భార్యను లైంగిక వేధింపులకు గురి చేసిన వ్యక్తిని ఆమె భర్త తన స్నేహితులతో కలిసి హత్య చేసిన సంఘటన కుంభకోణం సమీపంలో సంచలనాన్ని కలిగించింది.
కేకే.నగర్: భార్యను లైంగిక వేధింపులకు గురి చేసిన వ్యక్తిని ఆమె భర్త తన స్నేహితులతో కలిసి హత్య చేసిన సంఘటన కుంభకోణం సమీపంలో సంచలనాన్ని కలిగించింది. హత్యకు పాల్పడిన భర్త సహా ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. తంజావూరు జిల్లా కుంభకోణం సమీపంలోని మాత్తిమేట్టు వీధికి చెందిన నారాయణ్ కుమారుడు దినేష్ (21) కూలీ. కుంభకోణం నెహ్రూనగర్ డ్రైనేజ్ పంపింగ్ స్టేషన్ సమీపంలో దినేష్ హత్యకు గురై కనిపించాడు. సమాచారం అందుకుని నార్త్ పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో సింగారతోపు లయన్ కరైకు చెందిన అయ్యప్పన్ (21) అతని మిత్రులు మాత్తిమేట్టు వీధికి చెందిన సూర్యకుమార్ (18) అరియలూర్జిల్లా జయంకొండం ప్రాంతానికి చెందిన రాహుల్ అనే ముగ్గురు కలిసి దినేష్ను హత్య చేసినట్లు తెలిసింది. అయ్యప్పన్, సూర్యకుమార్ను పోలీసులు వెంటనే అరెస్టు చేశారు. రాహుల్ కోసం గాలిస్తున్నారు.
దినేష్, అయ్యప్పన్, సూర్యకుమార్, రాహుల్ ఈ నలుగురు స్నేహితులు. అయ్యప్పన్ డ్రమ్స్ ట్రూప్ నడుపుతున్నాడు. అతనికి సహాయకులుగా సూర్యకుమార్, రాహుల్ పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో అయ్యప్పన్ భార్యపై దినేష్ తరచూ లైంగిక వేధింపులు చేసేవాడని తెలుస్తోంది. అతడిని అయ్యప్పన్ మందలించేవాడు. గురువారం రాత్రి దినేష్ అయ్యప్పన్, సూర్యకుమార్, రాహుల్ ఈ నలుగురు మద్యం తాగారు. ఆ సమయంలో దినేష్కు అయ్యప్పన్ మధ్య ఘర్షణ ఏర్పడింది. ఈ క్రమంలో ప్రతిరోజూ రాత్రి దినేష్ నెహ్రూనగర్లో గల డ్రైనేజీ పంపింగ్ స్టేషన్ సమీపంలో నిద్రించేవాడు. శుక్రవారం ఉదయం మిత్రులు ముగ్గురు పంపింగ్ స్టేషన్ ముందు నిద్రిస్తున్న దినేష్ను హత్య చేశారు. ఆ తరువాత ముగ్గురు అరసల్నది ఒడ్డున నిద్రపోయారు. వారిలో రాహుల్ పారిపోయాడు. సూర్యకుమార్, అయ్యప్పన్ పోలీసులకు పట్టుబడ్డారు. రాహుల్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.