
ఎస్.ఐ ఆత్మహత్య కేసులో అధికారులపై చర్యలు
ఎస్.ఐ ఆత్మహత్య కేసులో డీఎస్పీ శ్రీధర్తో పాటు మరో ఏడుగురిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.
హైదరాబాద్ : కుకునూరు ఎస్.ఐ. రామకృష్ణారెడ్డి ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్తో పాటు మరో ఏడుగురిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు డీజీపీ అనురాగ్ శర్మ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. డీఎస్పీ, రూరల్ సీఐ వెంకటయ్య, సీఐ రామాంజనేయులు డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేయాలన్నారు. ఏఎస్ఐ ప్రకాశ్, హెడ్ కానిస్టేబుళ్లు ముత్యం, సంబాని, కానిస్టేబుళ్లు యాదవరెడ్డి, నాగిరెడ్డిలను ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
మరోవైపు రామకృష్ణారెడ్డి కుటుంబసభ్యులు శనివారం హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. తన భర్త చావుకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎస్.ఐ. భార్య ధనలక్ష్మీ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ...డీఎస్పీ, సీఐ, ఇతర అధికారులు మాముళ్లు ఇవ్వాలని తన భర్తను వేధించారన్నారు. ప్రధాని మోదీ పర్యటనకైనా ఖర్చును భరించాలని ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. వారిపై సెక్షన్ 306 కింద కేసు నమోదు చేసి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.