భారత్ మహిళల చేతిలో మూడు వన్డేల సిరీస్లో చిత్తుగా ఓడిపోయిన శ్రీలంక మహిళల జట్టు... టి20లో మాత్రం సత్తా చాటింది.
విశాఖపట్నం, న్యూస్లైన్: భారత్ మహిళల చేతిలో మూడు వన్డేల సిరీస్లో చిత్తుగా ఓడిపోయిన శ్రీలంక మహిళల జట్టు... టి20లో మాత్రం సత్తా చాటింది. విజయనగరంలోని ఏసీఏ అకాడమీ మైదానంలో శనివారం జరిగిన మ్యాచ్లో లంక జట్టు మూడు వికెట్ల తేడాతో భారత్పై గెలిచింది. భారత కెప్టెన్ మిథాలీరాజ్ (47 బంతుల్లో 67; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి అర్ధసెంచరీ చేసినా ప్రయోజనం లేకపోయింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 147 పరుగులు సాధించింది. హర్మన్ ప్రీత్ కౌర్ (40 నాటౌట్) రాణించింది.
శ్రీలంక జట్టు 19.5 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ శశికళ సిరివర్ధెనే (39 బంతుల్లో 52, 5 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడింది. ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేసిన భారత మాజీ కెప్టెన్ జులన్ గోస్వామి ఏకంగా 18 పరుగులు ఇవ్వడంతో భారత్ మూల్యం చెల్లించుకుంది. ఆమె నాలుగు ఓవర్లలో మొత్తం 35 పరుగులు ఇచ్చింది. రాజేశ్వరి గైక్వాడ్ 3, ఏక్తా బిష్త్, సోనియా డబిర్ చెరో 2 వికెట్లు తీశారు. మూడు మ్యాచ్ల సిరీస్లో ప్రస్తుతం లంక 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో టి20 మ్యాచ్ ఆదివారం విజయనగరంలోనే జరుగుతుంది.