ఆ విరాళాలను నిషేధించండి! | Ban that Donations | Sakshi
Sakshi News home page

ఆ విరాళాలను నిషేధించండి!

Dec 19 2016 6:35 AM | Updated on Sep 17 2018 5:36 PM

ఎన్నికల్లో నల్లధన ప్రవాహాన్ని అరికట్టడానికి ఎన్నికల కమిషన్‌ కసరత్తు చేస్తోంది.

పార్టీలకు రూ. 2 వేలు, ఆ పైబడిన అజ్ఞాత విరాళాలపై ఈసీ

న్యూఢిల్లీ: ఎన్నికల్లో నల్లధన ప్రవాహాన్ని అరికట్టడానికి ఎన్నికల కమిషన్‌ కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా పార్టీలకు రెండు వేల రూపాయలు, ఆ పైబడి అజ్ఞాతంగా ఇచ్చే విరాళాలపై నిషేధం విధించేందుకు చట్టాల్లో మార్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇలాంటి విరాళాలపై రాజ్యాంగ పరంగాగానీ, చట్ట పరంగాగానీ నిషేధం లేదు. అయితే ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్‌ 29సీ ప్రకారం ‘పరోక్ష పాక్షిక నిషేధం’ ఉంది. విరాళాల డిక్లరేషన్‌ అవసరాలకు అనుగుణంగా ఇది సాధ్యం. కానీ, అలాంటి డిక్లరేషన్లు రూ. 20 వేలకు పైబడిన విరాళాలకు మాత్రమే తప్పనిసరి.

ఇప్పుడు రెండు వేల రూపాయలు కంటే పైబడిన అనామక విరాళాలను నిషేధించాలని కేంద్రాన్ని ఈసీ కోరింది. ఇక లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి సీట్లు గెలుచుకున్న పార్టీలకు మాత్రమే ఐటీ మినహాయింపు కొనసాగించాలని కూడా ఈసీ పేర్కొంది. కాగా, నోట్ల రద్దు తర్వాత రాజకీయ పార్టీలకు విరాళాల స్వీకరణలో ప్రత్యేక సడలింపులు ఏమీ లేవని, పాత రూ. 500, రూ. 1000 నోట్లను అవి తీసుకోరాదని రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్‌ ఆధియా ట్విటర్‌లో పేర్కొన్నారు. అలా చేస్తే ఐటీ అధికారులకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement