ప్రియురాలిపై కన్నేశాడని అంతం చేశాడు! | Sakshi
Sakshi News home page

ప్రియురాలిపై కన్నేశాడని అంతం చేశాడు!

Published Thu, Sep 14 2017 9:25 AM

Jharkhand man murdered in hyderabad

యువకుడి హత్య కేసును ఛేదించిన పోలీసులు
మృతుడు, నిందితుడు.. జార్ఖండ్‌ వాసులే

సాక్షి, హైదరాబాద్ : అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన యువకుడి కేసును నార్సింగి పోలీసులు ఛేదించారు. హత్యగా నిర్ధారించి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తన ప్రియురాలితో చనువుగా ఉండటం భరించలేక గొంతుకోసి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జార్ఖండ్‌ ప్రాంతానికి చెందిన గోపాల్‌(25) బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చాడు.

మైహోమ్స్‌ అవతార్‌ ప్రాంతంలో ఇతర కార్మికులతో కలిసి ఉంటున్నాడు. జార్ఖండ్‌ ప్రాంతానికి చెందిన బాహాబాస్లా(25) ఈ ప్రాంతంలోనే కూలీ పని చేస్తూ ఉంటున్నాడు. ఇతడికి విమల అనే ప్రియురాలు ఉంది. అయితే గత కొన్ని రోజులుగా విమలతో గోపాల్‌ చనువుగా ఉంటున్నాడు. ఈ విషయమై గోపాల్‌ను బాహాబాస్లా హెచ్చరించాడు. అయినా గోపాల్‌ పట్టించుకోలేదు. ఈ నెల 11న రూమ్‌లో గోపాల్‌ ఒక్కడే ఉండడంతో ఇదే విషయమై బాస్లా మాట్లాడటానికి వెళ్లాడు.

వారిద్దరి మధ్య మాటామాటా పెరగడంతో ఆవేశం పట్టలేకపోయిన బాస్లా పక్కనే ఉన్న కూరగాయలు కోసే కత్తితో గోపాల్‌ గొంతు కోసి పారిపోయాడు. బయట నుంచి వచ్చిన తోటి కార్మికులు రక్తం మడుగులో పడి ఉన్న గోపాల్‌ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. బుధవారం కేసు నమోదు చేసిన పోలీసులు విచారణలో బాస్లా హత్య చేసినట్లు నిర్ధారించి రిమాండ్‌కు తరలించారు.

Advertisement
Advertisement