
'నాతో సెల్ఫీ తీసుకోండి'
తనతో నిరభ్యంతరంగా సెల్ఫీ తీసుకోవచ్చని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ అన్నారు.
లక్నో: తనతో నిరభ్యంతరంగా సెల్ఫీ తీసుకోవచ్చని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ అన్నారు. సమాజ్ వాదీ పార్టీ అత్యంత ఉదారవాద పార్టీ అని పేర్కొన్నారు. తనతో దిగిన ఫోటోను ఫేస్ బుక్ లో పెట్టినందుకు ఓ మహిళా నేతకు బీఎస్పీ అధినేత్రి మాయావతి టిక్కెట్ రద్దు చేసిన నేపథ్యంలో అఖిలేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
'మీకు తెలుసా.. సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టినందుకు ఓ నాయకురాలు టికెట్ కోల్పోయింది. కానీ సమాజ్ వాది పార్టీలో అలాంటివి జరగవు. నిరభ్యంతరంగా మీరు నాతో సెల్ఫీ తీసుకోవచ్చు' అని పార్టీ కార్యకర్తలతో అఖిలేశ్ అన్నారు.
క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడ్డారనే ఆరోపణలతో సంగీత చౌదరి అనే నాయకురాలికి 2017 ఎన్నికల కోసం ఇచ్చిన టిక్కెట్ ను మాయావతి బుధవారం రద్దు చేశారు. తన నలుగురు పిల్లలతో కలిసి మాయావతికి పాదాభివందనం చేసిన ఫొటోను సంగీత తన ఫేస్ బుక్ పేజీలో పెట్టడంతో ఆమెపై ఈ చర్య తీసుకున్నారు.
అయితే మాయావతికి సంగీత క్షమాపణ చెప్పారు. ఆట్రౌలీ నియోజకవర్గం నుంచి ముందుగా సంగీత భర్త ధర్మేంద్ర చౌదరికి టిక్కెట్ ఇచ్చారు. ఆయన గతేడాది జనవరిలో హత్యకు గురవడంతో సంగీతకు టిక్కెట్ కేటాయించారు.