక్కు, మాట్లాడే హక్కు లేదు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు, పోచంపల్లి వాళ్ల లెక్కలు చెప్పలేదు. కుల గణన చేయడం ఆ గ్యాంబ్లర్స్కు ఇష్టం లేదు. ఎందుకంటే వీళ్ల లెక్క తెలిస్తే గత ప్రభుత్వంలో నాలుగు మంత్రి పదవులు ఎలా తీసుకున్నారని బీసీలు అడుగుతారని, కడుగుతారని, వంగబెట్టి దంచుతారని తెలుసు. వీరి జనాభాకు వార్డు మెంబర్ కంటే ఎక్కువ పదవులేవీ రావు. అందుకే ఈ లెక్క రాకూడదని కేసీఆర్ కుట్ర చేస్తున్నాడు. మనకు తెలియకుండానే ఆ కుట్రలో మనం భాగస్వాములవుతున్నాం. నేను సవాల్ చేస్తున్నా.. మేం చేసిన కులగణనలో ఒక్క తప్పులేదు..’అని ముఖ్యమంత్రి అన్నారు. ఐదు గ్రూపుల్లో ముస్లింలు కూడా ఉన్నారు ‘కొందరు కాంగ్రెస్కు నేనే ఆఖరు సీఎం అని అంటున్నారు. అయినా ఫర్వాలేదు. మా నాయకుడి మాట నిలబెట్టేందుకే ఈ కులగణన చేశాం. నాయకుడిచ్చిన మాటను నిలబెట్టడం మా «ధర్మమని, ఏ త్యాగానికైనా సిద్ధమయ్యే ముందుకెళ్లాం. అయినా దొంగ లెక్కలు ఇలా రాస్తారా? దొంగ లెక్కలు రాయాలనుకుంటే మా జనాభా 5 శాతం ఎందుకు చూపిస్తాం. 15–20 శాతం చూపిస్తాం కదా? కొందరు మైనారీ్టల లెక్కలెలా తీస్తారని అంటున్నారు. గతంలో బీసీల్లో ఐదు గ్రూపులున్నాయి. అందులో ముస్లింలు కూడా ఉన్నారు. అందుకే వారి లెక్క తీశాం..’అని రేవంత్ వివరణ ఇచ్చారు. కోల్డ్ స్టోరేజీలో పెట్టేలా బీజేపీ కుట్ర ‘బీసీల లెక్కలు రాకూడదన్నదే మోదీ, కేడీల ప్రయత్నం. తెలంగాణలో మా ప్రభుత్వం అన్ని కులాల లెక్కలు తీసిందని, అదే పని దేశవ్యాప్తంగా ఎందుకు చేయరని పార్లమెంటులో మోదీని రాహుల్గాంధీ నిలదీశారు. అందుకే రాష్ట్ర బీజేపీ నేతలు కూడా దీన్ని తప్పుల తడక అనే ముద్ర వేసి కోల్డ్ స్టోరేజీలో పెట్టాలనుకుంటున్నారు. నిజంగా మోదీకి బీసీలపై ప్రేమ ఉంటే 2021 లోనే జనాభా లెక్కలు తీసి అందులో కులగణన చేసేవారు. రేపు చేయబోయే జనగణనలో అయినా బీసీ కులాల లెక్క తేల్చాలి. నిజంగా మేం చేసిన లెక్కలు తప్పయితే మోదీ దేశ వ్యాప్తంగా కులగణన చేయడం ద్వారా రాష్ట్రంలోని బీసీల లెక్కలు తేల్చాలి. ఇవిగో మోదీ లెక్కలు, ఇవిగో రాహుల్ లెక్కలు అని ప్రజల ముందు పెట్టాలి..’అని సీఎం అన్నారు. వారి ఇళ్ల ముందు మేల్కొలుపు డప్పులు కొట్టండి ‘ఎస్సీలను వర్గీకరించి రిజర్వేషన్లు పంపిణీ చేశాం. దీన్ని కూడా తప్పు పట్టాలని కొందరు చూస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు దీన్ని చాలెంజ్ చేయండి. ఏ లెక్క, ఏ వార్డు, ఏ కుటుంబంలో తప్పు ఉందో చెప్పమని అడగండి. కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావుల ఇళ్ల ముందు మేల్కొలుపు డప్పులు కొట్టండి. అప్పుడు కూడా వివరాలు ఇవ్వకపోతే సామాజిక బహిష్కరణ శిక్ష విధించండి..’అని సీఎం వ్యాఖ్యానించారు. సమావేశంలో కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్కుమార్రెడ్డి, సభ్యులు పొన్నం ప్రభాకర్, సీతక్క, మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ కాంగ్రెస్ నూతన ఇంఛార్జ్గా మీనాక్షి నటరాజన్
సాక్షి, ఢిల్లీ: తొమ్మిది రాష్ట్రాలకు ఇంఛార్జ్లను ఏఐసీసీ ప్రకటించింది. దీపాదాస్ మున్షీ స్థానంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్గా మీనాక్షి నటరాజన్ను నియమిస్తూ ఏఐసీసీ ఆదేశాలు జారీ చేసింది. 2009లో మధ్యప్రదేశ్ మాండసోర్ నుంచి ఎంపీగా మీనాక్షి నటరాజన్ పనిచేశారు.హిమాచల్ప్రదేశ్, హర్యానా, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, జార్ఖండ్, మణిపూర్, బీహార్ రాష్ట్రాలకు కొత్త ఇంఛార్జ్లను ఏఐసీసీ నియమించింది. పంజాబ్, జమ్మూకశ్మీర్లకు కొత్త జనరల్ సెకట్రరీలను కూడా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. -
ప్రధాని మోదీపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్:పుట్టుకతో ప్రధాని మోదీ బీసీ కాదని,ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. శుక్రవారం(ఫిబ్రవరి14) గాంధీభవన్లో జరిగిన యూత్ కాంగ్రెస్ సభలో సీఎం రేవంత్ మాట్లాడారు. సర్టిఫికెట్లలో మోదీ బీసీ కానీ మోదీ మనసంతా బీసి వ్యతిరేకి. మోదీ తొలిసారి సీఎం అయ్యాకే ఆయన కులాన్ని బీసీల్లో కలిపారు. అన్నీ తెలుసుకునే మోదీ కులంపై మాట్లాడుతున్నా. కేంద్రానికి సవాల్ చేస్తున్నా.. జనగణనతో పాటు కులగణన చెయ్యాలి. కేంద్రం లెక్కలు మా ప్రభుత్వం చేసిన లెక్కలను సరిపోల్చుదాం. కులగణన సర్వేలో పాల్గొనని కేసీఆర్,కేటీఆర్,హరీష్ లను బహిష్కరణ చెయ్యాలి.బహిష్కరణ కోసం మీ సమక్షంలో తీర్మానం చేస్తున్న. ప్రభుత్వ సర్వే తప్పుల తడక అని చెప్పే ప్రయత్నం బీఆర్ఎస్ చేసింది. భారత్ జోడో యాత్రలోనే రాహుల్ గాంధీ స్పష్టం గా కులగణన చేస్తాం అని హామీ ఇచ్చారు. దేశంలో ఉన్న అన్ని జాతులకు వారి ఫలాలు అందాలని రాహుల్ గాంధీ ఆకాంక్షించారు.డోర్ టు డోర్ వెళ్లిన సిబ్బంది ముందే డేటా ఎంట్రీ చేశాం. కేసీఆర్ సర్వే..కాకిలెక్కల సర్వే.తెలంగాణ సమాజంలో తిరిగే హక్కే కేసీఆర్, కేటీఆర్,సంతోష్ రావ్ లకు లేదు. సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు కేసీఆర్ ఇచ్చి ఉంటే మాట్లాడే హక్కు ఉండేది.కులగణన సర్వేలో డేటా ఇవ్వని లిస్టులో ముందు వరుసలో కేసీఆర్ కేటీఆర్,సంతోష్ రావ్ గ్యాంబ్లింగ్ శ్రీనివాస్లు ఉన్నారు.కేసీఆర్ లెక్క తేలితే..వార్డు మెంబర్ పదవి కూడా ఆ కుటుంబానికి రాదుగొప్పగొప్ప నేతలు యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చినవాళ్లే. చంద్రబాబు,కేసీఆర్ కూడా యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చిన వారే. యూత్ కాంగ్రెస్ శక్తి ఏంటో మాకు తెలుసు. అనిల్యాదవ్,బల్మూరి వెంకట్ సేవలను గుర్తించి వారికి పదవులు ఇచ్చాం. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే 55వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం.డబ్బుతో రాజకీయాలు సాధ్యాం కాదు. వచ్చే ఎన్నికల్లో ప్రజల్లో ఉన్నవారికే టికెట్లిస్తాం. ఢిల్లీ నుంచి కాదు గల్లీ నుంచి వారికే పదవులు వస్తాయి. పదేళ్లు కేసీఆర్ తప్పుడు హామీలిచ్చి ప్రజలను మోసం చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అని చెప్పి కేసీఆర్ అబద్ధాలు చెప్పాడు. లిక్కర్ కేసు ద్వారా కేసీఆర్, కేజ్రీవాల్ను ఓడగొట్టిన కవిత ఇప్పుడు మాట్లాడుతోంది. కేసీఆర్నే గట్టిగా ఓడగొట్టాం నువ్వొచ్చి చేసేదేముంది. కేసీఆర్ గట్టిగా కొడతా అంటున్నాడు. కొట్టాలనుకుంటే నీ కొడుకు కేటీఆర్ను పిచ్చిపిచ్చిగా కొట్టు. ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ను ఓడగొట్టినందుకు నీ అల్లుడిని కొట్టు. డబ్బుతో గెలవాలనుకుంటే కేసీఆరే గెలిచేవాడు. కేసీఆర్,కేటీఆర్, కవిత దగ్గర వేల కోట్లున్నాయిప్రభుత్వ పథకాలను యూత్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.ప్రజలకు అండగా ఉన్నవారికి మాత్రమే పదవులు ఇస్తాం.సామాన్యులకు పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. కష్టపడి పనిచేసిన వారికి తప్పకుండా అవకాశాలు కల్పిస్తాం. డబ్బుతో ఎన్నికల్లో గెలవడం సాధ్యం కాదు’అని రేవంత్రెడ్డి అన్నారు. -
సెక్రటేరియట్లో పెచ్చులు.. మంత్రి కీలక వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ సెక్రటేరియట్లోసీఎం చాంబర్ పక్కన పెచ్చులు ఊడిన ఘటనపై రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పందించారు. ఈ విషయమై శుక్రవారం(ఫిబ్రవరి14) కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. రెయిలింగ్ ఊడిన ఘటనపై విచారణ చేయాలని ఆర్అండ్బీ ప్రిన్సిపల్ సెక్రెటరీని ఆదేశించినట్లు తెలిపారు.విచారణ నివేదిక వచ్చాక అసలు విషయం ఏంటనేది తెలియజేస్తాం.ప్రభుత్వానికి రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్) లాంటి ప్రధానమైన పనులు చాలా ఉన్నాయి.పెచ్చులు ఊడటం చిన్న విషయం..ఆ అంశాన్ని అధికారులు చూసుకుంటారు’అని కోమటిరెడ్డి పేర్కొన్నారు.కాగా, ఇటీవల తెలంగాణ సచివాలయంలో పీవోపీ పార్టిషన్ స్వల్పంగా కూలింది. పెచ్చులు ఊడిపడ్డాయి. సీఎం ఛాంబర్ అంతస్తులో పెచ్చులు ఒక్కసారిగా ఊడిపడి కింద ఉన్న రామగుండం మార్కెట్ కమిటీ ఛైర్మన్ కారుపై పడ్డాయి. కారులో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. పెచ్చులు ఊడిపడడంతో ఉద్యోగులు ఆందోళన చెందారు.పీఓపీ పెచ్చులు ఊడి పడటంతో అధికారులు, భదత్రా సిబ్బంది అప్రమత్తం అయ్యారు. ఇటీవలే కొత్తగా నిర్మించిన తెలంగాణ సచివాలయం పీఓపీ కూలడం చర్చనీయాంశంగా మారింది. సచివాలయ నిర్మాణ లోపాలపై చర్చ జరుగుతోంది. -
నేను బీజేపీకి అవసరం లేదనుకుంటా?: రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీలో నేతల మధ్య కోల్డ్వార్ నడుస్తోంది. బీజేపీ హైకమాండ్ నిర్ణయంపై ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీపై అసంతృప్తిగా ఉన్నారు. ఈ క్రమంలోనే పార్టీలో వేధింపులు భరించలేకపోతున్నానని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో, బీజేపీలో అంతర్గత విభేదాలు చర్చనీయాంశంగా మారింది.తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఓ వీడియోలో మాట్లాడారు. ఈ సందర్భంగా రాజాసింగ్.. పార్టీలో వేధింపులు భరించలేకపోతున్నాను. దీని కంటే బయటికి వెళ్లడమే కరెక్ట్ అనుకుంటా. గోల్కొండ జిల్లా అధ్యక్ష పదవిని ఎస్సీ లేదా బీసీ వ్యక్తికి ఇవ్వాలని నేను సూచించాను. నేను చెప్పిన పేరు కాకుండా వేరే పేరు ఇవ్వడం ఏంటి?. కానీ, ఎంఐఎం పార్టీతో తిరిగే నాయకుడికి ఇచ్చారు. పార్టీకి నా అవసరం లేదనుకుంటా?. ముందు ముందు ఏమవుతుందో చూద్దాం. తెలంగాణలో బీజేపీ ఎప్పుడో అధికారంలోకి రావాల్సింది. కానీ, ఇలాంటి రిటైరైన వ్యక్తులు పార్టీలో ఉంటే బీజేపీ ఇక్కడ ఎప్పటికీ అధికారంలోకి రాదు. పార్టీ ఎమ్మెల్యే సూచించిన వ్యక్తికే జిల్లా అధ్యక్ష పదవి ఇస్తారు. తన సూచనను ఎందుకు పక్కన పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు.ఇక, ఇదే సమయంలో.. ఈ విషయాన్ని పార్టీలోని ఓ కీలక నేతకు ఫోన్ చేసి అడిగితే తనకు తెలియదని సమాధానమిచ్చారు. దీనిని బట్టి చూస్తే పార్టీలో తనపై కుట్ర జరుగుతోందని అర్థం అవుతుందంటూ రాజాసింగ్ వివరించారు. తాను ఇప్పటివరకు బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంతో యుద్ధం చేస్తూ వచ్చానని, కానీ, సొంత పార్టీలోనూ యుద్ధం చేయాల్సి రావడం దురదృష్టకరమని పేర్కొన్నారు. 2014లో తాను పార్టీలో చేరానని, అప్పటి నుంచి వేధింపులు భరిస్తూనే ఉన్నానని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి తాను అవసరం లేదని, వెళ్లిపోవాలని చెబితే ఇప్పటికిప్పుడు వెళ్లిపోయేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. -
TG: అర్ధరాత్రి హైడ్రామా.. బీఆర్ఎస్ నాయకుడు అరెస్ట్
సాక్షి, చండూరు: నల్లగొండ జిల్లాలో మరోసారి రాజకీయం హీటెక్కింది. బీఆర్ఎస్ నాయకుడు, మాజీ జడ్పీటీసీ అన్నెపర్తి శేఖర్ను పోలీసులు అరెస్టుచేశారు. రాత్రి రెండు సమయంలో మఫ్టీలో వచ్చిన పోలీసులు.. శేఖర్ను తీసుకెళ్లడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు చెందుతున్నారు. మరోవైపు.. శేఖర్ అరెస్టుపై తమకు ఎలాంటి సమాచారం లేదని స్థానిక పోలీసులు చెప్పడం గమనార్హం.వివరాల ప్రకారం.. జిల్లాలోని చండూరులో బీఆర్ఎస్ నాయకుడు అన్నెపర్తి శేఖర్ను గురువారం అర్ధరాత్రి దాటిన కొందరు వ్యక్తులు ఆయనను అదుపులోకి తీసుకెళ్లారు. ఈ సందర్బంగా కుటుంబీకులను భయబ్రాంతులకు గురయ్యారు. దీంతో, ఆయనను ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఎందుకు అరెస్టు చేశారనే విషయాలు చెప్పకుండానే లాకెళ్లారు. ఈ క్రమంలో అన్నెపర్తి శేఖర్ సతీమణి.. ఎవరు మీరని ప్రశ్నించినప్పటికీ వారు సమాధానం ఇవ్వలేదు. తన భర్తను కారులోకి ఎక్కించిన తర్వాత చివరకు పోలీసులమని చెప్పారని కుటుంబ సభ్యులు వెల్లడించారు.అయితే, శుక్రవారం ఉదయం స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయన లేకపోవడంతో ఎక్కడికి తీసుకెళ్లారంటూ ప్రశ్నించారు. శేఖర్ ఆచూకీ చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా, అన్నెపర్తి శేఖర్ అరెస్టుపై ఎట్టకేలకు పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఆర్థిక లావాదేవీల విషయంలో ఓ వ్యక్తిని చీటింగ్ చేయడం, బాధితుడిపై దాడి ఘటనలో అరెస్ట్ చేశామని చండూరు పోలీసులు వెల్లడించారు. బాధితుడి పిర్యాదు మేరకు నిందితుడిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదుచేశామన్నారు.మరోవైపు.. శేఖర్ అరెస్ట్పై మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి స్పందించారు. ఈ క్రమంలో నల్లగొండ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. అనంతరం, మునుగోడు ఎస్పీ కార్యాలయం వద్ద ఆయన మాట్లాడుతూ..‘అన్నెపర్తి శేఖర్ అరెస్ట్ అప్రజాస్వామికం. అర్థరాత్రి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది?. ప్రభుత్వాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించడంతోనే తప్పుడు కేసులు పెట్టారు. ఎమ్మెల్యే ఒత్తిడితోనే కేసు నమోదు చేశారు. బెదిరించడంలో భాగంగా ఓ కేసును అడ్డం పెట్టుకుని కేసు నమోదు చేశారు. ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదు. శేఖర్ను వెంటనే విడుదల చేయాలి. ఇంతవరకు శేఖర్ను అరెస్ట్ చేసి ఎక్కడ ఉంచారో కూడా సమాచారం లేదు అంటూ కామెంట్స్ చేశారు. -
19న తెలంగాణ భవన్కు కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు(KCR) సుదీర్ఘ విరామం తర్వాత ఈ నెల 19న పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్(Telangana Bhavan)కు రానున్నారు. పార్టీ ఆవిర్భవించి ఈ ఏడాది ఏప్రిల్కు 25 ఏళ్లు కానుంది. ఈ నేపథ్యంలో పార్టీ రజతోత్సవాల నిర్వహణతో పాటు పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత నిర్మాణం వంటి కీలక అంశాలపై చర్చించేందుకు ఈ నెల 19న బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు.మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమయ్యే ఈ భేటీకి పార్టీ రాష్ట్ర కార్యవర్గంతో పాటు జిల్లా అధ్యక్షులు, తాజా, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ప్రభుత్వ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, మాజీ జెడ్పీ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జీలకు పార్టీ తరఫున ఆహ్వానం పంపించారు. కేసీఆర్ అధ్యక్షత న జరిగే పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ నిర్మాణానికి సంబంధించి దిశానిర్దేశం చేస్తారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. బహిరంగ సభ వేదిక ఖరారు చేసే అవకాశంరాష్ట్రంలో అధికార కాంగ్రెస్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ అనుసరించాల్సిన కార్యాచ రణపైనా ఈ భేటీలో సమగ్రంగా చర్చిస్తారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసేలా ఒత్తిడి పెంచడంతో పాటు ప్రజల హక్కులను కాపాడే దిశగా పార్టీ పరంగా నాయకులు, కార్యకర్తలు అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశా నిర్దేశం చేస్తారు. ఈ నెలాఖరులో బీఆర్ఎస్ సత్తా చాటేలా భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని కేసీఆర్ ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో సభా వేదికను కూడా 19న జరిగే భేటీలో ఖరారు చేసే అవకాశముంది. ఆహ్వానితులు కచ్చితంగా హాజరు కావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.ఆరు నెలల తర్వాత..సుమారు ఆరు నెలల తర్వాత తెలంగాణ భవన్కు వస్తున్న పార్టీ అధినేత కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశముందని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో గత ఏడాది జూలై 23న తెలంగాణ భవన్కు వచ్చిన కేసీఆర్ నేతలతో భేటీలో ప్రభుత్వ పనితీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కవిత అరెస్టు, ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వంటి అంశాలను ప్రస్తావిస్తూ నేతలను తయారు చేసుకోవడం బీఆర్ఎస్కు కొత్త కాదంటూ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికే పరిమితం అయ్యారు. అక్కడే పార్టీ నేతలు, కార్యకర్తలతో భేటీ అవుతూ పలు అంశాలపై దిశా నిర్దేశం చేస్తూ వస్తున్నారు. -
ఆర్ఆర్ఆర్కి నిధుల కొరత లేదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్ను వచ్చేనెల ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రీ బడ్జెట్ సమావేశాలను చేపట్టారు. గురువారం సచివాలయంలో ఆయా శాఖలకు కేటాయింపులకు సంబంధించి రహదారు లు – భవనాలు, బీసీ సంక్షేమ శాఖల మంత్రులు, అధికారు లతో సమావేశమయ్యారు, ఆర్అండ్బీకి సంబంధించి ఆర్ఆర్ఆర్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని భట్టి, ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అధికా రులను ఆదేశించారు. రీజినల్ రింగ్ రోడ్డు సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) 3డి డిజైన్లు వంటి పనులను సత్వరం పూర్తిచేయాలని, ఎలాంటి నిధుల కొరత లేదని స్పష్టం చేశా రు.ఎంత వేగంగా పనులు చేపడితే అంత వేగంగా నిధులు మంజూరు చేస్తామని భట్టి అధికారులకు భరోసా ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్అండ్బీ శాఖకు ఉన్న ఆస్తులపై నివేదిక రూపొందించాలని, విలువైన ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లా కేంద్రాల నుంచి రాష్ట్ర రాజధానికి వచ్చే రహదారులు పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం మేరకు రోడ్లు, భవనాల శాఖ అధికారులు పనులు చేపట్టి నిధులు సద్వినియోగం చేయాలని ఆదేశించారు.కొత్త ఎయిర్ పోర్టుల నిర్మాణానికి ఆర్అండ్బీ శాఖ విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో ఏవియేషన్ రంగానికి తగిన ప్రోత్సాహం అందిస్తామని మంత్రులు తెలిపారు. సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీలు రామకృష్ణారావు, వికాస్రాజ్, డిప్యూటీ సీ ఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్, సెక్రటరీ దాసరి హరిచందన, ఆర్థిక శాఖ సెక్రటరీ హరిత తదితరులు పాల్గొన్నారు.హాస్టళ్ల, గురుకులాల బకాయిలు చెల్లిస్తాం..అద్దె భవనాల్లో కొనసాగుతున్న సంక్షేమ హాస్టళ్ల, గురుకులాల అద్దె బకాయిలు వెంటనే చెల్లిస్తామని అందుకు, ప్రతిపాదనలు తీసుకురావాలని అధికారులకు డిప్యూటీ సీఎం సూచించారు. సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి ప్రీబడ్జెట్ సమావేశం నిర్వహించారు. బీసీ స్టడీ సెంటర్లు ఉద్యోగ కల్పన కేంద్రాలుగా ఉండాలని భట్టి అధికారులను ఆదేశించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జాబ్ క్యాలెండర్ను అనుసరించి స్టడీ సెంటర్లలో కోచింగ్ నిర్వహించాలని కోరారు.డీఎస్సీ, బ్యాంకింగ్ వంటి పరీక్షలపైన దృష్టి సారించాలని ఆదేశించారు. ఆర్టీసీలో ఎలక్ట్రికల్ బస్సుల కొనుగోలు.. వాటి నిర్వహణకు అవసరమైన చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుపై కూడా సమావేశంలో చర్చించారు. ఆర్టీసీ ఆస్తులు, నిర్వహణ, ఆదాయ వనరులపై మంత్రులు అధికారులను అడిగారు. సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, రవాణా శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
ఖజానా ఖాళీ.. తలలు పట్టుకుంటున్న సీఎం,డిప్యూటీ సీఎం
సాక్షి,హైదరాబాద్ : కేసీఆర్ ఖజానా ఖాళీ చేశారు. ఇప్పుడు నిధులు సర్దుబాటు చేయలేక సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క తలలు పట్టుకుంటున్నారని’ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలపై ఆయన మీడియాతో మాట్లాడారు. బండి సంజయ్ ,కిషన్ రెడ్డి కోతల రాయుళ్లు.ఐటీఐఆర్ తీసుకొచ్చి బీజేపీ నేతలు మాట్లాడాలి. నేనేంటో,నా పనితనం ఏంటో రాష్ట్ర నేతలకు, ఎంపీ రాహుల్ గాంధీ, ఏఐసీసీ నేతలకు తెలుసు. నా అవసరం అనుకుంటే జగ్గారెడ్డికి పదవి ఇస్తారు. జగ్గారెడ్డి పదవి ఉన్నా ..లేకున్నా పార్టీ కోసం పనిచేస్తూనే ఉంటాడు.బీజేపీ నేతలు సీఎం రేవంత్ను రెచ్చగొట్టి తిట్టించుకుంటారు. ఎన్నికలకు చాలా సమయం ఉంది.. పింక్ బుక్ అంటూ రెచ్చగొట్టకు కవిత. కేసీఆర్ ఖజానా ఖాళీ చేశారు. నిధులు సర్దుబాటు చేయలేక మా సీఎం, డిప్యూటీ సీఎం తలలు పట్టుకుంటుంన్నారు.వరంగల్కు రావాలంటే రాహుల్ గాంధీ భయపడతారా?..రాహుల్ గాంధీ ఓంట్లోనే భయం లేదు.. కన్యాకుమారి టూ కాశ్మీర్ పాదయాత్ర చేశారు. కేసీఆర్ కనీసం పది కిలోమీటర్లు పాదయాత్ర చేయగలరా? ఐటీఐఆర్ కోసం అవసరం అయితే కిషన్ రెడ్డి, బండి సంజయ్ను కలుస్తా. ఐటీఐఆర్ ద్వారా వేల ఉధ్యోగాలు తెలంగాణ నిరుద్యోగులకు వస్తాయి’ అని అన్నారు. -
‘అప్పుల కుప్పగా తెలంగాణ’.. పార్లమెంట్లో నిర్మలా సీతారామన్
ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (nirmala sitharaman) కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రం .. ఇప్పుడు అప్పుల కుప్పగా మార్చారు’అని రాజ్యసభలో బడ్జెట్పై (parliament budget session) చర్చ సందర్భంగా మాట్లాడారు. నిర్మల సీతారామన్ ఇంకా ఏమన్నారంటే? ‘ఏపీ విభజన సమయంలో తెలంగాణ (telangana debt) మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉంది. కానీ ఇప్పుడు అది అప్పుల కుప్పగా తయారైంది. నేను ఏ పార్టీని తప్పుబట్టడం లేదు. ఇందిరాగాంధీ గెలిచిన మెదక్ నియోజకవర్గంలో తొలుత రైల్వే స్టేషన్ను మోదీ ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరించింది మోదీ ప్రభుత్వమే.ఎరువుల ఉత్పత్తిలో రికార్డు స్థాయిలో 12.7 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యాన్ని పెంచాం. నిజామాబాదులో పసుపు బోర్డు ఏర్పాటు చేసిన ఘనత ప్రధానిదే. అత్యద్భుతమైన పసుపు పండే ప్రాంతం నిజామాబాద్. తెలంగాణకు చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం జహీరాబాద్లో పారిశ్రామిక కారిడార్ను ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది.వరంగల్లో పీఎం మిత్ర కాకతీయ మెగా టెక్ట్స్ టైల్ పార్కు, సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం, బీబీనగర్లో ఎయిమ్స్, 2605 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం, భారత్ మాల కింద నాలుగు గ్రీన్ కారిడార్లు, రైల్వేల అభివృద్ధి కోసం తెలంగాణకు రూ.5337 కోట్ల బడ్జెట్ కేటాయింపు, ఏరుపాలెం నంబూరు మధ్య , మల్కాన్ గిరి పాండురంగాపురం మధ్య 753 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే ట్రాక్ నిర్మాణం,ఐదు కొత్త వందేభారత్ ట్రైన్ల కేటాయింపు, 40రైల్వే స్టేషన్స్ రీడెవలప్, పీఎం ఆవాస్ అర్బన్ కింద రెండు లక్షల ఇళ్ల నిర్మాణం స్వచ్ఛ భారత్ మిషన్ కింద 31 లక్షల టాయిలెట్ల నిర్మాణం, జల్జీవన్ మిషన్ కింద 38 లక్షల నల్ల కనెక్షన్లు, 82 లక్షల ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కార్డుల మంజూరు, 199 జనఔషది కేంద్రాలను ఏర్పాటు..ఇలా చెప్పుకుంటూ పోతే అనే అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాము’ అని వ్యాఖ్యానించారు. 👉చదవండి : కమల్ హాసన్తో డీసీఎం భేటీ! -
ఎర్రబెల్లి దయాకర్రావు సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్, సాక్షి: బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గద్దె దించేందుకు అధికార కాంగ్రెస్ పార్టీలోనే కుట్ర జరుగుతోందని ఆరోపించారాయన. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.‘‘అధికార పార్టీకి చెందిన పాతిక మంది ఎమ్మెల్యేలు ఒక్కటయ్యారు. వాళ్లంతా సీఎం రేవంత్ను గద్దె దించేందుకు ఒక్కటయ్యారు. రేవంత్ పదవికి సొంత ఎమ్మెల్యేలతోనే ముప్పు పొంచి ఉంది’’ అని అన్నారాయన. అలాగే.. ఓటమి భయంతోనే స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తున్నారని ఎర్రబెల్లి ఎద్దేవా చేశారు.తెలంగాణ భవన్కు కేసీఆర్బీఆర్ఎస్ అధినేత ఎట్టకేలకు తెలంగాణ భవన్కు రానున్నారు. ఈ నెల 19వ తేదీన ఆయన అధ్యక్షతన బీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ మీటింగ్లో పార్టీ సిల్వర్జూబ్లీ వేడుకల నిర్వహణపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. -
‘కాంగ్రెస్ పాలనపై గ్రామస్థాయి నుండి వ్యతిరేకత’
హనుమకొండ జిల్లా: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పాలనపై వ్యతిరేకత వస్తుందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మధుసూదనచారి. ఎన్నికల ముందు అధికారం కోసం 420 హామీలు ఇచ్చి, ఇప్పటివరకూ ఏ ఒక్క హానమీ నెరవేర్చలేనది మధుసూదనచారి ఆరోపించారు. హనుమకొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ ఏడాది పాలనా వైఫల్యం పేరుతో బీఆర్ఎస్ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ క్యాలెండర్, డైరీని ఎమ్మెల్సీ మధుసూదనచారి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మధుసూదనచారి మాట్లాడుతూ.. ‘కడియం శ్రీహరి తన స్వార్థ రాజకీయాల కోసం పార్టీ మారాడు. పార్టీ మారిన ఎమ్మెల్యే లతో రాజీనామా చేయించి పోటీలో నిలబెట్టు. బీఆర్ఎస్ కార్యకర్తల ఉద్యమంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చాం. పూర్తి స్థాయిలో కులగణ చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలి. BRSసాధించిన తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దిన మహనీయుడు కేసీఆర్. నూటికి నూరు శాతం బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటాం. ఎక్కడికి వెళ్తే రేవంత్రెడ్డి పబ్బం గడుస్తదో అక్కడికి వెళతాడు’ అని విమర్శించారు మధుసూదనచారి. -
పింక్ బుక్లో రాస్తున్నాం.. ఇంతకింత చెల్లిస్తాం.: ఎమ్మెల్సీ కవిత
సాక్షి, జనగామ జిల్లా: పింక్ బుక్లో అన్ని రాసుకుంటున్నాం.. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంతకింత చెల్లిస్తామంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. లెక్కలు ఎలా రాయాలో మాకూ తెలుసు.. మీ లెక్కలు తీస్తాం.. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.రైతు డిక్లరేషన్ పై నిలదీస్తారని రాహుల్ గాంధీ వరంగల్ పర్యటనను రద్దు చేసుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో చిన్న విమర్శ చేసినా సీఎం రేవంత్ భయపడుతున్నారు. పోస్టు చేసిన మరుసటి నాడే ఇంటికి పోలీసులు వచ్చి వేధిస్తున్నారు. దేశవ్యాప్తంగా రాజ్యాంగాన్ని పట్టుకొని రాహుల్ గాంధీ తిరుగుతారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి మాత్రం రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే దగా, మోసం’’ అని కవిత దుయ్యబట్టారు.‘‘కేసీఆర్ హయాంలో గ్రామాల్లో నీళ్లు పారాయి నిధులు పారాయి. కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి భయపడి 2001లో ఆగమేఘాలపై దేవాదుల ప్రాజెక్టుకు చంద్రబాబు శంకుస్థానప చేశారు. కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఆ ప్రాజెక్టు ముందుకు సాగలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ దేవాదుల ప్రాజెక్టు పనులను చేయించారు. 95 పూర్తయిన సమ్మక్క, సారక్క బ్యారేజీ పనులను పూర్తి చేయలేని చేతగాని దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం. కేవలం 5 శాతం పనులను పూర్తి చేయలేని అసమర్థత కాంగ్రెస్ ప్రభుత్వానిది. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు?’’ అని కవిత నిలదీశారు.అవకాశవాదం కోసం కడియం శ్రీహరి పార్టీ మారారు. కడియం శ్రీహరిని ప్రజలు క్షమించే ప్రసక్తే లేదు. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. న్యాయ వ్యవస్థపై మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్కు అనుకూలమైన తీర్పు వస్తుందన్న నమ్మకముంది. ఉప ఎన్నిక వస్తే అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ జెండా ఎగరేస్తుంది. రూ. 2500 ఇవ్వకుండా, స్కూటీలు ఇవ్వకుండా ప్రభుత్వం మహిళలను వేధిస్తోంది. కళ్యాణ లక్ష్మీ, కేసీఆర్ కిట్లు మాయమయ్యాయి.ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మానవత్వం లేదు.. కళ్యాణలక్ష్మీతో పాటు తులం బంగారం ఇవ్వాల్సిందే. ఆడ బిడ్డలను మోసం చేసిన మహమ్మారి కాంగ్రెస్ ప్రభుత్వం. విదేశీ విద్యా స్కాలర్ షిప్ నిధులు కూడా విడుదల చేయని దౌర్భాగ్య పరిస్థితి. ఫీజు రీయింబర్స్మెంట్ చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులను ఇబ్బంది పెడుతుంది. రైతు భరోసా పేరిట రైతులను సీఎం రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారు.రుణమాఫీ అందరికీ కాలేదు.. కానీ పూర్తయిందని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం... సంక్రాంతి నుంచి సన్నబియ్యం ఇస్తామని చెప్పి ఇంకా ఇవ్వలేదు. కాంగ్రెస్ అబద్దాలను ప్రజల్లో ఎండగడతాం. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది’’ అని ఎమ్మెల్సీ కవిత ధీమా వ్యక్తం చేశారు. -
రైతుకో న్యాయం.. పదవిలో ఉన్న వారికి మరొకటా?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ అరాచక పాలన సాగిస్తోందని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కష్టాల్లో ఉన్న పాడి రైతు లోన్ కట్టలేదని.. ఏకంగా ఇంటికి ఉన్న గేటును ఎత్తుకెళతారా? అని ప్రశ్నించారు. పేద రైతుకు ఒక న్యాయం.. పదవిలో ఉన్న వారికి మరో న్యాయమా?. గుర్తుపెట్టుకోండి.. కాంగ్రెస్ నేతల్ని ఇంటి గేటు కూడా తొక్కనియ్యరు అంటూ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా.. రుణం కట్టలేదని.. ఇంత దారుణమా ?నాటి కాంగ్రెస్ పాలనలో..అన్నదాతలు అప్పు కట్టలేదని..ఆడబిడ్డల పుస్తెలు లాక్కెళ్లే దుస్థితి..రైతుల ఇళ్ల దర్వజాలు తీసుకెళ్లే పరిస్థితి..కరెంట్ మోటర్లు, స్టార్టర్లు తీసుకెళ్లే దైన్యస్థితి.. స్వరాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది..మళ్లీ ఆనాటి దృశ్యాలు కళ్లముందుకు తెచ్చింది..కష్టాల్లో ఉన్న పాడి రైతు లోన్ కట్టలేదని.. ఏకంగా ఇంటికి ఉన్న గేటును ఎత్తుకెళతారా ?మరి రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తానని..మాటతప్పిన ముఖ్యమంత్రిపై చర్య తీసుకునే ధైర్యముందా ?రుణం తీర్చలేదని రైతుపై చూపిన ప్రతాపాన్ని..రుణమాఫీ చేయని రేవంత్ పై చూపించగలరా ?పేద రైతుకు ఒక న్యాయం..పదవిలో ఉన్న వారికి మరో న్యాయమా..??గుర్తుపెట్టుకోండి.. రైతులు అంతా గమనిస్తున్నారు..ఇలాంటి ఘోరాలను చూస్తూ ఊరుకోరు..కాంగ్రెస్ నేతల్ని ఇంటి గేటు కూడా తొక్కనియ్యరు !!జై తెలంగాణ అంటూ కామెంట్స్ చేశారు. రుణం కట్టలేదని.. ఇంత దారుణమా ?నాటి కాంగ్రెస్ పాలనలో..అన్నదాతలు అప్పు కట్టలేదని..ఆడబిడ్డల పుస్తెలు లాక్కెళ్లే దుస్థితి..రైతుల ఇళ్ల దర్వజాలు తీసుకెళ్లే పరిస్థితి..కరెంట్ మోటర్లు, స్టార్టర్లు తీసుకెళ్లే దైన్యస్థితి.. స్వరాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది..మళ్లీ… pic.twitter.com/NzJlFk7zA9— KTR (@KTRBRS) February 13, 2025 -
‘స్థానికం’.. ఇప్పట్లో లేనట్టే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ‘స్థానిక’ ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశం కనిపించడం లేదు. వారంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చేస్తుందని, బీసీ రిజర్వేషన్లు ఖరారు కావడమే తరువాయి అన్నంతగా నెలకొన్న ఉత్కంఠ ఒక్కసారిగా చల్లారిపోయింది. రాష్ట్రంలో మరో విడత కులగణన సర్వే నిర్వహణకు సర్కారు నిర్ణయించడం, బీసీలకు 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని భావించడమే దీనికి కారణం. బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో, పార్లమెంటులో బిల్లు ఆమోదానికి సమయం పట్టే అవకాశం ఉందని, దీనితో మే లేదా జూన్ నాటికి ‘స్థానిక’ఎన్నికలు జరగవచ్చని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. మరో విడత కులగణన సర్వే.. రాష్ట్రంలో నిర్వహించిన కులగణన సర్వేలో పాల్గొనని 3.1 శాతం (దాదాపు 16 లక్షల మంది) వివరాల నమోదు కోసం మరో విడత సర్వే నిర్వహించాలని నిర్ణయించామని సీఎం రేవంత్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశం తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాకు చెప్పారు. ఆ సర్వే తర్వాత బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పిస్తామని, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రిజర్వేషన్లు సాధిస్తామని తెలిపారు. తద్వారా ‘స్థానిక’ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు పరోక్షంగానే బయటపెట్టారనే చర్చ జరుగుతోంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడినట్టేనని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీలో బీసీ బిల్లును ఆమోదించి పార్లమెంట్కు పంపడం, అక్కడ ఆమోదం పొందడానికి సమయం పట్టే అవకాశం ఉండటంతో.. రాష్ట్రంలో రిజర్వేషన్లు ఖరారు కాక స్థానిక ఎన్నికలు మరికొన్ని నెలలు వాయిదా పడవచ్చని రాజకీయవర్గాల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది. పంచాయతీరాజ్, మున్సిపాలిటీల ఎన్నికలను ఒకేసారి నిర్వహించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించిందని, మే లేదా జూన్లో ఈ ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. వడివడిగా అడుగులు వేసినా.. బీసీ డెడికేటెడ్ కమిషన్ వేగంగా అధ్యయనం పూర్తి చేసి సర్కారుకు నివేదిక అందజేయడం, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ నివేదిక అందడం, కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణ అంశాలపై అసెంబ్లీలో చర్చ వంటి పరిణామాలు వేగంగా జరిగిపోయాయి. అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఈనెల 15వ తేదీలోగా వస్తుందని కొందరు మంత్రులు బహిరంగంగా ప్రకటించారు. ఎన్నికలకు సంబంధించి వివిధ ప్రభుత్వ శాఖలు కసరత్తు చేపట్టాయి. సిబ్బందికి శిక్షణ, జిల్లా కలెక్టర్లకు ఓరియంటేషన్ కార్యక్రమాలు కూడా పూర్తి చేశారు. వారంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి.. ఈ నెలాఖరు లేదా మార్చి మొదటి వారంలోగా మండల, జిల్లా పరిషత్, ఆ తర్వాత వారం రోజుల వ్యవధి ఇచ్చి పంచాయతీ ఎన్నికలు నిర్వహించవచ్చని ప్రచారం జరిగింది. బుధవారం రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల బ్యాలెట్ పేపర్లపై ‘నోటా’ గుర్తు చేర్పు అంశంపై రాజకీయ పారీ్టల ప్రతినిధులతో సమావేశం కూడా జరిగింది. ఎన్నికలపై భిన్నాభిప్రాయాల మధ్య స్థానిక సంస్థలకు వెంటనే ఎన్నికలు నిర్వహించాలా, వద్దా అన్న అంశంపై బుధవారం సీఎం ఆధ్వర్యంలో జరిగిన సమీక్ష సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగిందని తెలిసింది. తక్షణమే ఎన్నికలకు వెళ్లాలని కొందరు మంత్రులు ప్రతిపాదించగా.. పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు తదితరులు రిజర్వేషన్లపై బీసీలకు ఇచి్చన మాట నిలబెట్టుకునే విధంగా నిర్ణయం తీసుకోవాలని కోరారని తెలిసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై చట్టబద్ధత కల్పించే దిశగా ముందుకెళ్లాలని వారు స్పష్టం చేశారని సమాచారం. స్థానిక సంస్థలకే కాకుండా విద్య, ఉద్యోగపరంగా కూడా బీసీలకు తగిన రిజర్వేషన్లను కల్పించాలని వారు అభిప్రాయపడ్డారని తెలిసింది. మరోవైపు వెంటనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకుంటే కేంద్రం నుంచి అందాల్సిన విధులు రావని.. వీలైనంత త్వరగా నిర్వహించాలని కొందరు మంత్రులు సూచించారని సమాచారం. అయితే ఈ అంశం చాలా సున్నితమైనదని.. బీసీల రిజర్వేషన్లు కీలకమని, ఈ విషయంలో విధుల కంటే కాంగ్రెస్ పారీ్టకి ఉన్న నిబద్ధత ముఖ్యమని సీఎం రేవంత్తోపాటు మరికొందరు అభిప్రాయపడ్డారని తెలిసింది. ఈ క్రమంలో బీసీల రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని, అసెంబ్లీలో బిల్లును ఆమోదించి, తమిళనాడు తరహాలో తొమ్మిదో షెడ్యూల్లో ఈ అంశాన్ని పొందుపరచాలని కేంద్రాన్ని కోరాలని నిర్ణయించారని సమాచారం. -
దీపాదాస్ మున్షీ మార్పు.. వారం లోపే కొత్త ఇంఛార్జ్?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. త్వరలో తెలంగాణ రాష్ట కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ స్థానంలో కొత్త ఇంఛార్జ్ని నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారం లోపే కొత్త ఇంఛార్జ్ను నియమించడానికి హైకమాండ్ నిర్ణయించినట్లు సమాచారం. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల ఇంఛార్జ్లను ఏఐసీసీ మార్చనుంది. రాష్ట్ర నేతలకు ఇప్పటికే అధిష్ఠానం సంకేతాలు ఇచ్చింది. ఏడాదిలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో స్థానిక నేత అయిన దీపాదాస్ మున్షీకి పశ్చిమ బెంగాల్ పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.రాష్ట్రంలో పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి ఏఐసీసీ దృష్టి సారించింది. ఈ క్రమంలోనే కొత్త ఇంఛార్జ్ను యమించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న దీపాదాస్ మున్షీ స్థానంలో మాజీ ముఖ్యమంత్రికి తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.కాగా, గత వారం హైదరాబాద్లోని కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో సీఎంతోపాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పార్టీ కోసం అందరం కలసికట్టుగా పనిచేసుకుంటూ ముందుకు వెళ్లాలని ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ స్పష్టం చేశారు.ఇదీ చదవండి: Telangana: గీత దాటితే వేటే..! -
‘వరంగల్ వచ్చే ధైర్యం లేక రాహుల్ పారిపోయారు’
సాక్షి,హైదరాబాద్ : వరంగల్ వచ్చే ధైర్యం లేక రాహుల్ గాంధీ పారిపోయారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ కవిత తన నివాసంలో జాగృతి మహిళా నాయకులు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడారు.‘వరంగల్ వచ్చే ధైర్యం లేక రాహుల్ గాంధీ పారిపోయారు. హామీలపై ప్రజలు నిలదీస్తారనే రాహుల్ వరంగల్ పర్యటనను రద్దు చేసుకున్నారు.అదే వరంగల్లో రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ అమలే కాలేదు. వరంగల్ డిక్లరేషన్పై రైతులు ప్రశ్నిస్తారని ఆయన భయపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల హామీలు నెరవేర్చే వరకు వెంటబడతామని’ కవిత వ్యాఖ్యానించారు. భద్రతా పరమైన ఇబ్బందులు.. రాహుల్ పర్యటన రద్దురాహుల్ గాంధీ వరంగల్ పర్యటన రద్దు అయ్యింది. ఛత్తీస్గఢ్ మావోయిస్టుల ఎన్కౌంటర్ నేపథ్యంలో భద్రతా పరమైన ఇబ్బందులు కారణంగా రాహుల్ పర్యటన రద్దు అయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.కాగా, షెడ్యూల్ ప్రకారం నిన్న సాయంత్రం 5.30 గంటలకు రాహుల్ శంషాబాద్ చేరుకుని అక్కడ నుంచి చాపర్లో వరంగల్ చేరుకోవాల్సి ఉంది. వరంగల్ సుప్రభా హోటల్లో కాసేపు విశ్రాంతి తీసుకుని 7:30కి వరంగల్ నుంచి రైలులో చెన్నై వెళ్లాల్సి ఉంది.బీసీ కుల గణన అంశంలో ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో.. బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణ అంశంపై ప్రజల స్పందనను రాహుల్ తెలుసుకోవడంతో పాటు, రైల్వే ప్రైవేటీకరణ అంశంపై రైలు ప్రయాణికుల నుంచి అభిప్రాయాలను సేకరించాల్సి ఉంది.. అయితే, భద్రతపరమైన ఇబ్బందులు కారణంగా చివరి క్షణంలో పర్యటన రద్దు అయ్యింది. -
ఈసీ అఖిలపక్షంలో ట్విస్ట్.. నోటాను వ్యతిరేకించిన కాంగ్రెస్
హైదరాబాద్, సాక్షి: స్థానిక సంస్థల ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ఇవాళ నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. పంచాయితీ ఎన్నికల్లో నోటాను ప్రవేశపెట్టాలన్న ప్రతిపాదనను అధికార కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. దీంతో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే భేటీ ముగిసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా.. పంచాయితీ ఎన్నికల్లో నోటాను ప్రవేశపెట్టాలని ఈసీ ప్రతిపాదన చేసింది. దీనికి కాంగ్రెస్ తప్ప.. అన్ని రాజకీయ పార్టీల దాదాపుగా సానుకూలంగానే స్పందించాయి. నోటాతో ఎన్నిక ఖర్చు ఎక్కువ అని, ఒకవేళ నోటాతో ఎన్నిక నిర్వహించినా సెకండ్ లార్జెస్ట్ పార్టీనే విజేతగా ప్రకటించాలని కాంగ్రెస్ ఈసీని కోరింది. నోటాపై అభిప్రాయం సేకరణలో బీఆర్ఎస్ సానుకూలంగా స్పందించింది. ఏకగ్రీవానికి.. బెదిరింపులు, బలప్రదర్శన చేసే అవకాశం ఉందని ఈసీకి తెలిపింది. అలాగే.. కొత్త మండలాల వివరాలను రాజకీయ పార్టీలకు ఇవ్వాలని ఈసీని కోరింది. ఇక.. సుప్రీం కోర్టులో కేసు పెండింగ్లో ఉన్నందున అభిప్రాయం ఇప్పుడే చెప్పలేమని పేర్కొంది. అలాగే.. రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఈ విషయంపై నిర్ణయం తీసుకునే అధికారం లేదని గుర్తు చేసింది. పంచాయతీ ఎన్నికల నిర్ణయం ప్రభుత్వమే తీసుకోవాలని స్పష్టం చేసింది. నోటాతో ఎన్నిక ఉండాలని సుప్రీంకోర్టు ఇప్పటికే చెప్పిందని సీపీఎం గుర్తు చేసింది. అభ్యర్థి కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే రీ-ఎలక్షన్ కరెక్ట్ కాదు. ఎన్నిక కండక్ట్ చేయడం అవసరం.. నోటాకు ఎక్కువ ఓట్లు అనేది తర్వాత చర్చ అని వామపక్ష పార్టీ అభిప్రాయపడింది. ఇక.. తెలంగాణ టీడీపీ తమ అభిప్రాయాన్ని రెండు మూడు రోజుల్లో చెప్తామనగా, సింగిల్ అభ్యర్థిగా అయినా నోటా ఉండాలని జనసేన పార్టీ ఈసీకి విజ్ఞప్తి చేసింది.ఇదీ చదవండి: స్థానిక సంస్థల్లో ‘నోటా’ ఎందుకంటే.. -
రేవంత్.. 12 రోజులు దాటినా జీతాలెక్కడ?: హరీష్రావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) సీరియస్ కామెంట్స్ చేశారు. హోంగార్డులకు జీతాలు చెల్లించకపోవడం పట్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చే పథకాల్లో కోతలు, జీతాలు చెల్లించకుండా ఉద్యోగులకు వాతలు.. ఇది ప్రజా పాలన కాదు.. ప్రజా వ్యతిరేక పాలన అంటూ ఘాటు విమర్శలు చేశారు.తెలంగాణలో హోంగార్డుల జీతాల విషయమై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ క్రమంలో హరీష్..‘రాష్ట్రవ్యాప్తంగా 16వేలకు పైగా ఉన్న హోంగార్డులకు 12 రోజులు గడస్తున్నా జీతాలు చెల్లించకపోవడం సిగ్గుచేటు. చిన్న జీతాలపైనే ఆధారపడి జీవిస్తున్న హోంగార్డులు.. చేతిలో చిల్లిగవ్వలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్ ఫీజులు, రోజువారీ ఖర్చుల కోసం అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది.ఈఎంఐలు చెల్లించకపోవడం వల్ల బ్యాంకు అధికారులు ఫోన్లు చేసి నిలదీస్తున్న పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రతి నెలా ఇదే తీరు కొనసాగుతున్నా పట్టించుకునే వారే లేరు. మాటలు కోటలు దాటితే, చేతలు గడప దాటని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీరికి ఏం సమాధానం చెబుతారు?. పథకాల్లో కోతలు, జీతాలు చెల్లించకుండా ఉద్యోగులకు వాతలు.. ఇది ప్రజా పాలన కాదు, ప్రజా వ్యతిరేక పాలన. హోంగార్డులకు వేతనాలు తక్షణం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రవ్యాప్తంగా 16వేలకు పైగా ఉన్న హోం గార్డులకు 12 రోజులు గడస్తున్నా జీతాలు చెల్లించకపోవడం సిగ్గుచేటు. చిన్న జీతాలపైనే ఆధారపడి జీవిస్తున్న హోంగార్డులు.. చేతిలో చిల్లిగవ్వలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్ ఫీజులు, రోజువారీ ఖర్చుల కోసం అప్పులు…— Harish Rao Thanneeru (@BRSHarish) February 12, 2025 -
పీఏసీ చైర్మన్ ఎంపిక అప్రజాస్వామికం
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ టికెట్పై గెలిచి పార్టీ మారిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని అసెంబ్లీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ (పీఏసీ)గా నియమించడం అప్రజాస్వామికమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. పీఏసీ చైర్మన్ పదవికి నామినేషన్ వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు నామినేషన్ పత్రాలను మాయం చేశారని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకుడితో సంప్రదింపులు జరిపి పీఏసీ చైర్మన్ను ఎంపిక చేయాలనే సంప్రదాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని మండిపడ్డారు. శాసనసభలో కమిటీ హాల్లో మంగళవారం జరిగిన పీఏసీ మూడో సమావేశం నుంచి బీఆర్ఎస్ సభ్యులు వేముల ప్రశాంత్రెడ్డి, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, ఎల్.రమణ వాకౌట్ చేశారు.అనంతరం బీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నందున, అరికెపూడి గాంధీ పీఏసీ చైర్మన్ హోదాలో సమావేశం నడపడం సమంజసం కాదని ప్రశాంత్రెడ్డి అన్నారు. సంప్రదాయాలకు విరుద్ధంగా జరిగిన పీఏసీ చైర్మన్ నియామకాన్ని అంగీకరించేది లేదని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. అసెంబ్లీతోపాటు పీఏసీ భేటీలోనూ మాట్లాడే అవకాశం ఇవ్వకుండా మైకులు కట్ చేస్తున్నారని ఆరోపించారు. పీఏసీ చైర్మన్ పదవి నుంచి అరికెపూడిని తొలగించేంత వరకు పోరాటం కొనసాగిస్తామని ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. పీఏసీ చైర్మన్తోపాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని రమణ డిమాండ్ చేశారు.అధికారుల తీరుపై పీఏసీ అసంతృప్తివైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారులపై పీఏసీ సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ అధ్యక్షతన అసెంబ్లీలోని కమిటీ హాల్లో ఈ శాఖలపై సమీక్ష నిర్వహించారు. భేటీకి అధికారులు తగినంత సమాచారంతో రాకపోవడంపై సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. తదుపరి సమావేశానికి పూర్తి సమాచారం ఇస్తామని అధికారులు తెలిపారు. కాగా, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు మెరుగుపరిచేందుకు పీఏసీ సభ్యులు పలు సూచనలు చేశారు. -
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు జరుగుతాయని అన్నారు. ఆ ఎన్నికల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. స్టేషన్ ఘన్పూర్లోనూ ఉప ఎన్నిక జరుగుతుంది. ఆ ఎన్నికల్లో కడియం శ్రీహరి ఓడి పోతారు. రాజయ్య ఎమ్మెల్యేగా గెలుస్తారని కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే రాజయ్యతో పాటు పలువురు నాయకులు ఎర్రవల్లిలో కేసీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ పై విధంగా మాట్లాడారు. -
రాహుల్ వరంగల్ పర్యటన రద్దు
సాక్షి, వరంగల్: రాహుల్ గాంధీ వరంగల్ పర్యటన రద్దు అయ్యింది. ఛత్తీస్గఢ్ మావోయిస్టుల ఎన్కౌంటర్ నేపథ్యంలో భద్రతా పరమైన ఇబ్బందులు కారణంగా రాహుల్ పర్యటన రద్దు అయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.కాగా, షెడ్యూల్ ప్రకారం ఇవాళ సాయంత్రం 5.30 గంటలకు రాహుల్ శంషాబాద్ చేరుకుని అక్కడ నుంచి చాపర్లో వరంగల్ చేరుకోవాల్సి ఉంది. వరంగల్ సుప్రభా హోటల్లో కాసేపు విశ్రాంతి తీసుకుని 7:30కి వరంగల్ నుంచి రైలులో చెన్నై వెళ్లాల్సి ఉంది.బీసీ కుల గణన అంశంలో ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో.. బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణ అంశంపై ప్రజల స్పందనను రాహుల్ తెలుసుకోవడంతో పాటు, రైల్వే ప్రైవేటీకరణ అంశంపై రైలు ప్రయాణికుల నుంచి అభిప్రాయాలను సేకరించాల్సి ఉంది.. అయితే, భద్రతపరమైన ఇబ్బందులు కారణంగా చివరి క్షణంలో పర్యటన రద్దు అయ్యింది. -
సడన్ టూర్.. నేడు వరంగల్కు రాహుల్ గాంధీ
సాక్షి, వరంగల్: నేడు తెలంగాణకు రాహుల్ గాంధీ రానున్నారు. సాయంత్రం 5.30 గంటలకు శంషాబాద్ చేరుకోనున్న రాహుల్.. చాపర్లో వరంగల్ చేరుకోనున్న రాహుల్.. వరంగల్ సుప్రభా హోటల్లో కాసేపు విశ్రాంతి తీసుకోనున్నారు. 7:30కి వరంగల్ నుంచి రైలులో చెన్నై వెళ్లనున్నారు.కాగా, బీసీ కుల గణన అంశంలో ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందని ప్రభుత్వం చెబుతోంది. బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణ అంశంపై ప్రజల స్పందనను రాహుల్ తెలుసుకొనున్నారు. రైల్వే ప్రైవేటీకరణ అంశంపై రైలు ప్రయాణికుల నుంచి అభిప్రాయాలను సేకరించనున్నారు. -
రేవంత్.. దమ్ముంటే రాజీనామా చెయ్
సాక్షి, నాగర్కర్నూల్/నారాయణపేట: గత 14 నెలల పాలనలో సీఎం రేవంత్రెడ్డి రైతులు, మహిళలు, వృద్ధులు, యువత కోసం ఒక్క పని కూడా చేయలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు విమర్శించారు. ఎనుముల అన్నదమ్ముల కోసం, అల్లుడు, అదాని కోసం, బావమరిది, కుటుంబసభ్యుల కోసం దోచుకునే పనిలో పడ్డారని ఆరోపించారు. ‘నీ నియోజకవర్గం నుంచి బంపర్ ఆఫర్ ఇస్తున్నా.. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్.ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తరో చూద్దాం. మేం బయటకు రాము. ఇంట్లోనే కూర్చుంటాం. మా సోదరుడు నరేందర్రెడ్డి కూడా బయటకు రాడు. మా పార్టీకి 50 వేల మెజార్టీ కన్నా ఒక్క ఓటు తగ్గినా నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. రాజకీయాల్లో ఉండను..’అని సవాల్ విసిరారు. సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్లో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బొంద పెట్టాలని ప్రజలు చూస్తున్నారని, రాష్ట్రం మొత్తం ఇదే ముఖచిత్రం ఉందని అన్నారు. సోమవారం నారాయణపేట జిల్లా కోస్గి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నిర్వహించిన ‘రైతు మహాధర్నా’లో కేటీఆర్ మాట్లాడారు. దుర్యోధనుడి తరహాలో పాలన ‘రాష్ట్రంలో గత ఏడాది కాలంగా సీఎం రేవంత్రెడ్డి పాలన కౌరవుల రాజు దుర్యోధనుడి తరహాలో సాగుతోంది. ముఖ్యమంత్రి దుర్మార్గపు, అరాచక పాలనతో ఇక్కడి బిడ్డల పోరాటం కురుక్షేత్ర యుద్ధాన్ని తలపిస్తోంది. దుర్యోధనుడు తన రాజ్యం నుంచి పాండవులను బయటకు పంపినట్టుగానే.. రేవంత్ కూడా కొడంగల్లోని గిరిజన ఆడ బిడ్డలను అవమానిస్తూ తండాల నుంచి జంగిల్కు ఉరికిచ్చారు. ఇక్కడి ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్ 70 మందిపై కేసులు పెట్టి 40 మందిని జైలుకు పంపారు. కొడంగల్ ఆడబిడ్డలను గోసపెట్టిన రేవంత్ను చిత్తుగా ఓడించి ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉన్నారు..’అని కేటీఆర్ చెప్పారు.రేవంత్ మోసం దేశమంతా తెలిసింది ‘సీఎం స్థాయిలో ఉండి కూడా అబద్ధాలు చెబుతారా? టకీ టకీమని డబ్బులు పడ్డాయంటే నిజమని అనుకున్నా కానీ రేవంత్ మోసం దేశమంతా తెలిసింది. రైతుబంధు, రుణమాఫీ, వరికి బోనస్, మహిళలకు రూ.2,500, తులం బంగారం, బాలికలకు స్కూటీలు.. ఎంత మందికి ఇచ్చారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయకుండా, తన కాంట్రాక్టర్ మంత్రి కోసం రూ.4,350 కోట్లతో కొత్త ప్రాజెక్టు తెస్తానంటూ మోసం చేస్తున్నారు. అల్లుడికి కట్నం కింద ఇచ్చేందుకు లగచర్ల, హకీంపేట భూములపై కన్నేశారు. ఎన్నికల సందర్భంగా అడ్డగోలు హామీలు ఇచ్చిన రేవంత్ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు.ఇప్పుడు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు వస్తాయని చెబుతున్నారు. చికెన్ దావత్లు ఇస్తామని, పైసలు తీసుకోమని కాంగ్రెసోళ్లు వస్తారు..వారి దగ్గర పైసలు తీసుకుని కారు గుర్తుకే ఓటు వేయాలి..’అని కేటీఆర్ అన్నారు. కొడంగల్ భూముల్లో తొండలు కూడా గుడ్లు పెట్టవని మాట్లాడిన రేవంత్కు.. ఇక్కడి తాండూరు కందిపప్పునకు జియోలాజికల్ ఇండెక్స్ గుర్తింపు లభించిందని తెలియదా? అని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి ప్రశ్నించారు.జ్యోతి–ప్రవీణ్ దంపతుల బిడ్డకు ‘భూమి’గా నామకరణం దుద్యాల్: కోస్గి మండల పరిధిలోని హకీంపేట మీదుగా కేటీఆర్ వెళ్తున్న క్రమంలో బీఆర్ఎస్ నాయకులు గ్రామ శివారు నుంచి ప్రధాన చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించి ఘన స్వాగతం పలికారు. లగచర్ల బాధిత రైతులను పరామర్శించిన కేటీఆర్ వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా జ్యోతి, ప్రవీణ్ దంపతుల కుమార్తెకు భూమి అని నామకరణం చేశారు. తిరుగు ప్రయాణంలో పారిశ్రామికవాడఏర్పాటుతో కోల్పోతున్న భూములను పరిశీలించారు.