
విరాట్ కోహ్లి
జోహన్నెస్బర్గ్: ఇప్పటికే ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్న టీమిండియా కెప్టెన్ మరో మైలురాయిని అందుకున్నాడు. భారత తరపున అత్యధిక టెస్టు పరుగులు సాధించిన కెప్టెన్గా కోహ్లి రికార్డు నెలకొల్పాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరిదైన మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్లో కోహ్లి ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో కోహ్లి 40 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా భారత కెప్టెన్గా అత్యధిక పరుగుల రికార్డును చేరుకున్నాడు.
ఈ క్రమంలోనే ఇప్పటివరకూ ఎంఎస్ ధోని పేరిట ఉన్న రికార్డును కోహ్లి బ్రేక్ చేశాడు. టెస్టు కెప్టెన్గా కోహ్లి 57 ఇన్నింగ్స్లో 3,455 పరుగులు సాధించగా, ధోని 96 ఇన్నింగ్స్ల్లో 3,454 పరుగులు సాధించాడు. ఆ తర్వాత స్థానాల్లో సునీల్ గావస్కర్(3,449 పరుగులు-74 ఇన్నింగ్స్లు), మొహ్మద్ అజహరుద్దీన్(2,856 పరుగులు-68 ఇన్నింగ్స్లు), సౌరవ్ గంగూలీ(2,561 పరుగులు-75 ఇన్నింగ్స్లు) లు ఉన్నారు. కాగా, ఈ ఇన్నింగ్స్లో కోహ్లి 41 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఐదో వికెట్గా పెవిలియన్ చేరాడు. దాంతో భారత జట్టు 134 పరుగుల వద్ద కోహ్లి వికెట్ నష్టపోయింది.